సాక్షి, తిరుపతి: టీటీడీ పాలనపై మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రెండున్నరేళ్లుగా టీటీడీకి చంద్రగ్రహణం పట్టింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా, కొండపై జలాశయాలు ఎండిపోతున్నా.. వర్షాల కోసం వరుణయాగం నిర్వహించాలన్న ఆలోచన కూడా టీటీడీకి లేకపోవడం బాధాకరమంటూ మండిపడ్డారు.
మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ ఆధ్వర్యంలో అనేక వైదిక కార్యక్రమాలు, యాగాలు నిర్వహించామని గుర్తు చేశారు. దేశం, రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండాలని శతాబ్దాలుగా టీటీడీ యాగాలు నిర్వహిస్తూ వస్తోందని చెప్పారు. అయితే ప్రస్తుత పాలకులు టీటీడీ వైదిక కార్యక్రమాలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపించారు. శ్రీవారి ఆలయ ప్రతినిధులే మంటగలుపుతున్నారు. వేద సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు. ధార్మిక కార్యక్రమాలను పక్కనపెట్టి దహన కార్యక్రమాల్లో మునిగిపోయారు అంటూ మండిపడ్డారు. వేద పరిరక్షణ కోసం నిధులు ఉన్నప్పటికీ అవసరమైన కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నాయని భూమన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ వరుణయాగం నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. చిన్న దేవాలయాల పాలక మండళ్లు సైతం వరుణయాగాలు నిర్వహిస్తున్నాయని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీటీడీ మాత్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వీఐపీ సేవల్లో కాకుండా ప్రజల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. వెంటనే మేల్కొని వరుణయాగం నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీటీడీ పాలకులు వేద, వైదిక సంప్రదాయాలను పరిరక్షించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇది కేవలం విమర్శ కాదు.. బుద్ధి తెచ్చుకుని వైదిక కార్యక్రమాలను, వేద సంప్రదాయాలను పరిరక్షించాలని సూచించారు.


