సర్కార్‌ జులుం

Municipal Workers In Andhra Pradesh - Sakshi

జిల్లాలో ఉధృతంగా మున్సిపల్‌ కార్మికుల సమ్మె

సమ్మెలో పాల్గొంటున్న 2597 మంది కార్మికులు

తెనాలిలో పోలీసులు, కార్మికులు మధ్య తోపులాట 

ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళ కార్మికురాలు 

తెనాలిలో 16, సత్తెనపల్లిలో 24 మంది కార్మికుల అరెస్ట్‌

గుంటూరులో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం  

సాక్షి, గుంటూరు: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృత రూపం దాల్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు గొంతెత్తాయి. ఈ క్రమంలో టీడీపీ సర్కార్‌ నిరసన గళాలలను అణచివేసేందుకు  పోలీసులను ప్రయోగిస్తోంది. ఎక్కడికక్కడ కార్మిక నాయకులు, కార్మికులను అరెస్టు చేస్తూ ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతోంది. జిల్లాలో ము న్సిపల్‌ కార్మికుల సమ్మె గురువారం ఎనిమిదో రోజుకు చేరుకుంది. 

బాపట్ల, పొన్నూరు మినహా అన్ని మున్సిపాల్టీల్లో సమ్మె కొనసాగుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి, వినుకొం డ, నగరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, మంగళగిరి, తాడేపల్లి, సత్తెనపల్లి, రేపల్లే ము న్సిపాల్టీల్లో 3700 మంది కాంట్రాక్టు పారి శుద్ధ్య కార్మికులు ఉండగా వీరిలో 2597 మంది సమ్మెలో పాల్గొంటున్నారు.  1,744 మంది ఇంజి నీరింగ్‌ విభాగం కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొనడం లేదు. పారిశుద్ధ్య కార్మికులు చాలా వరకూ సమ్మె పాల్గొంటుండటంతో పారిశుద్ధ్యం క్షిణించిం ది. దీంతో ప్రభుత్వం పోటీ కార్మికులను రంగంలోకి దించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తోంది. 

పోలీసుల దౌర్జన్యం..
ఎనిమిది రోజులుగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతున్నా స్పందించని ప్రభుత్వం పోటీ కార్మికులను పనుల్లోకి తీసుకురావడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 774 మంది పోటీ కార్మికులను రంగంలోకి దించి పారిశుద్ధ్య పనులు చేయిస్తోంది. దీంతో ఆయా మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు పోటీ కార్మికుల విధులను అడ్డగిస్తున్నారు. సత్తెనపల్లి మున్సిపల్‌ అధికారులు పోటీ కార్మికులతో  పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సమయంలో సమ్మెలో ఉన్న కార్మికులు కూలీలు చెత్త తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఏరియా ఆస్పత్రి వద్ద అడ్డుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసన చేస్తున్న సీఐటీయూ పట్టణాధ్యక్షుడు జగన్నథరావు సహా 24 కార్మికులను మంది కార్మికులను అరెస్టు చేశారు. గుంటూరు కార్పొరేషన్‌లోని ఒకటో డివిజన్‌లో పోటీ కార్మికుల విధులను అడ్డగించేకి ప్రయత్నించిన మున్సిపల్‌ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. చిలకలూరిపేట సంజీవనగర్‌లో పారిశుద్ధ్య విధులు నిర్వర్తిస్తున్న కూలీలను మున్సిపల్‌ కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు నిలువరించి వెనక్కు పంపించారు.

సీఎం దిష్టి బొమ్మ దగ్ధం..
వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేసేలా జీవో 279ని రద్దు చేయకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు దగ్ధం చేశారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వానికి కాలం చెల్లిందని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జీవో 279ని రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ తెనాలి శాఖ అధ్వర్యంలో గురువారం సాయంత్రం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ ప్రభుత్వం కార్మికులపై అణచివేత ధోరణితో వ్యవహరిస్తు పోలీసులతో కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్‌ మధుబాబు, రాష్ట్ర కార్యదర్శులు పి.రామచంద్రరావు, సోమ శంకర్, తెనాలి నాయకులు పాల్గొన్నారు.  

ఆత్మహత్యలే శరణ్యం..
జీవో 279ని రద్దు చేయకుంటే మాకు ఆత్మహత్యే శరణ్యమని ఉరితాళ్లను మెడకు బిగించుకుని మంగళగిరి పట్టణంలో కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. తాడేపల్లిలో కార్మికులు మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో బుధవారం రేపల్లె పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. నరసరావుపేటలో కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్‌డీవో ఆఫీస్‌కు చేరుకుని ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేశారు. 

పటిష్ట బందోబస్తు..
జిల్లాలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం దీక్షా శిబిరాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య విధుల నిర్వహిస్తున్న కూలీలను మున్సిపల్‌ కార్మికులు అడ్డుకోకుండా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై  పోలీసులను ప్రదర్శించి ప్రభుత్వం ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

తెనాలిలో ఉద్రిక్తత
తెనాలిఅర్బన్‌: తెనాలిలో మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోటీ కార్మికులను కాంట్రాక్ట్‌ కార్మికులు అడ్డుకోవడంతో మున్సిపల్‌ అధికారులు పోలీసుల రక్షణలో పారిశుద్ధ్య నిర్వాహణ పనులు చేయిస్తున్నారు. గురువారం ఆర్‌ఆర్‌ నగర్‌లో ఇదే జరిగింది. అయితే ఈ సమాచారాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ శకుంతల త్రీటౌన్‌ పోలీసులకు అందించారు. ఎస్‌ఐ అశోక్‌కుమార్‌ మహిళా కానిస్టేబుల్స్‌తో అక్కడకు చేరుకున్నారు. కూలీలను అడ్డుకుంటే సహించేదిలేదని,  కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయిన కార్మికులు వినకపోవడంతో మహిళా కానిస్టేబుల్స్‌ వారిని వారించారు. ఇంతలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

 ఘటనలో కాంట్రాక్ట్‌ కార్మికురాలు ఎం.జయలక్ష్మి సృహతప్పి కింద పడింది. వెంటనే తోటి కార్మికులు ఆమెను జిల్లా వైద్యశాలకు తరలించారు. విష యం తెలుసుకున్న కార్మికులు వైద్యశాలకు వచ్చి చికిత్స పొందుతున్న జయలక్ష్మిని పరామర్శించా రు. సుమారు 16 మందిని త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి బైండవర్‌ చేసి వదిలేశారు. అనంతరం మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఠాకార్మిక సంఘం డాల్‌ మిల్‌ కార్మిక సంఘ నాయకులు అక్కడికి వచ్చి మద్దతు తెలిపారు.  కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, నాయకులు జోనేష్, లక్ష్మణరావు  పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top