Delhi Assembly Elections 2020
-
కాంగ్రెస్ విషాదం
గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడల్లా కాంగ్రెస్ పుట్టి మునుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి కాంగ్రెస్లో మళ్లీ భిన్న స్వరాలు కత్తులు దూసుకుంటున్నాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీతో మొదలుపెట్టి ఒక్కొక్కరే చేస్తున్న వ్యాఖ్యలు చివరకు పార్టీ అధ్యక్ష పదవి వైపు మళ్లాయి. ఢిల్లీలో కాంగ్రెస్కు ఘనమైన చరిత్రే వుంది. అక్కడ షీలా దీక్షిత్ నేతృత్వంలో ఆ పార్టీ వరసగా మూడు దఫాలు పాలించింది. అయితే 2013æనుంచి కాంగ్రెస్ క్షీణ దశ మొదలైంది. అక్కడే కాదు... దేశవ్యాప్తంగానే ఆ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. తాజాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక, బీజేపీ ఓటమిపై ట్వీట్ చేస్తూ ‘మోసకారులు, డంబాలు పలికేవారూ మట్టికరిచారు’ అనడంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విజయాన్ని కీర్తించిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి శర్మిష్ట ఊహించని షాక్ ఇచ్చారు. ‘బాగాలేని రాష్ట్రాల్లో పార్టీని రద్దు చేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే బాధ్యతను ఔట్ సోర్సింగ్కి ఇద్దామా?’అని నిలదీశారు. తనను జైలుపాలు చేసిన బీజేపీని గేలిచేయడానికి అవకాశం దొరికొందన్న సంబరమే తప్ప, పరాజయభారంతో ఖిన్నులైవున్న ఢిల్లీ కాంగ్రెస్ నేతల మనోభావాలను గాయపరుస్తానేమోనన్న ఆలోచన చిదంబరానికి లేకపోయింది. ఢిల్లీ అపజయం సాధారణమైనది కాదు. ఆ పార్టీకి ఇది వరసగా మూడో ఓటమి. ప్రతి ఎన్నికల్లోనూ ఆ పార్టీ అంతకు ముందుకన్నా క్షీణించిపోవడం ప్రస్ఫు టంగా కనబడుతోంది. అసెంబ్లీలో సున్నా చుట్టడం ఇది వరసగా రెండోసారి. ఈసారి ఓట్లు నాలుగు శాతం మించలేదు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్కు పడిన ఓట్లు ఒక శాతం కూడా లేవు! ఢిల్లీ పీసీసీకి లోగడ ఇన్చార్జిగా వున్న పీసీ చాకో ఢిల్లీ ఓటమికి చనిపోయిన షీలా దీక్షిత్ను తప్పుబడితే, మరో అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆమె హయాంలో ఎన్నడూ ఇంత హీన స్థితిలో లేదని జవాబిచ్చారు. ఇదంతా సద్దుమణగక ముందే ముంబై పీసీసీ చీఫ్ మిలింద్ దేవరా ఆప్ను, అరవింద్ కేజ్రీవాల్ను ఆకాశానికెత్తుతూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆయనకు అజయ్ మాకెన్ నిష్టూరంగా జవాబిచ్చారు. కేవలం ఎన్నికల్లో ఓటమి సంభవించినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ఇలా పరస్పర కలహాలతో బజారున పడుతున్నదని అనుకోవడానికి లేదు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మధ్యప్రదేశ్లో కూడా పార్టీ పరిస్థితి బాగులేదు. అక్కడ ముఖ్యమంత్రి కమల్నాథ్కూ, ఆ పదవి ఆశించి భంగపడిన జ్యోతిరాదిత్య సింధియాకూ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిరసన ఉద్యమం ప్రారంభిస్తానని జ్యోతిరాదిత్య హెచ్చరించడం, అలా చేయమ నండి చూద్దామంటూ కమల్నాథ్ స్పందించడం ఆసక్తిదాయకంగా మారింది. వారిద్దరిమధ్యా రాజీ కుదర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పంజాబ్లో గత నెల పుట్టిన తుపాను పర్యవసానంగా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పీసీసీని, జిల్లా కమిటీలను రద్దు చేశారు. ప్రభుత్వానికీ, పార్టీకీ మధ్య సమన్వయం కోసం 11మందితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా సమస్య తలెత్తినప్పుడల్లా ఏదో ఒకటి చేశామని చెప్పుకోవడానికి తప్ప, మొత్తంగా పార్టీని ఏకతాటిపై నడిపించగల సామర్థ్యం అధినాయకత్వానికి లేకుండాపోయింది. కనుకనే ఈ వివాదం చివరకు కాంగ్రెస్ అధ్యక్ష పదవివైపు మళ్లింది. నాయకత్వ లేమిని పార్టీ సరిదిద్దుకోవాలంటూ ఎంపీ శశి థరూర్ ఇచ్చిన పిలుపు పెను ప్రకంపనలు సృష్టించింది. అంతక్రితం నాయకత్వం తలెత్తిన ప్రశ్నకు సరైన జవాబును అన్వేషించడం పార్టీకున్న పెద్ద సవాలని షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. మరో సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ వీరితో గొంతు కలిపి పార్టీ ‘చింతన్ బైఠక్’ జరపాలని, సంస్థాగత జడత్వాన్ని వదిలించుకోవాలని పిలుపు నిచ్చారు. అయితే కాంగ్రెస్కు రాహుల్గాంధీ తిరుగులేని నాయకుడని, ఎవరినో ఎన్నుకోవాల్సిన అవసరం పార్టీకి లేదని ఆయన మద్దతుదార్లు ఒకటికి రెండుసార్లు చెబుతున్నారంటే పార్టీలో నెలకొన్న పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రస్తుతానికి ఖాళీగా లేదని, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వీరందరూ మరిచిపోతు న్నారు. పైగా ఫలానా సమయం వరకే ఈ పదవిలో ఉంటానని ఆమె గడువేమీ విధించలేదు కూడా. అయినా అధ్యక్ష పదవి గురించి బాహాటంగా అందరూ మాట్లాడుతుంటే, ఎవరికి వారుగా ఇష్టాను సారం వ్యాఖ్యలు చేస్తుంటే వారిని బతిమాలి నోరు మూయించడం తప్ప పార్టీ నాయకత్వం మరేమీ చేయలేకపోతోంది. కాంగ్రెస్కు గెలుపోటములు కొత్తేమీ కాదు. అధికారానికి దూరంగా ఉండటం గతంలోనూ జరిగింది. వేరే నేతలు పార్టీకి సారథ్యం వహించినప్పుడు అప్పుడప్పుడు సమస్యలు తలెత్తినా, గాంధీ–నెహ్రూ కుటుంబీకులున్నప్పుడు ఇలా ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం కనబడదు. పార్టీ ఎదుగుదలను కాంక్షించి చిత్తశుద్ధితో పనిచేసేవారిని శంకించి దూరం పెట్టడం, వారికి వ్యతిరేకంగా తమ భజనపరులతో ముఠాలు కట్టించి కలహాలు రేపడం పార్టీ నాయకత్వానికి అలవాటుగా మారాక పార్టీ క్షీణ దశ మొదలైంది. ఒకదాని వెనక ఒకటిగా వచ్చే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పార్టీ మరింత బలహీనపడుతోంది. ఈ ఏడాది రెండు ప్రధాన రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, బిహార్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రెండుచోట్లా పార్టీ స్థితి అంతంతమాత్రమే. బిహార్లో ఆర్జేడీతో కూటమి కడితే కొద్దో గొప్పో వస్తాయనుకున్నా, బెంగాల్లో నిరాశ తప్పదు. ఇప్పటికైనా వైఫల్యాలు ఎందుకొచ్చిపడుతున్నాయో చిత్తశుద్ధితో సమీక్షించుకుని, సమర్థులైనవారికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ సంస్థాగతంగా బలపడుతుంది. ఆ తర్వాత ప్రజల విశ్వాసాన్ని పొందడం ఏదో మేర సాధ్యమవుతుంది. -
దేశవ్యాప్త విస్తరణ దిశగా ‘ఆప్’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విస్తరణ బాట పట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని కనీసం కోటి మందికి చేరువ అవ్వాలన్న లక్ష్యంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించనుంది. అరవింద్ కేజ్రీవాల్ తాజా మంత్రివర్గంలో సభ్యుడిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీ సీనియర్ నేత గోపాల్ రాయ్.. ఆప్ రాష్ట్రాల ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ‘మూడు విషయాలపై పని చేయాలని నిర్ణయించాం. మొదటిది, అన్ని రాష్ట్రాల పార్టీ యూనిట్లు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు రాష్ట్ర నిర్మాణ్ కార్యక్రమం చేపడ్తాయి. ఇందులో పార్టీ వాలంటీర్లు ప్రజలను కలుస్తారు. కనీసం కోటి మందిని కలవాలనేది లక్ష్యం. అలాగే, దేశ నిర్మాణంలో పాలుపంచుకునేందుకు కలసిరావాలని కోరుతూ పోస్టర్లతో ప్రచారం చేస్తాం. ఇందుకు 9871010101 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పోస్టర్లను అంటిస్తాం. ఆ తరువాత, అన్ని రాష్ట్రాల రాజధానులు, ఇతర ప్రధాన నగరాల్లో పార్టీ నేతలు ప్రెస్మీట్లను నిర్వహిస్తారు. దేశ నిర్మాణంలో భాగంగా ఆప్లో చేరాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు’ అని గోపాల్ రాయ్ వివరించారు. రానున్న నెలల్లో అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నామన్నారు. తద్వారా, ఆయా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలను పొందాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని, ఏయే రాష్ట్రాల్లో పోటీకి దిగాలనేది పార్టీ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ‘ఆప్’ను ప్రాంతీయ పార్టీగానే ఎన్నికల సంఘం గుర్తించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ, గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడంతో, జాతీయ స్థాయిలో సత్తా చూపాలన్న ఆ పార్టీ కోరిక నెరవేరలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అదీ పంజాబ్లోనే. ఢిల్లీలోని అన్ని స్థానాల్లోనూ ఓడిపోయింది. -
మోదీ ఆశీస్సులు కావాలి
న్యూఢిల్లీ: ఢిల్లీ పాలన సజావుగా సాగేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, ఇందుకు ప్రధాని మోదీ ఆశీస్సులు కావాలని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలతోనూ ఇక పనిలేదని, ఎన్నికల సమయంలో తనపై అనేక విమర్శలు గుప్పించిన రాజకీయ ప్రత్యర్థులను క్షమించేశా నన్నారు. ఆదివారం ఉదయం చారిత్రక రాంలీలా మైదానంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మూడోసారి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు.. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, కైలాస్ గహ్లోత్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇమ్రాన్ హుస్సేన్లతో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్ ప్రమాణం చేయించారు. అనంతరం కేజ్రీవాల్.. భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రారంభించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. తనను తాను ఢిల్లీ కొడుకునని చెప్పుకున్నారు. ఈ విజయం తనది కాదని, ప్రతి ఢిల్లీ పౌరుడిదని అన్నారు. గతంలో కేంద్రంతో పలు సందర్భాల్లో తలపడిన కేజ్రీవాల్ ఈసారి మాత్రం.. తన పాలన సజావుగా సాగాలంటే ప్రధానమంత్రి మోదీ ఆశీస్సులు కావాలని, కేంద్రంతో కలిసి పని చేయాలనుకుంటున్నానని చెప్పారు. ప్రమాణ స్వీకారానికి ప్రధానికి కూడా ఆహ్వానం పంపామనీ, ఆయన బిజీగా ఉండి రాలేకపోయి ఉంటారని అన్నారు. ఎవరిపైనా సవతి తల్లి ప్రేమ చూపనని, వచ్చే ఐదేళ్లూ ఢిల్లీ ప్రజలందరి కోసం పనిచేస్తానని చెప్పారు. ‘తల్లి ప్రేమ, తండ్రి ఆశీర్వాదంతోపాటు ఈ ప్రపంచంలో ప్రకృతి ఇచ్చే విలువైన ప్రతిదీ ఉచితమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన వారి నుంచి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తే నేను సిగ్గుపడాలి’ అని అన్నారు. ‘హమ్ హోంగే కామ్యాబ్..’ అంటూ కార్యక్రమానికి హాజరైన ప్రజలతో గొంతుకలిపి పాడి కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ముగించారు. -
‘మఫ్లర్ మ్యాన్’ సందడి ‘క్రేజీ’
న్యూఢిల్లీ : ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ‘బేబి మఫ్లర్ మ్యాన్’ సందడి చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల రోజు సోషల్ మీడియాలో పాపులర్ అయిన ‘అవ్యాన్ తోమర్’కు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఫంక్షన్కు ఆహ్మనం అందిన విషయం తెలిసిందే. కాగా ఆదివారం రామ్లీలా మైదానంలో ముడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెటర్, మఫ్లర్, కళ్లజోడుతో వచ్చిన ఈ బుడతడు అందరి దృష్టిని ఆకర్షించాడు. (‘బేబీ మఫ్లర్మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!) ఈవెంట్లో చిన్నారి సెంటర్ ఆఫ్ ఆట్రాక్షన్గా నిలవడంతో పిల్లవాడితో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ చిన్నారిని తమ కెమెరాల్లో బంధించేందుకు మీడియా సైతం ఆసక్తి చూపింది. ఇక ఆప్ ఎమ్మెల్యేలు భగవత్మాన్, రాఘవ్ చద్దా, సోమ్నాథ్ భారతి వంటి వారు కూడా పిల్లాడితో ఫోటోలు దిగి ముద్దు చేశారు. అదే విధంగా మరికొంత మంది చిన్నారులు కూడా కేజ్రీవాల్ను అనుకరిస్తూ దుస్తులు ధరించి కార్యక్రమానికి వచ్చి ప్రత్యేకంగా నిలిచారు. (వైరల్ : పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్) చదవండి : ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు! -
ఒకటి కాదు, రెండు కాదు.. హ్యాట్రిక్ కొట్టారు!
కేజ్రీ... హ్యాట్రిక్ ఢిల్లీ అసెంబ్లీ పీఠంపై సామాన్యుడు మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విద్య, వైద్య రంగంలో చేసిన అభివృద్ధి, ఉచిత సంక్షేమ పథకాలు, ఎన్నికలకు ముందు సంయమనం సాగిస్తూ చేసిన పాజిటివ్ ప్రచారం తిరిగి ఆయన ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాయి. మన దేశంలో ఇలా హ్యాట్రిక్ కొట్టిన సీఎంలు ఎందరు ? సుదీర్ఘ కాలం సీఎంలుగా పనిచేసిన వారు ఎవరు ? బ్రేక్ లేకుండా అన్ని సంవత్సరాలు ఎలా అధికారంలో కొనసాగారు? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్... (చదవండి : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం) పవన్ కుమార్ చామ్లింగ్ (ఎస్డీఎఫ్) రాష్ట్రం: సిక్కిం, పదవీ కాలం: 24 ఏళ్ల 165 రోజులు సిక్కిం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన పవన్కుమార్ చామ్లింగ్ ఏకంగా అయిదు సార్లు అప్రతిహతంగా అధికారాన్ని అందుకున్నారు. 1994లో తొలిసారిగా సీఎం పీఠం ఎక్కిన ఆయన గత ఏడాది వరకు అదే పదవిలో కొనసాగారు. తన గురువు, సిక్కింను పరిపాలించిన నార్ బహుదూర్ భండారీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన చామ్లింగ్ 1992లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్)పేరుతో కొత్త పార్టీ పెట్టారు. భండారీది అరాచకవాదమని, తాను ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల బరిలో దూకి 1995లో సీఎం పదవి చేపట్టారు. అభివృద్ధి, శాంతిభద్రతలపై ఎక్కువ దృష్టి సారించారు. సిక్కిం రాష్ట్రంలో సహజ వనరుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వ్యవసాయాన్ని, పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించారు. బడ్జెట్లో 70 శాతం నిధుల్ని గ్రామీణ ప్రాంతాల్లోనే వినియోగించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత సాధించారు. దేశంలో పూర్తిగా సేంద్రియ పంటలు పండిస్తున్న తొలి రాష్ట్రంగా సిక్కిం 2015లో రికార్డులకెక్కింది. పదో తరగతి వరకు అందరికీ ఉచిత విద్య అందివ్వడం కూడా ప్రజల్లో పవన్కుమార్పై ఒక క్రేజ్ని సృష్టించాయి. చామ్లింగ్ పదవి చేపట్టేనాటికి రాష్ట్రంలో 40శాతానికిపైగా జనాభా దారిద్య్రరేఖ దిగువన ఉన్నారు. దానిని 8శాతానికి తగ్గించారు. సగటు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎప్పుడూ సిక్కింలో అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. క్షేత్రస్థాయికి పరిపాలనను తీసుకువెళ్లడం, ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తాను చేసిన తప్పుల్ని గ్రహించుకొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడం, నిరంతరం పుస్తకాలు చదువుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పాలనలో మార్పులు చేపట్టడం వంటి చామ్లింగ్ చర్యలు ప్రజల్లో చరిష్మాను పెంచాయి. పశ్చిమబెంగాల్కు అత్యధిక కాలం సీఎంగా సేవలు అందించిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టేలా చేశాయి. జ్యోతిబసు (సీపీఐ–ఎం) రాష్ట్రం: పశ్చిమ బెంగాల్, పదవీ కాలం: 23 ఏళ్ల 137 రోజులు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక జ్యోతిలా వెలుగులు పంచిన జ్యోతిబసు పశ్చిమబెంగాల్ను రెండు దశాబ్దాల పాటు ఏలి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించారు. వామపక్ష భావజాలంపై గట్టి విశ్వాసం కలిగిన జ్యోతిబసు 1940లో యువకుడిగా ఉన్నప్పుడే కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అయితే సీఎం పదవి చేపట్టడానికి ఆయన 37 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1977లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితి విధించిన అనంతరం పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. జ్యోతిబసు రచించిన వ్యూహాలతోనే ఆ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. సీఎం అయ్యాక భూసంస్కరణలు, వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు, పంచాయతీల్లో మూడు అంచెల వ్యవస్థ, వితంతువులకు, నిరుద్యోగులకు భృతి, యువజన వ్యవహారాల కోసం ప్రత్యేక శాఖ వంటివన్నీ ఆయనను అత్యధిక కాలం సీఎంగా కొనసాగేలా చేశాయి. 2000 సంవత్సరంలో బుద్ధదేవ్ భట్టాచార్యకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి సీఎం పదవి నుంచి వైదొలిగారు. 1996లో పార్టీ నియమనిబంధనలకి తలొగ్గి గుమ్మం దాకా వచ్చిన ప్రధాని పదవిని వదులుకున్నారు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజుల పాలన అనంతరం యునైటెడ్ ఫ్రంట్ నాయకుడిగా జ్యోతిబసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ సీపీఎం అగ్ర నాయకత్వం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవడానికి నిరాకరించడంతో ప్రధాని అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. మాణిక్ సర్కార్ (సీపీఐ–ఎం) రాష్ట్రం: త్రిపుర, పదవీ కాలం: 19 ఏళ్ల 363 రోజులు తనకంటూ ఒక సొంత ఇల్లు, కారు లేని ఏకైక ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. త్రిపురలో వరసగా నాలుగుసార్లు ఎర్రజెండా ఎగురవేసిన కమ్యూనిస్ట్ దిగ్గజం మాణిక్ సర్కార్. దేశంలోనే నిరుపేద సీఎంగా రికార్డులకెక్కారు. త్రిపురలో ఒక టైలర్ కుటుంబంలో జన్మించిన మాణిక్ సర్కార్ చిన్నప్పుడే కమ్యూనిజం వైపు ఆకర్షితుడై సీపీఐ (ఎం)లో చేరారు. 1998లో తొలిసారిగా త్రిపుర సీఎంగా పదవి చేపట్టిన ఆయన 19 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మాణిక్ సర్కార్ సీఎం పదవిలో ఉన్నప్పుడు తన జీతంలో నెలకి రూ.5 వేలు ఉంచుకొని మిగిలినది పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. ఆయన సీఎం అయిన సమయంలో త్రిపురలో నిరంతరం హింస, ఘర్షణ చెలరేగుతూ ఉండేది. బెంగాలీలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు ఉండేవి. బెంగాల్ నుంచి వచ్చే తీవ్రవాదులు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేవారు. అలాంటి హింసాత్మక వాతావరణం నుంచి శాంతి స్థాపన దిశగా మాణిక్ సర్కార్ తీసుకున్న చర్యలు, ఆయనలో నిజాయితీ, నిరాండబరత అన్నేళ్లు పదవిలో కొనసాగేలా చేశాయి. అయితే మాణిక్ సర్కార్ ఎంత నిరాడంబరంగా ఉన్నారో, అందరూ అంతే సామాన్యంగా ఉండాలని భావించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు అరకొర జీతాలతో బతుకు బండి లాగాల్సి వచ్చేది. అందుకే రెండేళ్ల క్రితం త్రిపుర కోటపై ఎర్రజెండాకి బదులుగా కాషాయం జెండా రెపరెపలాడింది. నవీన్ పట్నాయక్ (బిజూ జనతాదళ్) రాష్ట్రం: ఒడిశా, పదవీ కాలం: 2000 సంవత్సరం నుంచి ఇంకా కొనసాగుతున్నారు. మాతృభాష ఒరియాలో కూడా మాట్లాడలేరు. అయినా అయిదు దఫాలుగా వరస విజయాలతో దూకుడు చూపిస్తున్నారు. ఒడిశాలో జన హృదయ నేత బిజు పట్నాయక్ మరణానంతరం ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన నవీన్ పట్నాయక్ ఆ తర్వాత కాలంలో జనతాదళ్ నుంచి విడిపోయి బిజూ జనతాదళ్ స్థాపించారు. ప్రజా నేతగా ఎదిగారు. ఒకప్పుడు ఒడిశా అంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికి పగ్గాలు చేపట్టిన నవీన్ అభివృద్ధి అంటే ఏంటో చూపించారు. ఖనిజ సంపద అత్యధికంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేని ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. నవీన్ సీఎం అయ్యాక మౌలిక సదుపాయాల రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, నైపుణ్యం కలిగిన కార్మిక శక్తిని తయారు చేసి చూపించారు. దీంతో పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు ఒడిశాని వెతుక్కుంటూ వచ్చాయి. ప్రజాసేవ, సుపరిపాలనే అస్త్రాలుగా ముందుకు సాగారు. చౌక ధరకే బియ్యం, స్కూలు బాట పట్టే విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ, ఎన్నో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి 80 లక్షల మందికి పైగా ప్రజల్ని దారిద్య్ర రేఖకి ఎగువకి తీసుకువచ్చారు. అనునిత్యం తుపాన్లలో చిక్కుకునే ఒడిశాలో ప్రకృతి వైపరీత్యాల సమయాలను ఆయన ఎదుర్కొనే తీరు అంతర్జాతీయంగా ప్రశంసలు తెచ్చిపెట్టింది. షీలా దీక్షిత్ (కాంగ్రెస్) రాష్ట్రం: ఢిల్లీ, పదవీ కాలం: 15 ఏళ్ల 25 రోజులు ఇప్పుడు అందరం కేజ్రీవాల్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడుసార్లు దక్కించుకొని అరుదైన ఘనత సా«ధించిన తొలి సీఎం షీలాదీక్షిత్. కాంగ్రెస్ డార్లింగ్గా పేరు సంపాదించిన ఆమె 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పరిపాలించి దేశ రాజధాని రూపు రేఖలు మార్చారు. ఢిల్లీకి రాజధాని హంగులు అద్దింది షీలా దీక్షితే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా గుర్తింపుని తెచ్చుకున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ, విద్య, ఆరోగ్య రంగాలను ఒక గాడిలో పెట్టారు. పెద్ద పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. ఢిల్లీ అభివృద్ధి చెందడానికి, నిరుపేదల సంఖ్య తగ్గడానికి షీలా చేపట్టిన అభివృద్ధే కారణం. సీఎంగా ఉన్నప్పుడు ఆమెపై అవినీతి ఆరోపణలూ వచ్చాయి కానీ ఏవీ కోర్టు ముందు నిలవలేదు. రాజకీయాల్లో మహిళలు మనుగడ సాగించడమే కష్టమైపోతున్న రోజుల్లో షీలా దీక్షిత్ మూడు సార్లు వరసగా ఎన్నికల్లో విజయభేరి మోగించి రికార్డు సృష్టించారు. 2013లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రవేశపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆయన చరిష్మా ముందు షీలా నిలబడలేకపోయారు. గాంధీ కుటుంబానికి వీర విధేయురాలైన ఆమె గత ఏడాది లోక్సభ ఎన్నికల ప్రచారంలో 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా పాల్గొని అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడానికి కృషి చేశారు. రమణ్ సింగ్ (బీజేపీ) రాష్ట్రం: ఛత్తీస్గఢ్, పదవీ కాలం: 15 ఏళ్ల 4 రోజులు రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ అన్న ఇమేజ్ సాధిం చడం అంత సులభమేమీ కాదు. అలాంటి ఇమేజ్తోనే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో 2003–18వరకు మూడుసార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించారు రమణ్ సింగ్. బీజేపీకి పదిహేనేళ్ల పాటు వెన్నుదన్నుగా నిలిచారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భారీగా సంస్కరణలు తీసుకువచ్చి ఆహార భద్రత కల్పించారు. నిరుపేదలకు, ముఖ్యంగా ఆదివాసీలకు కడుపు నిండా తిండి దొరకడంతో వారంతా రమణ్ సింగ్ను ఆప్యాయంగా చావాల్ బాబా అని పిలిచేవారు. ఆహారం, విద్య, ఆరోగ్య రంగాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఛత్తీస్గఢ్ పరిపాలనను రమణీయంగా మార్చాయి. వ్యూహాత్మకంగా నక్సల్స్ అణిచివేత కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించేలా చర్యలు తీసుకున్నారు. అధికారం చేపట్టేనాటికి 7 వేల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ను 78 వేల కోట్లకు తీసుకువచ్చారు. ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రి స్వస్త బీమా యోజన ద్వారా ఏడాదికి రూ.30 కడితే చాలు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించేవారు. శిశు మరణాల్ని అరికట్టారు. అయితే 2018కి ముందు ఎన్నికల్లో రమణ్ సింగ్పై పడిన అవినీతి మకిలి, కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరు కుంపటి పెట్టిన అజిత్ జోగి పార్టీ బీజేపీ ఓట్లను చీల్చేయడంతో రమణ్ సింగ్ నాలుగోసారి అధికారం చేపట్టలేకపోయారు. కానీ ఇప్పటికీ రమణ్ సింగ్ పేరు ఆదివాసీల హృదయాల్లో మారు మోగుతూనే ఉంది. నరేంద్ర మోదీ (బీజేపీ) రాష్ట్రం: గుజరాత్, పదవీ కాలం: 12 ఏళ్ల 226 రోజులు 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, తర్వాత ఏడాది జరిగిన గోద్రా మత ఘర్షణల మచ్చను జయించి మరీ హ్యాట్రిక్ సీఎంగా నిలిచారు. గుజరాత్ మోడల్ అభివృద్ధినే పెట్టుబడిగా పెట్టి 2014లో లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధాని పగ్గాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటిగా నిలిచిందంటే దానికి మోదీ ప్రవేశ పెట్టిన అభివృద్ధి పథకాలే కారణం. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ మౌలిక రంగాల కల్పనలో అత్యధికంగా నిధులు వినియోగించారు. ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో కొత్త ఒరవడి సృష్టించడంతో ఆయన అభిమానులు మోడీనామిక్స్కి తిరుగులేదని బ్రహ్మరథం పట్టారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.1% ఉన్నదానిని మోదీ సీఎం అయ్యాక 16.6 శాతానికి చేర్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించడంతో నిరుద్యోగ సమస్య తొలగిపోయింది. భారీ ఎత్తున పెట్టుబడుల సదస్సులు నిర్వహించి పారిశ్రామిక రాయితీలు ఇచ్చారు. ఎవరైనా పరిశ్రమలను నెలకొల్పడానికి ముందుకు వస్తే చాలు, ప్రభుత్వ యంత్రాంగమే వారి దగ్గరకు పరుగులు తీసి ఆహ్వానించేది. అభివృద్ధి ఎంత జరిగిందో దానికి నీడలా దుర్భర దారిద్య్రం కూడా నెలకొని ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. మాతా శిశు మరణాలు గుజరాత్లో అత్యధికమన్న వాదనా ఉంది. -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
-
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కేజ్రీవాల్తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం రాంలీలా మైదానంలో ‘ ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్తో ప్రమాణం చేయించారు. వరుసగా మూడవ సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు.మనిష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. (చదవండి : బ్రేక్ లేకుండా.. రాష్ట్రాలేలిన హ్యాట్రిక్ హీరోలు..!) కాగా, ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ శనివారం కేజ్రీవాల్ పిలుపునివ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. -
నేడు ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
-
కేజ్రీ.. ముచ్చటగా మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(51) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానం వేదిక కానుంది. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్ ఈసారి.. రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులు ఉంటారని ఆప్ నేత మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సుమిత్ నగల్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఐటీ సీటు సాధించిన విజయ్ కుమార్, మొహల్లా క్లినిక్ డాక్టర్ ఆల్కా, బైక్ అంబులెన్స్ సర్వీస్ అధికారి యుధిష్టిర్ రాఠీ, నైట్ షెల్టర్ కేర్ టేకర్ సబీనా నాజ్, మెట్రో పైలట్ నిధి గుప్తా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి 1.25లక్షల మంది ప్రజలు తరలివస్తారని భావిస్తున్నామని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రధాని మోదీతోపాటు ఢిల్లీకి చెందిన బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రజలను ఆహ్వానించారు. రాంలీలా మైదానం, పరిసరాల్లో ఢిల్లీ పోలీసు, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్ కలిపి సుమారు 3 వేల మందిని మోహరించనున్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతోపాటు మైదానం చుట్టుపక్కల బ్యాగేజి స్కానర్లను, డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను అమర్చారు. మైదానంలోపలా బయటా ‘ధన్యవాద్ ఢిల్లీ’ అంటూ కేజ్రీవాల్ ఫొటో ఉండే భారీ కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ జారీ చేసిన ఆదేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కోరారు. ఈ ఆదేశం నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానిం చారు. ఉపాధ్యాయులకు తాము ఆహ్వానాలు పంపామేతప్ప, ఆదేశాలు కాదని ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. కాబోయే మంత్రులకు కేజ్రీవాల్ విందు ఢిల్లీ అభివృద్ధి కార్యాచరణతోపాటు వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కేజ్రీవాల్ కాబోయే మంత్రులతో చర్చించారు. గత మంత్రివర్గంలోని ఆరుగురికి శనివారం తన నివాసంలో కేజ్రీవాల్ విందు ఇచ్చారు. ఢిల్లీలో రెండు కోట్ల మొక్కలు నాటడం, యమునా నదిని శుద్ధి చేయడం, కాలుష్యం తగ్గించడం వంటి ప్రజలకిచ్చిన 10 హామీల అమలుకు రంగంలోకి దిగాలని సహచరులను కేజ్రీవాల్ కోరారని ఆప్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. గత మంత్రివర్గంలో ఉన్న సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్ సహా ఆరుగురు మంత్రులు కేజ్రీవాల్తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
పేరు సార్థకం చేసుకున్న సామాన్యుడి పార్టీ..!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయ ఢంకా మోగించిన ఆమ్ ఆద్మీపార్టీ (సామాన్యూడి పార్టీ) తన పేరుకు తగ్గట్టే అడుగులు వేస్తోంది. ఆదివారం జరుగబోయే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 50 మంది సాధారణ పౌరులను ముఖ్య అతిథులుగా ఆప్ ఆహ్వానించిందని ఆప్ నేత మనీష్ సిసోడియా శనివారం మీడియాతో తెలిపారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, రాజకీయ ప్రముఖులు, అధికార యంత్రాగానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు.. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, అంబులెన్స్, మెట్రో రైల్ డ్రైవర్లు, పాఠశాల ప్యూన్లు వేదిక పంచుకోనున్నారు. ఇక రామ్లీలా మైదానంలో జరిగే అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలను ఆప్ ఇప్పటికే కోరింది. మాస్కో ఒలింపియాడ్లో పతకాలు సాధించిన విద్యార్థులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బంది కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కార్యక్రమానికి ఆహ్వానించినట్టుగా సిసోడియా తెలిపారు. కాగా, మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
చీపురు వజ్రాయుధమై...
