
‘నన్ను చంపేస్తున్నారు.. కాపాడండి ’
‘నన్ను చంపేస్తున్నారు.. కాపాడండి..’ అంటూ ఓ ఇరవై ఏళ్ల యువకుడు గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి హల్చల్ చేశాడు.
♦ మున్సిపల్ కార్యాలయంలో రక్తపు మరకలతో
♦ యువకుడి హల్చల్ గంట తరువాత మాయమైన యువకుడు
తాండూరు: ‘నన్ను చంపేస్తున్నారు.. కాపాడండి..’ అంటూ ఓ ఇరవై ఏళ్ల యువకుడు గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించి హల్చల్ చేశాడు. వివరాలు.. సమస్యలు విన్నవించేందుకు ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. చైర్పర్సన్ విజయలక్ష్మి తన ఛాంబర్లో, ఇతర కౌన్సిలర్లు, అధికారులు కార్యాలయంలో ఎవరిపనిలో వారు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటి నుంచి పరుగులు తీస్తూ రక్తపు మరకలతో ఓ యువకుడు మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. హిందీలో మాట్లాడుతూ తనను చంపేందుకు కొందరు వెంటపడ్డారు. ఈక్రమంలో గాయాలయ్యాయని తెలిపాడు. తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. యువకుడు అడ్మిస్ట్రేషన్ విభాగంలోకి వెళ్లాడు.
మున్సిపల్ అకౌంటెంట్ సుధ, మేనేజర్ శ్రీహరి, సిబ్బంది కాశీనాథ్ తదితరులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. పక్కసెక్షన్లో పనిచేస్తున్న సిబ్బంది అక్కడికి వచ్చారు. యువకుడు హిందీలో వివరాలు చెబుతున్నా వారికి అర్థంకాలేదు. తనను ఎవరో వెంబడిస్తున్నారని భయంతో వణికిపోయాడు. విషయం అర్థంకాని అధికారులు.. వచ్చింది సైకోనా? లేక? నిజంగా అతడిపై ఎవరైనా దాడి చేశారా..? అని తెలియక ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత యువకుడికి నీళ్లు తాగించారు. కౌన్సిలర్ అరవింద్కుమార్ కార్యాలయానికి వచ్చారు. యువకుడితో హిందీలో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. యువకుడి మాట్లాడే తీరు అర్థంకాలేదు. సుమారు గంట తరువాత యువకుడు కార్యాలయం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే, ఇంత జరిగినా మున్సిపల్ అధికారులు ఎవరూ పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.