
పన్ను కట్టని ‘పల్లె’
రాష్ట్ర ప్రభుత్వం ఇంటి, నీటి పన్ను బకాయిల విషయంలో సీరియస్గా ఉంది.
► ఇంటి పన్ను చెల్లించని మంత్రి పల్లె, ఎమ్మెల్యే వరదాపురం సూరి
► వసూలుకు జంకుతున్న నగరపాలక సంస్థ అధికారులు
► రూ.44 లక్షల బకాయిలు
వారిద్దరూ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు. అస్తమానం మైకులు తీసుకుని నీతులు వల్లిస్తుంటారు. అటువంటి వారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని బకాయిలను చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. వారి నుంచి వసూలు చేసేందుకునగరపాలక సంస్థ అధికారులు కూడా జంకుతున్నారు. అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డి,ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) నగర పాలక సంస్థకు రూ.లక్షల్లో బకాయి పడ్డారు. తద్వారా నగరాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం న్యూసిటీ : రాష్ట్ర ప్రభుత్వం ఇంటి, నీటి పన్ను బకాయిల విషయంలో సీరియస్గా ఉంది. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా వడ్డీ మాఫీ ఉండదని స్పష్టం చేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు పన్నుల వసూలుకు సన్నద్ధమయ్యారు. మార్చి ఆఖరులోపు పన్నులు వసూలు చేయాల్సి ఉంది. కనీసం 85 శాతం వసూలు చేస్తేనే ప్రత్యేక నిధులు వస్తాయి. ఆ నిధులను నగరాభివృద్ధికి వినియోగించుకోవచ్చు. కానీ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే పన్నులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సూరి ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించలేదు. వీరిద్దరూ రూ.44 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.
అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. సామాన్య ప్రజలు పన్ను చెల్లించకపోతే నీటి సరఫరా బంద్ చేస్తామని, ఆస్తి సీజ్ చేస్తామంటూ నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదు. దీంతో మాకో న్యాయం.. నేతలకో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించి మూడు డోర్ నంబర్లపై పన్ను చెల్లించాల్సి ఉంది.
డోర్ నంబర్ 13-3-612 కింద రూ.10,20,574, డోర్ నంబర్ 13-3-610,610-1 కింద రూ.8,85,122, డోర్ నంబర్ 13-3-612-1 కింద రూ.7,79,849 బకాయిలున్నాయి. అలాగే ఎమ్మెల్యే వరదాపురం సూరికి చెందిన ఓ భవనానికి సంబంధించి జి.నిర్మలాదేవి పేరుపై ఇంటి పన్ను నమోదైంది. డోర్ నంబర్ 15-323 కింద రూ. 7,16,223, డోర్ నంబర్ 15-325 కింద రూ 6,77,055, డోర్ నంబర్ 15-322 కింద రూ.3,43,533 పన్ను బకాయిలున్నాయి. సామాన్య ప్రజానీకంపై ధూం..ధాం అంటూ చిందులు వేసే నగరపాలక అధికారులు మంత్రి, ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ‘ఎందుకొచ్చిన గొడవలే.. వారెప్పుడైనా చెల్లించనీ’ అన్న ధోరణితో ఉన్నారు.