సొంత చాప కిందికి నీళ్లొచ్చిన వైనం ఆ జంట పసిగట్టలేకపోయింది. అమిత్ షాకి గజకర్ణ గోకర్ణ, టక్కు టమారాది విద్యలు క్షుణ్ణంగా వచ్చుననీ, మనుషుల మెదళ్లని బొంగరాలుగా తిప్పి ఆడుకుంటా డని ఒక వాడుక. మోదీ అమిత్ షా చేసిన, చేస్తున్న తప్పులతో సహా సమాదరించి విశ్వసిస్తారని ప్రపంచం అనుకుంటుంది. మోదీకి మోదీపై భయంకరమైన ఆత్మవిశ్వాసం ఉంది. నిన్న మొన్నటి ఢిల్లీ ఎన్నికలు మహా మాంత్రికులిద్దరినీ పొత్తిళ్లలోకి తీసికెళ్లాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సోదిలోకి కూడా రాలేదు. కమలం రెక్కలైనా సాంతం విప్పలేకపోయింది. పీఠం కిందనే ఉండి పూర్తిగా అందుబాటులో ఉన్న హస్తినలోనే పాగా గురితప్పిందంటే ఆ ద్వయం ఆలోచనలు అధ్వాన్నంగా ఉన్నాయనడానికి కొండ గుర్తు. కశ్మీర్ పరిష్కారం, రామాలయం, పౌరసత్వ క్షాళన ఇవేమీ బీజేపీని పీఠంపై గట్టిగా పదిమెట్లు కూడా ఎక్కించలేక పోయాయి. అంతమాత్రం చేత కమలానికి రాముడి రక్ష లేదని నాస్తికుల్లా కొట్టిపారెయ్యరాదు. క్షాళనకి ప్రతీకగా నిలబడ్డ ఆప్ పార్టీ ముత్యం మూడోసారి చెక్కు చెదరలేదు. కారణాల్లో మొదటిది ఏలికలపై అవినీతి ఆరోపణలు లేకపోవడం. ప్రజల సామాన్య అవసరాలపై దృష్టి సారించడం చీపురు గెలుపునకు కారణంగా చెబుతున్నారు. ఒకప్పుడు నీళ్లు, కరెంటు లాంటి ప్రాథమిక అవసరాల ప్రస్తావన ఉంటే ఆ పార్టీలను గెలిపించేవారు. కేవలం ఈ వాగ్దానాలతో దశాబ్దాలపాటు గద్దెమీద కూచున్నవారున్నారు. బీజేపీ దేశంలో పూర్తి పవర్లో ఉంది. మొత్తం బలాలు, బలగాలు యుద్ధప్రాతిపదికన ఢిల్లీ ఎన్నికల సంరంభంలోకి దిగాయి. ఒక పెద్దాయన ‘ప్రభుత్వ వాహనాలే కాదు మిలట్రీ ట్యాంకర్లు సైతం ఎన్నికల్లో సేవలందించాయ్. అయినా పూజ్యం’ అని చమత్కరించాడు. ఢిల్లీ చౌరస్తాలో పానీపూరీ జనంతో తింటూ వారి మాటలు వినాలి. టాంగా, ఆటో ఎక్కినప్పుడు సామెతల్లా వినిపించే మాటలుంటాయ్. అందులో గొప్ప చమత్కారం ఉంటుంది. సత్యం ఉంటుంది. ‘ఈసారి ఢిల్లీలో మోదీ సాబ్ని ఒడ్డెక్కించడం బాబామాలిక్ వల్ల కూడా కాదు. అందుకే బాబా కాలుమీద కాలేసుకుని ప్రశాంతంగా కూచున్నాడు’ అన్నాడొక పకీర్ మధ్యలో పాట ఆపి. ఆప్ పార్టీ చిన్న చిన్న సౌకర్యాలమీద శ్రద్ధ పెట్టిందనీ, దానివల్లే కాషాయపార్టీని ఊడ్చేయగలిగిందని అంతా అనుకున్నారు. స్కూళ్లమీద పిల్లల చదువులమీద దృష్టి నిలిపింది. హెల్త్ సెంటర్లని జన సామాన్యానికి అందుబాటులోకి తెచ్చింది. సామాన్య ప్రజ సంతృప్తి చెందింది. నిశ్శబ్దంగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెల్పుకున్నారు. మనుషులు దేవుడి విషయంలో అయినా అంతే. నిదర్శనం కావాలి. ఫలానా మొక్కు మొక్కాం. అది జరిగితే ఆ దేవుణ్ణి మర్చిపోరు. తిరుమల వెంకన్న కావచ్చు, షిర్డీ సాయిబాబా కావచ్చు. వరుస విజయాలవల్ల మోదీ, షా బ్రహ్మాండ నాయకులమని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీ ఫలితాలు గట్టి మొట్టికాయగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ కాలుష్యకాసారంగా పేరుపడింది. అందుకు బోలెడు కారణాలు. వీధులు పట్టనన్ని మోటారు వాహనాలు మరొక సమస్య. వీటిని ఓటర్లు నొచ్చుకోకుండా ఎలాగో అధిగమించారు. పాలకులు చిన్న చిన్న సమస్యల పరిష్కారంతోనే ప్రజల మనసుల్ని గెలవచ్చునని పూర్వం నుంచీ వింటున్నాం. అశోకుడు మహా చక్రవర్తి. అయినా మనం చెప్పుకునేవి చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను అనే రెండు అంశాల గురించి మాత్రమే. చాలా ఏళ్ల క్రితం రుషి లాంటి ఒక పెద్దాయనని కలిశాను. ‘అన్నిటికంటే ప్రజల్ని గెల్చి పవర్లోకి రావడం బహు తేలిక’ అని స్టేట్మెంట్ ఇస్తే ఉలిక్కిపడ్డాను. నా మొహం చూస్తూనే నా మనసు గ్రహించాడు. ‘నీకు కుర్చీమీద మోజుంటే చూస్కో. మన రాష్ట్రంలో లేదా మన దేశంలో అంటువ్యాధులు, వీధి కుక్కలు మచ్చుకి కూడా లేకుండా చేయగలిగితే చాలు. జనం పట్టం కడతారు’ అన్నాడు. ‘అంతేనా’ అన్నాను అవి చాలా తేలిక అన్నట్టు. రుషి నా మాటకి నవ్వాడు. ‘నాయనా! మన దేశంలో మంచిపని ఏదీ అంత తేలిక కాదు. పనిచేయక మూలపడిన బోర్లను శ్రద్ధగా మూసేస్తే బోలెడు మరణాలు నిత్యం నివారించవచ్చు. కానీ జరగడం లేదు. తప్పులకి శిక్షలు లేకపోవడం మనకున్న గొప్ప అదృష్టం’ అన్నాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కేజ్రీవాల్ ప్రమాణానికి సీఎంలకు ఆహ్వానం నో
న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆమ్ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం లేదు. ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎంలు, రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించడం లేదని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్రాయ్ చెప్పారు. కేజ్రీవాల్ తన నాయకత్వంపై విశ్వాసం ఉంచి, మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజల మధ్యనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలే అతిథులని కేజ్రీవాల్ భావిస్తున్నారని వివరించారు. ఏడాది బుడతడికి పిలుపు అవ్యాన్ తోమర్ అనే చిన్నారికి మాత్రం ప్రత్యేకంగా ఆప్ నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెట్టర్, మఫ్లర్, కళ్లజోడు ధరించిన ఈ ఏడాది వయస్సున్న ఈ బుడతడు ఢిల్లీలోని ఆప్ కార్యాలయం దగ్గర ఫలితాల వెల్లడిరోజు అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ‘బేబీ మఫ్లర్ మాన్’గా పేరొందిన తోమర్ తల్లిదండ్రులు ఆప్ కార్యకర్తలు. 24 గంటల్లో 11 లక్షల కొత్త సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్టు ఆప్ వెల్లడించింది. పార్టీ సభ్యత్వం తీసుకోదలిచిన వారికోసం ఆ పార్టీ ఓ ఫోన్ నంబర్ను ప్రత్యేకంగా కేటాయించింది. పార్టీలో జాయిన్ అవడానికి ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. -
అలాంటి మాటలు వాడకుంటే బావుండేది: షా
న్యూఢిల్లీ: తమ నేతలు చేసిన ‘గోలీ మారో’, ‘ఇండో పాక్ మ్యాచ్’ వంటి వ్యాఖ్యలు ఢిల్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసి ఉండొచ్చని హోం మంత్రి అమిత్షా అన్నారు. బీజేపీ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బావుండేదన్నారు. ‘టైమ్స్ నౌ’ వార్తా చానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అమిత్ మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని ఆయన అంగీకరించారు. అయితే, ఈ ఫలితాలను సీఏఏపై, ఎన్నార్సీపై ప్రజలిచ్చిన తీర్పుగా భావించకూడదని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి ఎవరైనా తనతో చర్చించాలనుకుంటే.. అపాయింట్మెంట్ తీసుకుని తనను నేరుగా కలవవచ్చని షా తెలిపారు. అపాయింట్మెంట్ కోరిన మూడు రోజుల్లోగా వారికి సమయమిస్తామన్నారు. -
దూకుడు తగ్గించడమా? పెంచడమా?
కోల్కతా/న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో.. రానున్న పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడింది. గతంలో మాదిరిగానే పౌరసత్వ సవరణ చట్టం అమలు, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై దూకుడుగా వెళ్లాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహాలను తెరపైకి తేవాలా? అనే విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2021లో పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అధికార టీఎంసీని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కాబోవని తాజా ఢిల్లీ ఎన్నికలు స్పష్టం చేశాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. మొత్తం 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుంది. లోక్సభ ఎన్నికలతో పోల్చుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తామని భావించలేమని పార్టీ రాష్ట్ర నేతలు పేర్కొంటున్నారు. వారు ఢిల్లీ ఫలితాలను ఉదాహరణగా చూపుతున్నారు. ఢిల్లీలో 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. ‘ఢిల్లీలో కొన్ని నెలల వ్యవధిలోనే రెండు విభిన్న ఫలితాలు వచ్చాయి. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నాం కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తామని ధీమాగా ఉండలేం’ అని వారు వివరించారు. ‘రాష్ట్ర ఎన్నికలకు వ్యూహాలను మార్చాల్సి ఉంటుంది. జాతీయ ఎన్నికల్లో పనిచేసిన అంశాలు రాష్ట్రాల ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు.సీఏఏ, ఎన్నార్సీల అమలుపైననే మా ప్రచారం ఉండకూడదు. సుపరిపాలనకు సంబంధించిన ఇతర అంశాలనూ తెరపైకి తేవాలి’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ బీజేపీ నేత అభిప్రాయపడ్డారు. ఈ వాదనకు విరుద్ధంగా మరో వాదనను మరి కొందరు నేతలు వినిపించారు. ‘సీఏఏ, ఎన్నార్సీలకు సంబంధించి వ్యూహాలను మార్చాల్సిన అవసరం లేదు. వాటిపై దూకుడుగా ముందుకు వెళ్లడమే మంచిది. గతంలో అలా దూకుడుగా వెళ్లిన సందర్భంగా మంచి ఫలితాలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. తృణమూల్ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే.. ఆవేశపూరిత, ఉద్వేగభరిత వ్యూహాలనే అమలు చేయాలి. ఒకవేళ వ్యూహాలను మారిస్తే వెనకడుగు వేసినట్లవుతుంది. ఇది పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సందేశం తీసుకువెళ్తుంది’ అని పశ్చిమబెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్కు సన్నిహితులైన కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడ్తున్నారు. ద్విముఖ పోరు వల్లనే ఓటమి ‘ఢిల్లీ’ పరాజయంపై బీజేపీ సమీక్ష ప్రారంభించింది. గతం కన్నా ఈ సారి ఓటు శాతం పెంచుకున్నప్పటికీ.. ద్విముఖ పోటీ నెలకొనడం వల్లనే ఓటమి పాలయినట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 62 సీట్లు గెలుచుకుని ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 2015లో కేవలం 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈ సారి ఆ సంఖ్యను కాస్త మెరుగుపర్చుకుని 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, పార్టీ దిగ్గజాలను ప్రచార బరిలో దింపినప్పటికీ ఆశించిన ఫలితం దక్కకపోవడంపై గురువారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్షా సమావేశం నిర్వహించారు. -
నా లెక్క తప్పింది: అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తన అంచనా తప్పిందని వ్యాఖ్యానించారు. టైమ్స్ నౌ సమ్మిట్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. కొంతమంది బీజేపీ నేతల వ్యాఖ్యల కారణంగా ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని తెలిపారు. ‘‘దేశ్ కే గదరానోంకో గోలీమారో’’ (దేశ ద్రోహులను కాల్చండి) వంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి ఎవరైనా తనతో చర్చకు రావొచ్చని అమిత్ షా తెలిపారు. ఇందుకు మూడు రోజుల సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. (‘బేబీ మఫ్లర్మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!) కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అదే విధంగా సీఏఏకు వ్యతిరేకంగా షాహిన్బాగ్లో నిరసనలు, ధర్నాలు జరగడం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే కేజ్రీవాల్ మాత్రం బీజేపీపై విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకుండా.. తాను అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న వెలువడిన అసెంబ్లీ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సొంతం చేసుకోగా.. బీజేపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 62 సీట్లు ఆప్ గెలుచుకోగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.(ఆరోజే బిగ్ అనౌన్స్మెంట్: ప్రశాంత్ కిషోర్) -
‘బేబీ మఫ్లర్మ్యాన్’కు ఆప్ బంపర్ ఆఫర్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన.. 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్) ఆ పార్టీలో భాగస్వామ్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. తాజాగా.. బిగ్ అనౌన్స్మెంట్ అంటూ ఆప్ చేసిన మరో ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. మంగళవారం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనున్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వేషధారణతో ఉన్న.. ఓ బుడతడి ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆప్ విజయోత్సవాల్లో భాగంగా మినీ మఫ్లర్మ్యాన్ అంటూ పార్టీ సైతం ఆ బుడ్డోడి ఫొటోను షేర్ చేసింది. (కేజ్రీవాల్ కేబినెట్: వారిద్దరికి ఛాన్స్ లేనట్లే!) ఇక ఫిబ్రవరి 16న అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్న నేపథ్యంలో.. బేబీ మఫ్లర్మ్యాన్ను బంపర్ ఆఫర్ వరించింది. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి సదరు బుడ్డోడిని ఆహ్వానిస్తున్నట్లు ఆప్ పేర్కొంది. ఈ మేరకు... ‘‘బిగ్ అనౌన్స్మెంట్: ఫిబ్రవరి 16న జరుగనున్న అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి బేబీ మఫ్లర్మ్యాన్ను ఆహ్వానించాం. సూట్ అప్ జూనియర్!’ అని మరోసారి అతడి ఫొటోను షేర్ చేశారు. కాగా ఫిబ్రవరి 8న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ రికార్డు స్థాయిలో 62 స్థానాలు కైవసం చేసుకోగా.. బీజేపీ 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకలేకపోయింది. Big Announcement: Baby Mufflerman is invited to the swearing in ceremony of @ArvindKejriwal on 16th Feb. Suit up Junior! pic.twitter.com/GRtbQiz0Is — AAP (@AamAadmiParty) February 13, 2020 -
కేజ్రీవాల్ ఖాతాలో మరో ‘విజయం’!
న్యూఢిల్లీ : ముచ్చటగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది కేవలం 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా పది లక్షల మంది(1 మిలియన్) ఆ పార్టీలో భాగస్వామ్యం అయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజు ఆమ్ ఆద్మీ తమ పార్టీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించింది. దీంతో అనూహ్యంగా ఒక్క రోజులోనే దాదాపు 11 లక్షల మంది ఈ క్యాంపెయిన్లో భాగస్వాములు అయ్యారు. దీనిపై పార్టీ స్పందిస్తూ.. ‘ఒక్క రోజులోనే 11 లక్షల మంది పార్టీలో చేరారు. ఇది భారీ విజయం’ అంటూ ట్వీట్ చేసింది. మరోవైపు ప్రజల నుంచి ఇంత భారీ ఎత్తున స్పందన లభించడం చరిత్రాత్మకమని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. (కేజ్రీవాల్ కేబినెట్: వారిద్దరికి ఛాన్స్ లేనట్లే!) More than 1 million people have joined AAP within 24 hours of our massive victory. To join AAP, give a missed a call on : 9871010101#JoinAAP pic.twitter.com/o79SV8bj01 — AAP (@AamAadmiParty) February 13, 2020 ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 70 స్థానాలకు గానూ 62 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించగా.. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ అసలు ఖాతా కూడా తెరవలేదు. ఈ క్రమంలో వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాలే చేజిక్కించుకున్నారు. ఆయన ఈనెల 16న ఢిల్లీలోని రామలీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. (16న కేజ్రీవాల్ ప్రమాణం) -
విభజన రాజకీయాలపై అభివృద్ధి గెలుపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యంత తీవ్ర స్థాయిలో సాగించిన విభజన రాజకీయాల ప్రచార సంరంభాన్ని తిప్పికొట్టిన ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోదఫా అధికారంలోకి రావడమే కాదు.. అనితరసాధ్యమైన విజయాన్ని కూడా అందుకున్నారు. ఈ క్రమంలో ఆద్యంతం సానుకూల దృక్పథం, ప్రజానుకూల ఎన్నికల ఎజెండాలో ఢిల్లీ నమూనా పాలన ఎలా భాగం కావచ్చో జాతి మొత్తానికి చూపించారు. స్పష్టంగా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలూ పాటించి అమలు చేయగల, ఫలితాలను అందించగల పాలనా నమూనాపై ఆధారపడి కేజ్రీవాల్ తన వ్యూహాన్ని అమలు చేశారు. ప్రభుత్వం పట్ల బలమైన సానుకూల దృక్పథాన్ని నిర్మించడంతోపాటు కేజ్రీవాల్ అత్యంత సమయస్ఫూర్తితో కూడిన రాజకీయ క్రీడను సాగించారు. ఈ క్రమంలో సానుకూల శక్తిని ప్రేరేపిస్తున్న, ప్రజలకోసం కష్టపడుతున్న నిజాయితీ కలిగిన పరిణతి చెందిన వ్యక్తిగా తన ప్రతిష్టను పూర్తిగా పునర్నిర్మించుకున్నారు. ఇవన్నీ కలిసి కేజ్రీవాల్, ఆప్ ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలకు గాను 62 స్థానాలను గెల్చుకునేలా చేశాయి. దీంతో ప్రతిపక్షమైన బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. మరోవైపున నామమాత్రమైపోయిన తన ఉనికి ద్వారా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆశించిన స్థాయిలో ఆప్ను దెబ్బతీయలేకపోయింది. మరోవైపున ఎన్నికల ప్రచారానికి సంబంధిం చిన కొన్ని మెలకువలను కేజ్రీవాల్ ప్రధాని మోదీ నుంచి సంగ్రహించడమే ఆప్ ఘనవిజయానికి దారితీసింది. మోదీ ప్రచార వ్యూహాన్ని అచ్చుగుద్దినట్లు స్వీకరించిన కేజ్రీవాల్ దాంతోనే బీజేపీని చావుదెబ్బ కొట్టారు. అంతకుమించి బీజేపీ తనపై రుద్దజూసిన హిందూ–ముస్లిం ఎరలో చిక్కుకోవడానికి తిరస్కరించారు. ఈ ఒక్క అంశమే బీజేపీ అవకాశాలను కొల్లగొట్టింది. పైగా హిందూయిజానికి బీజేపీ మాత్రమే ఏకైక ప్రతినిధి కాదని కేజ్రీవాల్ బలమైన సందేశం పంపారు. ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించడమే కాకుండా బహిరంగంగా హనుమాన్ చాలీసాను పఠించారు కూడా. మరోవైపున బీజేపీ హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించడాన్ని కూడా తప్పు పడుతూ పూర్తి వ్యతిరేక దృక్పథాన్ని అవలంబించడం ద్వారా బీజేపీ తనకేమాత్రం అనుకూలత లేకుండా చేసుకుంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై చాయ్వాలా అస్త్రం ప్రయోగించి మోదీ ఎంతగా ప్రయోజనం పొందారో తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ తన్నుతాను దెబ్బతిన్న బాధిత కార్డును ప్రయోగించారు. కొన్ని నెలల క్రితం మోదీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లే కేజ్రీవాల్ కూడా ఈ ఎన్నికలకు గాను తన తల్లి ఆశీర్వాదం తీసుకుని ప్రచారంలో పెట్టారు. రాజకీయాల్లోకి కొన్ని సంవత్సరాల క్రితమే అడుగుపెట్టిన వ్యక్తి అతి శక్తివంతమైన మోదీ–షాల ఎన్నికల యంత్రాంగంతో తలపడి అఖండ విజయాన్ని సాధించడం అత్యంత ప్రధాన విజయంగా చెప్పాలి. అది కూడా ఢిల్లీలోని అన్ని లోక్ సభా స్థానాలను బీజేపీ గెల్చుకున్న నేపథ్యంలో 8 నెలలు కాకముందే ఆప్ ఇంత విజయం సాధించడం గొప్ప విషయమే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 65 అసెంబ్లీ స్థానాలలో మెజారిటీ ఓట్లు సాధించగా కాంగ్రెస్ అయిదు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆధిక్యత సాధించడం గమనార్హం. ఢిల్లీ ఎన్నికల్లో అద్భుత విజయంతో, ఉచిత విద్యుత్తు, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి తాయిలాలు అందించడం ద్వారా ఓటర్లను ఎలా గెల్చుకోవచ్చో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ కేజ్రీవాల్ దారి చూపారు. కేజ్రీవాల్ తాయిలాలు నిస్సందేహంగానే దిగువ, మధ్యతరగతి ఓటర్లకు అందాయి. సుపరిపాలనను అమలుచేస్తే ఎన్నికల్లో విజయాన్ని సాధించవచ్చని ఇవి నిరూపించాయి. తాను గత అయిదేళ్లలో చేసిన మంచిపనులను కేజ్రీవాల్ ప్రజలకు చేరవేశారు. తాను సాధించిన పనుల రిపోర్టు కార్డుతోనే ఆయన ప్రజల్లోకి వెళ్లారు. గతంలో తాను చేసిన హామీలు నిలబెట్టుకున్నానని మరో అవకాశమిస్తే మిగిలి ఉన్న పనులను కూడా నెరవేరుస్తానని కేజ్రీవాల్ సూటిగా చెప్పిన మాటలు ఓటర్లు నమ్మారు. అలాగే, ఢిల్లీలో ఓటర్లు ఆప్ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటూ స్వయంగా తనకు వేసినట్లేనని కేజ్రీవాల్ బలంగా చెప్పారు. హిందూయిజం ముగ్గులోకి దిం పాలని బీజేపీ చేసిన పన్నాగాన్ని దగ్గరకు రానివ్వని కేజ్రీవాల్ అభివృద్ధి, పనులు చేయడంలో తన ట్రాక్ రికార్డును మాత్రమే ఓటర్లముందు ప్రదర్శించారు. ఆప్ విజయానికి ఇదీ ప్రధాన కారణం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు లక్ష్మణ్ వెంకట కూచి -
16న కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా 16న ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్లీలా మైదానం ఈ కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రజలందరూ ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్తోపాటు కేబినెట్ మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు కేజ్రీవాల్ కొత్తఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరూ లాంఛనప్రాయంగా కేజ్రీవాల్ను ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపై చర్చించారు. భారీగా జన సమీకరణ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆప్ సన్నాహాలు చేస్తోంది. భారీగా జన సమీకరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.. ఒకప్పుడు అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్లీలా మైదానంలో ఆయనకు కుడిభుజంగా పని చేసి దేశ ప్రజలందరి దృష్టిని కేజ్రీవాల్ ఆకర్షించారు. కేబినెట్లో పాత ముఖాలే ? గత ప్రభుత్వంలో పనిచేసిన వారికే మళ్లీ కేజ్రీవాల్ కేబినెట్లో అవకాశం ఇవ్వనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఈసారి ఎలాంటి మార్పులు చేయకపోవచ్చునని తెలుస్తోంది. మనీశ్ సిసోడియా, రాజేంద్ర పాల్ గౌతమ్, సత్యేంద్ర జైన్, కైలాస్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్లు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో హోరెత్తించి, ఆప్ విద్యా రంగ సంస్కరణల్లో భాగస్వామిగా నిలిచిన ఆప్ నాయకురాలు అతిషి మర్లేనా, పార్టీకి కొత్త శక్తిగా మారిన రాఘవ్ చద్దాకు ఆర్థిక శాఖ కట్టబెడతారన్న ప్రచారమూ సాగింది. -
కేజ్రీవాల్ కేబినెట్: వారిద్దరికి ఛాన్స్ లేనట్లే!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై మూడోసారి కొలువుదీరనున్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. తన కేబినెట్లో ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారే ఈ దఫా కూడా మంత్రులుగా కొనసాగుతారని వెల్లడించాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి అఖండ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ పిలుపు మేరకు ఆప్ ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పార్టీ శాసన సభాపక్షనేతగా ఎన్నుకున్నారు. చదవండి: ఆప్.. మళ్లీ స్వీప్ కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 62 స్థానాలు కైవసం చేసుకోగా.. బీజేపీ కేవలం 8 స్థానాలతోనే సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవకుండానే చతికిలపడింది. ఈ క్రమంలో ఆప్ ఘన విజయంలో కీలకంగా వ్యవహరించిన మహిళా ఎమ్మెల్యే అతిషిని.. కేజ్రీవాల్ తన మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అదే విధంగా యువ ఎమ్మెల్యే రాఘవ్ చద్దాకు కూడా మంత్రి పదవి దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి. వీరి కోసం ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయితే... గతంలో కేజ్రీవాల్ కేబినెట్లో ఉన్న మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, ఖైలాశ్ గెహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రపాల్ గౌతం.. మరోసారి మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నట్లు తాజా సమాచారం. -
ఊడ్చుకుపోయింది!
-
ఢిల్లీ కాంగ్రెస్లో కల్లోలం.. పార్టీ ఇన్ఛార్జ్ రిజైన్
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చుకు కారణమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, సీనియర్ నేత అయిన చాకో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం మొదలయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుందన్నారు. పోయిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీకి రాలేదని, ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆప్తో ఉందని ఆయన పేర్కొన్నారు. పీసీ వ్యాఖ్యలపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర చాకో వ్యాఖ్యలతో విభేదించారు. నిజానికి షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగిందని మిలింద్ దేవర అభిప్రాయపడ్డారు. (ఆమ్ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!) ఆమె మరణాంతరం ఢిల్లీలో పార్టీ ఓటమికి షీలాను నిందించడం సరికాదన్నారు. ఆమె పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. కాగామొత్తం 70 స్థానాలకు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాలు చేపట్టగా.. బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2015 మాదిరిగానే ఖాతా తెరవలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. (హస్తిన తీర్పు : ఆప్ 62.. బీజేపీ 8) -
అయ్యో.. అల్కా లాంబా
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో పార్టీలు మారి ఎన్నికల బరిలో నిలిచిన 17 మందిలో 9 మంది విజయం సాధించారు. గెలుపొందిన వారిలో అత్యధికంగా 8 మంది ఆప్కు చెందిన వారు కాగా బీజేపీ నుంచి ఒక్కరున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిలో ఆప్ 9 మందిని, బీజేపీ నలుగురిని, కాంగ్రెస్ ముగ్గురిని బరిలోకి దించాయి. ఆప్ తరఫున పోటీ చేసిన మొత్తం 9 మందిలో అయిదుగురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. గాంధీనగర్ ఎమ్మెల్యే అనిల్ బాజ్పాయ్(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈయన ఆప్ అభ్యర్థి నవీన్ చౌదరిపై 6 వేల పైచిలుకు ఓట్లతో మళ్లీ విజయం సాధించారు. మోడల్ టౌన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా(ఆప్) ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరారు. ఈసారి ఈయన్ను ఆప్నకు చెందిన అఖిలేశ్ త్రిపాఠీ 10వేల పైచిలుకు ఓట్లతో ఓడించారు. కాంగ్రెస్కు చెందిన సంజయ్ సింగ్(వికాస్పురి), సురేంద్రపాల్ సింగ్(తిమర్పూర్) ఈసారి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. వీరిద్దరినీ వరుసగా ఆప్కు చెందిన మహీందర్ యాదవ్(31 వేల ఓట్లు), దిలీప్ పాండే(21వేల ఓట్లు) ఓడించారు. ఎన్నికల ప్రచారంలో అల్కా లాంబా (ఫైల్) ఇతర ముఖ్యనేతల్లో ఆప్ను వీడి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన చాందినీచౌక్ సిట్టింగ్ ఎమ్మెల్యే అల్కా లాంబా.. కాంగ్రెస్ తరఫున గతంలో నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ అభ్యర్థి ప్రహ్లాద్ సింగ్ సాహ్నీ చేతిలో ఓడిపోయారు. అల్కాకు కేవలం 3,881 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సుమన్ కుమార్ గుప్తా 29,584 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రహ్లాద్ సింగ్కు 50,891 ఓట్లు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్టు అల్కా లాంబా తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయన్న దానిపై మాట్లాడబోనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంటే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (చదవండి: ‘ఆప్’రేషన్ సప్తపది) -
కేజ్రీవాల్.. ఫిబ్రవరి 14!
సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ జీవితానికి ఫిబ్రవరి 14కి ఆసక్తికర బంధముంది. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో గెలిచాక ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీననే అని సమాచారం. కేజ్రీవాల్ది ప్రేమ వివాహం. ఎగ్జిట్ పోల్స్ నిజం! ఆప్ గెలుస్తుందన్న ఎగ్జిట్పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో ఆప్ విజయం సాధించింది. ఇండియాటుడే–యాక్సిస్, ఏబీపీ–సీ ఓటర్, టీవీ9 భరత్వర్ష్లు అంచనా వేసినట్లే సీట్లు వచ్చాయి. ఇండియా టుడే–యాక్సిస్ సర్వే ఆప్కి 59–68 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 నుంచి 11 సీట్లొస్తాయని చెప్పింది. ఏబీపీ–సీ ఓటర్ ఆప్కి 49 నుంచి 63 స్థానాలూ, బీజేపీకి 5 నుంచి 19 స్థానాలూ వస్తాయని చెప్పింది. ఇక టీవీ 9 భరత్వర్ష్ అంచనాల ప్రకారం ఆప్కి 52 నుంచి 64, బీజేపీకి 6 నుంచి 16 స్థానాలు వస్తాయని వెల్లడించింది. (చదవండి: ఆప్.. మళ్లీ స్వీప్) మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ విజయాన్ని భరత మాత విజయంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు తనను పెద్ద కొడుకుగా ఆదరించి ఈ విజయాన్ని అందించారన్నారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం(పాలిటిక్స్ ఆఫ్ వర్క్స్)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు’ అని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్న వేదికపై నుంచి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. (చదవండి: ఏ.కే.–62) -
ఢిల్లీ సుల్తాన్..కేజ్రీవాల్
-
పీకే.. పక్కా వ్యూహకర్త
న్యూఢిల్లీ: ప్రశాంత్ కిశోర్. ఎవరికీ పరిచయం చేయనక్కర్లేని పేరు. ఎన్నో రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా తెరవెనుక పని చేసి తనకంటూ ఒక ఇమేజ్ కల్పించుకున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయంతో మరోసారి ఆయన పేరు దేశవ్యాప్త రాజకీయాల్లో మారుమోగిపోతోంది. ప్రశాంత్ కిశోర్కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ–ప్యాక్)తో గత డిసెంబర్లో ఆప్ చేతులు కలిపింది. అప్పట్నుంచి ఆప్ ప్రచార ధోరణే మారిపోయింది. బీజేపీ చేసే వ్యతిరేక ప్రచారానికి అసలు బదులివ్వొద్దని, సంయమనం పాటించాలని కేజ్రివాల్కు సూచించింది ప్రశాంత్ కిశోరేనని ఐప్యాక్ వర్గాలు వెల్లడించాయి. అలా పాజిటివ్ ప్రచారంతో ఆప్ విజయభేరి మోగించింది. ఫలితాలు వెలువడగానే ప్రశాంత్ కిశోర్ ‘‘భారత్ ఆత్మను కాపాడడానికి ఒక్కటై నిలిచిన ఢిల్లీవాసులకి ధన్యవాదాలు’’అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలో ఆప్ సర్కార్ విద్య, ఆరోగ్య రంగాల్లో సాధించిన విజయాలనే ప్రచారంలో హైలైట్ చేశారు. స్విమ్మింగ్ పూల్స్తో ఉన్న పాఠశాలలు, మొహల్లా క్లినిక్ల గురించి విస్తృతంగా ప్రచారం చేయడమే కాదు, ఆప్ థీమ్ సాంగ్ లగేరహో కేజ్రివాల్ అనే పాటను బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దాడ్లానీతో దగ్గరుండి ట్యూన్ చేయించి ప్రభుత్వ పథకాలు జనంలోకి వెళ్లేలా చేయడంలో విజయం సాధించారు. ఐపాక్ సంస్థ తొలిసారిగా 2014 లోక్సభ ఎన్నికల్లో తెరవెనుక ఎన్నికల వ్యూహాలను రచించింది. అప్పుడు ప్రచారంలో ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ చాయ్ పే చర్చ కార్యక్రమం రచించింది ప్రశాంత్ కిశోరే. -
రాజధానిలో రెండోసారి డకౌట్
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఒకప్పుడు హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్ పార్టీ వరసగా రెండోసారి డకౌట్ అయింది. ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడింది. వాస్తవానికి కాంగ్రెస్ హయాంలోనే ఢిల్లీ అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1998–2013 సంవత్సరం మధ్యలో షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఢిల్లీ రాజధాని కళను సంతరించుకుంది. అలాంటిది ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేశాక ఆ పార్టీ పునాదుల్నే కదిలించేసింది. చివరికి పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్బాగ్లో వెల్లువెత్తిన నిరసనలకు కేవలం కాంగ్రెస్ పార్టీ బహిరంగ మద్దతు తెలిపింది. ఢిల్లీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో కలసి పోటీ చేసింది. అందులో 66 మంది కాంగ్రెస్ తరపున, మరో నలుగురు ఆర్జేడీ తరఫున బరిలో దిగారు. అందులో కాంగ్రెస తరఫున పోటీలో నిలిచిన 66 మందిలో 63 మంది అభ్యర్థులు కనీసం 5శాతం ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్లు కోల్పోయారు. -
ఢిల్లీ కూడా దక్కలేదు!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్ షా..పెద్ద సంఖ్యలో కేంద్రమంత్రులు.. సుమారు 300 మంది ఎంపీలు..గల్లీగల్లీకి తిరిగి ప్రచారం చేపట్టినా బీజేపీకి ఫలితం దక్కలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రెండు ర్యాలీల్లో ప్రసంగించగా, హోం మంత్రి అమిత్షా 60 నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, 300 మంది ఎంపీలు వచ్చినా ప్రజల మనస్సును మార్చలేకపోయారు. పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలివి. అసెంబ్లీలోని 70 స్థానాలకు గాను 45కు పైగా సీట్లు గెలుచుకుంటామని నడ్డా ధీమా వ్యక్తం చేసినా 8 చోట్ల మాత్రమే గెలవడం ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. 1993లో 48 శాతం ఓట్లతో ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ..గత 2015 ఎన్నికల్లో 32 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఈసారి మాత్రం ఓట్ల శాతాన్ని 38కి పెంచుకోవడం ఒక విధంగా ఊరట కలిగించే అంశమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మిత్రపక్షాలు జేడీయూ, ఎల్జేపీకి వచ్చిన ఓట్లతో కలుపుకుంటే ఇది 40 శాతం వరకు ఉంటుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గీయ తెలిపారు. ఆప్కు కేజ్రీవాల్ పెద్ద అండ కాగా ప్రజాదరణ పొందిన స్థానిక నేతలెవరూ లేకపోవడం బీజేపీ వైఫల్యానికి ప్రధాన కారణమనేది కొందరి మాట. కేంద్ర మంత్రి హర్షవర్థన్ వంటి స్థానిక నేతలను పక్కనబెట్టిన కేంద్ర నాయకత్వం స్థానికేతరుడిగా భావించే మనోజ్ తివారీకి పెద్దపీట వేయడం కూడా ఢిల్లీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. -
‘ఆప్’రేషన్ సప్తపది
గ్యారంటీ కార్డులు: అయిదేళ్లలో ఢిల్లీలో తాను చేపట్టిన అభివృద్ధిని చాటి చెబుతూనే సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్లో కొనసాగిస్తామంటూ కేజ్రీవాల్ ఎన్నికల మేనిఫెస్టోకి ముందే గ్యారంటీ కార్డుల్ని విడుదల చేశారు. ప్రజలకి మొత్తం 10 అంశాల్లో గ్యారంటీ ఇచ్చారు. నెలకు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు, మహిళలు, విద్యార్థులకి బస్సుల్లో ఉచిత ప్రయాణం, సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రలు తదితర హామీలు సీఎం పీఠంపై కూర్చోబెట్టాయి. విద్యారంగంలో.. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంచడానికి గత అయిదేళ్లుగా అనుమతినివ్వలేదు. గత మూడేళ్లుగా వార్షిక బడ్జెట్లో 25శాతానికిపైగా విద్యారంగంపైనే ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన దగ్గర నుంచి టీచర్ ట్రైనింగ్ వరకు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పాఠశాలల్లో జరిగే ప్రతీ అంశంలోనూ పిల్లల తల్లిదండ్రుల్ని భాగస్వాముల్ని చేశారు. పాజిటివ్ ప్రచారం: 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ విజయ దుందుభి మోగించాక జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావించారు. తాను ఏం చేస్తున్నానో పాజిటివ్ ప్రచారాన్ని ప్రారంభించారు. కేజ్రివాల్ వంటి అరాచకవాదులు, ఉగ్రవాదులు దేశంలో దాక్కొని ఉంటారంటూ బీజేపీ ఎంపీ పర్వేష్ వంటి నాయకులు నోరు పారేసుకున్నా సంయమనం పాటించారు. ఆప్ గెలిస్తే తన ఆ«ధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా బీజేపీని మించిపోయి ఆప్ చేసిన ప్రచారమే హోరెత్తింది. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మోడల్ అభివృద్ధి అభివృద్ధిలో మోదీ కంటే తాను ఒక అడుగు ముందే ఉన్నానని నిరూపించడానికి కేజ్రీవాల్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గుజరాత్ మోడల్ అభివృద్ధిని ఎలాగైతే ప్రచారం చేసిందో, అదే స్థాయిలో ఢిల్లీ మోడల్ అభివృద్ధిని ప్రచారం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రజారోగ్యం కోసం ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్లలో ఉచిత చికిత్స, వైద్య పరీక్షలు, పారదర్శక పరిపాలన, చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల్ని తక్కువ సమయంలో, అంచనా వేసిన దానికంటే తక్కువ వ్యయంతో పూర్తి చేయడం వంటివాటితో ఢిల్లీ మోడల్ అభివృద్ధిని పాపులర్ చేశారు. ఏకే, పీకే కాంబినేషన్ అరవింద్ కేజ్రీవాల్ (ఏకే), ప్రశాంత్ కిశోర్ (పీకే) వీరిద్దరి కాంబినేషన్ ఢిల్లీ ఎన్నికల దశను మార్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించాక ఇప్పటివరకు ఆరు ఎన్నికల్ని ఎదుర్కొంది. రెండు లోక్సభ, మూడు అసెంబ్లీ, ఒక స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే మొట్టమొదటిసారిగా ప్రశాంత్ కిశోర్కి చెందిన ఐపాక్ ఏజెన్సీని ఎన్నికల వ్యూహకర్తగా ఆప్ నియమించుకుంది. గ్యారంటీ కార్డుల విడదుల , కేజ్రివాల్ స్వయంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడం, టౌన్హాల్స్లో సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రితో ముఖాముఖి కార్యక్రమాలు పార్టీకి అత్యంత అనుకూలంగా మారాయి. హిందూత్వపై సామరస్య ధోరణి హిందూ ఓట్లను నష్టపోకూడదనుకున్న కేజ్రివాల్ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్బాగ్లో జరిగిన నిరసనలపై ఆచితూచి వ్యవహరించారు. తొలిసారిగా ముఖ్యమంత్రి తీర్థయాత్ర కార్యక్రమం కింద తొలి రైలుని ప్రారంభించారు. వైష్ణోదేవి ఆలయం, మథుర, రిషికేష్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే సీనియర్ సిటిజ్లకు ఉచిత ప్రయాణం, వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. హనుమాన్ చాలీసా చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుందంటూ ఎన్నికలకు ముందు ఒక వీడియో విడుదల చేశారు. కేజ్రివాల్ హనుమాన్ చాలీసా చదువుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలింగ్కు ఒక రోజు ముందు కుటుంబ సభ్యులతో కలిసి హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెయిల్యూర్ స్టోరీ కాంగ్రెస్ పార్టీ ముందే ఓటమి ఖాయమని తేలిపోవడంతో ప్రచారంపై దృష్టి సారించలేదు. బీజేపీ తొలి దశలో ఆప్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని, అదంతా డొల్లేనని ప్రచారం చేసింది. తర్వాత వ్యూహాన్ని మార్చుకొని జాతీయవాదాన్నే మళ్లీ ఎజెండాగా తీసుకుంది. స్థానిక సమస్యలకు బదులుగా పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా షహీన్బాగ్లో కొనసాగుతున్నS నిరసన ప్రదర్శనల్ని ప్రచారాస్త్రంగా చేసుకుంది. అయినా అవేవీ కేజ్రివాల్కి ఉన్న క్రేజ్ ముందు నిలబడలేకపోయాయి. -
ఆప్.. మళ్లీ స్వీప్
ఢిల్లీ ప్రజలు ‘పని’ రాజకీయానికి పట్టం కట్టారు. విద్వేష వ్యాఖ్యలను, వెకిలి రాజకీయాలను ‘చీపురు’తో ఊడ్చేశారు. అభివృద్ధి వైపే మేమున్నామని ‘నొక్కి’ వక్కాణించారు. సామాన్యుడి కోసం పనిచేసే ‘ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)’ని మరోసారి అందలం ఎక్కించారు. బీజేపీ హై ఓల్టేజీ ప్రచారాన్ని ‘ఒకే ఒక్కడు’గా ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాలే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్కు మళ్లీ గుండు సున్నా మార్కులే వేశారు. న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ 62 సీట్లలో విజయ కేతనం ఎగరేసింది. బీజేపీని 8 స్థానాలకు పరిమితం చేసింది. గతంలో వరుసగా మూడుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఆప్కు 53.57%, బీజేపీకి 38.51%, కాంగ్రెస్కు 4.26% ఓట్లు లభించాయి. 2015 ఎన్నికల్లో ఆప్ 54.34% ఓట్లు సాధించింది. సీఎంగా కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న ప్రమాణంచేస్తారని సమాచారం. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్కు, ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. లోక్సభ మీకు.. అసెంబ్లీ ‘ఆప్’కు దాదాపు 8 నెలల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలకు పూర్తి విరుద్ధమైన తీర్పును ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని 7 స్థానాలనూ బీజేపీ గెల్చింది. ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకుంటున్న సందర్భంలో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ ఆ ఆందోళనలపైనే ప్రచారంలో దృష్టి పెట్టింది. ఆ ఆందోళనలు పాక్ అనుకూల, ఆప్, కాంగ్రెస్ ప్రాయోజిత కార్యక్రమాలను ప్రచారం చేసింది. ప్రధాని మోదీ సహా ప్రచారంలో పాల్గొన్న అగ్ర నేతలంతా ఆ ఆందోళనలకు కేంద్ర స్థానంగా నిలిచిన షహీన్బాఘ్ అంశాన్ని ప్రతీ సభలోనూ ప్రస్తావించారు. కేంద్రం ప్రారంభించిన సంక్షేమ పథకాలను కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు అందనివ్వడం లేదని మోదీ ఆరోపించారు కూడా. అయితే, ఢిల్లీ ప్రజలు ఈ అంశాల కన్నా గత ఐదేళ్లలో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ తమకందించిన సౌకర్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ ఫలితాల ద్వారా అర్థమవుతోంది. ఆప్ చేపట్టిన విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ప్రజా రవాణా రంగాల్లో సంస్కరణలు, సామాన్యుడిపై ఆర్థిక భారం తగ్గించే పథకాలు సామాన్యుల మనసు దోచాయి. కేజ్రీవాల్ తన ప్రచారంలోనూ ప్రధానంగా గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలనే వివరించారు. కాగా, కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై వ్యతిరేకత కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రమైన షహీన్ బాఘ్ ఉన్న ఓఖ్లా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ సమీప బీజేపీ అభ్యర్థిపై 81 వేల అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆప్ నుంచి గెలిచిన ప్రముఖుల్లో సీఎం అభ్యర్థి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, రాఘవ్ చద్ధా, అతిస్థి, గోపాల్ రాయ్, సత్యేంద్ర జైన్ తదితరులున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్పై గెలుపొందారు. మూడోసారి సీఎం పీఠంపై.. ఈ ఎన్నికల్లో ఘన విజయంతో మూడోసారి సీఎం కుర్చీపై కేజ్రీవాల్ కూర్చోబోతున్నారు. తొలిసారి 2013 డిసెంబర్ 28న కాంగ్రెస్ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, 49 రోజులు మాత్రమే అధికారంలో ఉండి 2014, ఫిబ్రవరి 14న రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 సీట్లతో దాదాపు క్లీన్స్వీప్ చేసింది. బీజేపీ 3 సీట్లలో మాత్రమే గెలుపొందింది. సంబరాలు.. అభినందనలు తాజా విజయంలో ఆప్ శ్రేణులు ఢిల్లీ వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నాయి. ఆప్ ప్రధాన కార్యాలయాన్ని నీలి, తెలుపు బెలూన్లతో అలంకరించారు. ఈ ఘనవిజయం పట్ల కేజ్రీవాల్ను పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, శరద్ పవార్(ఎన్సీపీ), నవీన్ పట్నాయక్(బీజేడీ), స్టాలిన్(డీఎంకే) తదితర నేతలు అభినందనలు తెలిపారు. ఇంతకంటే గొప్ప జన్మదిన బహుమతి ఏముంటుందని మంగళవారం బర్త్డే జరుపుకుంటున్న కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశ ఆత్మను కాపాడిన ఢిల్లీ ఓటర్లకు కృతజ్ఞతలని రాజకీయ వ్యూహకర్త, ఈ ఎన్నికల్లో ఆప్ విజయం కోసం వ్యూహ రచన చేసిన ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ప్రజా తీర్పును ఆమోదిస్తున్నాం ఢిల్లీ ప్రజలిచ్చిన తీర్పును ఆమోదిస్తు న్నామని బీజేపీ అ«ధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతిపక్షంగా బీజేపీ క్రియాశీల పాత్ర పోషిస్తుందన్నారు. పార్టీ గెలుపు కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించే ఈ తీర్పు ఇచ్చారని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ వ్యాఖ్యానించారు. తమ ఓటు శాతం 32% నుంచి 38 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. అపజయాన్ని అంగీకరించిన కాంగ్రెస్.. పార్టీ పునరుత్తేజానికి పునరంకితం అవుతామని పేర్కొంది. ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాల విష పూరిత ప్రచారం ఓడిపోయిందని వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రజలు ‘పని’ రాజకీయానికి పట్టం కట్టారు. విద్వేష వ్యాఖ్యలను, వెకిలి రాజకీయాలను ‘చీపురు’తో ఊడ్చేశారు. అభివృద్ధి వైపే తామున్నామని ‘నొక్కి’ వక్కాణించారు. సామాన్యుడి కోసం పనిచేసే ‘ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)’ని మరోసారి అందలమెక్కించారు. బీజేపీ హై ఓల్టేజీ ప్రచారాన్ని ‘ఒకే ఒక్కడు’గా ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాలే ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని స్పష్టమైన తీర్పునిచ్చారు. కేజ్రీవాల్.. ఫిబ్రవరి 14! కేజ్రీవాల్ జీవితానికి ఫిబ్రవరి 14కి ఆసక్తికర బంధముంది. తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక 49 రోజుల తర్వాత ఫిబ్రవరి 14ననే ఆయన రాజీనామా చేశారు. 2015లో గెలిచాక ఫిబ్రవరి 14వ తేదీనే ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేయబోయేదీ ఫిబ్రవరి 14వ తేదీననే అని సమాచారం. కేజ్రీవాల్ది ప్రేమ వివాహం. ఎగ్జిట్ పోల్స్ నిజం! ఆప్ గెలుస్తుందన్న ఎగ్జిట్పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఢిల్లీలో ఆప్ విజయం సాధించింది. ఇండియాటుడే–యాక్సిస్, ఏబీపీ–సీ ఓటర్, టీవీ9 భరత్వర్‡్షలు అంచనా వేసినట్లే సీట్లు వచ్చాయి. ఇండియా టుడే–యాక్సిస్ సర్వే ఆప్కి 59–68 సీట్లు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 2 నుంచి 11 సీట్లొస్తాయని చెప్పింది. ఏబీపీ–సీ ఓటర్ ఆప్కి 49 నుంచి 63 స్థానాలూ, బీజేపీకి 5 నుంచి 19 స్థానాలూ వస్తాయని చెప్పింది. ఇక టీవీ 9 భరత్వర్‡్ష అంచనాల ప్రకారం ఆప్కి 52 నుంచి 64, బీజేపీకి 6 నుంచి 16 స్థానాలు వస్తాయని వెల్లడించింది. ‘పని రాజకీయం’ పురుడు పోసుకుంది: అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్య న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఘనవిజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్ విజయాన్ని భరత మాత విజయంగా అభివర్ణించారు. ఢిల్లీ ప్రజలు తనను పెద్ద కొడుకుగా ఆదరించి ఈ విజయాన్ని అందించారన్నారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరు అద్భుతం చేశారు.. ఐ లవ్ యూ’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం(పాలిటిక్స్ ఆఫ్ వర్క్స్)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు’ అని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఉన్న వేదికపై నుంచి కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ శుభాకాంక్షలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘ఆప్నకు, ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్కు అభినందనలు. వారు ఢిల్లీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరకుంటున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. అత్యుత్తమ బర్త్డే గిఫ్ట్ ఇది: భార్య సునీత ‘అత్యుత్తమ బర్త్డే గిఫ్ట్ ఇది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు కంటే పెద్ద బహుమతి అడగను’ అని కేజ్రీవాల్ భార్య సునీత అన్నారు. ఎన్నికల విడుదల రోజైన మంగళవారమే ఆమె పుట్టిన రోజు. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో భర్త, కొడుకు, కూతురు సమక్షంలో కేక్ కట్చేశారు. కేజ్రీవాల్కు ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ అద్భుతమైన విజయం సాధించినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు మంగళవారం ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. కేజ్రీవాల్ పదవీకాలం అంతా విజయవంతంగా కొనసాగాలని జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆప్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ ఆయనకు అభినందన సందేశం పంపారు. కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ అన్ని రంగాల్లో మరింత అభివృధ్ధి చెందుతుందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజలే కేంద్రంగా ఆలోచించి పాలన చేస్తే ప్రజాభిమానం పొందుతారనడానికి కేజ్రీవాల్ విజయం ఓ ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలారా.. ఇది అందరి విజయం. నన్ను పెద్ద కొడుకుగా భావించి, ఇంత పెద్ద గెలుపును అందించిన ప్రతీ ఒక్క కుటుంబం విజయం ఇది. ఈ రోజు ఢిల్లీ ప్రజలు ‘పని రాజకీయం (పాలిటిక్స్ ఆఫ్ వర్క్స్)’ అనే కొత్త తరహా రాజకీయ సంస్కృతికి తెర తీశారు. ఇది దేశానికి ఢిల్లీ అందించిన పవిత్రమైన సందేశం. – అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల తీర్పును బీజేపీ అంగీకరిస్తోంది. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది. బీజేపీ కోసం కష్టపడిన కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఘన విజయం సాధించిన ఆప్ అధినేత కేజ్రీవాల్కు అభినందనలు. – జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన ఆప్కు, కేజ్రీవాల్కు నా అభినందనలు. – రాహుల్ గాంధీ, కాంగ్రెస్నేత దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉన్న ఢిల్లీలో ఓటర్లు రానున్న ఏళ్లలో జరగనున్న ఎన్నికలకు సరైన మార్గం చూపించారు. విభజించడంతో పాటు ప్రమాదకరమైన ఎజెండాలు ఉన్న పార్టీని ఓడించారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీని ఓడించగలమన్న ధైర్యాన్ని ప్రతిపక్షాలకు ఢిల్లీ ఓటర్లు ఇచ్చారు. – చిదంబరం, కాంగ్రెస్ నేత -
అభివృద్ధికే ఢిల్లీ ఓటరు పట్టం
మతభావోద్వేగాలను రెచ్చగొడుతూ బీజేపీ అధినాయకత్వం ఎన్నికల్లో సాగించిన ప్రచారాన్ని ఢిల్లీ ఓటర్లు తిప్పికొట్టారు. మోదీ, అమిత్ షాలతో సహా బీజేపీ ప్రచారంలో ఆర్థిక సంక్షోభం నివారణ, ఉపాధికల్పన, విద్యా, వైద్యం వగైరాల ఊసేలేదు. మరోవైపు అందివచ్చిన విజయాన్ని స్వీయ తప్పిదాలతో చేజార్చుకోకుండా కేజ్రీవాల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అభివృధ్ధి మంత్రాన్నే ఎంచుకున్నారు. మోదీ, అమిత్ షాలు తనను ఎంత రెచ్చగొట్టినా స్పందించలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నప్పటికీ షహీన్ బాగ్ శిబిరానికి వెళ్ళలేదు. ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్యం పథకాలు, విద్యా రంగంలో సంస్కరణలు కేజ్రీవాల్కు ‘అనుకూల వాతావరణం’ కల్పించాయి. బీజేపీ చీలిక విధానాలను పక్కకు తోసి అభివృద్ధిని దేశ రాజకీయ ఎజెండాగా మార్చడానికి ఢిల్లీ ఎన్నికలు నాంది పలికాయి. అందుకు దోహదపడిన ఆప్ అధినేత కేజ్రీవాల్కు అభినందనలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమకారులకు, గొప్ప ఊరట నిచ్చాయి. దేశాన్ని మతోన్మాద కారు మేఘాలు కమ్ముకుంటున్న ఒక చారిత్రక దశలో ఒక తొలకరి జల్లులా వచ్చిన ఫలితాలివి. మతోన్మాదంపై అభివృధ్ధి మంత్రం సాధించిన విజయం ఇది. 1992 డిసెంబరులో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత చెలరేగిన మత భావోద్వేగాలు సానుకూలంగా మారడంతో 1993 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఎన్నికల నినాదాలు రూపొందించడంలో గొప్ప నైపుణ్యం వున్న కమలనాథులు ‘‘ఇప్పుడు మినీ భారత్ (ఢిల్లీ) గెలిచాం, రేపు బిగ్ – భారత్ గెలుస్తాం’’ అంటూ అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేసేవారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు బిగ్–భారత్ను గెలిచాయి కానీ మినీ భారత్కు 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారాన్ని చేపట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. కేంద్రంలోని అధికార పక్షం ఈసారి మినీ భారత్ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘‘దేశ్ బద్లా– అబ్ ఢిల్లీ బద్లో’’ (దేశం మారింది; ఇప్పుడు ఢిల్లీ నువ్వు మారు)! అనే నినాదంతో రంగంలో దిగింది. అయితే ఈ నినాదంలో ఒక తిరకాసు వుంది. లోక్సభ ఎన్నికల్లో మారిన దేశంలో ఢిల్లీ లేదా? అనే సందేహం వస్తుంది. నిజానికి దేశంలోని పది రాష్ట్రాల్లో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం బీజేపీయేతర ప్రభుత్వాలున్నాయి. దేశమంతా మారలేదనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? బీజేపీ ప్రచారం మొత్తం చీలిక విధానాలు, మతోన్మాద రాజకీయాలతోనే సాగింది. ఈ ఎన్నికల్ని ‘షహీన్ బాగ్పై భారత్ యుద్ధం’గా ఒకరు చిత్రిస్తే ‘పాకిస్తాన్తో భారత్ యుద్ధం’గా మరొకరు చిత్రిం చారు. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర శాఖకు మనోజ్ తివారి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే బీజేపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా జేíపీ నడ్డా ఉన్నారు. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలే స్వయంగా పార్టీ ప్రచారాన్ని, వ్యూహాలు ఎత్తుగడల్ని దగ్గరుండి నడిపించారు. మతభావోద్వేగాలు, లౌకిక విలువల మధ్య ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ స్థితిలో కాంగ్రెస్ వుంది. కాంగ్రెస్ అస్త్ర సన్యాసం చేసి యుధ్ధరంగాన్ని వదిలివేయడంవల్ల ఆప్కు లాభిం చిన మాట నిజమేగానీ బీజేపీ ఓటమికి కాంగ్రెస్ తోడ్పడిన మాట అంతకన్నా వాస్తవం. ఇప్పటి పరిస్థితిలో కాంగ్రెస్ చురుగ్గా పనిచేసివుంటే అది బీజేపీకి లాభించివుండేది. బీజేపీ ప్రచారంలో ఆర్థిక సంక్షోభం నివారణ, ఉపాధికల్పన, విద్యా, వైద్యం వగైరాల ఊసేలేదు. మోదీ పాల్గొన్న సభలు సహితం ఆ బాటలోనే నడిచాయి. అభివృధ్ధి గురించి ఒక్క మాటైనా ప్రస్తావించలేదు. షహీన్ బాగ్ ఉత్తేజంతో దేశంలో ఇప్పుడు దాదాపు 150 సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్íసీ వ్యతిరేక శిబిరాలు నడుస్తున్నాయి. ఒక చేతితో మువ్వన్నెల జాతీయ జెండాను, ఇంకో చేతితో రాజ్యాంగాన్ని పట్టుకుని, ఒళ్ళో మహాత్మా గాంధీజీ, బాబాసాహెబ్ అంబేడ్కర్ల ఫొటోలు పెట్టుకుని, రాజ్యాంగ ప్రవేశికలోని ‘‘న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం’’ ఆదర్శాలను నినదిస్తూ సాగుతున్న మహత్తర లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం ఇది. భావోద్వేగాలను రెచ్చగొట్టిమినీ భారత్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా లబ్ధి పొందడానికే బీజేపీ ముహూర్తం చూసి సరిగ్గా డిసెంబరులోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది. కేవలం ముస్లింలు మాత్రమే సీఏఏను వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలు ఇచ్చి హిందూ ఓటు బ్యాంకును సమీకరించాలని స్వయంగా ప్రధాన మంత్రి కూడా ప్రయత్నించారు. అయితే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. సిక్కులు మొదటి నుండీ షహీన్ బాగ్ నిరసనకారులకు అండగా వున్నారు. ఆ పిదప క్రైస్తవులేగాక, హిందూ సమాజానికి చెందిన అనేక సమూహాలు ఆ శిబిరానికి చేరుకున్నాయి. రోజూ షహీన్ బాగ్ శిబిరంలో సర్వమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ మతసామరస్య పరిణామాల్ని మోదీజీ–అమిత్ జీ ద్వయం ఊహించలేదు. అది వారికి జీర్ణం కావడంలేదు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనిని ముందుగా బీజేపీ ఎంపీ ప్రవేశ్ వర్మ మొదలెట్టారు. ‘‘షహీన్ బాగ్ నిరసనకారులు మీ ఇళ్ళలోనికి దూరి మీ మహిళల్ని చెరుస్తారు, మీ సోదరుల్ని హత్యలు చేస్తారు’’ అని జనాన్ని రెచ్చగొట్టారు. ప్రవేశ్ వర్మ మీద ఎన్నికల కమిషన్ నాలుగు రోజుల నిషేధాన్ని విధించింది. నిషేధం నుండి తిరిగి వచ్చిన వర్మ మరీ రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఏకంగా టెర్రరిస్టు అన్నారు. మళ్ళీ ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంది. ఒక్క వారంలో రెండుసార్లు ఎన్నికల కమిషన్ నిషేధించడంతో పార్టీలో వర్మ స్థాయి పెరిగిపోయింది. రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చను ప్రవేశపెట్టే కీలక బాధ్యతను ప్రవేశ్ వర్మకు అప్పగించారు. ప్రజల్ని ఎంతగా రెచ్చగొడితే పార్టీలో అంత పెద్ద పీట వేస్తాం అని సంకేతాలిచ్చారు మోదీజీ–అమిత్ జీ. ప్రవేశ్ వర్మ ప్రేరణతో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇంకా రెచ్చిపోయారు. ‘‘దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో’’ (సాలేగాళ్ళు దేశద్రోహులు; కాల్చిచంపండి వాళ్ళని) అని రెచ్చగొట్టారు. గాంధీజీని హత్య చేసిన రోజైన జనవరి 30న జామియా మిలియా శిబిరం వద్ద ఒక ఆగంతకుడు నిరసనకారుల మీద కాల్పులు జరిపాడు. ఆ తరువాత మరో మూడు రోజుల్లో షహీన్ బాగ్ దగ్గర రెండుసార్లు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వీరుళ్ళు ముగ్గురూ ‘దేశ్ కే గద్దారో కో; గోలీ మారో సాలో కో’ నినాదాలే ఇవ్వడం విశేషం. ప్రచారంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తన సహజశైలిలో బుల్లెట్ల భాష మాట్లాడారు. షహీన్ బాగ్ నిరసనకారులు ‘‘మాటల భాషతో వినకపొతే తూటాల భాష దారికి తెస్తుంది’’ అన్నారాయన. కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్ తదితరులు తమ వంతు ఆజ్యం పోశారు. ప్రచారసారథి అమిత్ షా చెలరేగిపోయారు. ‘‘మీరంతా ఈవీఎం బటన్ను ఎంత గట్టిగా నొక్కాలంటే ఆ షాక్ షహీన్ బాగ్కు కొట్టాలి’’ అని పిలుపిచ్చారాయన. ‘‘11వ తారీఖున ఎన్నికల్లో మనం గెలిచిన వార్త రాగానే సాయంత్రం ఆరు గంటల లోగా విద్యార్థి నాయకులు షర్జీల్ ఇమామ్, కన్హయ్య కుమార్ల మీద చార్జిషీట్ తయారయిపోతుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడిన గంటలోపులోనే వాళ్ళు జైల్లో వుంటారు’’ అన్నారాయన. ఇంతటి ద్వేషపూరిత ప్రచారం గతంలో ఎన్నడూ చూడలేదు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం చేజిక్కగానే బీజేపీ అధ్యక్షునిగా అమిత్ షా చేసిన మొదటి ప్రకటన ‘‘ఒక్క పార్టీ కూడా తమ ప్రణాళికల్లో లౌకికవాదం ఊసే ఎత్తలేదు’’ అని. లౌకికవాదాన్ని భారత ప్రజలు తిరస్కరించారు అని చెప్పడం వారి అభిమతం. అలాగే, ఢిల్లీ ఎన్నికల్లో గెలవగానే ప్రజలు అభివృధ్ధిని కోరుకోవడంలేదు; వాళ్ళకు మత భావోద్వేగాలే ముఖ్యం అని ప్రకటించి వుండేవారు. అదృష్టవశాత్తు వారికి ఆ అవకాశం రాలేదు. మరోవైపు, ఈ ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడిన రోజే ఆప్ గెలుపు ఖాయం అయిపోయింది. అందివచ్చిన విజయాన్ని స్వీయ తప్పిదాలతో చేజార్చుకోకుండా కేజ్రీవాల్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మోదీ, అమిత్ షాలు తనను ఎంత రెచ్చగొట్టినా స్పందించలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నప్పటికీ షహీన్ బాగ్ శిబిరానికి వెళ్ళలేదు. కేవలం అభివృధ్ధి మంత్రాన్నే ఎంచుకున్నారు. సీబీఎస్ఈ పరీక్షల్లో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ సగటుకన్నా, ప్రైవేటు విద్యా సంస్థల కన్నా మెరుగైన ఫలితాలను సాధించారు. ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, ఉచిత వైద్యం పథకాలు, విద్యా రంగంలో సంస్కరణలు కేజ్రీవాల్కు ‘‘అనుకూల వాతావరణం’ కల్పించాయి. కమలనాథులకు రాజకీయ ప్రాణవాయువుగా పని చేస్తున్న మతోన్మాదాన్ని, చీలిక విధానాలని పక్కకు తోసి అభివృధ్ధిని దేశ రాజకీయ ఎజెండాగా మార్చడానికి ఈ ఎన్నికలు నాంది పలికాయని ఆశించవచ్చు. అందుకు దోహదపడిన ఆప్ అధినేత కేజ్రీవాల్కు అభినందనలు. డానీ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు, రచయిత, సమాజ విశ్లేషకులు ‘ మొబైల్: 90107 57776 -
