సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ పేరుతో కోట్ల రూపాయల దోపిడీ చేశారని.. ఎన్సీఈఆర్టీలో అవుట్సోర్సింగ్ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం.. ఇది పేపర్ లీక్ కాకుండా ఇంకేంటి? అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. జీవో 47, జీవో 4 పేరుతో స్పోర్ట్స్ కోటా 421 పోస్టులు అమ్ముకున్నారు. అర్హులైన యువత భవిష్యత్తుతో చెలగాటమాడారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఇంత పెద్ద కుంభకోణంపై సీబీఐ విచారణ తప్పనిసరి. దోషులను కఠినంగా శిక్షించాల్సిందే. అధికారంలోకి వచ్చి 25 నెలలు అయ్యింది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇదేనా మీ సుపరిపాలన. నిరుద్యోగులకు నెలకు రూ. 3000 ఇస్తామన్నారు
ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.75,000 బాకీ ఉన్నారు. మోసం చేయడంలో మీరు సిద్ధహస్తులు’’ అంటూ వరుదు కళ్యాణి దుయ్యబట్టారు.
‘‘ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.9500 కోట్లు పెండింగ్ పెట్టారు. పేద విద్యార్థుల చదువులతో ఆడుకుంటున్నారా?. ఉద్యోగులకు ఐఆర్, డీఏ, పీఆర్సీ ఇవ్వకుండా వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు, బీమా లేదు, గిట్టుబాటు ధర లేదు. రైతన్న ఆత్మహత్యలకు కారణం ఎవరు?. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. దిశ చట్టాన్ని రద్దు చేసి మహిళల భద్రతతో ఆటలాడారు. సభలో నిజాలు బయటపడతాయని కూటమి ప్రభుత్వం భయం పడుతుంది’’ అని వరుదు కళ్యాణి వ్యాఖ్యానించారు.


