కాకినాడ: స్టైఫండ్ పెంచే వరకు ఆందోళన విరమించేది లేదని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (GGH)లో జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూడాలు నిరసన కొనసాగిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో జూనియర్ డాక్టర్లకు అధిక స్టైఫండ్ చెల్లిస్తున్నప్పుడు.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. తమకు కూడా ఇతర రాష్ట్రాలతో సమానంగా స్టైఫండ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో కాకినాడ GGHలో జూనియర్ డాక్టర్లు నాన్ ఎమర్జెన్సీ విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అయితే ఆస్పత్రి ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు సూపరింటెండెంట్ అనుమతి ఇవ్వకపోవడంతో జూడాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు తేల్చిచెబుతున్నారు. దీంతో ఆస్పత్రిలో నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.