కేజ్రీవాల్ హ్యాట్రిక్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా మూడోసారి ఘన విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ‘హ్యాట్రిక్’ కొట్టింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆప్కు 62 స్థానాలు రాగా, బీజేపీ 8 స్థానాలకు పరిమితమైంది. ఈ ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక కార్టూన్ వర్తమాన స్థితికి అద్దం పడుతుంది. చెల్లాచెదురుగా వున్న బుల్లెట్లను చీపురు ఊడ్చేయడాన్ని ఆ కార్టూన్లో చూపారు. చీపురు గుర్తు ఆప్ దని చెప్పనవసరం లేదు. కానీ ఆ కార్టూనిస్టు బుల్లెట్లను దేనికి ప్రతీకగా వాడాడో అక్కడ జరిగిన ప్రచార పర్వం తీరుతెన్నుల్ని గమనించినవారికి సులభంగానే బోధపడు తుంది. ఎన్నికలన్నాక గెలుపోటములు తప్పవు. అధికారంలో వున్నవారైతే మంచి పనులతో జనాన్ని మెప్పించడానికి ప్రయత్నించాలి. అధికారంలోకి రావాలనుకున్నవారు తాము వస్తే ఏమేం చేస్తామో చెప్పాలి. కానీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నేతల ప్రచారం హద్దు మీరింది. ఈ విషయంలో ఆప్ నుంచి కొత్తగా వచ్చి చేరిన కపిల్ మిశ్రా గురించి చెప్పుకోవాలి. బీజేపీలో ఆదినుంచీ వుంటున్న నేతల్ని మించి ఆయన రెచ్చిపోయారు. ఈ ఎన్నికల్లో పోటీ భారత్, పాకిస్తాన్ల మధ్యేనంటూ శ్రుతి మించారు. ఇప్పటికే షహీన్బాగ్లోకి పాకిస్తాన్ ప్రవేశించిందని, మరికొన్ని చోట్ల అది వేళ్లూనుకోవ డానికి ప్రయత్నిస్తోందని భయపెట్టే యత్నం చేశారు. కొందరు నేతలు కేజ్రీవాల్ను ఉగ్రవాది అన్నారు. దేశద్రోహుల్ని కాల్చిచంపాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సభికులతో నినాదాలు చేయించారు. తుది దశలో బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో స్థానిక అంశాలతో నిండి వుండొచ్చుగానీ, ఆ పార్టీ ప్రచారం మొత్తం జాతీయ భద్రత చుట్టూ, షహీన్బాగ్ చుట్టూ తిరిగింది. మీరెటువైపో తేల్చుకోవాలని ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చింది. జాతీయ భద్రత గురించి పౌరులను చైతన్యవంతం చేయాలనుకోవడాన్ని తప్పుబట్టలేంగానీ, తెల్లారితే కాలుష్యం మొదలుకొని అనేక స్థానిక సమస్యలతో సతమతమవుతున్న ఢిల్లీ పౌరులకు కేవలం జాతీయ భద్రత పాఠాలు చెబితే చాలనుకోవడం, ప్రత్యర్థులందరినీ జాతి వ్యతిరేకులుగా చిత్రిస్తే సరిపోతుందనుకోవడం బీజేపీ చేసిన తప్పిదం. అయిదేళ్ల పాలనలో తొలి మూడున్నరేళ్లు తమను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని, సుప్రీంకోర్టు ఎవరి విధులేమిటో తేటతెల్లం చేసేవరకూ మెరుగైన పాలన అందించకుండా అడ్డు తగిలిందని కేజ్రీవాల్ ఆరోపించినా బీజేపీ సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయింది. తాము ఢిల్లీకి ఏంచేశామో చెప్పడంలోగానీ, తొలి మూడున్నరేళ్లకూ సంబం ధించి తమ వాదనేమిటో వివరించడంలోగానీ ఆ పార్టీ విఫలమైంది. గత ఎన్నికలతో పోలిస్తే రాజకీయ నాయకుడిగా కేజ్రీవాల్ ఎంతో పరిణతి సాధించారు. ఎన్నికల సమయంలో బీజేపీ అనుసరిస్తున్న నమూనాను నిశితంగా పరిశీలించి, దాంతో సాధ్యమైనంతవరకూ ఘర్షణ వైఖరికి దిగకుండా సంయమనం పాటించారు. తనను ఉగ్రవాది అన్నా, దేశద్రోహులతో సమానం చేసినా ఆయన మాట తూలలేదు. పైగా రాముడిపైనా, హనుమంతుడిపైనా బీజేపీకే పేటెంట్ ఉంటుందన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేశారు. గతంలోవలె ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించే పనికి పూనుకోలేదు. షహీన్బాగ్ ఆందోళనపై మీ అభిప్రాయమేమిటో చెప్పాలని బీజేపీ సవాలు విసిరినా కేజ్రీవాల్ జవాబివ్వలేదు. అక్కడ సాగుతున్న ఉద్యమానికి మీ నిర్వాకమే కారణమని ఆరోపించారు. వారితో చర్చించి, ఒప్పించి దాన్ని విరమింపజేసే బాధ్యత మీదేనని, అందులో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని నిలదీశారు. ఆ అంశాలకు బదులు తాము మెరుగైన పనితీరు కనబర్చిన ఉన్న విద్య, వైద్య రంగాలకు ప్రచారంలో ప్రాధాన్యమిచ్చారు. 20,000 లీటర్ల వరకూ ఉచితంగా నీరు అందజేయడం, మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించడానికి వీలు కల్పించడం, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంటు, కాలనీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు తదితరాలను తన విజయాలుగా ఆప్ బాగా ప్రచారం చేయగలిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మరో కారణం శాంతిభద్రతలు గాలికి కొట్టుకుపోయాయన్న అభిప్రాయం అందరిలో కలగడం. దేశ రాజధాని నగరంలో పట్టపగలు వేలాదిమంది మహిళలు గుమిగూడినచోట ఒక దుండగుడు పోలీ సుల సమక్షంలోనే నాటు తుపాకి పేల్చడం, ఒకరిని గాయపర్చడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అటువంటి ఘటనలే మరో రెండు చోటుచేసుకోవడం మరింత ఆశ్చర్యపరిచింది. ప్రతిష్టాత్మ కమైన జేఎన్యూలో పదుల సంఖ్యలో ముసుగులు ధరించిన గూండాలు మూడుగంటలపాటు చెలరేగినా, ఆడపిల్లల హాస్టల్పై దాడిచేసి కొందరి తలలు పగలగొట్టినా దోషులను పట్టుకోవడంలో ఢిల్లీ పోలీసులు విఫలం కావడం అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కనుకనే బీజేపీకి బాగా పట్టువుండే సంపన్నుల కాలనీల్లో సైతం ఆ పార్టీకి ఓట్ల శాతం తగ్గింది. బహుశా స్థానిక ఓటరు నాడి పట్టగలిగిన మదన్లాల్ ఖురానా వంటి నేతలు ఉండివుంటే ఢిల్లీ బీజేపీ ఇంత అధ్వాన్నమైన ప్రచారం నడిపేది కాదు. ఢిల్లీలో విజయం కోసం బీజేపీ 22 ఏళ్లుగా నిరీక్షిస్తోంది. ఈసారి అది దక్కుతుందని దృఢంగా విశ్వసించడానికి తొమ్మిదినెలలక్రితం జరిగిన లోక్సభ ఎన్నికలు కారణం. ఆ ఎన్నికల్లో బీజేపీకి 56.58 శాతం ఓట్లు లభించాయి. దాని ప్రకారం 65 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీదే ఆధిక్యత. దీనిలో ఎంతచెడ్డా 40 అయినా రాకపోతాయా అని బీజేపీ ఆశించింది. ఓట్ల లెక్కింపు తొలి దశలో ఆ ఆశ నెరవేరవచ్చునన్న అభిప్రాయం కూడా కలిగింది. అటు తర్వాత అంతా తిరగబడింది. పవర్ బ్రోకర్లతో నిండిన కాంగ్రెస్ను ఓటర్లు మరోసారి పరాభవించారు. 2013 వరకూ మూడు దఫాలు వరసగా పాలించిన ఆ పార్టీకి అంతకంతకు ఓట్ల శాతం పడిపోతోంది. ఈసారి 67 చోట్ల ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోవడమంటే మాటలు కాదు. మొత్తానికి దేశ రాజధాని నగరంలో విజేతలెవరో, పరాజితులెవరో తేలిపోయింది. కానీ ఈ ఎన్నికలు మోసుకొచ్చిన విద్వేషభావనలు చల్లారడానికి, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చాన్నాళ్లు పడుతుంది. -
ఆప్ ‘హ్యాట్రిక్’సంబరాలు
-
ఆమ్ ఆద్మీ అందగాడు గెలిచేశాడు..!
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో సామాన్యుడి ఆమ్ ఆద్మీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా.. ఆప్ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా భారీ మెజార్టీతో గెలుపొందారు. రాజేందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాఘవ్.. బీజేపీ అభ్యర్థి ఆర్పీ సింగ్పై 20వేల 58ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. (హస్తిన తీర్పు : ఆప్ 62.. బీజేపీ 8) ఎన్నికల ప్రచారం సమయంలో రాఘవ్ చద్దాకు వింత అనుభవాలు ఎదురైన సంగతి తెల్సిందే. ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్ల నుంచి నియోజకవర్గ సమస్యల గురించి వినతులు వస్తుంటాయి. కానీ, రాఘవ్ చద్దాకు మాత్రం పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. ఆయన ప్రచారంలో పాల్గొన్న సమయంలో..'మీరు చాలా బాగున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా ఫాలోవర్ చద్దాకు ప్రపోజ్ చేయగా, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగాలేనందున పెళ్లి చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చద్దా తెలివిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా ఆయన ఓ స్కూల్కు వెళ్లగా అక్కడున్న టీచర్ ఒకరు తనకు కుమార్తె ఉంటే మీకిచ్చి వివాహం చేసేదాన్నని చద్దాతో చెప్పుకొచ్చారని ఆయన సోషల్ మీడియా బృందం పేర్కొంది. (ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్..) ఇక ‘మీకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నా మీరు పెళ్లి మాత్రం చేసుకోవద్దని అలా చేస్తే తన గుండె ముక్కలవుతుంద’ని ఓ మహిళ ఆప్ నేత ఇన్స్టాగ్రాంలో ఆయనను వేడుకున్నారు. ట్విటర్లో మరో మహిళ చద్దాను ఉద్దేశించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎరౌండ్ అంటూ ఓ స్టోరీని షేర్ చేశారు. సీఏగా కెరీర్ ప్రారంభించిన రాఘవ్ చద్దా తరువాత రాజకీయాలోకి ప్రవేశించారు. తదనంతరం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో అతను గెలుపొందడంతో, ఇదంతా ఆ అమ్మాయిల వల్లే అంటూ కొందరు చమత్కరిస్తున్నారు. -
మోదీ ట్వీట్.. కేజ్రీవాల్ రిప్లై
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్కు, అరవింద్ కేజ్రీవాల్కు కంగ్రాట్స్. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే మోదీ ట్వీట్పై కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. ‘థాంక్యూ సో మచ్ సార్. న్యూఢిల్లీని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను’ అని బదులిచ్చారు. కాగా, నేడు వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ 62 సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరువలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపును ఢిల్లీ ప్రజల విజయంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. చదవండి : ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు : కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రకాశ్ రాజ్ ట్వీట్ -
థాంక్యూ ఢిల్లీ.. షాక్ తగిలిందా: ప్రకాశ్ రాజ్
బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ‘సామాన్యుడి’కి అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలను ప్రశంసిస్తూనే.. బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ మేరకు... ‘‘రాజధాని శిక్ష.. బుల్లెట్లు పేల్చేవాళ్లను.. చీపురుతో కొట్టారు. షాక్ తగిలిందా?’’అని ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా.. ‘‘పేరున్న వాళ్లను.. బద్నాం చేసే వాళ్లను కాకుండా.. కేవలం పనిచేసే వారిని మాత్రమే గెలిపించారు. థాంక్యూ ఢిల్లీ’’ అని ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా గత లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజక వర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రకాశ్ రాజ్ ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ తీరుపై అనేకమార్లు విమర్శలు గుప్పించారు. చదవండి: హస్తిన తీర్పు: ఆప్ 62.. బీజేపీ 8 కాగా ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న 70 స్థానాల్లో ఎన్నికల్లో... ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఒక్క స్థానంలో కూడా గెలుపొందని కాంగ్రెస్ పార్టీ.. పలు చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. మరోవైపు వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనకు అఖండ విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన హనుమాన్ మందిర్కు వెళ్లి దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్ తీసుకోనున్నారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం : కేజ్రీవాల్ CAPITAL PUNISHMENT.... Goli maarne walon ko.... jhadu se mara..... SHOCK LAGA??? ಗೋಲಿಬಾರ್ ಮಾಡೋರಿಗೆ ಜನ ಪೊರಕೇಲಿ ಹೊಡುದ್ರು.. SHOCK ಹೊಡೀತಾ??#JustAsking — Prakash Raj (@prakashraaj) February 11, 2020 -
ఆప్ విజయంపై కేజ్రీవాల్ కుటుంబం హర్షం
-
ఇది ఢిల్లీ ప్రజల విజయం
-
ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారు : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని ఢిల్లీ ప్రజల విజయంగా ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంపై కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ కేంద్ర కార్యాలయంలో ఆప్ కార్యకర్తలతో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘భారత్ మాతా కీ జై, ఇక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు సరికొత్త తీర్పు ఇచ్చారని అన్నారు. దేశంలోనే కొత్త రాజకీయ అధ్యాయం తీసుకొచ్చారని తెలిపారు. అభివృద్ధికే ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. మూడోసారి తమ కొడుకుపై నమ్మకం ఉంచి భారీ విజయాన్ని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఐ లవ్ యూ ఢిల్లీ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ప్రజలకు తక్కువ ధరకే విద్యుత్ అందించాం. విద్య, వైద్యం కోసం చేసిన కృషి వల్లే ఆప్ను ప్రజలు మళ్లీ ఆదరించారు. ఈ రోజు మంగళవారం.. హనుమాన్జీ ఢిల్లీ ప్రజలను ఆశీర్వాదించారు. రాబోయే ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేస్తూనే ఉండటానికి హనుమాన్జీ మాకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆప్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. అందరం కలిసి పనిచేస్తూ ఢిల్లీని సుందర నగరంగా తీర్చిదిద్దుదామ’ని పిలుపునిచ్చారు. -
అసెంబ్లీ రద్దుకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్స్
-
కేజ్రీవాల్కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తమైంది. ఈ సందర్బంగా ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్కి, ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే కేజ్రీవాల్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె విమర్శించారు. అభివృద్దే ఢిల్లీలో ఆప్ను గెలిపించిందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఆప్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్.. ‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.(హస్తిన తీర్పు : లైవ్ అప్డేట్స్) -
ఢిల్లీ ఫలితాలు : ‘కమల దళానికి తగిన శాస్తి జరిగింది’
-
ఆప్ జోరు, వైరల్ మినీ మఫ్లర్మ్యాన్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటోంది. స్మైలీ ఫేస్ ఎమోజీతో ‘మఫ్లర్మాన్’ పేరుతో ఒక బుడతడి ఫోటోను షేర్ చేసింది. ఆప్ ట్రేడ్ మార్క్ మఫ్లర్, టోపీ ధరించి, అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లా వున్న ఒక పసిబిడ్డ ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అభిమానుల లైక్లతో పాటు కమెంట్లు, అభినందనల వెల్లువ కురుస్తోంది. ఆప్ షేర్ చేసిన మినీ మఫ్లర్ మాన్ ఫోటో వైరల్ అవుతోంది. ప్రధానంగా "నేను కేజ్రీవాల్...కానీ నేను ఉగ్రవాదిని కాదు’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించగా, మరో యూజర్ ఆప్కు ఓట్లు వేసిన ఢిల్లీ ఓటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది భారతదేశం ఆత్మను, సారాన్ని రక్షించడానికి ప్రజల స్పష్టమైన తీర్పు అని, విద్య, ఆరోగ్య సంరక్షణకు వేసిన ఓటు. హిందుస్తాన్, పాకిస్తాన్ కోసం కాదు..స్థిరత్వం కోసం ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరోజు అతనే సీఎం అని మరొకరు పోస్ట్ చేయడం విశేషం. Mufflerman 😄 pic.twitter.com/OX6e8o3zay — AAP (@AamAadmiParty) February 11, 2020 He will be the CM one day. 😍#DelhiResults Mophlar Men pic.twitter.com/oFrpjKgQY4 — Pramod Gupta (@PramodG96346806) February 11, 2020 -
ఢిల్లీ ఫలితాలు : ‘2021లో ఏం జరుగుతుందో చూడండి’
కోల్కత : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2020లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే 45 స్థానాల్లో విజయం సాధించిన ఆప్.. మరో 17 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వరుసగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయబోతున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు అభినందనల వెల్లువ మొదలైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు. దాంతోపాటు బీజేపీ పతనం మొదలైందని ఓ ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు. (చదవండి : ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర) క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలహీన పడటం ప్రారంభమైందని, త్వరలోనే కాషాయ దళం ప్రభ కోల్పోతుందని మమత పేర్కొన్నారు. వచ్చే యేడాది జరగుబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ విద్యార్థులను, మహిళలను టార్చర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు కాషాయ దళానికి తగిన శాస్తి చేశారని చురకలంటించారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయం సాధించగా, 5 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక దశాబ్దాల పాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు వచ్చేలా కనిపించడం లేదు. చదవండి : న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం ఢిల్లీ ఫలితాలు : ప్రశాంత్ కిశోర్ స్పందన -
ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించింది. ఈ విజయంలో మసాలా దినుసులతో ఘుమ ఘుమలాడే ‘బిర్యానీ’ కూడా తనవంతు పాత్రను నిర్వహించిందని చెప్పవచ్చు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిర్యానీ’ ఓ రాజకీయ ఆయుధంగా మారడమే అందుకు కారణం. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్ బాద్లో ఆందోళన చేస్తున్న వారికి ఆప్ ప్రభుత్వం ‘బిర్యానీ’ సరఫరా చేస్తోందని బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా పదే పదే ఆరోపణలు చేసింది. ఆ పార్టీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవియా అయితే ‘షహీన్ బాద్లో బిర్యానీ పంచుతున్నారనడానికి ఇదిగో ప్రూఫ్, అదిగో ప్రూఫ్’ అంటూ ఏవో ఫొటోలతో ట్వీట్లపై ట్వీట్లు చేశారు. ఇలా ‘బిర్యానీ’ని ప్రతికూల ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇదే మొదటి సారి కాదు. 2015లో ముంబై టెర్రరిస్టు దాడుల కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ ‘బిర్యానీ’ ఆయుధంగా ఉపయోగించారు. జైల్లో టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్కు జైలు అధికారులు ‘బిర్యానీ’ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అప్పట్లో కసబ్కు పెరుగుతున్న మద్దతును దెబ్బతీయడానికే తాను ఆ అబద్ధపు ఆరోపణ చేశానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దక్షిణాసియా ముస్లింలకు బహు పసందైన ‘బిర్యానీ’ని రాజకీయ ఆయుధంగా వాడినట్లయితే హిందువుల ఓట్లన్నీ కట్టకట్టుకొని తమకే పడతాయని బీజేపీ నేతలు ఆశించారు. అయితే ఆ నినాదాన్ని ఎవరు అంతగా పట్టించుకోలేదని ఎన్నికల ఫలితాలే సూచిస్తున్నాయి. నిమిషానికి 95 వేల ఆడర్లు భారత్లో ప్రతి నిమిషానికి 95 బిర్యానీల ఆర్డర్ వస్తోందని ఇంటికి ఆహారాన్ని సరఫరా చేస్తున్న అతి పెద్ద యాప్ ‘స్విగ్గీ’ లెక్కలు తెలియజేస్తున్నాయి. దేశంలో జాతీయ ఆహారంగా ‘బిర్యానీ’ని గుర్తించాలనే స్థాయికి దీని ప్రాధాన్యత పెరిగింది. భారత దేశ ఆహారాన్ని రుచి చూడాలనుకునే విదేశీయులు మొట్టమొదగా బిర్యానీ, ఆ తర్వాత బటర్ చికెన్ను శోధిస్తారని ‘ఎస్ఈఎం రష్’ 2019లో నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. ధోని హోటల్ మారిన వైనం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన బస చేసిన హోటల్లోకి బయటి నుంచి బిర్యానీని అనుమతించకపోతే ఆయన ఏకంగా హోటల్ నుంచే మకాం మార్చారు. పర్షియన్ పదం బిర్యాన్ నుంచి బిర్యానీ వచ్చింది. పర్షియన్లో బిరింజ్ అంటే బియ్యం అని అర్థం కూడా ఉంది. బిర్యానీ మొఘల్స్ వంటకమని, వారి నుంచి ఇది భారత్కు వచ్చిందని చెబుతారు. తుర్క్–మంగోల్ చక్రవర్తి తైమార్ 14వ శతాబ్దంలోనే ఈ వంటకాన్ని భారత్కు తీసుకొచ్చారనే వాదన కూడా ఉంది. నిజాం నవాబులు, లక్నో నవాబులు ఈ వంటకాన్ని అమితంగా ప్రేమించి ప్రాచుర్యంలోకి తెచ్చారు. పలు రకాల బిర్యానీలు హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. సంప్రదాయ మొఘలాయ్ బిర్యానీ కూడా హైదరాబాద్లో దొరకుతుంది. అలాగే బెంగళూరు బిర్యానీ, కోల్కతా బిర్యానీ, ముంబై బిర్యానీ, లక్నో బిర్యానీ (పుక్కీ బిర్యానీ, అవద్) అంటూ ఏ ప్రాంతం బిర్యానీలకు ఆ ప్రాంతం ప్రత్యేకతలుండగా హైదరాబ్ దమ్, మొఘలాయ్, థలస్సరీ బిర్యానీలు దేశవ్యాప్తంగా పెద్ద నగరాల్లో దొరకుతున్నాయి. బిర్యానీ అంటే ప్రధానంగా మటన్తో చేసేదని, ఇప్పుడు చికెన్, ఎగ్, ఫిష్, ప్రాన్స్లతోపాటు విజిటెబుల్ బిర్యానీలు కూడా దొరకుతున్న విషయం తెల్సిందే. (హస్తిన తీర్పు : లైవ్ అప్డేట్స్) చదవండి : ఆప్ జోరు, వైరల్ మినీ మఫ్లర్మ్యాన్ -
న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం దిశగా దూసుకుపోతోంది .సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్ 18 స్థానాల్లో విజయం సాధించి, 40 స్థానాల్లో ముందంజలో ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు. సంగంవిహార్, దేవ్లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. -
ఢిల్లీ ఫలితాలు : ప్రశాంత్ కిశోర్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ఆప్కు భారీ విజయం కట్టబెట్టినందుకుగాను ఢిల్లీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్కు అభినందనలు తెలిపారు. ‘ భారత దేశ ఆత్మను కాపాడిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీకి ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కేజ్రీవాల్కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే చీప్ స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె విమర్శించారు. అభివృద్దే ఢిల్లీలో ఆప్ను గెలిపించిందని ఆమె పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆప్ 15 స్థానాల్లో విజయం సాధించి, 43 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ రెండు చోట్ల విజయం సాధించి, 10 స్థానాల్లో ముందంజలో ఉంది. -
ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ
-
సత్తా చాటిన ఆప్
-
ఆప్ సంబరాలు.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ 58 స్థానాల్లో(ఉదయం 11.30గంటలకు) స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ మంత్రులు కూడా ఆయా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. (చదవండి : ఆప్ విజయంలో ‘బిర్యానీ’ పాత్ర) ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. టపాసుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. సీఎం కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆప్ శ్రేణులు టపాసులు పేల్చడం లేదు. టపాసులకు బదులు బెలూన్లను గాల్లోకి వదిలి, స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ ఫలితాలు: విజయమైనా.. అపజయమైనా ఓకే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. గత ఎన్నికల కంటే బీజేపీ ఈసారి మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఈక్రమంలో బీజేపీ కార్యాలయంపై ప్రత్యక్షమైన ఓ బ్యానర్ ఆసక్తి రేపుతోంది. ‘విజయం మాకు అహంభావాన్ని కలిగించదు. అలాగే ఓటమి మమ్మల్ని నిరాశపరచదు’ అని బ్యానర్పై హిందిలో రాసి ఉంది. అదేవిధంగా బ్యానర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బొమ్మ కూడా ఉంది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్ని మళ్లీ ఆప్నకే పట్టం కట్టగా.. ఫలితాలు వాటిని నిజం చేస్తున్నాయి. ప్రజల నాడిని విశ్లేషించటంలో సర్వే సంస్థలు సఫలీకృతం అయినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం ఆప్ 56 సీట్లలో ముందజలో ఉండగా, బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ప్రధాని మోదీతోపాటు, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ లాభం లేపోయింది. ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను అమిత్ షా చేపట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ చదవండి: హస్తిన తీర్పు : ఖాతా తెరవని కాంగ్రెస్ -
ఓటమికి బాధ్యత వహిస్తా :మనోజ్ తివారీ
-
పుంజుకున్న బీజేపీ..పత్తాలేని కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 10.35గంటలకు ఆప్ 49 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 21 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. ఈసారి పుంజుకుంది. గతం కంటే ఐదింతలు మెరుగైంది. 27 స్థానాల్లో ఆప్, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉంది. 14 స్థానాల్లో ఆప్కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మెడల్ టౌన్లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ముందంజలో ఉన్నారు. చాందినీలో ఆప్ 9, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ4, ఈస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ 4 , న్యూఢిల్లీలో ఆప్ 9, బీజేపీ 1, నార్త్ వెస్ట్ ఢిల్లీలో ఆప్ 8, బీజేపీ2, వెస్ట్ ఢిల్లీలో ఆప్ 6, బీజేపీ4, సౌత్ ఢిల్లీలో ఆప్ 7, బీజేపీ3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. -
ఆప్ కార్యాలయంలో సంబరాలు
-
న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ముందంజ
-
ముందంజలో కేజ్రీవాల్, సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 51 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 14 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
ఢిల్లీ పీఠం మాదే : బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55 స్ధానాల్లో గెలుపొందినా ఆశ్చర్యం లేదని అన్నారు. అంతకుముందు బీజేపీ నేత విజయ్ గోయల్ మంగళవారం ఉదయం కన్నాట్ప్లేస్లో హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇక కౌంటింగ్కు ముందు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన నివాసంలో ప్రార్ధన చేశారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. -
నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
-
హస్తిన తీర్పు : మోదీ, రాహుల్ ట్వీట్
నా ప్రత్యేక అభినందనలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు మించిన ఫలితాలతో అఖండ విజయాన్ని అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై ప్రశంసల జల్లులు కురుస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఆంద్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు జాతీయ, స్థానిక నేతలు కేజ్రీవాల్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఫలితాల అనంతరం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి శుభాకంక్షలు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాను’అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్కు తన ప్రత్యేక అభినందనలు అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆప్ 62.. బీజేపీ 8 ఎలాంటి గందరగోళం, ఉత్కంఠ లేదు. వార్ వన్ సైడ్ అయింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించిన ఫలితాలతో ‘సామాన్యుడి’ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 చోట్ల గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలతోనే సరిపెట్టుకుంది. కాగా, కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. ఈ సారి కూడా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా.. ఏ తరుణంలోనూ కనీసం ఆధిక్యం కూడా ప్రదర్శించ లేదు. ఇక వరుసగా మూడో సారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక 2015లో ఆప్ 67 స్థానాల్లో ఆప్ జయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 3 స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక తాజా ఎన్నికల్లో ఆప్ ఐదు స్థానాలను చేజార్చుకోగా.. బీజేపీ మరో ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకుమించి 2015 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల ఫలితాల్లో పెద్దగా తేడా ఏం కనిపించలేదు. కేజ్రీవాల్ అండ్ టీమ్కు అభినందనలు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అవిశ్రాంతంగా ప్రనిచేసిన కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీని అభివృద్ది చేస్తుందనే నమ్మకంతోనే అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి పట్టం కట్టారన్నారు. ఇక అసెంబ్లీలో ప్రజా సమస్యలు లెవనెత్తుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్రను బీజేపీ పోషిస్తుందన్నారు. ఇక ఢిల్లీ అభివృద్దికి కృషి చేస్తుందనే నమ్మకంతో కేజ్రీవాల్ అండ్ టీమ్కు అభినందనలు అంటూ నడ్డా ట్వీట్ చేశారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అఖండ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్ వన్ సైడ్గా నిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎం కేజ్రీవాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇది ఢిల్లీ ప్రజలు విజయం. ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. అభివృద్దికే ప్రజలు ఓటేశారు. ఈ విజయం కొత్త రాజకీయాలకు నాంది. ఢిల్లీ తన కుమారుడిని మరోసారి నమ్మింది’అంటూ ఆ ప్రకటనలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేజ్రీవాల్కు అభినందనల వెల్లువ ఒంటిచేత్తో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొని కనీవినీ ఎరుగని రీతిలో మరోసారి బంపర్ విక్టరీ సాధించిన అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలదన్ని అఖండ విజయంతో ఆప్ దూసుకపోతోంది. ఇప్పటికే 45 స్థానాల్లో ఆప్ గెలుపొందగా.. 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కేజ్రీవాల్ అండ్ టీం సాధించిన ఈ సూపర్బ్ విక్టరీపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్కి, ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్కు హృదయపూర్వక అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మరోసారి విజయ ఢంకా మోగించిన అరవింద్ కేజ్రీవాల్కు యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సైతం కేజ్రీవాల్కు శుభాభినందనలు తెలిపారు. అసెంబ్లీ రద్దుకు సిఫార్సు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం, నేటితో అసెంబ్లీ కాలపరిమితి ముగియడంతో ఢిల్లీ శాసనసభను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ రద్దు చేశారు. త్వరలోనే కేజ్రీవాల్ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సింగిల్ డిజిట్కే బీజేపీ పరిమితం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మరోసారి నిరాశే ఎదురైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పట్నుంచి 20కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించిన బీజేపీ మెల్లిమెల్లిగా పట్టువదిలింది. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థానాలకే బీజేపీ పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఫలితాల్లో కాంగ్రెస్కు రిక్త హస్తమే మిగిలింది. కనీసం ఒక్క స్థానంలో కూడా కనీసం ఒక్కసారైనా ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు డిప్యూటీ సీఎం విజయం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్పర్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవి నేగిపై దాదాపు 3,571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ఆద్మీ పార్టీ దూసుకెళ్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మరోసారి కంగుతినిపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ విజయం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్లో ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ విజయం సాధించారు. సంగంవిహార్, దేవ్లీలో ఆప్ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్లో బీజేపీ అభ్యర్థి జగదీష్ ప్రధాన్ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. కేజ్రీవాల్కు ప్రశాంత్ కిశోర్ అభినందనలు ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్ కిశోర్ ట్వీట్ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్కు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. టాపాసులు కాల్చకండి : కేజ్రీవాల్ ఆప్ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. పటాకుల స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్ పేర్కొంది. ఐదింతలు పెరిగిన బీజేపీ బలం దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 11 గంటలకు ఆప్ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 16స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. ఉచిత విద్యుత్తో ఆప్కు అనుకూలం: బీజేపీ ఎంపీ నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్ తివారీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. ఆప్ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. 70 స్ధానాలు కలిగిన ఢిల్లీలో ఆప్ ప్రస్తుతం 50 స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్ధానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది. సంబరాల్లో ఆప్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట విజయం ఖాయమవడంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్ ఏకపక్షంగా దూసుకుపోతోంది. సత్తా చాటిన ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ మొదటి నుంచి లీడ్లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్ 50 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ద్వారాకా, జనక్ పురి, కృష్ణానగర్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్ అధిక్యంలో కొనసాగుతున్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మనీష్ అక్షర్ ధామ్ కౌంటింగ్ సెంటర్లో ప్రతాప్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థి రవినేగి పాల్గొన్నారు. అక్కడక్కడ మెరుస్తోన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 54 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది. ఆప్కు గట్టి పోటీ ఇవ్వకపోయినా.. అక్కడక్కడ బీజేపీ ముందంజలో ఉంది. రోహిణిలో బీజేపీ అభ్యర్థి విజయేంద్రకుమార్ లీడ్లో కొనసాగుతున్నారు. బగ్గాలో తాజిందర్పాల్ సింగ్ ఆప్ అభ్యర్థిని వెనక్కినెట్టి ముందంజలో కొనసాగుతున్నారు. ముందంజలో కేజ్రీవాల్, సిసోడియా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 55 స్ధానాల్లో ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉండగా, బీజేపీ 13 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్క స్ధానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దూసుకెళ్తున్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 15, కాంగ్రెస్ 1 స్థానంలో లీడ్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని ఆప్ నేత,ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. కౌంటింగ్ ప్రారంభం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో మొత్తం 21 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గెలుపుపై ధీమాతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఆప్ మద్దతు దారులు పెద్ద ఎత్తును కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. పిల్లలతో సహా కేజ్రీవాల్ ఇంటికి... శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ఈ ఉదయం నుంచే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంటున్నారు. పిల్లలతో కలిసి వారంతా కేజ్రీవాల్ నివాసానికి వస్తుండటం విశేషం. మరోవైపు బీజేపీ నాయకుడు విజయ్ గోయల్.. కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తన నివాసంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వత్రా ఉత్కంఠ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. ఎన్నికల సంఘం తుది పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్ సీవీ రామన్ ఐటీఐ, రాజీవ్ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్బూత్లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్ అధికారులు పరిశీలిస్తారని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది. -
