అనకాపల్లిలో కాలనీ గోడ కూల్చివేసిన ఎమ్మెల్యే బంధువులు
ఇదేమని అడిగిన కాలనీ వాసులపై దౌర్జన్యం
ఎట్టకేలకు ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
సాక్షి టాస్క్ఫోర్స్: అనకాపల్లిలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడి అనుచరులు ఓ కాలనీ గోడను కూల్చివేయడమే కాకుండా ఇదేమని ప్రశ్నించిన కాలనీవాసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నానితోపాటు ఎమ్మెల్యే బంధువైన కొణతాల బాల సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అనకాపల్లిలో విశాఖ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనుమతి పొందిన లేఅవుట్లో కాలనీ వాసులు నిర్మించుకున్న గోడను జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మేనల్లుడు దాడి నాని, ఎమ్మెల్యే బంధువు కొణతాల బాల, విల్లూరి గణేష్, ఆడారి శంకరరావు, శరగడం రమేష్, బుద్ద మురళీ తాతారావు తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరి 18న అర్ధరాత్రి పొక్లెయిన్ సాయంతో కూల్చివేశారు.
కాలనీ వాసులు తమ రక్షణ కోసం చాలాకాలం క్రితం ఆ గోడను నిర్మించుకోగా.. ఆ గోడ అవతల ఉన్న స్థలంపై జనసేన పార్టీకి చెందిన వ్యక్తులు కన్నేశారు. కాలనీ వాసులు అడ్డు చెప్పేలోపే పాత గోడను తొలగించి.. పక్కన మరో గోడ నిర్మించారు. గోడ తొలగించిన స్థలంలో అది తమ స్థలమేనంటూ బోర్డులు పెట్టారు. గోడ కూల్చివేత, స్థలాన్ని ఆక్రమించడంతోపాటు పక్కనే అక్రమ కట్టడం నిర్మించడంపై కాలనీవాసులు అప్పట్లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు స్పందించడానికి చాలా సమయం తీసుకున్నారు.
ఎమ్మెల్యే బంధువు ఈ వ్యవహారంలో ఉండటంతో కేసు నమోదులో జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఎట్టకేలకు శనివారం (ఈ నెల 9న) బాధితులలో ఒకరైన కాండ్రేగుల బాల వెంకట పరమేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడు, బంధువుపై ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే మేనల్లుడు తదితరులు కాలనీవాసులపై శనివారం రాత్రి దౌర్జన్యానికి దిగటం కలకలం రేపింది. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


