అధికారుల అండదండలు... రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కొందరు రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా నిర్వహిస్తున్నారు. ప్రజల
షాద్నగర్ రూరల్:
అధికారుల అండదండలు... రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని కొందరు రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా భూ దందా నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కాలుష్య కారక పరిశ్రమ చుట్టూ పెద్దఎత్తున వెంచర్లు చేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇదంతా షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రియల్ వెంచర్ల భాగోతం. అంతర్జాతీయ విమానాశ్రయానికి, రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న షాద్నగర్ ప్రాంతంలో వ్యవసాయ పొలాలకు మార్కెట్ ధర లక్షల్లో పలుకుతుంది.
హైదరాబాద్ పట్టణవాసులే కాకుండా ఎన్నారైలు సైతం ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసేందుకుఆసక్తిని చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొందరు రియల్టర్లు నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో వెంచర్లు ఏర్పాటు చేసి అమాయకులకు అంటగడుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలోని షాద్నగర్ మున్సిపాలిటీలో గల సోలీపూర్ గ్రామ శివారులో కొన్ని రియల్ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కి వెంచర్లు ఏర్పాటు చేశాయి. సోలీపూర్ గ్రామపరిధిలోని ఓ పరిశ్రమ నుంచి వ్యర్థ రసాయనాలను భూమిలోకి పంపుతున్నారు.
దీంతో పరిశ్రమ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. ఎక్కడ బోరు వేసినా కలుషిత నీరే బయటకు వస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొనుగోలుదారులను మభ్యపెట్టి వారికి ప్లాట్లు అంటగడుతున్నారు. దీనికి కొందరు అధికారులు.. రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి సహకరిస్తున్నట్టు సమాచారం. పరిశ్రమ పక్కన వందల ఎకరాల్లో ప్లాట్లు చేశారు. వాటికి అనుమతులు లేకుండానే కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రియల్లర్లు అనుమతుల కోసం స్థానిక మున్సిపల్, హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకోవడం పూర్తయిన వెంటనే తమ పనిని ప్రారంభిస్తున్నారు. అనుమతులు రాకపోయినా కొనుగోలు దారులకు ప్లాట్లను విక్రయిస్తున్నారు.