ఢిల్లీ ఓట్ల లెక్కింపు నేడే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. నేడు జరిగే కౌంటింగ్ కోసం ఢిల్లీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే మళ్లీ అధికారం అన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..ఎన్నికల సంఘం తుది పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా వెల్లడించిన నేపథ్యంలో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలైన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధానంగా ఉండనుందని, ఈసారి కూడా కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు లేవని భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి ఐదు శాతం తక్కువగా 62.59 శాతం మాత్రమే నమోదైందని ఆదివారం సాయంత్రం ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపులో 70 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 79 మంది మహిళలు సహా మొత్తం 672 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్ సీవీ రామన్ ఐటీఐ, రాజీవ్ గాంధీ స్టేడియం, మీరాబాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తదితర 21 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 33 మంది పరిశీలకులను నియమించారు. 13, 780 పోలింగ్బూత్లలో పోలైన ప్రతి ఓటును ప్రిసైడింగ్ అధికారులు పరిశీలిస్తారని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. అభివృద్ధినే ఎజెండాగా తీసుకుని ఎన్నికల బరిలో దిగిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఈసారి కూడా తమదే అధికారమనే ధీమాతో ఉంది. జాతీయతావాదం, సీఏఏ వ్యతిరేక ఆందోళనలపై తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ కూడా ఢిల్లీ సీఎం పీఠం తమకే దక్కుతుందని అంచనా వేస్తోంది. -
ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేజ్రీవాల్
-
ఢిల్లీ ఎన్నికల్లో 62.59 శాతం పోలింగ్ నమోదు
-
ఢిల్లీ పోలింగ్ @ 62.59%
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తుది గణాంకాలను.. పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల తరువాత.. ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు విడుదల చేసింది. మొత్తంగా, 62.59 శాతం పోలింగ్ నమోదైందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్బీర్ సింగ్ వెల్లడించారు. 2015 ఎన్నికల కన్నా ఇది దాదాపు 5% తక్కువ. ఆ ఎన్నికల్లో 67.47% మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని 70 నియోజకవర్గాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో బల్లీమారాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6%, ఢిల్లీ కంటోన్మెంట్ స్థానంలో అత్యల్పంగా 45.4% పోలింగ్ నమోదైందని సింగ్ తెలిపారు. తుది గణాంకాలను విడుదల చేయడంపై జరిగిన ఆలస్యంపై ఆయన వివరణ ఇచ్చారు. కచ్చితమైన గణాంకాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో రాత్రంతా రిటర్నింగ్ అధికారులు సమాచారాన్ని విశ్లేషించారని, అందువల్లనే పోలింగ్కు సంబంధించిన తుది శాతాన్ని వెల్లడి చేయడంలో జాప్యం ఏర్పడిందని ఆయన వివరించారు. అయితే, ఇది అసాధారణ ఆలస్యమేమీ కాదన్నారు. తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించడంలో ఆలస్యం నెలకొనడాన్ని ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఈసీ ఏం చేస్తోంది? పోలింగ్ వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదు?’ అని ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ట్వీట్ చేశారు. ‘బీజేపీ నేతలు ఇచ్చే పోలింగ్ గణాంకాల కోసం ఈసీ ఎదురు చూస్తోంది. అందుకే, పోలింగ్ ముగిసి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ తుది లెక్కలు ఈసీ వెల్లడించలేకపోయింది’ అని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీడియాతో అన్నారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. -
ఈసీపై కేజ్రీవాల్ ఆగ్రహం
-
ఈసీ అధికారులు నిద్రపోతున్నారా? : కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు శనివారం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 70స్థానాలున్న అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసి 24 గంటలయిన ఎన్నికల కమీషన్ మాత్రం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించలేదు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నే మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి కానీ బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని.. అమిత్ షా చెప్పినట్లు 45 సీట్లకు తక్కువ కాకుండా తామే గద్దెనెక్కుతామని ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా తుది పోలింగ్ శాతంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు తావిచ్చినట్లయింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కమీషన్పై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.(కేజ్రీవాల్పై కాంగ్రెస్ నేత ప్రశంసలు..) 'పోలింగ్ పూర్తయిన ఇన్ని గంటల తర్వాత కూడా ఓటింగ్ శాతంపై ఈసీ ప్రకటన చేయకపోవడం నాకైతే షాకింగ్గా అనిపిస్తోంది. అసలు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్లేమైనా నిద్రపోతున్నారా ఏంటి? పోలింగ్ శాతాన్ని ప్రకంచాలి కదా?' అంటూ సీఎం కేజ్రీవాల్ ఈసీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తున్నదని, ట్యాంపరింగ్ ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచుకుని, తద్వారా ఫలితాల్ని తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.(బీజేపీలో సరైన సీఎం అభ్యర్ధి లేరు..) Absolutely shocking. What is EC doing? Why are they not releasing poll turnout figures, several hours after polling? https://t.co/ko1m5YqlSx — Arvind Kejriwal (@ArvindKejriwal) February 9, 2020 శనివారం సాయంత్రానికి వెల్లడైన లెక్కల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 61.46 శాతం పోలింగ్ నమోదైంది. గత లోక్ సభ ఎన్నికలు, 2015నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి 67.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా శాతం లెక్కలు పెరుగుతాయని ఈసీ అధికారులు చెప్పినా... అధికార లెక్కలు మాత్రం విడుదల చేయకపోవడం పట్ల విమర్శలకు దారి తీస్తోంది. (ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ట్వీట్ వార్) అయితే కేజ్రీవాల్ ఎలక్షన్ కమీషన్ తీరును తప్పు బట్టిన కాసేపటికే కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 5శాతం తగ్గిందని పేర్కొన్నారు. అయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల కంటే 2శాతం ఎక్కువగా నమోదైందని అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలో అత్యల్పంగా 45.4 శాతం, బల్లిమారన్ నియోజకవర్గంలో అత్యధికంగా 71.6శాతం పోలింగ్ నమోదైందని ఈసీ తమ ప్రకటనలో తెలిపింది. -
కేజ్రీవాల్పై కాంగ్రెస్ నేత ప్రశంసలు..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై ఆయన ప్రశంసలు గుప్పించారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా ఉంటుందని, దేశ రాజధానిలో ఆప్ వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆప్కు మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తుందని, కాంగ్రెస్ మూడోస్ధానంతో సరిపెట్టుకుంటుందని అంచనాలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై కాంగ్రెస్ నేత స్పందిస్తూ ఢిల్లీ ఎన్నికలపై తాము మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకోలేదని, తమ బలాన్నంతా కూడదీసుకుని ఎన్నికల బరిలో పోరాడామని, ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని భావిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మతతత్వ అజెండాతో ముందుకువస్తే కేజ్రీవాల్ అభివృద్ధి అజెండాతోముందుకొచ్చారని అన్నారు. కేజ్రీవాల్ గెలిస్తే అభివృద్ధి అజెండా గెలుపుగా భావించాలని వ్యాఖ్యానించారు. మరోవైపు ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఇన్ఛార్జ్ పీసీ చాకో ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి : ఢిల్లీ సుల్తాన్ కేజ్రీవాలే..! -
ఢిల్లీ సుల్తాన్ కేజ్రీవాలే..!
-
మళ్లీ సీఎం పీఠంపై కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కూడా కమలం కలలు కల్లలేనా? దేశానికి మోదీ, రాష్ట్రానికి కేజ్రీవాల్ అని ఓటర్లు ఫిక్సయిపోయారా? జాతీయవాదాన్ని అభివృద్ధి, ఉచిత పథకాల ఎజెండా అధిగమించిందా? మరోసారి ఆప్ కీ సర్కార్ అనే రాజధాని ఓటర్లు నినదించారా? కాంగ్రెస్ పార్టీ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయిందా?.. ఈ ప్రశ్నలన్నింటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ఢిల్లీ ప్రజలు మరోసారి ఆప్కే పట్టం కడతారని ఎగ్జిట్పోల్స్ తేల్చి చెప్పాయి. అయితే, 2015 ఎన్నికల మాదిరిగా భారీ స్థాయి మెజార్టీ రాకపోవచ్చునని అంచనా వేశాయి. వివిధ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సమీక్షించి చూస్తే అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 40 నుంచి 50 స్థానాలను గెలుచుకోవచ్చునని, బీజేపీకి 10 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక చతికిలపడుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభ సమయంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావించారు. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలను స్వీప్ చేయడం, కాంగ్రెస్ ఓట్ల శాతంలో రెండో స్థానంలో నిలవడంతో ఈసారి ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. కమలదళం మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే జాతీయ భద్రత, అయోధ్యలో రామాలయ నిర్మాణం, కశ్మీర్లో 370 ఆర్టికల్ వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకుంది. ప్రధానంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా షహీన్బాగ్లో జరుగుతున్న నిరసనల్ని పదే పదే ప్రస్తావించి, వారికి మద్దతిచ్చిన వాళ్లని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. సీఎం కేజ్రీవాల్ మాత్రం తన సొంత సంక్షేమ ఎజెండాతోనే ముందుకు వెళ్లారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా అయిదేళ్లలో తాను చేసిన సుపరిపాలననే నమ్ముకుని సంయమనంతో వ్యవహరించారు. షహీన్బాగ్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ‘మీరు గెలిస్తే సీఎం ఎవరు’అంటూ సవాల్ విసిరారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నెలకు 20 వేల లీటర్లు ఉచితంగా నీళ్లు వంటివి కేజ్రీవాల్పై క్రేజ్ను ఏ మాత్రం తగ్గించలేదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్లో సీనియర్ నేతలు పోటీకి అంగీకరించకుండా, వారి బంధువులకే టిక్కెట్లు ఇప్పించుకోవడం, గాంధీ కుటుంబం ఆఖరి నిమిషంలో తూతూ మంత్రంగా ప్రచారం చేయడం వంటివి ఆప్కి కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? ఢిల్లీ ప్రజల అసలైన నాడిని పట్టుకోగలిగాయా? అన్నది 11న వచ్చే ఫలితాల్లో తేలిపోనుంది. మెజారిటీ మాదే: ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఆప్ వైపే మొగ్గుచూపుతుండగా బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ మాత్రం.. తమ పార్టీ క్లీన్స్వీప్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు నాడిని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయని పేర్కొన్నారు. 48 సీట్లు గెలుచుకుని ఢిల్లీలో అధికారం చేపడుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు భారీ మెజారిటీ రానుందని ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులను ఆయన ట్విట్టర్ ద్వారా అభినందించారు. -
ఢిల్లీలో పోలింగ్ 61%
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రానికి 61.46% పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని 11 జిల్లాలకు గాను ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 65.24% పోలింగ్ నమోదు కాగా, న్యూఢిల్లీలో 56.10%, ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 54.89% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42% మంది ఓటేశారు. కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నందున పోలింగ్ శాతం పెరిగే చాన్సుందని అధికారులు తెలిపారు. గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47% పోలింగ్ నమోదు కాగా, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో 60.60% పోలింగ్ నమోదైంది. పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీములు కలిపి 60వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓటేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు పోలింగ్ సరళి ఇలా.. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి మూడు గంటల్లో కేవలం 14.5% మాత్రమే పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కొద్దిగా పుంజుకుని, మధ్యాహ్నం 3 గంటలకు 41.5%కు చేరుకుంది. పోలింగ్ ముగిసే 6 గంటల సమయానికి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ముస్తాఫాబాద్లో 66.29%, మతియామహల్ 65.62%, సీలాంపూర్లో 64.92% పోలింగ్ నమోదైంది. షహీన్బాగ్లాంటి కొన్ని చోట్ల ఓటర్ల క్యూలు కొనసాగుతున్నందున పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్బీర్ సింగ్ తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులో తన ఫొటో, పేరు కనిపించలేదంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ సభర్వాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొద్దిసేపు పోలింగ్కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే ఆ వీవీప్యాట్ మిషన్ స్థానంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ వైఫల్యం కేవలం ఒక్క శాతమేనని సీఈవో తెలిపారు. శతాధిక వృద్ధులు 60 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఓటేసిన ప్రముఖులు రాష్ట్రపతి కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజ్పూర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పోలింగ్ కేంద్రంలో తల్లిదండ్రులతోపాటు భార్య సునీత, కొడుకు పుల్కిత్తో కలిసి వచ్చి ఓటు వేశారు. ముందుగా ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రియాంకా గాంధీ కొడుకు రెహాన్, కేజ్రీవాల్ కొడుకు పుల్కిత్ మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కేజ్రీవాల్ మళ్లీ సీఎం అవుతారని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ప్రజలు ఎవరికి ఓటేస్తే వారే ఢిల్లీ సీఎం అవుతారని పుల్కిత్ బదులిచ్చాడు. పోలింగ్ కేంద్రం వద్ద సోనియా, ప్రియాంక కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ట్విట్టర్ వార్ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో మగవారిని సంప్రదించాలంటూ ఢిల్లీ మహిళలకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘మీరంతా తప్పకుండా ఓట్లేయండి. ముఖ్యంగా మహిళలకు ఓ విన్నపం. కుటుంబంతోపాటు దేశం, ఢిల్లీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో మీ ఇంట్లో మగవారితోనూ చర్చించండి’ అంటూ పోలింగ్కు ముందు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ..ఎవరికి ఓట్లేయాలో తెలియని స్థితిలో మహిళలున్నట్లు కేజ్రీవాల్ భావిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కేజ్రీవాల్ బదులిస్తూ..ఇంటి బాధ్యతలు మోసే ఢిల్లీ మహిళలు తమ కుటుంబం ఎవరికి ఓటేయాలో కూడా ఈసారి నిర్ణయించారని వ్యాఖ్యానించారు. షహీన్బాగ్లో ఆగని నిరసనలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని షహీన్బాగ్లో పోలింగ్ రోజూ నిరసనలు ఆగలేదు. నిరసనలు కొనసాగేందుకు వీలుగా అందులోని మహిళలు కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన పోలింగ్ ప్రక్రియలో తామూ భాగస్వాములయ్యామని నిరసనల్లో పాల్గొంటున్న జెహ్రా షేక్ తెలిపారు. బిర్యానీ కోసమే నిరసనల్లో పాల్గొంటున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువు చేసేందుకు ఓట్లు వేశామని మొహమ్మద్ అయూబ్ అన్నారు. ఏ పార్టీ వారు కూడా తమకు బిర్యానీ సరఫరా చేయడం లేదన్నారు. షహీన్బాగ్లో నిరసనకారులకు ఢిల్లీ సీఎం బిర్యానీ అందజేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగికి ఈసీ నోటీసులు పంపింది. సిరా గుర్తుతో ఎంపీ గౌతం గంభీర్ దంపతులు. 9నెలల పాపతో క్లాసికల్ డ్యాన్సర్ అరణ్యని ఓటేసిన 111ఏళ్ల కలితార మండల్ -
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2020 : ఎగ్జిట్ పోల్స్
-
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఎగ్జిట్ పోల్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు-2020 ముగిశాయి. శనివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 58 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్కు సంబంధించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. కాగా పోలింగ్ అనంతరం విడులైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆమ్ఆద్మీ పార్టీకే మొగ్గు చూపాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని చెబుతున్నాయి.ఈ రోజు ఓటింగ్ సమయం ముగిసిన తర్వాత పలు జాతీయ వార్తా ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేశాయి. అందులో మెజారిటీ సర్వేలు ఆప్కే జై కొట్టాయి. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో.. ఆమ్ ఆద్మీ పార్టీకి 54 నుంచి 59 సీట్లు, బీజేపీకి 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్కు 0 నుంచి 2 సీట్ల వరకు గెలుచుకుంటాయని పీపుల్స్ పల్స్ ప్రెడిక్షన్ సర్వే సంస్థ అంచానా వేసింది. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని తెలిపింది. జాతీయవాదంపై జనాకర్షణ విజయం సాధించిందని పేర్కొంది. సంక్షేమ పథకాలు ఆప్నకు అధికారాన్ని అందించనున్నాయని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరోసారి విజయ దుందుబి మోగిస్తుందని టైమ్స్ నౌ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ 44, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది. న్యూస్ ఎక్స్ నేతా ప్రకారం.. ఆప్ 53-57, బీజేపీ 11-17, ఇతరులు0-2 స్థానాల్లో విజయం సాధించనున్నారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం.. ఆప్ 48-61, బీజేపీ 9-21 స్థానాల్లో గెలుపొందనున్నారు. ఇండియా టీవీ సర్వే ప్రకారం ఆప్ 44, బీజేపీ26, స్థానాల్లో విజయం సాధించనున్నారు. జన్కీ బాత్ సర్వే ప్రకారం.. ఆప్ 55, బీజేపీ 15 స్థానాలను కైవసం చేసుకోనున్నాయి. ఇండియా న్యూస్ నేషన్ ప్రకారం. ఆప్ 55, బీజేపీ 14, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందనున్నారు. సుదర్శన్ న్యూస్ సర్వే ప్రకారం.. ఆప్ 40-45, బీజేపీ 24-28, ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధించనున్నారు. -
ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్, స్మృతి ట్వీట్ వార్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు- 2020 ముగిశాయి. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు కొనసాగాయి. సాయంత్రం 5 గంటల వరకు 44.52 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మహిళా ఓటర్లకు ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ చేసిన ఓ విఙ్ఞప్తిని స్మృతి తప్పుబట్టారు. పోలింగ్ మొదలవడానికి ముందు ఆయన తన ట్విటర్ ఖాతాలో.. (చదవండి : ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లైవ్అప్డేట్స్) ‘అందరూ తప్పకుండా ఓటు వేయండి. ముఖ్యంగా మహిళా ఓటర్లందరూ కదలిరండి. మీ కుంటుంబ బాగుకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటారో.. అలాగే దేశాన్ని, ఢిల్లీని మంచి నాయకుల చేతుల్లో పెట్టడానికి నడుం బిగించండి. మీ భర్త సాయం తీసుకుని ఎవరు ఢిల్లీకి సరైన నాయకుడో చర్చించి ఓటు వేయండి. ఇది నా పత్యేక వినతి’ అని ట్వీట్ చేశారు. కాగా, కేజ్రీవాల్ ట్వీట్పై స్పందించిన స్మృతి.. మహిళల్ని ఢిల్లీ సీఎం కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎవరికి ఓటు వేయాలనే స్వేచ్ఛ కూడా మహిళలకు లేదా అని ప్రశ్నించారు. మహిళల్ని కేజ్రీవాల్ తక్కువ చేసి మాట్లాడారని ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్గా ట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ఎవరికి ఓటు వేయాలో ఢిల్లీ మహిళలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు. ఇక ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 11న జరుగనుంది. (చదవండి : కేజ్రీవాల్ ఒక్కడే..) -
ఢిల్లీ పీఠం మాదే.. తివారి జోస్యం
-
ఢిల్లీ పీఠం మాదే.. తివారి జోస్యం
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారి ధీమా వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 50కి పైగా సీట్లను గెలుచుకొని, తమ పార్టీ జాతీయ రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అన్ని వైపులనుంచి ఆ ప్రకంపనలు తనకు వినిపిస్తున్నాయనీ, బీజీపీ తప్పక విజయం సాధిస్తుందని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందంటూ జోస్యం చెప్పారు. ఢిల్లీ ప్రజల ఆశీస్సులతో తమ విజయం తథ్యమని తివారి వెల్లడించారు. అంతేకాదు ప్రజల ఆశీర్వాదాలు ప్రధాని మోదీకి ఉన్నాయనీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయ మన్నారు. ఢిల్లీ ప్రజలు తమకే పట్టం గడతారనీ, తమ విజయం కోసం ఎదురు చూస్తున్నామని తివారి వెల్లడించారు. అయితే, బీజేపీ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేసిన ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పడానికి నిరాకరించారు. కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఈ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 సీట్లను గెలుచుకోగా, బీజేపీ మూడు స్థానాలను మాత్రం దక్కించుకుంది. కాంగ్రెస్కు ఒక్కస్థానం కూడా దక్కలేదు. మరోవైపు గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఏడు స్థానాలను దక్కించుకోవడం విశేషం. చదవండి : ఢిల్లీ ఎన్నికల పోలింగ్ లైవ్అప్డేట్స్ -
ఢిల్లీ ఎన్నికలు : ముగిసిన పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ : చెదురుమదురు ఘటనలు మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 57.06 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటు వేసేందుకు 13,750 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు.70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 5 వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్పీఎఫ్తో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరో రెండు గంటలు మాత్రమే మరో రెండు గంటల్లో ఢిల్లీ ఎన్నికలు ముగియనున్నాయి. కానీ పోలింగ్ శాతం మాత్రం పెద్దగా పెరగడం లేదు. సాయంత్రం నాలుగు గంటలకు 42.20శాతంగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం మూడు గంటలకు 30.18శాతంగా, రెండు గంటలకు 28శాతంగా, ఒంటిగంటకు 19.37శాతంగా పోలింగ్ నమోదైంది. క్రమంగా పెరుగుతున్న పోలింగ్ శాతం దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం మూడుగంటల సమయానికి 30.18శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి కేవలం 28శాతం ,ఒంటిగంటలోపు 19.37 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 12 గంటల సమయానికి 15.57 శాతం నమోదయింది. ఓటేసిన ప్రియాంక గాంధీ కుమారుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ రాజీవ్ వాద్రా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటేసిన పెళ్లికొడుకు లక్ష్మీనగర్ నియోజకవర్గంలోని శాఖర్పూర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం పెళ్లివారి రాకతో సందడిగా మారింది. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. ఓటు వేసి మరీ వెళ్లాడు సదరు పెళ్లికొడుకు. ఆయనతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి రావడం విశేషం. ‘ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన భవిష్కత్ కోసం ఓటు హక్కును వినియోగించుకుకోవాలి. ఓటేసిన తర్వాత నా వివాహ కార్యక్రమానికి వెళ్తాను’ అని పెళ్లి కొడుకు అన్నాడు. కాగా, ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకున్న ఆ కుటుంబానికి ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మందకొడిగా పోలింగ్ దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి కేవలం 19.37 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 12 గంటల సమయానికి 15.57 శాతం నమోదయింది. జాతీయ ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా.. నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు. ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఆయన భార్య నీలూ చంద్ర.. న్యూ మోతిబాగ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్కా ఆగ్రహం మంజు-కా-తిల్లా పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా.. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను శాంతింపజేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతో ఆప్ కార్యకర్తపై అల్కా మండిపడ్డారు. అయితే ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజయ్ సింగ్ తెలిపారు. ‘పొన్ను పరివార్ ఓటు’ హీరోయిన్ తాప్సీ పొన్ను తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ఈ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘పొన్ను పరివార్ ఓటు వేసింది. మీరు ఓటు వేశారా? ప్రతి ఓటు లెక్కించబడుతుంది’ అంటూ క్యాప్షన్ పెట్టారు. తన సోదరి షగున్ పొన్నుతో కలిసి కారులో ఓటు వేయడానికి వెళుతున్న ఫొటోను కూడా ఇన్స్టాగ్రామ్లో తాప్సీ పోస్ట్ చేసింది. బద్దకించకుండా ఓటు వేయండి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ సింగ్.. నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఇక్కడే ఓటు వేశారు. ప్రియాంక గాంధీ వాద్రా.. లోధి ఎస్టేట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బద్దకించకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపునిచ్చారు. ఓటు వేయడం చాలా ముఖ్యమని చెప్పారు. రాహుల్ గాంధీ.. ఔరంగజేబు రోడ్డులో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీసమేతంగా రాష్ట్రపతి ఓటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్.. ప్రెసిడెంట్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ సింగ్.. నిర్మాణ్ భవన్లో ఓటు వేశారు. ఉదయం 11 గంటలకు వరకు 6.96 శాతం పోలింగ్ నమోదయింది. ఎన్నికల విధుల్లో విషాదం ఈశాన్య ఢిల్లీలోని బాబర్పూర్ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉధమ్సింగ్ అనే వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన భౌతిక కాయాన్ని పోలీసులు పోలింగ్ కేంద్రం నుంచి తరలించారు. ఎన్నికల అధికారి మరణంతో కాసేపు పోలింగ్కు అంతరాయం కలిగింది. తర్వాత యథావిధిగా పోలింగ్ కొనసాగింది. మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి సివిల్ లైన్స్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఢిల్లీ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్ కోరారు. మహిళలు తప్పనిసరిగా ఓటు వేయాని విజ్ఞప్తి చేశారు. పనితీరుగా ఆధారంగా హస్తిన వాసులు ఓటు వేస్తారని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమ సిసోడియా.. పాండవ్ నగర్లోని ఎంసీడీ పాఠశాలలో ఓటు వేశారు. ఈవీఎంల మొరాయింపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు పలుచోట్ల అవాంతరాలు ఎదురయ్యాయి. యమునా విహార్లోని సీ10 బ్లాక్ పోలింగ్ బూత్లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 9 గంటలకు వరకు అక్కడ ఓటింగ్ ప్రారంభం కాలేదు. ఎన్నికల సంఘం సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన జనం పోలింగ్ కేంద్రం ముందు బారులు తీరారు. తల్లితో కలిసి ఓటు వేసిన కేంద్ర మంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తన తల్లితో కలిసి కృష్ణానగర్లోని రతన్ దేవి పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. జస్టిస్ ఆర్. భానుమతి.. తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలోని ఎన్ఎండీసీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ.. మాటియాల నియోజవర్గంలో తన ఓటు వేశారు. ఓటు వేసిన జైశంకర్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్.. తుగ్లక్ క్రెసెంట్ ప్రాంతంలోని ఎన్ఎండీసీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడం పౌరుల ప్రాథమిక బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఢిల్లీ పౌరులు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. మంచి భవిష్యత్తు కోసం ఓటు ఈ రోజు ఢిల్లీ ప్రజలు నాణ్యమైన విద్య, తమ పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఓటు వేయబోతున్నారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ప్రతాప్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రవి నేగి పోటీలో ఉన్నారు. భద్రత నడుమ పోలింగ్ ప్రారంభం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అభ్యర్థుల పూజలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే ప్రార్థనాలయాల బాట పట్టారు. ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. హరినగర్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి తాజిందర్ పాల్ సింగ్ ఈ ఉదయం ఫతేనగర్ గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాల తనిఖీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను పెంచారు. జామియా ప్రాంతంలో శనివారం తెల్లవారుజాము నుంచి వాహనాలను భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో వాహనాల సోదాలు కొనసాగాయి. పోలింగ్కు సిద్ధం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు వేసేందుకు 13,750 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. 1.47 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 70 స్థానాలకు 672 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5 వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్పీఎఫ్తో బందోబస్తు ఏర్పాటు చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై షహీన్బాగ్లో నిరసనలు, జేఎన్యూలో హింస వంటి ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు ఓటింగ్పై నగర ప్రజల్లో నిరాసక్తత పోగొట్టడానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఓటర్లను గుర్తించడానికి ఎన్నికల సిబ్బంది క్యూఆర్ కోడ్స్, మొబైల్ యాప్స్ని వాడుతున్నారు. ఓటర్లు స్మార్ట్ ఫోన్లను వెంట తెచ్చుకోవడానికి కూడా అనుమతినిచ్చారు. ఓటరు కార్డు లేకపోయినా క్యూ ఆర్ కోడ్తో స్కాన్ చేసి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు. షహీన్బాగ్లో నిరసనకారుల్ని ఎన్నికల సిబ్బంది స్వయంగా కలుసుకొని ఓటు వేయాలని కోరారు. ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలిరావడానికి వీలుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచే కార్యక్రమాలను ఈసీ చేపట్టింది. ఓటర్లను పోలింగ్ బూత్లకు ఉచితంగా చేరవేస్తామని టూవీలర్ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ప్రకటించింది. మూడు కిలోమీటర్ల వరకు ఓటర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపింది. కాగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 28 మంది, పటేల్నగర్ నుంచి అతి తక్కువగా నలుగురే పోటీలో ఉన్నారు. -
నేడే ఢిల్లీ పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం నాటి పోలింగ్కు ఎన్నికల సంఘం(ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రణ్బీర్ సింగ్ వెల్లడించారు. పౌరసత్వ సవరణ చట్టంపై షహీన్బాగ్లో నిరసనలు, జేఎన్యూలో హింస వంటి ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 75 వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్పీఎఫ్ను బందోబస్తు కోసం వినియోగించుకుంటున్నట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీర్ రంజన్ వెల్లడించారు. ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు ఓటింగ్పై నగర ప్రజల్లో నిరాసక్తత పోగొట్టడానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఓటర్లను గుర్తించడానికి ఎన్నికల సిబ్బంది క్యూఆర్ కోడ్స్, మొబైల్ యాప్స్ని వాడుతున్నారు. ఓటర్లు స్మార్ట్ ఫోన్లను వెంట తెచ్చుకోవడానికి కూడా అనుమతినిచ్చారు. ఓటరు కార్డు లేకపోయినా క్యూ ఆర్ కోడ్తో స్కాన్ చేసి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు. షహీన్బాగ్లో నిరసనకారుల్ని ఎన్నికల సిబ్బంది స్వయంగా కలుసుకొని ఓటు వేయాలని కోరారు. ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలిరావడానికి వీలుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచే కార్యక్రమాలను ఈసీ చేపట్టింది. ఓటర్లను పోలింగ్ బూత్లకు ఉచితంగా చేరవేస్తామని టూవీలర్ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో ప్రకటించింది. మూడు కిలోమీటర్ల వరకు ఓటర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపింది. కాగా, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 28 మంది, పటేల్నగర్ నుంచి అతి తక్కువగా నలుగురే పోటీలో ఉన్నారు. కేజ్రీవాల్కు ఈసీ నోటీసు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈసీ నోటీసులు జారీ చేసింది. శనివారం సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇతర పార్టీలన్నీ సీఏఏ, హిందూ–ముస్లిం, మందిరం–మసీదు గురించే మాట్లాడుతుండగా కేజ్రీవాల్ మాత్రం అభివృద్ధి, సంక్షేమం గురించే చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇది నిబంధనావళిని ఉల్లంఘించడమేనంటూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తం స్థానాలు: 70 మొత్తం ఓటర్లు: 1.47 కోట్లు బరిలో ఉన్న అభ్యర్థులు: 672 పోలింగ్ బూత్లు: 13, 750 కేజ్రీవాల్ పనితీరు భేష్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్పై శివసేన పార్టీ ప్రశంసలు కురిపించింది. ‘అయిదేళ్లలో ఆప్ సర్కార్ చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేపట్టింది. ఢిల్లీ మోడల్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలను అమలు చేయాలి’ అంటూ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది. ప్రధాని, కేంద్ర మంత్రులు, 200 మంది ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కలిసి వచ్చినా కేజ్రీవాల్దే పైచేయి అని ఆ సంపాదకీయంలో పేర్కొంది. -
రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
కేజ్రీవాల్ ఒక్కడే..
ముంబై : మరికొన్ని గంటల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్పై శివసేన ప్రశంసలు గుప్పించింది. ఓట్ల వేటలో బీజేపీ మతపరమైన విభజనకు పాల్పడుతున్న క్రమంలో ఆ పార్టీ కుయుక్తులను కేజ్రీవాల్ దీటుగా ఎదుర్కొంటున్నారని పేర్కొంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఓటమితో ఢిల్లీలో గెలిచేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, బీజేపీ సీఎంలు, 200 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో దిగగా వారందరినీ కేజ్రీవాల్ ఒక్కడే ఎదుర్కొంటున్నారని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన వ్యాఖ్యానించింది. గత ఐదేళ్లలో తన ప్రభుత్వం చేపట్టిన పనుల ఆధారంగా కేజ్రీవాల్ ఢిల్లీ ఓటర్లను ఓట్లు కోరుతున్నారని, పార్టీలకు అతీతంగా దీన్ని అందరూ స్వాగతించాలని పేర్కొంది. ఎండిన చెరువులో కమలం వికసించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేసింది. ఢిల్లీ ప్రజలు తెలివైనవారని ఎవరిని ఎంచుకోవాలో వారికి తెలుసునని వ్యాఖ్యానించింది. ఆప్ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్ ఆటంకాలు సృష్టిస్తోందని దుయ్యబట్టింది. కేంద్రం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిమిత అధికారాలతోనే కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యా, వైద్య, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మంచి పురోగతి సాధించిందని పేర్కొంది. మోదీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ కేజ్రీవాల్ తరహాను అనుసరించాలని శివసేన హితవు పలికింది. కేజ్రీవాల్ ఎంతగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అభినందించాల్సిన కేంద్రం అవరోధాలు సృష్టిస్తోందని ఆరోపించింది. కేజ్రీవాల్ను బీజేపీ నేతలు ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని సేన తప్పుపట్టింది. ఉగ్రవాదైతే ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 2015లో 70 శాతం ఢిల్లీ ఓటర్లు ఉగ్రవాదికి ఓటు వేశారని బీజేపీ భావిస్తోందా అని ప్రశ్నించింది. చదవండి : బీజేపీలో సరైన సీఎం అభ్యర్ధి లేరు.. -
ముగిసిన ‘ఢిల్లీ’ ప్రచారం
న్యూఢిల్లీ: వాడివేడిగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికలు ఈ నెల 8వ తేదీన జరగనున్నాయి. ఫలితాలు 11వ తేదీన వెలువడుతాయి. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనలకు కేంద్రంగా మారిన షహీన్బాఘ్ అంశాన్ని బీజేపీ, తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రచారాంశాలుగా చేపట్టాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా∙సహా పార్టీలోని మహామహులను బీజేపీ ప్రచారరంగంలోకి దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం అంతా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంగానే సాగింది. బీజేపీ, ఆప్ల స్థాయిలో కాంగ్రెస్ ప్రచారం సాగలేదు. మనోజ్ తివారీ డ్యాన్స్ నాకిష్టం బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మనోజ్ తివారీని తాను ఎగతాళి చేశానన్న వార్తలను ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఖండించారు. తనకు నిజంగానే తివారీ పాటలన్నా, డాన్స్లన్నా ఇష్టమన్నారు. తివారీ భోజ్పురి నటుడన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా తాను మనోజ్ తివారీ పాటలను, డ్యాన్స్లను చూడాలని ప్రజలను కోరుతానని కేజ్రీవాల్ గురువారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తివారీని ఎగతాళి చేసి పూర్వాంచల్ వాసులను తాను అవమానించానన్న విమర్శలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. తూర్పు ఉత్తరప్రదేశ్, బిహార్లకు చెందిన పూర్వాంచల్ వాసులు ఢిల్లీలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ 67 సీట్లను ఆప్ గెలుచుకుంది. మూడింటిలో బీజేపీ విజయం సాధించింది. -
యోగి బిర్యానీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షహీన్బాగ్కు బిర్యానీలు సరఫరా చేస్తున్నారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలకు గాను ఈసీ గురువారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయవాదం, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే మరోవైపు కాంగ్రెస్, కేజ్రీవాల్ విభజిత శక్తులకు తోడ్పాటు అందిస్తున్నారని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యానాథ్ అన్నారు. ఉగ్రవాదంపై మోదీ సర్కార్ రాజీలేని పోరు జరుపుతుంటే షహీన్బాగ్ ఆందోళనలకు మద్దతిస్తూ నిరసనకారులకు బిర్యానీ తినిపిస్తున్నారని మండిపడ్డారు. యోగి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఈనెల 7 సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా 11న ఫలితాలను వెల్లడిస్తారు. చదవండి : ‘వాళ్లకు బిర్యానీ కాదు బుల్లెట్ దింపాలి’ -
‘షాహీన్ బాగ్.. సుసైడ్ బాంబర్ల శిక్షణ కేంద్రం’
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షాహీన్ బాగ్లో సుపైడ్ బాంబర్లను(ఆత్మాహుతి దళాలు) తయారు చేసేందుకు శిక్షణ ఇస్తున్నారని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణలు చేశారు. ‘‘షాహిన్బాగ్లో జరిగేది కేవలం ఉద్యమం కాదు. అక్కడ సూసైడ్ బాంబర్లు శిక్షణ పొందుతున్నారు. రాజధానిలో దేశానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది’’ అని గురువారం ట్విటర్లో తెలిపారు. షాహీన్బాగ్ ఆత్మాహుతి దళాలను పెంపొందిస్తున్న కేంద్రంగా మారిందని ఆరోపించారు. (‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?) పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్లో గత ఏడాది డిసెంబర్ 18 నుంచి ముస్లింలు తీవ్ర ఆందళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు దీనిని కీలక ప్రచార అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. అధికారం కోసం బీజేపీ షాహీన్బాగ్పై మురికి రాజకీయాలు చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్, ఆప్ మద్దతుతోనే ఆందోళనకారులు రహదారులను అడ్డగించి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తాము అధికారంలోకి వచ్చాక శిబిరాన్ని తొలగిస్తామని బీజేపీ నేతలు ప్రసంగాలు చేస్తున్నారు. చదవండి : షహీన్ బాగ్పై మరో నకిలీ వీడియో! यह शाहीन बाग़ अब सिर्फ आंदोलन नही रह गया है ..यहाँ सूइसाइड बॉम्बर का जत्था बनाया जा रहा है। देश की राजधानी में देश के खिलाफ साजिश हो रही है। pic.twitter.com/NoD98Zfwpx — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) February 6, 2020 -
బీజేపీలో సరైన సీఎం అభ్యర్ధి లేరు..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో ఢిల్లీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టే స్ధాయి గల నేత ఎవరూ లేరని ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని, మీ పార్టీ నుంచి సంబిట్ పాత్రా లేక అనురాగ్ ఠాకూర్ను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తారా అని కేజ్రీవాల్ కాషాయ పార్టీని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మతపరంగా విడదీసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఆ ప్రయత్నంలో బీజేపీ విజయవంతమైందా లేదా అనేది ఫలితాలు వెల్లడిస్తాయన్నారు. ఆప్ ఓటర్లు మెరుగైన విద్య, వైద్యం, ఆధునిక రహదారులు, 24 గంటల విద్యుత్ను కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే షహీన్బాగ్లో సీఏఏ వ్యతిరేక నిరసనలపై బీజేపీ మౌనం దాల్చిందని ఆరోపించారు. షహీన్బాగ్ రోడ్ను క్లియర్ చేయడంలో హోంమంత్రి అమిత్షాకు ఏం అడ్డంకి ఎదురైందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆ రహదారిని బ్లాక్ చేయడం వల్ల ఆయనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది..ఢిల్లీ ప్రజలకు ఎందుకు ఇబ్బందులు కలిగించారు..నిరసనలపై దిగజారుడు రాజకీయాలను ఎందుకు చేస్తున్నారంటూ ఆయన బీజేపీని నిలదీశారు. ఢిల్లీలో అనధికార కాలనీల సమస్యలను పూర్తిగా విస్మరించిన బీజేపీ నేతలు ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆప్ తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలు కొనసాగుతాయని, అవసరమైతే ఇలాంటి పథకాలను మరికొన్ని చేపడతామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. చదవండి : ఆప్ కే సాథ్ ! -
‘కాల్చి వేయండి’ అన్నా చర్య తీసుకోరా!?
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచారానికి ఈ రోజు చివరి రోజు కావడంతో పాలకపక్ష ఆప్, బీజేపీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్తోపాటు ఆప్ పార్టీ ముఖ్య నేతలు వీధి వీధిన ప్రచారం చేస్తుండగా, బీజేపీ తరఫున అమిత్ షా, మోదీలతోపాటు ‘దేశ ద్రోహులను కాల్చేయండి’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునివ్వడం ద్వారా మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారానికి దూరమైన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తిరిగి ప్రచారానికి వచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షహీన్ బాగ్లో ఆందోళన చేస్తున్న వారంతా దేశద్రోహులని వారిని కాల్చేయండంటూ అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చిన అనంతరం మూడు చోట్ల ఆందోళనకారులపై కాల్పులు జరిగాయి. ‘మా పిల్లలను ఎవరో తప్పుదోవ పట్టించడంతో గందరగోళంలో కాల్పులు జరిపారు’ అని మరో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సమర్థించారు. ఇంత బహిరంగంగా హింసాకాండను ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులను బీజేపీ అధిష్టానం కనీసం మందలించక పోవడం ఏమిటని ఎన్నికల ప్రచారంలో ఆప్ నాయకులు నిలదీస్తున్నారు. ‘పౌరసత్వం నిరూపణకు డాక్యుమెంట్లు అడిగితే వారిని కొట్టండి’ అనే అభ్యంతరకర వ్యాక్యం కర్ణాటక ముస్లిం పాఠశాలలో వేసిన ఓ నాటకంలో ఉన్నందుకు తొమ్మిది నుంచి పన్నేండేళ్ల పిల్లలను ఐదు రోజులపాటు పోలీసులు ఇంటరాగేట్ చేయడంతోపాటు, దేశ ద్రోహం కేసు కింద ఓ టీచర్ను, ఓ పేరెంట్ను అరెస్ట్ చే యడాన్ని ఆప్ నేతలు ప్రస్తావిస్తున్నారు. ‘సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా నోరు విప్పితే దేశద్రోహం కేసు పెడతారా? అదే ఆందోళనకారులను కాల్చేయండంటూ పిలుపునిస్తే ఎలాంటి చర్య తీసుకోరా?’ ఇదేమి ప్రజాస్వామ్యం అని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: షహీన్ బాగ్పై మరో నకిలీ వీడియో!) -
ఆప్ కే సాథ్ !
ఇన్నాళ్లూ మూడు స్తంభాలాట అన్నారు. ఇప్పుడు ముఖాముఖి పోరనే అంటున్నారు. రాజధాని రణ రంగంలో ఆప్, బీజేపీల మధ్యే ఎన్నికల యుద్ధం జరుగుతోంది. పోలింగ్కు ముందే కాంగ్రెస్ కాడె దింపేసింది. బీజేపీ కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. జనం ఆప్ కే సాథ్ అంటున్నారని వివిధ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఏడాది క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 57శాతం ఓట్లతో ఏడుకి ఏడు లోక్సభ స్థానాల్లోనూ బీజేపీ విజయఢంకా మోగించింది. ఏడాదిలోనే బీజేపీకి ఏటికి ఎదురీడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ► ఢిల్లీలో నిరుపేదల సంఖ్య మిగిలిన హిందీ బెల్ట్ రాష్ట్రాలతో పోలిస్తే తక్కువే. 2015–16 జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా దుర్భర దారిద్య్రంలో మగ్గిపోతున్నవారు 20శాతంగా ఉంటే, ఢిల్లీలో మాత్రం 0.2% మాత్రమే ఉన్నారు. దీని వల్ల ఉజ్వల యోజన పథకం కింద ఢిల్లీ జనాభాలో 2% మాత్రమే లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలన్నీ నిరుపేదల్ని ఉద్దేశించినవి కావడంతో ఆప్ సర్కార్ వాటిని అమలు కూడా చేయడం లేదు. ► ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతిని కూడా ఆకర్షించేలా తన సొంత సంక్షేమ ఎజెండాతో ముందుకు వెళుతూ ఎన్నో ఉచితాలు ప్రకటించింది. అందులో ఉచితంగా నెలకి 20 వేల లీటర్ల నీళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అత్యధికుల్ని ఆకర్షిస్తోంది. ► ఆప్ అవినీతి రహిత పరిపాలన అందిస్తోంది. సీఎం అరవింద్ కేజ్రివాల్ సుపరిపాలనే ఎజెండాగా తీసుకున్నారు. విపక్షాలు కొన్నాళ్లు ఆప్ సర్కార్లో అవినీతి జరుగుతోందని గగ్గోలు పెట్టినా దానికి ఆధారాలేమీ లేవు. ఎన్నికల ప్రచారంలో ఆ ఊసే లేదు. ► అవినీతి లేని ప్రభుత్వాలు కావాలంటే ప్రధానిగా మోదీ, ముఖ్యమంత్రిగా కేజ్రివాలే ఉత్తమమని ఓటర్లు ముందుగానే ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తోందని ఎన్నికల విశ్లేషకుల అంచనా. ► 2019 లోక్సభ ఎన్నికల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లు సాధించింది. 2017 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చతికిలపడిపోయిన ఆప్ తన రాజకీయ వ్యూహాలను మార్చుకుంది. కశ్మీర్లో ఆర్టికల్ 370కి మద్దతునిచ్చింది. సీఏఏకి వ్యతిరేక ప్రదర్శనల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ అన్న అభిప్రాయం మైనార్టీల్లో వచ్చి ఆ పార్టీ వైపు వెళ్లారు. కానీ ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉండడంతో ఆప్కే లబ్ధి చేకూరే అవకాశాలున్నాయని అంచనా. ► ఢిల్లీ ఓటరు ఎన్నికల ఎన్నికలకీ తన తీర్పుల్ని తానే తిరగరాస్తూ ఉంటాడు. 2013 ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్కి సమానంగా స్థానాలిచ్చిన ఓటర్లు ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అక్కున చేర్చుకున్నారు. 2015లో ఆప్ వెంటే నడిస్తే, ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ ఆశలపై నీళ్లు చల్లారు. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఈ సారి ఆప్ వెంట నడుస్తారని సర్వేలు చెబుతున్నాయి. – న్యూఢిల్లీ -
సర్వత్రా ‘ఢిల్లీ’ ఉత్కంఠ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు హోరాహోరీగా జరిగిన ప్రచారం గురువారం సాయంత్రంతో సమాప్త మవుతుంది. ప్రచారం మొదలైన కొన్ని రోజుల వరకూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సాధించిన విజయాలపైనా, దాని వైఫల్యాలపైనా సాగుతున్నట్టు కనబడిన చర్చంతా పది పన్నెండు రోజులుగా కొత్త మలుపు తిరిగింది. ఢిల్లీకి అవసరమైన మౌలిక సదుపాయాలు, వాటిని తీర్చడానికి ఎదురవుతున్న అవరోధాలు, జవాబుదారీ తనం వగైరా అంశాలు ప్రస్తావనకొస్తుండగా దాన్ని తనకనుకూలమైన దోవకు మళ్లించడంలో బీజేపీ సఫలమైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా షాహీన్బాగ్లో మహిళలు సాగిస్తున్న ఆందోళనపై కేంద్రీకరించి, జాతీయ భద్రతను ప్రధాన అంశంగా మార్చి మీరెటు వైపో తేల్చు కోవాలంటూ పౌరులకు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రజలు స్థానిక అంశాలనూ, ఆప్ ప్రభుత్వ సాఫల్య వైఫల్యాలను పరిగణనలోకి తీసుకుని ఓట్లేస్తారా లేక బీజేపీ కోరుకున్నట్టు జాతీయ భద్రతే ప్రధాన మనుకుంటారా అన్నది చూడాల్సివుంది. 8వ తేదీ సాయంత్రం పోలింగ్ ముగిశాక వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఈసారి గాలి ఎటు వీచిందో చెప్పగలిగే అవకాశం వుంది. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా 11న అసలు ఫలితాలు వెలువడే వరకూ ఉత్కంఠ తీరదు. ఢిల్లీ పౌరులు ఏం ఆలోచిస్తున్నారో, చివరకు ఎటువైపు మొగ్గుతారో నిర్ణయించడం అంత సులభమేమీ కాదు. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి అక్కడున్న ఏడు స్థానాలనూ కట్టబెట్టిన ప్రజలు, మరికొన్ని నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు భారీ ఆధిక్యతతో అధికారం అప్పగించి అందరి అంచనాలనూ తలకిందులు చేశారు. మొత్తం 70 స్థానాల్లో ఆప్కు 67 రాగా, మిగిలిన మూడు బీజేపీకి దక్కాయి. అప్పుడు ఆప్ నెగ్గుతుందని కానీ, నెగ్గినా ఈ స్థాయిలో సీట్లొస్తాయని గానీ ఏ సర్వే చెప్పలేకపోయింది. ఇంచుమించు ప్రతి సర్వే కూడా బీజేపీకి 40కి మించి స్థానాలొస్తాయని, ఆప్కి అంతక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెచ్చుకున్న 28 స్థానాలకు మించిరావని, ఇంకా తగ్గినా ఆశ్చర్యం లేదని చెప్పాయి. ఈ లెక్కలన్నీ 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకొచ్చిన 46.40 శాతం ఓట్ల ఆధారంగా వేసినవే. ఎనిమిది నెలలక్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ 2014నే పునరావృతం చేసింది. ఆ పార్టీకి అంతక్రితం కంటే మెరుగ్గా 56.58 శాతం ఓట్లు లభించాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆప్ ఏడు చోట్లా ఓడిపోయినా 32.90శాతం ఓట్లు గెల్చుకుంది. కానీ మొన్న లోక్సభ ఎన్నికల్లో దానికి కేవలం 18 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఒక్కచోట అది రెండో స్థానంలోకి రాగలిగింది. మిగిలిన ఆరుచోట్లా రెండో స్థానం కాంగ్రెస్దే. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆ ఫలితాలను బేరీజు వేస్తే బీజేపీ 65 స్థానాల్లో ఆధిక్యత చూపగా, కాంగ్రెస్ అయిదు చోట్ల ఆధిక్యత తెచ్చుకుంది. ఆప్ సున్నా చుట్టింది. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల అనుభవం తర్వాత బీజేపీ భరోసాగా లేదు. ‘మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పండ’న్న కేజ్రీవాల్ సవాలుకు బీజేపీ జవాబీ యలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి విషయమై ఇలాగే చర్చ సాగింది. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని అప్పట్లో పార్టీలో చేర్చుకుని, ఆమెను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. కానీ ఆ నిర్ణయం వికటించింది. అందువల్లే ఈసారి అలా ఎవరినీ ప్రకటించే సాహసం చేయలేదు. బీజేపీ ప్రచార బాధ్యతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన భుజస్కంధాలపై వేసు కున్నారు. పలు సభల్లో ప్రసంగించడంతోపాటు, కొన్నిచోట్ల ఇంటింటి ప్రచారం చేశారు. ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలన్నిటిలోనూ జాతీయ భద్రత, 370 అధికరణ రద్దు తదితర అంశాలే విస్తృతంగా ప్రచారమయ్యాయి. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఢిల్లీలో మోహరించారు. దేశద్రోహుల్ని కాల్చిచంపాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సభల్లో నినా దాలు చేయించడం, మరో ఎంపీ షాహీన్బాగ్ ఆందోళనకారులు ఇళ్లల్లోకి చొరబడి అరాచకాలు సృష్టి స్తారంటూ ప్రకటించడం వివాదాస్పదమయ్యాయి. వేదికలపై ఇలా జాతీయ భద్రతను హోరె త్తించినా మేనిఫెస్టోను మాత్రం బీజేపీ స్థానిక అంశాలతో నింపింది. ఇంటింటికీ రక్షిత మంచినీరు, వలస కార్మికులు నివసించే కాలనీల అభివృద్ధి, ఆడపిల్ల పుడితే రూ. 2 లక్షల సాయం, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి వాగ్దానాలు చేసింది. బీజేపీ, ఆప్ కూడా పరస్పరం ప్రభావితమవుతున్నాయని రెండు పార్టీల మేనిఫెస్టోలు గమనిస్తే అర్థమవుతుంది. గత అయిదేళ్లలో కేజ్రీవాల్ అమలు చేసిన అంశాలు గమనంలోకి తీసుకుని బీజేపీ మేనిఫెస్టో రూపొందిస్తే... బీజేపీ లేవనెత్తుతున్న అంశాల విషయంలో ఆప్ అత్యంత జాగరూకతతో అడుగులేసింది. షాహీన్బాగ్పై మీ వైఖరేమిటన్న ప్రశ్నకు నేరుగా జవాబివ్వడానికి ఆప్ సిద్ధపడలేదు. పైగా మళ్లీ అధికారంలో కొచ్చాక పాఠశాలల్లో దేశభక్తిపై పాఠాలు పెడతామని వాగ్దానం చేసింది. పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే రూ. కోటి ఇస్తామని చెప్పడం అందరి ప్రశంసలూ పొందింది. 20,000 లీటర్ల వరకూ ఉచితంగా నీరు, 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్, ప్రభుత్వ పాఠశాలల సమూల మార్పు, మొహల్లా క్లినిక్లు, మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం, కాలనీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు వంటివి కేజ్రీవాల్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసింది. కేంద్రం సృష్టించిన అవ రోధాలు అధిగమించి సుప్రీంకోర్టు తీర్పుతో ఏడాదిన్నరగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని కేజ్రీవాల్ చెప్పడాన్ని జనం సానుకూలంగా తీసుకున్నారు. కాంగ్రెస్ రంగంలోవున్నా దాన్నెవరూ పట్టించుకునే స్థితి లేదు. మొత్తానికి బీజేపీ ప్రచార హోరుతో ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో వెలువడే తీర్పుపై దేశమంతా ఉత్కంఠ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో విజయం మాటెలావున్నా, 2015 ఎన్నికల్లో కేజ్రీవాల్ సాధించిన మెజారిటీని మాత్రం పునరావృతం చేయనీయరాదన్న కృత నిశ్చయం బీజేపీలో కన బడింది. ఓటరు నాడి తెలిసేది మరికొన్ని రోజుల్లోనే. -
ఓటు కోసం వెళితే పెళ్లి ప్రపోజల్స్..
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్ధిగా బరిలో నిలిచిన రాఘవ్ చదాకు ఓట్ల సంగతేమో కానీ పెళ్లి సంబంధాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఆయన ఎక్కడికి వెళ్లినా పెళ్లి ప్రపోజల్స్తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరి ఇవి ఓట్ల రూపంలో ఎంతవరకూ మారతాయో తెలియకపోయినా ఇప్పటివరకూ కనీసం 12 పెళ్లి ప్రతిపాదనలు ముందుకొచ్చాయని ఆయన సోషల్ మీడియా బృందం వెల్లడించింది. వృత్తి రీత్యా సీఏ అయిన 31 సంవత్సరాల రాఘవ్ చదా ఢిల్లీలోని రాజిందర్ నగర్లో ఆప్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజూ పలు రోడ్షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్న క్రమంలో ఆయా సభల ఫోటోలు, వీడియోలను ఆయన సోషల్ మీడియా టీం తన ఇన్స్టాగ్రాం, ట్విటర్ ఖాతాల్లో పోస్ట్ చేస్తోంది. మహిళా ఫాలోయర్ల నుంచి చదాకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయని ఆయన సోషల్మీడియా బృందం పేర్కొంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా ఫాలోయర్ చదాకు ప్రపోజ్ చేయగా, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగాలేనందున పెళ్లి చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదని చదా తెలివిగా బదులిచ్చారని తెలిపింది. ప్రచారంలో భాగంగా ఆయన ఓ స్కూల్కు వెళ్లగా అక్కడున్న టీచర్ ఒకరు తనకు కుమార్తె ఉంటే మీకిచ్చి వివాహం చేసేదాన్నని చదాతో చెప్పుకొచ్చారని ఆయన సోషల్ మీడియా బృందం పేర్కొంది. ఇక ‘మీకు పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నా మీరు పెళ్లి మాత్రం చేసుకోవద్దని అలా చేస్తే తన గుండె ముక్కలవుతుంద’ని ఓ మహిళ ఆప్ నేత ఇన్స్టాగ్రాంలో ఆయనను వేడుకున్నారు. ట్విటర్లో మరో మహిళ చదాను ఉద్దేశించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎరౌండ్ అంటూ ఓ స్టోరీని షేర్ చేశారు. చదాపై బీజేపీ సీనియర్ నేత ఆర్పీ సింగ్ పోటీచేస్తుండగా, కాంగ్రెస్ నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనే అత్యంత పిన్న వయసు కలిగిన పాతికేళ్ల రాకీ తుసీడ్ బరిలో నిలిచారు. చదవండి : మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తారు.. -
మానసిక వేదనకు గురయ్యా..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ తనను ఉగ్రవాదిగా అభివర్ణించడంతో మానసిక వేదనకు గురయ్యానని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ సేవ కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని.. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నానని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఒకవేళ తాను ఉగ్రవాదిలా కనిపిస్తే కమలానికి ఓటెయ్యాలని లేదంటే చీపురు గుర్తు ఉన్న బటన్ నొక్కాలని విఙ్ఞప్తి చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ కేజ్రీవాల్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.(అందుకేనా మా నాన్న ఉగ్రవాది...?) ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బుధవారం మాట్లాడుతూ... ‘‘ఆయన మాటలకు నేను చాలా బాధపడ్డాను. మా కుటుంబం, పిల్లల కోసం నేనేమీ చేయలేదు. ఐఐటీలోని నా బ్యాచ్మేట్లలో 80 శాతం మంది విదేశాల్లో స్థిరపడ్డారు. నేను మాత్రం దేశ సేవకే అంకితమయ్యాను. ఇన్కం ట్యాక్స్ కమిషనర్ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాను. నేను ఉగ్రవాదినా కాదా అన్న విషయాన్ని ఢిల్లీ ప్రజలకే వదిలేస్తున్నా. ఒకవేళ నేను ఉగ్రవాదిని అనుకుంటే ఫిబ్రవరి 8న కమలం ఉన్న బటన్పై నొక్కండి. ఒకవేళ ఢిల్లీ ప్రజల కోసం, దేశం కోసం పనిచేశానని భావిస్తే చీపురుకట్ట గుర్తుపై నొక్కండి’’ అని విఙ్ఞప్తి చేశారు.(ఆ ఫొటోలు ఆనాటివి.. వాళ్లతో సంబంధం లేదు!) -
ఆ ఫొటోలు ఆనాటివి.. వాళ్లతో సంబంధం లేదు!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసులతో కలిసి కుట్రకు తెరతీశారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్ బాగ్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ గుజ్జార్ అనే వ్యక్తి నిరసనకారులపై కాల్పులకు దిగాడు. ఇక ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్న క్రమంలో బీజేపీ- ఆప్ నేతలు షాహిన్బాగ్ కాల్పుల విషయంలో పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా కపిల్ గుజ్జార్ ఆప్నకే చెందిన వ్యక్తి అని బీజేపీ ఆరోపించగా.. ఆప్ నేతలు వారి విమర్శలను తిప్పికొట్టారు.(దీనినే ఉగ్రవాదం అంటారా: సీఎం కుమార్తె) ఈ నేపథ్యంలో కపిల్.. ఆప్నకే చెందినవాడంటూ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆప్ నేతలతో కపిల్ దిగిన ఫొటోలు విడుదల చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన కపిల్ కుటుంబ సభ్యులు.. తమకు ఆప్తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ నేతలు తమ ఇంటికి వచ్చినప్పుడు ఆప్ క్యాపులు ధరించి ఫొటోలు దిగామని పేర్కొన్నారు. పోలీసులు ఇప్పుడు చూపిస్తున్న ఫొటోలు అవేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్... ‘‘కాల్పులు జరిపేంత సామర్థ్యం మాకు ఉందని మీరు భావిస్తున్నారా? కాల్పులు జరిపిన వ్యక్తి కుటుంబమే మా పార్టీతో వాళ్లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలింగ్కు ఇంకా 48 గంటలే సమయం ఉన్నందున వాళ్లు(బీజేపీ) పోలీసులను ప్రయోగిస్తున్నారని ఎవరైనా చెప్పగలరు’ అని వ్యాఖ్యానించారు. -
అందుకేనా మా నాన్న ఉగ్రవాది...?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ బీజేపీ నాయకులు చేసిన విమర్శలను ఆయన కుమార్తె హర్షిత కేజ్రీవాల్ తప్పుబట్టారు. రాజకీయాలంటేనే బురద అంటారు.. అయితే అవి ఇప్పుడు మరింత దిగజారిపోయాయని వ్యాఖ్యానించారు. ఉచితంగా వైద్య సేవలు అందించడం, పిల్లలలకు మంచి విద్య అందించడాన్ని ఉగ్రవాదం అంటారా అని ప్రశ్నించారు. విద్యుత్, నీటి సరఫరా విషయంలో ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నందుకు కేజ్రీవాల్ను ఉగ్రవాది అంటున్నారా అంటూ బీజేపీ నాయకుల విమర్శలను తిప్పికొట్టారు. కాగా ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఆప్, బీజేపీ ప్రచార జోరును పెంచాయి. పరస్పరం విమర్శల దాడికి దిగుతూ.. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సహా మరికంత మంది నాయకులు కేజ్రీవాల్ ఓ ఉగ్రవాది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.(ఢిల్లీలో మళ్లీ ఆప్కే ఎందుకు పట్టం!?) ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కుమార్తె హర్షిత బుధవారం మాట్లాడుతూ... ‘‘మా నాన్న ఎన్నో ఏళ్లు ప్రజలకు సేవ చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆయన క్రమశిక్షణ కలిగిన మనిషి. రోజూ ఉదయం ఆరు గంటలకే నన్ను, మా అమ్మను, సోదరుడిని నిద్రలేపేవారు. భవద్గీత చదివించేవారు. సోదర భావం పెంపొందించేందుకు.. ‘ఇన్సాన్ సే ఇన్సాన్ కా హో భాయిచారా’ వంటి పాటలు పాడిస్తూ వాటి అర్థం చెప్పేవారు. ఇది టెర్రరిజమా? లేదా అందరికీ విద్య అందించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం ఉగ్రవాదమా? ఎలాంటి ఆరోపణలైనా చేసుకోండి.. 200 మంది ఎంపీలను, 11 మంది ముఖ్యమంత్రులను తీసుకువచ్చుకోమని చెప్పండి. మేమే కాదు.. 2 కోట్ల మంది సామాన్యులు ఆప్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 11న వారు వేసే ఓట్లే మా నాన్నపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు తప్పు అని నిరూపిస్తాయి’’అని పేర్కొన్నారు. కాగా ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆయన కుమార్తె హర్షిత ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.(పాక్ జోక్యం సహించం: ప్రధానికి కేజ్రీవాల్ మద్దతు!) Harshita Kejriwal,Delhi CM Arvind Kejriwal's daughter: They say politics is dirty but it's a new low. Is it terrorism if health facilities are made free&brought to people?Is it terrorism if children are made educated?Is it terrorism if electricity&water supply are improved?(04.2) pic.twitter.com/hClnayFJTC — ANI (@ANI) February 5, 2020 -
మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తారు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారానికి ఇంకా మూడు రోజల గడువు మాత్రమే ఉండటంతో విమర్శలకు పదునుపెడుతున్నారు. ప్రచారంలో భాగంగా నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. మోదీ దేశంలోని ప్రతీది ప్రైవేటు పరం చేస్తున్నారని, ఏదో ఒక రోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ మహల్ను కూడా అమ్మేస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని జంగ్పురాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. (‘మోదీజీ.. మాయాజాల వ్యాయామం మరింత పెంచండి’) ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా అనే మంచి నినాదాన్ని తీసుకొచ్చిన మోదీ ఆగ్రాలో కనీసం ఒక్క ఫ్యాక్టరీని కూడా నిర్మించలేదని విమర్శించారు. మతంపై ప్రధానికి అవగాహన లేదని, దేశ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై మోదీ సర్కార్ను టార్గెట్ చేసిన రాహుల్.. రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని మండిపడ్డారు. యువత తరఫున తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భయపడకూడదని హితవు పలికారు. అదే విధంగా ఢిల్లీలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏం చేశారని ప్రశ్నించారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచార బరిలో దిగడం ఇదే తొలిసారి. జంగ్పురా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తార్విందర్ సింగ్ మార్వాకు మద్దతుగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. -
కేజ్రీ సర్కార్పై మోదీ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఢిల్లీ సర్కార్ ప్రజా సమస్యలను విస్మరించిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీ వాసులకు ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మించేందుకు ఆప్ సర్కార్ చొరవ చూపలేదని దుయ్యబట్టారు. రానున్న ఢిల్లీ ఎన్నికలు ఈ దశాబ్ధంలో తొలి ఎన్నికలని భారత్ భవితవ్యానికి ఈ ఎన్నికలు కీలకమైనవని, అభివృద్ధిని కాంక్షించే బీజేపీకి ఓటర్లు పట్టం కట్టాలని కోరారు. దేశ రాజధానిలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిరాకరించిందని ఆరోపించారు. పేదలకు రూ 5 లక్షల వరకూ ఉచిత వైద్య చికిత్సలు కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఢిల్లీ పేదలు ఉపయోగించుకోలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ఏ ప్రభుత్వమూ చేయనంత వేగంగా దేశాన్ని తమ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి దిశగా నడిపించిందని చెప్పుకొచ్చారు. సీఏఏ, ఆర్టికల్ 370 వంటి జాతీయ భద్రతకు సంబంధించిన అన్నినిర్ణయాలకు తోడ్పాటును అందించే నాయకత్వం ఢిల్లీకి అవసరమని ఆకాంక్షించారు. బాట్లా హౌస్ ఉగ్రవాదుల పట్ల కన్నీరు కార్చే ఈ నాయకులు భద్రతా దళాల త్యాగాలను స్మరించలేరని విపక్షాలను దుయ్యబట్టారు. చదవండి : ‘పౌర నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు’ -
బీజేపీకి కేజ్రీవాల్ సవాల్..
సాక్షి, న్యూఢిల్లీ : మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీజీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో వెల్లడించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీకి సవాల్ విసిరారు. దీనిపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలోగా బీజేపీ తమ పార్టీ సీఎం అభ్యర్ధిని వెల్లడించాలని లేనిపక్షంలో తాను మరోసారి మీడియా ముందుకు వస్తానని చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రజల తీర్పును కోరుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రజాతీర్పు వెలువడిన తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని అమిత్ షా చెబుతున్నారని, కానీ బీజేపీకి ఓటు వేస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారన్నారు. విద్యాభ్యాసం లేని అసమర్ధుడిని సీఎంగా అమిత్ షా ప్రకటిస్తే అప్పుడు ఢిల్లీ ప్రజలను మోసగించినట్టు కాదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. చదవండి : ‘కేజ్రీవాల్ ఓ టెర్రరిస్ట్’ -
ఆప్ మేనిఫెస్టో : నాణ్యమైన విద్య, ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పాలక ఆప్ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను వెల్లడించింది. దేశ రాజధాని ప్రజలందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సురక్షిత నీరు, 24 గంటల విద్యుత్ అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంటింటికీ రేషన్ సరుకుల సరఫరా, పది లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత యాత్రాసౌకర్యం కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. రెండు భాగాలుగా రూపొందిన మేనిఫెస్టోలో తొలి భాగం పది హామీలతో ఇప్పటికే విడుదల కాగా రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామనేది రెండవ భాగంలో ఆప్ పొందుపరించింది. ఆప్ ప్రభుత్వం 2015లో ఆమోదించిన ఢిల్లీ జన్ లోక్పాల్ బిల్లు నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నట్టు తెలిపింది. పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన హ్యాపినెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ కరిక్యులమ్ విజయవంతమైన క్రమంలో త్వరలో దేశభక్తికి సంబంధించిన సిలబస్ను ప్రవేశపెడతామని పేర్కొంది. ప్రపంచ శ్రేణి రహదారుల నిర్మాణం, యమునా నదీతీరంలో అభివృద్ధి పనులు, ఢిల్లీ మెట్రో విస్తరణ, యువతకు స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ, పారిశుద్ధ కార్మికుల సంక్షేమ చర్యలు వంటి పలు హామీలను ఆప్ తన మేనిఫెస్టోలో గుప్పించింది. చదవండి : మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా! -
మళ్లీ ప్రాంతీయ పార్టీల హవా!
సాక్షి, హైదరాబాద్: 2014, లోక్సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఆ తర్వాత వరుసగా జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా విజయఢంకా మోగిస్తూ 19 రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా వల్ల వరుసగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాలు కూలిపోయాయి. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోక తప్పలేదు. ఈ పరిణామాలతో బీజేపీ అధికారం ప్రస్తుతం 13 రాష్ట్రాలకే పరిమితం అయింది. ప్రాంతీయ పార్టీల విజయంతో శరద్ పవార్, భూపిందర్ హూడా, హేమంత్ సోరెన్లు తిరుగులేని నాయకులుగా తెరమీదకు రాగా, 2019 లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయంతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అద్భుత విజయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని ప్రాంతీయ నాయకులుగా చరిత్ర సృష్టించారు. అదే కోవలో ఫిబ్రవరి 8వ తేదీన జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆప్ను విజయ పథాన నడిపించడం ద్వారా అరవింద్ కేజ్రివాల్ బలమైన ప్రాంతీయ నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఎన్నికల విశ్లేషణా సంస్థ ‘పీపుల్స్ పల్స్’ అంచనా వేసింది. -
ఢిల్లీలో మళ్లీ ఆప్కే ఎందుకు పట్టం!?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రివాల్ నాయకత్వంలోని ఆప్, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ ప్రధానంగా పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఢిల్లీ ప్రజలు మళ్లీ ఆప్కే పట్టం కట్టారు. విద్యుత్, మంచినీటి సరఫరా, విద్యా, ఆరోగ్యం, ప్రజా రవాణా, ఢిల్లీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం తదితర తాము చేపట్టిన స్థానిక అభివృద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన ఆప్ నేత కేజ్రివాల్, ఇతర నేతలు ఎన్నికల ప్రచారం చేయగా, సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి వివాదాస్పద జాతీయ అంశాల ప్రాతిపదికన అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ‘మోదీ– షహీన్బాద్’లో ఎవరు కావాలంటూ అమిత్షా జనవరి 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఢిల్లీలో తీవ్రతరం చేశారు. ముఖ్యంగా ముస్లిం మహిళల నాయకత్వాన సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గత డిసెంబర్ 15వ తేదీ నుంచి ఢిల్లీలోని షహీన్బాద్లో ఆందోళన కొనసాగింది. షహీన్బాద్ ఆందోళనకు ఆసరాగా తీసుకొని ఎన్నికల్లో ఢిల్లీ వాసులను ప్రభావితం చేసేందుకు బీజేపీ నాయకులు తెగ ప్రచారం చేశారు. ఈ ప్రచారం గత రెండు వారాల్లో తీవ్రస్థాయికి చేరుకోవడంతో బీజేపీ బలపడుతోందని, ఆప్ బలహీన పడుతోందని వార్తలు వచ్చినా ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్కే బంపర్ మెజార్టీ వస్తుందని తేల్చి చెప్పింది. ఢిల్లీవాసుల నాడి పట్టుకునేందుకు డాక్టర్ సజ్జన్ కుమార్, డాక్టర్ రాజన్ పాండే, డాక్టర్ బిజేంద్ర ఝా ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్లోని ప్రముఖ ఎన్నికల పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ రంగంలోకి దిగింది. జనవరి 17 నుంచి జనవరి 29 వరకు నిర్వహించిన ఫీల్డ్ సర్వే కూడా ఆప్ విజయాన్నే సూచించాయి. అందుకు అయిదు కారణాలను కూడా ‘పీపుల్స్ పల్స్’ సూచించింది. మొదటి అంశం: గత రెండున్నర దశాబ్దాలుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను స్థానిక అంశాలే ప్రభావితం చేస్తున్నాయి. 1998లో ఉల్లిగడ్డ ధరలు పెరిగిన కారణంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పడిపోయింది. అప్పుడు షీలాదీక్షిత్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2013 వరకు, 15 ఏళ్లపాటు అధికారంలో కొనసాగింది. అందుకు కారణం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడం, నగరంలో వంతెనలు, మెట్రో లాంటి మౌలిక సౌకర్యాలను మెరగుపర్చడం, కాలుష్యం నివారణకు సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టడం. ఆ తర్వాత అవినీతి నిర్మూలన, స్థానిక అభివృద్ధి అంశాల ప్రాతిపదికనే ఆప్ గెలుస్తూ వచ్చింది. అంటే ఈ సారి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రధానంగా ప్రభావం చేశాయని చెప్పడం మొదటి అంశం. ఇక రెండో అంశం: గడచిన ఒకటిన్నర దశాబ్దం కాలంగా లోక్సభ, అసెంబ్లీ, స్థానిక మున్సిపాలిటీ ఎన్నికలను భిన్నమైన ఓటింగ్ సరళి కనిపిస్తోంది. ఢిల్లీకి మున్సిపాలిటీలకు 2007లో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బీజేపీ, అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ పరిధిలోని ఏడుకు ఏడు లోక్సభ స్థానాలను కైవసం చేసుకొంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మూడవ స్థానానికి పడిపోయింది. ఢిల్లీ ఓటరు నాడి ఒక్కో ఎన్నికలకు ఒక్కోరకంగా ఉన్నట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే లోక్సభ ఎన్నికలను జాతీయ అంశాలు, అసెంబ్లీ ఎన్నికలను ప్రాంతీయ, స్థానిక అంశాలు ప్రభావితం చేసినట్లు స్పష్టం అవుతుంది. మూడవ అంశం: ఢిల్లీ నైసర్గిక పరిస్థితులు, సామాజిక వెనకబాటుతనం, వలసలు అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. నగరంలో 76 శాతం జనాభా అనియత కాలనీల్లోనే. అంటే అనధికార కాలనీలు, మురికి వాడల్లో నివసిస్తున్నారు. వారిలో 50 శాతం మంది పేదలు, దిగువ మధ్య తరగతికి చెందిన వారే. వారికి నిత్య జీవితంలో విద్యుత్, మంచినీరు, విద్య, ఆరోగ్యం, ప్రభుత్వ రవాణా సదుపాయలపైనే ఆధారపడతారు. అందుకని వారంతా ఆ దృక్కోణం నుంచే ఎన్నికల్లో ఓటేస్తారు. (చదవండి: కేజ్రీవాల్ను తీవ్రవాది అన్న కేంద్రమంత్రి) నాలుగవ అంశం: గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీలో బీజేపీకి పంజాబీలు, కోమట్లు, జాట్ల నుంచే మద్దతు. పూర్వాంచల్ నుంచి వలసవచ్చిన వారితోపాటు దిగువ మధ్య తరగతి, మురికివాడల ప్రజలు, ముస్లింల మద్దతుతో 2013 వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చింది. ఓ సామాజిక విప్లవంతో అధికారంలోకి వచ్చిన ఆప్, ఈ వర్గాల ప్రజలను ఆకర్షించడంతోపాటు బీజేపీకి చెందిన నమ్మకమైన ఓటర్లను కూడా తనవైపు తిప్పుకోగలిగింది. ‘మోదీ దేశానికి కావాల్సిన నాయకుడు, కేజ్రివాల్ ఢిల్లీకి కావాల్సిన నాయకుడు’ అనే నమ్మే బీజేపీ వర్గం కేజ్రివాల్కు మద్దతిస్తోంది. (చదవండి: బీజేపీ ఇంత దిగజారిపోయిందా?) -
‘ఒవైసీ హనుమాన్ చాలీసా చదువుతారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇది చేశాం, ఇకముందు అది చేస్తాం అని చెప్పాల్సిన నాయకులు ఇతర పార్టీల నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల కమిషన్ చేత మొట్టికాయలు తిన్న బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మెజారిటీ సీట్లు సాధించడానికి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు హనుమాన్ చాలీసా చదువుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఆమ్ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఓ ఇంటర్వ్యూలో హనుమాన్ భక్తుడినని, ఇప్పటికీ హనుమాన్ చాలీసా పఠిస్తానని వెల్లడించగా, దీన్ని ఉటంకిస్తూ కపిల్ మిశ్రా మంగళవారం ట్వీట్ చేశారు. (చదవండి: వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..) ‘కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠించడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడిక ఒవైసీ వంతు. ఆయన కూడా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెడతారు. ఐక్యతకు బలమైన శక్తి ఉంది. మన ఐక్యత 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు చేసే మురికి రాజకీయాలను సమాధి చేస్తుంది. దీనికోసం అందరం కలిసి పోరాడుదాం’ అని పిలుపునిచ్చారు. కపిల్ మిశ్రా వ్యాఖ్యలపై ఎంఐఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలోనూ ఆయన పలుసార్లు అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు భారత్కు పాక్కు మధ్య యుద్ధమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రెండు రోజుల పాటు ఢిల్లీ ఎన్నికల ప్రచార నిషేధానికి గురయ్యారు. (బీజేపీ ఇంత దిగజారిపోయిందా?) చదవండి: ‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్గా మార్చుకోండి’ -
బీజేపీ ఇంత దిగజారిపోయిందా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు అత్యాచార బెదిరింపులకు తెగబడుతున్నారని ఆరోపిస్తూ వారి తీరును నిందిస్తూ, తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ సుమారు 175 మంది మహిళా ఉద్యమకారులు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. పౌరసత్వ సవరణ చట్టంతోపాటు, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమిస్తున్న మహిళలపై హింసకు పాల్పడాల్సిందిగా బీజేపీ నేతలు తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని, తద్వారా ఎన్నికల్లో ఒక హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆప్ ఇండియన్ విమెన్ సంస్థలతోపాటు ఆర్థికవేత్త దేవకీ జైన్, ఉద్యమకారణి లైలా త్యాబ్జీ, మధు బాధురీ (విశ్రాంత దౌత్యవేత్త), కమలా భాసిన్ తదితరులు ఆ లేఖలో ఆరోపించారు. ఢిల్లీ మహిళలకు ప్రధాని ఇస్తున్న ఎన్నికల సందేశం ఇదేనా? బీజేపీ ఇంతటి అధమ స్థితికి దిగజారిపోయిందా? అని ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకోవాలని కేంద్ర మంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎంపీ పర్వేశ్ వర్మ తమ అనుచరులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. మహిళలపై దాడులు చేయించి ఢిల్లీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హింసాకాండతో ఎన్నికల్లో గెలవలేరని హెచ్చరించారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. (చదవండి: ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ సర్కార్ కాదు) -
ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ సర్కార్ కాదు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్బాగ్లో కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనలపై, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం నాటి లోక్సభ సమావేశాలు దద్ధరిల్లాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నారీల వ్యతిరేక నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. బుల్లెట్లతో ప్రజల గొంతుకను అణచేయలేరని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు. ‘మీరు నకిలీ హిందువులు’ అని అధికార పక్షాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ఉద్దేశించి ‘ద్రోహులను కాల్చి చంపండి’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. ‘మీ తూటాలెక్కడ?’ అని ప్రశ్నించారు. సప్లిమెంటరీ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఠాకూర్ ప్రయత్నించిన ప్రతీసారి నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించేందుకు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ లేచినపుడు.. ‘సిగ్గు పడు’ అని విపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ‘సీఏఏ నిరసనకారులు మీ ఇళ్లల్లోకి వచ్చి, మీ మహిళలపై అత్యాచారం చేస్తారు’ అని వర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు వర్మ ప్రసంగం ప్రారంభించగానే.. నిరసనగా కాంగ్రెస్, డీఎంకే సహా విపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. సీఏఏను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని, అది దేశ సమగ్రతకు సంబంధించిన విషయమని తేల్చిచెప్పారు. ‘ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదు.. ఇది మోదీ ప్రభుత్వం’ అని ఇందిరా గాంధీ కుటుంబం ముస్లింలేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘షహీన్బాగ్ నిరసనలు సీఏఏను వ్యతిరేకిస్తూ చేస్తున్నవి కావు. అక్కడి నిరసనకారులు పాకిస్తాన్ జిందాబాద్ అని, కశ్మీర్ను, అస్సాంను భారత్ నుంచి విడగొట్టాలి అని అంటున్నారు’ అని వర్మ పేర్కొన్నారు. మానవత్వ సందేశం ఇచ్చిన రాముడికి కాంగ్రెస్ మతం రంగు పులిమిందని విమర్శించారు. ‘ఇప్పటికైనా ప్రతిపక్ష సభ్యులు జై శ్రీరాం అని నినదిస్తే వారి పాపాలు తొలగిపోతాయి’ అన్నారు. రాజ్యాంగం తొలి ప్రతుల నుంచి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి చిత్రాలను కాంగ్రెస్ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఆర్టికల్ 370 లాంటి సమస్యలను కాంగ్రెస్ పెంచి పోషించిందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే అనధికార కాలనీల ప్రజలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వర్మ ప్రసంగంపై టీఎంసీ స్పందిస్తూ.. అది ఢిల్లీ ఎన్నికల ప్రచార ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జామియా మిలియా యూనివర్సిటీలో సీఏఏ నిరసనకారులను దారుణంగా కొట్టారని గుర్తు చేశారు. ఒక విద్యార్థిని తన కన్ను కూడా కోల్పోయిందన్నారు. ‘అమ్మాయిలను దారుణంగా కొట్టారు. పిల్లలపై తూటాలు ప్రయోగించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోనూ... పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సోమవారం రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా బీజేపీ సభ్యుడు భూపేందర్ యాదవ్ను అడ్డుకున్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలపై కాల్పులు జరిపిన ఘటనలను కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ తదితర విపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించారు. సభ్యులను శాంతపర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో డెప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. -
కేజ్రీవాల్ ఉగ్రవాదే
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సోమవారం వెల్లడించారు. గతంలో కేజ్రీవాల్ తనకు తానుగా అరాచకవాదినని ప్రకటించుకున్నారని, నా దృష్టిలో అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదని ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ గురీందర్ సింగ్ నివాసమైన మోగాలో కేజ్రీవాల్ బస చేశారని గుర్తుచేశారు. అది ఉగ్రవాది నివాసమని తెలిసీ కేజ్రీవాల్ బసచేశారని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. షహీన్బాగ్లో ఆందోళనలు చేస్తోన్న వారికి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారికి కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారన్నారు. షహీన్బాగ్లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అరాచకవాదులకు మద్దతిచ్చిన నువ్వు నిజంగా ఉగ్రవాదివే అంటూ కేజ్రీవాల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
దేశ సామరస్యతపై కుట్ర
సాక్షి న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలు దేశ సామరస్యతను దెబ్బతీసేందుకు పన్నిన రాజకీయ కుట్రలో భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ నిరసనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, వాటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎగదోస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సీఏఏ నిరసనల్లో రాజ్యాంగం, జాతీయ పతాకాలను ముందుపెట్టి అసలు కుట్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం ప్రధాని మోదీ తొలిసారి పాల్గొన్నారు. షహీన్బాఘ్ నిరసనల కారణంగా ఢిల్లీ పౌరులు ముఖ్యంగా సాటిలైట్ సిటీ ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు కోపంగా, మౌనంగా ఈ ఓటుబ్యాంక్ రాజకీయాలను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఈ అరాచకాన్ని ఆపేందుకు సహకరించాలని కోరారు. 21వ శతాబ్ది భారత్లో విద్వేష పూరిత రాజకీయాలు పనిచేయవని, అభివృద్ధి రాజకీయాలు మాత్రమే పనిచేస్తాయని కడ్కడూమా సీబీడీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ వ్యాఖ్యానించారు. బాట్లా హౌజ్ ఎన్కౌంటర్ను ప్రశ్నించినవారే ఇప్పుడు ‘తుక్డే తుక్డే’ నినాదాలు చేస్తున్నవారిని రక్షిస్తున్నారని కాంగ్రెస్పై పరోక్ష ఆరోపణలు చేశారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఢిల్లీ ఒక నగరం కాదని, అది దేశ సాంస్కృతిక వారసత్వమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతీ ఢిల్లీవాసి చెమటోడ్చి ఢిల్లీని ప్రస్తుతమున్న స్థాయికి తెచ్చారన్నారు. గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు 21వ శతాబ్ది ప్రయోజనాలు ఢిల్లీకి అందకుండా చేశాయన్నారు. ఢిల్లీ వాసులు లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసి దేశ భవిçష్యత్తు మారేందుకు బాట వేశారని, ఇప్పడు ఢిల్లీ భవిష్యత్తు మార్చడం కోసం మళ్లీ బీజేపీకే ఓటేయాలని కోరారు. ఢిల్లీ సురక్షితంగా, పరిశుభ్రంగా, ఆధునికంగా ఉండాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ అనధికార కాలనీలను క్రమబద్దీకరిస్తామన్న తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు పీఎం ఆవాస్ యోజనను అడ్డుకుని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్కి మరోసారి అధికారమిస్తే కేంద్రం ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం, కర్తార్పుర్ కారిడార్, 370 అధికరణం రద్దు, అయోధ్యపై కోర్టు తీర్పు, భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య పరిష్కారం.. తదితర అంశాలను ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ.. ఇవన్నీ 70 ఏళ్ల తరువాత, తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. తాజా బడ్జెట్లో తమ ప్రభుత్వం సామాన్యుల కోసం, వ్యాపారుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. -
‘పౌర నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు’
-
‘పౌర నిరసనలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు’
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తూర్పు ఢిల్లీలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ విపక్షాలపై నిప్పులు చెరిగారు. సీలంపూర్, జామియా, షహీన్బాగ్ ఇలా రోజుల తరబడి జరుగుతున్న పౌర నిరసనలు కాకతాళీయంగా జరిగేవి కాదని, దీని వెనుక కుట్ర ఉందని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయని మండిపడ్డారు. దేశాన్ని చీల్చే కుట్రతోనే రాజకీయ శక్తులు దుష్ట పన్నాగాలకు పాల్పడుతున్నాయని అన్నారు. విద్వేష రాజకీయాలతో దేశం ముందుకెళ్లదని, అభివృద్ధి విధానంతోనే దేశ రూపురేఖలు మారతాయని బీజేపీ విశ్వసిస్తోందన్నారు. తమ పార్టీకి దేశ ప్రయోజనాలే ప్రాధాన్యతాంశమని స్పష్టం చేశారు. 2022 నాటికి పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఆప్ను మరోసారి గెలిపిస్తే సంక్షేమ పథకాలను నిలిపివేస్తుందని హెచ్చరించారు. అనధికార కాలనీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అక్కడి ప్రజలందరికీ పక్కా ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతోందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం, పౌరసవరణ చట్టం అంశాలను ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రస్తావించారు. చదవండి : ‘మోదీజీ.. మాయాజాల వ్యాయామం మరింత పెంచండి’ -
‘కేజ్రీవాల్ ఓ టెర్రరిస్ట్’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అని నిరూపించేందుకు పలు ఆధారాలున్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. తాను టెర్రరిస్టునా అంటూ కేజ్రీవాల్ అమాయకుడిలా ఢిల్లీ ప్రజలను అడుగుతున్నారని, అందుకు సమాధానం ఆయన టెర్రరిస్టేనని అన్నారు. గతంలో తాను అరాచకవాదినని కేజ్రీవాల్ స్వయంగా చెప్పుకున్నారని, అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసమేమీ లేదని జవదేకర్ అన్నారు. కాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. ఈ తరహా భాషను వాడిన జవదేకర్పై చర్యలు చేపట్టాలని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈసీని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఉగ్రవాది అయితే ఆయనను అరెస్ట్ చేయాలని సంజయ్ సింగ్ బీజేపీని డిమాండ్ చేశారు. దేశ రాజధానిలో ఈసీ కొలువుతీరిన ప్రాంతంలోనే కేంద్ర మంత్రి ఇలాంటి భాషను వాడటాన్ని ఎలా అనుమతిస్తారని సింగ్ ప్రశ్నించారు. కాగా ఆప్ తన పార్టీని ముస్లిం లీగ్ అని మార్చుకుంటే మంచిదని అంతకుముందు బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆప్కు హితవు పలికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం ఆప్ టెర్రరిస్టులను వెనకేసుకొస్తోందని ఆరోపించారు. చదవండి : ఏపీకి తప్పకుండా న్యాయం జరుగుతుంది -
ఇర్ఫాన్ పఠాన్పై ఫేక్ వీడియో!
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఢిల్లీలోని షహీన్ బాగ్కు ‘మరో సింహం వచ్చింది. దాని పేరు ఇర్ఫార్ పఠాన్’ అంటూ 13 సెకన్ల ఓ వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా పలు ఫేస్బుక్ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 78 వేల వ్యూస్, 3,100 షేర్స్, 666 లైక్స్ వచ్చాయి. ఆ వీడియోను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో ఇర్ఫాన్ పక్కన కూర్చున్న వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మదన్ మిశ్రా అని సులభంగానే గుర్తించవచ్చు. ఇర్ఫాన్ పఠాన్ ఫేస్బుక్, ట్విటర్ను తనిఖీ చేయగా జనవరి 14వ తేదీన ఆయన ఇదే వీడియోను పోస్ట్ చేశారు. అదే రోజున మదన్ మిశ్రా తాను ఇర్ఫాన్ పఠాన్తో ఉన్న ఫొటోను ట్విటర్లో విడుదల చేశారు. ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్ చేసిన వీడియో, ట్విటర్లో మదన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను పరిశీలించగా, జనవరి 14వ తేదీన పశ్చిమ బెంగాల్లోని కమర్హటిలో కమర్హటి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రీమియర్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్కు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య అతిథిగా హాజరైన వీడియో అది. ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైన అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఓడించాలని చూస్తున్న శక్తులు ఈ వీడియోను వక్రీకరించినట్లు తెలుస్తోంది. -
కేజ్రీవాల్, బీజేపీ నేతల హోరాహోరీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేజ్రీవాల్ నాయకత్వంలోని పాలకపక్షం ఆప్, నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర పాలక పక్షం బీజేపీ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా, వైద్యరంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రధానంగా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో షహీన్ బాగ్లో కొనసాగుతున్న ప్రజా ఆందోళన ప్రధాన ఆయుధంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. నరేంద్ర మోదీ కావాలా లేదా షహీన్ బాగ్ కావాలా తేల్చుకోండంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. సీఏఏ, ఎన్ఆరీసీలకు వ్యతిరేకంగా షహీన్బాగ్లో డిసెంబర్ 15వ తేదీ నుంచి మహిళల ఆధ్వర్యంలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. (కేజ్రీవాల్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు) షహీన్బాగ్లో ఆందోళన చేస్తున్న దేశ ద్రోహులను కాల్చి పారేయండంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించగా, ‘ఆందోళనకారులను ఉపేక్షించినట్లయితే వారు రేపు మీ ఇళ్లలోకి జొరబడి మీ చెల్లెళ్లను, కూతుళ్లను రేప్ చేస్తారు, హత్య చేస్తారు’ అని బీజేపీ లోక్సభ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించడంతో ఆయన ప్రచారంపై ఎన్నికల కమిషన్ ఐదు రోజుల పాటు నిషేధం విధించింది. ‘షహీన్బాగ్ను ప్రేమిస్తున్న వారికి సరైన సమాధానం ఇవ్వండి’ అంటూ శుక్రవారం బీజేపీ అధికారికంగా ఓ ఎన్నికల పాటను విడుదల చేసింది. ఈ పాటకు ఇప్పటికే ఆన్లైన్లో లక్ష లైక్స్ వచ్చాయి. (అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!) పర్వేష్ వర్మ తాజాగా కేజ్రీవాల్ను ఉద్దేశించి ‘ఆటంక్వాది, టెర్రరిస్ట్’ అని పిలిచారు. ఇక్కడ ఆప్కు సరికొత్త ఆయుధాన్ని ఆయన అందించినట్లయింది. ‘కేజ్రీవాల్ ఆటంక వాదా?, కాదనుకుంటే మీరు ఆప్కు ఓటేయండి’ అంటూ ఆ పార్టీ సరికొత్త ఎన్నికల పోస్టర్ను తీసుకొచ్చింది. ఆప్ సానుభూతిపరులైన బీజేపీ ఓటర్లను ఆకర్షించడం కోసమే ఆ పార్టీ ఈ పోస్టర్ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. (గల్లీల్లో ఢిల్లీ ప్రచారం) కేజ్రివాల్ పార్టీయే మళ్లీ గెలుస్తుందంటూ పలు ముందస్తు ఎన్నికల సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలనే కసితో ఉన్న బీజేపీ షహీన్బాగ్ ఆందోళన ఒక్కదాన్నే ఆయుధంగా చేసుకుని ప్రచారం చేస్తోంది. ఆ విషయంలో కేజ్రివాల్ను రెచ్చగొట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు కేజ్రివాల్ సమన్వయంతో శాంతియుతంగా తాను చేపట్టిన అభివద్ధి కార్యక్రమాలనే నమ్ముకుని ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. (‘మోదీ 24 క్యారెట్ల బంగారం.. ఆయన్ని నమ్మండి’) -
‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్గా మార్చుకోండి’
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరు పెరుగుతోంది. రోజురోజుకి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీకి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా మరోసారి ట్విటర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ముస్లిం లీగ్గా మార్చుకోవాలి. ఉమర్ ఖలీద్, అఫ్జల్ గురు, బుర్హాన్ వనీ వంటి ఉగ్రవాదులను తమవారిగా భావించేవారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కి భయపడుతున్నారు’ అంటూ ఆప్పై కపిల్మిశ్రా విమర్శలు గుప్పించారు. కాగా ఆప్ నేత సంజయ్ సింగ్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మత కలహాలు సృష్టిస్తారని.. ఢిల్లీలో ఆయన ప్రచారం చేయకుండా నిషేధించాలని వ్యాఖ్యానించారు. సంజయ్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యలో కపిల్ మిశ్రా ఆప్పై వివాదాస్పద విమర్శలు చేయడం గమనార్హం. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్- పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ తన ట్విటర్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా స్పందించి కపిల్ మిశ్రాపై 48 గంటల పాటు ఢిల్లీలో ప్రచార నిషేధం విధించింది. ఈ నిషేదం తర్వాత మళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కపిల్ మిశ్రా మరోసారి తీవ్రమైన విమర్శలకు దిగారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
నిరుద్యోగ భృతి, క్యాష్బ్యాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ అధికారంలోకి వస్తే యువ స్వాభిమాన్ యోజన కింద నిరుద్యోగులకు నెలకు రూ. 5,000–7,500 వరకు నిరుద్యోగ భృతి ఇస్తామంది. కరెంటు, నీటిని ఆదా చేసే వినియోగదారులకు క్యాష్బ్యాక్ పథకాలు అమలు చేస్తామంది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. బడ్జెట్లో 25 శాతం నిధులను కాలుష్యంపై పోరాటానికి, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కేటాయిస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందజేస్తామని తెలిపింది. 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.15 కే భోజనం అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ‘ఐసీ హోగీ హమారీ ఢిల్లీ’ పేరిట కాంగ్రెస్ నాయకులు తమ మేనిఫెస్టోను పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. -
గల్లీల్లో ఢిల్లీ ప్రచారం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ, ఆప్ ప్రచార పర్వంలో దూసుకు పోతూ ఉంటే, కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడి పోయింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీ ఇంటి పెద్ద కొడుకునంటూ కుటుంబ సెంటిమెంట్ను రగిలిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని వివరించడానికి మీ ఇంటికొస్తానంటూ వెబ్సైట్ను ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచారానికి అన్నీ తానై తన భుజస్కంధాలపై మోస్తున్నారు. వీరిద్దరూ ఓటర్లతో వ్యక్తిగతంగా కనెక్ట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్లో ముఠా తగాదాలు, కొత్త ముఖాలు పార్టీ ప్రచారానికి ఊపు అందించ లేకపోతున్నాయి. బీజేపీ ప్రచారానికి ఫేస్ షా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచార బా«ధ్యతనుమోస్తే, అమిత్ షా తెరవెనుక వ్యూహాలు రచిస్తూ ఆయనకు కుడి భుజంగానే పనిచేసేవారు. కానీ, ఈసారి అమిత్ షా ఢిల్లీ ఎన్నికల బాధ్యతను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నారు. ప్రచారానికి ఫేస్గా మారారు. పెద్ద పెద్ద సభలకు బదులుగా చిన్న చిన్న ర్యాలీలు నిర్వహిస్తూ ఢిల్లీని చుట్టేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఓటర్లతో వ్యక్తిగత బాంధవ్యం ఏర్పడేలా ముందుకు వెళుతున్నారు. చిన్న గల్లీల్లో జరిగే సభల్లో పాల్గొంటూ, ట్వీట్లు చేస్తూ, బీజేపీ సైబర్ వారియర్లతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీరోజూ రెండు, మూడు సభలు, ఒక రోడ్ షోలో షా పాల్గొంటున్నారు. 5 వేల నుంచి 50 వేల మంది వరకు వచ్చే సభల్లో మాత్రమే పాల్గొని జాతీయ భావమే ప్రధాన ఎజెండాగా చేసుకున్నారు. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలే ప్రధాన అస్త్రంగా చేసుకొని బీజేపీ కేడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. కేజ్రీవాల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాముడు మంచి బాలుడు టైప్. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థిగా ఉన్నప్పుడు, ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రజలతో మంచి సీఎం అనిపించుకోవాలన్న తపనతోనే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద అంశాలపై పెదవి విప్పకుండా ఓటర్లతో నేరుగా అనుసంధానమయ్యేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఢిల్లీ కుటుంబాలకు పెద్ద కొడుకునంటూ ఫ్యామిలీ సెంటిమెంట్ని రగిలిస్తున్నారు. ‘నేనే మీ ఇంటి పెద్ద కొడుకుని. రోడ్షోలో పాల్గొన్న కేజ్రీవాల్ అందుకే మీ వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు, అనారోగ్యం వస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లడం, వృద్ధులైతే తీర్థయాత్రలకి వెళ్లడం వంటివన్నీ నేనే చూసుకుంటున్నాను’ అంటూ తమ ఉచిత పథకాలకు మైలేజ్ వచ్చేలా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకోవడానికి ‘ఆప్కా కేజ్రీవాల్ ఆప్ కే ద్వార్’ అన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇందుకోసం ఠ్ఛీ ఛిౌఝ్ఛజ్ఛ్జుటజీఠ్చీ .జీn అన్న వెబ్సైట్ ప్రారంభించారు. ఈ వెబ్సైట్లోకి వెళితే కేజ్రీవాల్ ఇంటి డోర్ బెల్ మోగిస్తున్న వీడియో ప్రత్యక్షమవుతుంది. లేదంటే 7690944444కు మిస్డ్ కాల్ ఇచ్చినా కేజ్రీవాల్ వాళ్ల ఇంటికి వెళ్లి అయిదేళ్లలో ఆప్ సర్కార్ ఏం చేస్తుందో స్వయంగా వివరిస్తారు. కాంగ్రెస్లో స్తబ్దత ఢిల్లీ ఎన్నికలకు మరో వారం రోజులు కూడా గడువు లేదు. కాంగ్రెస్లో ఇంకా స్తబ్దత వీడలేదు. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా, ప్రచార కమిటీ చైర్మన్ కీర్తి ఆజాద్ మధ్య విభేదాలు పార్టీ ప్రచారంపై ప్రభావం చూపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది కొత్తవారే కావడంతో ప్రచారానికి ఇప్పటివరకు ఒక ఊపు రాలేదు. పార్టీ స్టార్ క్యాంపెయినర్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక 4,5 తేదీల్లో రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్లో నెలకొన్న ఒకరకమైన నిర్వే దం ఆప్కి లాభించనుందనే వాదనలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకునే ఆప్ పూర్తిగా కొల్లగొట్టేసింది. తన ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడంతో ఈ మూడు స్తంభాలాటలో ఆప్ది పై చేయిగా నిలిచే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
‘వాళ్లకు బిర్యానీ కాదు బుల్లెట్ దింపాలి’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పౌర ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు కేంద్రంగా మారిన షహీన్బాగ్లో ఆందోళనకారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం బిర్యానీలు సమకూరుస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి కేజ్రీ సర్కార్పై నిప్పులు చెరిగారు. ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కనీసం రక్షిత మంచినీటిని సరఫరా చేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. బీఐఎస్ సర్వే ప్రకారం ఢిల్లీ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం విషపూరిత నీటిని తాగేలా చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో సీఏఏ నిరసనకారులకు మాత్రం బిర్యానీ సరఫరా చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని కరవాల్ నగర్, ఆదర్శ్ నగర్, నరేలా, రోహిణీల్లో జరిగిన నాలుగు ర్యాలీలను ఉద్దేశించి యోగి ఆదిత్యానాథ్ ప్రసంగించారు. గతంలో రాళ్లు విసిరేవారు పాకిస్తాన్ నుంచి డబ్బు తీసుకుని కశ్మీర్లో ప్రజల ఆస్తులను ధ్వంసం చేసేవారు. కేజ్రీవాల్, కాంగ్రెస్లు విధ్వంసకారులకు మద్దతిస్తూ వారికి బిర్యానీలు పంచితే తాము మాత్రం వారికి బుల్లెట్ రుచిచూపామని ధ్వజమెత్తారు. చదవండి : భగీరథుడిలా వచ్చాడు.. -
‘మోదీ 24 క్యారెట్ల బంగారం.. ఆయన్ని నమ్మండి’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తూ దేశంలో హింసను రెచ్చగొట్టి పబ్బంగడుపుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ.. హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేసే పార్టీ కాదని చెప్పారు. శువ్రవారం ఆయన ఢిల్లీలోని మెహ్రోలిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ... దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిపారు. ‘ మోదీ తీసుకున్న ప్రతీ నిర్ణయం దేశ అభివృద్ధి కోసమే.ఆయన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం లాంటి వ్యక్తి. ఆయనను నమ్మండి’ అని రాజ్నాథ్ అన్నారు. (చదవండి : సీఏఏను గట్టిగా సమర్థించండి) భారత్ హిందూ రాజ్యం కాదని, సెక్యులర్ దేశమని చెప్పారు. ఇండియాలో అన్ని మతాల వారూ సమానమేనని, స్వేచ్ఛగా వారి మతాన్ని పాటించవచ్చని అన్నారు. ఇక్కడి ముస్లింలను సందేహించాల్సిన అవసరేలేదన్నారు. సీఏఏతో భారత ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పొరుగు దేశాల్లోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు వంటి మైనారిటీలు మత హింసను ఎదుర్కొంటున్నారని చెప్పారు. అక్కడ బతకలేక భారత్ వచ్చేస్తున్న వారికి గౌరవప్రదంగా జీవించే అవకాశం కల్పించేందుకు పౌరసత్వ చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి మాట్లాడుతూ... ఆయనకు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకునే ఉద్దేశమే లేదన్నారు. గత ఐదేళ్లలో కేంద్రంతో గొడవకు దిగి ఢిల్లీ అభివృధ్దిని అడ్డుకున్నారని ఆరోపించారు. (చదవండి : సీఏఏ చరిత్రాత్మకం) -
బీజేపీ వరాల జల్లు.. ఉచిత స్కూటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ఓటర్లపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ ఎన్నికల మేనిఫేస్టోని శుక్రవారం విడుదల చేసింది. వీటిలోని ముఖ్య అంశాలను ఆ పార్టీ చీఫ్ మనోజ్ తివారీ మీడియా ముందు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, పాఠశాల పిల్లలకు సైకిల్స్ పంపిణి చేస్తామన్నారు. ఢిల్లీ నివసించే పేదలు గోదుమలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. వారికి కేవలం రెండు రూపాయాలకే కేజీ గోదుమ పిండి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవడేకర్, మనోజ్ తివారీ బీజేపీ నేతలు పాల్గొన్నారు. బీజేపీ ప్రకటించిన మేనిఫేస్టోలని ముఖ్య అంశాలు.. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీ వ్యాప్తంగా కొత్తగా 200 కాలేజీలు ఏర్పాటు చేస్తాం. రాబోయే ఐదేళ్లలో కనీసం 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ బీసీ, అగ్రవర్ణ పేదల కోసం వేర్వరుగా డెవెలప్మెంట్ బోర్డులు పిల్లల పెళ్లిళ్ల కోసం, ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం ఢిల్లీ-యమునా వికాస్ బోర్డు, 20 సూత్రాల పథకంలో నిర్మించిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అప్లకు పోత్సాహంతో పాటు ఫిట్ ఇండియా-ఫిట్ ఢిల్లీ పథకం అమలు ఢిల్లీలో అక్రమ నివాసాలుగా ఉన్న 1728 కాలనీలోని ప్రజలకు ఉచిత ఇళ్ల పట్టాలు ఇస్తాం మంచినీటి సమస్యను పరిష్కరిస్తాం విద్యా, వైద్య, ఆరోగ్యంలో ఢిల్లీని మొదటి స్థానంలో నిలుపుతాం -
పాక్ జోక్యం సహించం: ప్రధానికి కేజ్రీవాల్ మద్దతు!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని.. ఇందులో ఎవరూ తలదూర్చాల్సిన అవసరం లేదని చురకలు అంటించారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా మోదీకి బుద్ధి చెప్పాలని పాక్ మంత్రి ఫవాద్ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. కశ్మీర్ అంశం, పౌరసత్వ సవరణ చట్టంపై బాహ్య ప్రపంచం నుంచి వస్తున్న విమర్శలు, ఆర్థిక మందగమనం కారణంగా మోదీకి మతి చలించిందని.. అందుకే అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారంటూ ఫవాద్ ట్వీట్ చేశారు. (ఢిల్లీ అసెంబ్లీ పీఠం: ఈ అంచనాలు నిజమేనా?) ఈ క్రమంలో ఫవాద్ ట్వీట్పై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్... ‘‘ నరేంద్ర మోదీ భారత ప్రధాన మంత్రి. ఆయన నాకు కూడా ప్రధాన మంత్రే. ఢిల్లీ ఎన్నికలు భారత అంతర్గత అంశం. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారి జోక్యాన్ని మేము అస్సలు సహించం. భారత ఐకమత్యానికి హాని తలపెట్టాలని పాక్ ఎంతగా ప్రయత్నించినా ఫలితం ఉండదు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు కేజ్రీవాల్ను విమర్శిస్తున్నా.. ఆయన మాత్రం హుందాగా వ్యవహరిస్తున్నారు’’అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కేజ్రీవాల్.. భారత్, ప్రధానిపై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 8 న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనుండగా... 11న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. नरेंद्र मोदी जी भारत के प्रधानमंत्री है। मेरे भी प्रधानमंत्री है। दिल्ली का चुनाव भारत का आंतरिक मसला है और हमें आतंकवाद के सबसे बड़े प्रायोजकों का हस्तक्षेप बर्दाश्त नहीं। पाकिस्तान जितनी कोशिश कर ले, इस देश की एकता पर प्रहार नहीं कर सकता। https://t.co/E2Rl65nWSK — Arvind Kejriwal (@ArvindKejriwal) January 31, 2020 -
షహీన్బాగ్తో ఎవరికి చెక్
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా దక్షిణ ఢిల్లీలోని యమునా నది ఒడ్డున షహీన్బాగ్ ప్రాంతం గత నెలరోజులుగా నిరసనలతో అట్టుడుకుతోంది. వణికించే చలిని లెక్కచేయకుండా ముస్లిం వర్గానికి చెందిన వారు ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఏఏ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంతో బీజేపీ షహీన్బాగ్ను ఎన్నికల అస్త్రంగా మార్చుకుంది. సీఏఏ వ్యతిరేకుల్ని పదునైన మాటలతో ఎండగడుతోంది. దేశభక్తి వర్సస్ టుక్డే టుక్డే గ్యాంగ్ ఎన్నికలుగా వీటిని అభివర్ణిస్తూ ఎవరివైపు ఉంటారని ప్రశ్నిస్తోంది. కేజ్రీవాల్ ఇప్పటివరకు షహీన్బాగ్కు ఎందుకు రాలేదంటూ ఆప్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలైన పర్వేష్ వర్మను మూడు రోజులు, అనురాగ్ ఠాకూర్ని నాలుగు రోజుల పాటు ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించినా కమలదళం తాను చేపట్టిన వ్యూహం ప్రకారమే ముందుకి అడుగులు వేస్తోంది. ఆచితూచి వ్యవహరిస్తున్న ఆప్ సీఏఏ అంశంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. హిందూ ఓట్లు ఎక్కడ కోల్పోతామోనన్న ఆందోళనలో ఉన్న కేజ్రీవాల్ దీనిపై ఎక్కడా పెదవి విప్పడం లేదు. షహీన్బాగ్ వెళ్లి ఆందోళనకారులకు మద్దతు తెలిపే ధైర్యం చేయలేదు. అయిదేళ్లలో తాను చేసిన పనులనే ప్రస్తావిస్తున్నారు. ఉచిత విద్యుత్, ఉచితంగా నీళ్లు, స్కూలు ఫీజుల నియంత్రణ, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు వంటివే ప్రస్తావిస్తున్నారు. సుపరిపాలన అన్న సొంత ఎజెండాతోనే ముందుకు వెళుతున్నారు. పరువు కాపాడుకునే వ్యూహంలో కాంగ్రెస్ ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలకి బహిరంగంగా మద్దతు తెలుపుతున్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆప్ రాజకీయాల్లోకి వచ్చాక రాజధానిలో ఇంచుమించుగా పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతున్న సమయంలో ఒక వర్గంలో నెలకొన్న సీఏఏ వ్యతిరేకతను తమకి అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ఢిల్లీలో 8 నుంచి 10 స్థానాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంది. కనీసం ఆ స్థానాలనైనా దక్కించుకొని పరువు కాపాడుకునే పనిలో ఉంది. షహీన్బాగ్ నిరసనకారుల్ని టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై ఎదురుదాడి మొదలు పెట్టింది. కేంద్రానివే దేశాన్ని విభజించే టుక్డే టుక్డే రాజకీయాలంటూ ప్రచారం ప్రారంభించింది. బీజేపీ అస్త్రం పని చేస్తుందా ? షహీన్బాగ్ బీజేపీ ట్రంప్ కార్డా లేదంటే, అసహనంతో కూడుకున్న అస్త్రమా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ షహీన్బాగ్ ఆందోళనలపై స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్లే బీజేపీ జాతీయ భావాన్ని రగల్చడంలో ఎంతో కొంత పైచేయి సాధించిందని ఎన్నికల విశ్లేషకుడు ప్రదీప్ భండారీ అభిప్రాయంగా ఉంది. ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ఉన్న ఎగువ మధ్యతరగతిలో సీఏఏపై పెద్దగా వ్యతిరేకత లేదు. మరోవైపు షహీన్బాగ్ నిరసనలతో ట్రాఫిక్ జామ్లు ఎక్కువై సామాన్యులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాగని ఆమ్ ఆద్మీ పార్టీపై అధికార వ్యతిరేకత కూడా లేదు. అమిత్షా చాణక్య నీతిని కేజ్రీవాల్ ఎంతవరకు సమర్థవంతంగా తిప్పికొట్టగలరో అన్న దానిపైనే బీజేపీ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందో తెలుస్తుందని సీఎస్డీఎస్ రాజకీయ విశ్లేషకుడు సంజయ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 8న మీరు ఈవీఎంల బటన్ ఎంత ఆగ్రహంతో ప్రెస్ చేయాలంటే దాని ప్రకంపనలు షహీన్బాగ్ను వణికించాలి. – కేంద్ర హోం మంత్రి అమిత్ షా షహీన్బాగ్లో నిరసనకారులు మీ ఇళ్లల్లోకి చొరబడొచ్చు. మీ చెల్లెళ్లు, కూతుళ్లపై అత్యాచారం చేయొచ్చు. చివరికి మిమ్మల్ని చంపేయొచ్చు కూడా. –బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ టుక్డే టుక్డే గ్యాంగ్కి షహీన్బాగ్ కేంద్రంగా మారింది. –కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ దేశద్రోహుల్ని కాల్చి చంపండి. –కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ -
ఢిల్లీని మరో సిరియా కానివ్వం: బీజేపీ నేత
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 8న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ప్రచారంలో భాగంగా పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. అల్లర్లను సృష్టించడానికి మహిళలు, పిల్లలను ఉపయోగించే ఉగ్రవాద సంస్థ ఐసీస్ నమూనాను ఢిల్లీలోని కొందరు అమలు చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఢిల్లీని మరో సిరియా కానివ్వమని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. సీఏఏ నిరసనకారులు ఢిల్లీలోని రహదారులను దిగ్భందం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తరుణ్ చగ్ మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రధాన పాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. గత వారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అంతర్గత సర్వే నిర్వహించిందని, సర్వేలో బీజేపీ విజయం సాధిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని కొందరు బీజేపీ నేతుల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 8న 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 11న ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్న విషయం తెలిసిందే. చదవండి: బీజేపీలోకి సైనా.. జ్వాలకు చీవాట్లు We will not let Delhi become Syria and allow them to run an ISIS-like module here,where women and kids are used. They are trying to create fear in the minds of people of Delhi by blocking the main route. We will not let this happen.(We will not let Delhi burn).#ShaheenBaghKaSach — Tarun Chugh (@tarunchughbjp) January 29, 2020 -
అప్పటి దాకా ఏం మాట్లాడను: పీకే
న్యూఢిల్లీ: తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఫిబ్రవరి 11న పట్నాలో మాట్లాడతానని ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జనతాదళ్(యూ) బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. అంతవరకు తాను ఎవరితోనూ ఏమీ మాట్లానబోనని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ సర్కారు తీసుకవచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) విషయంలో జేడీయూ పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ను జనతాదళ్(యూ) బహిష్కరించిన విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో ప్రశాంత్ కిషోర్, జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ల వాగ్యుద్ధం తారస్థాయికి చేరిన నేపథ్యంలో.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ పీకేపై పార్టీ వేటు వేసింది. ఈ నేపథ్యంలో.. బిహార్ సీఎంగా నితీశ్ పగ్గాలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించిన పీకే.. తనను బహిష్కరించినందుకు నితీశ్కు ధన్యవాదాలు తెలుపుతూనే.. మరోసారి సీఎం కావాలంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇక ఫిబ్రవరి 11న నిర్ణయం చెబుతానంటూ ఆసక్తికర చర్చకు తెరతీశారు.(అసలు పీకే ఎవరు.. దిమ్మతిరిగే కౌంటర్!) కాగా సీఏఏకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఇక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పీకే టీంతో జట్టుకట్టి.. బీజేపీని విమర్శించడాన్ని పక్కనపెట్టి.. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైన ఫిబ్రవరి 11న తన నిర్ణయం ప్రకటిస్తానంటూ ప్రశాంత్ కిషోర్ తనదైన శైలిలో స్పందించారు. తన వ్యూహాలతో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జేడీయూకు చెక్ పెడతానని చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిషోర్ను తమ పార్టీలో చేరాల్సిందిగా ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆహ్వానించారు. ఆయన కోసం తామెప్పుడూ ఎదురుచూస్తూ ఉంటామని పేర్కొన్నారు.(పీకే బహిష్కరణ.. మీరు మళ్లీ సీఎం కావాలి!) -
సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే చర్చకు వస్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన పార్టీలు తమదైన శైలీలో ప్రచారాల హోరును కొనసాగిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. షాహిన్ బాగ్ నిరసనలు ఎన్నికల్లో ప్రధాన అంశాలు కాబోవని, అభివృద్దిపైనే ప్రజలు తీర్పు ఇస్తారని అన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే టీవీ షోలో చర్చించడానికి తాను సిద్దమని సవాలు విసిరారు. తాము చేసిన అభివృద్ధిని వివరించి ప్రజలను ఓట్లు అడుగుతామని అన్నారు. ప్రజలు తమను మరోసారి గెలిపిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని షాహిన్బాగ్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ ఆరోపిస్తుండగా.. బీజేపీ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ అన్నారు. సీఏఏ, ఏన్ఆర్సీపై మీ వైఖరేంటని ప్రశ్నించగా.. ఎన్నికల్లో ప్రజలు విద్యుత్, నీరు, విద్య, పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తారని చెప్పారు. సీఏఏ, ఎన్ఆర్సీ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపవని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు రాష్ట్రంలో నివసిస్తున్నారని, అందుకే ఢిల్లీ మినీ ఇండియాగా పేరు గాంచిందని తెలిపారు. విద్వేష రాజకీయాలను ఢిల్లీ ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా తమ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. ఆప్ ప్రభుత్వం రాకముందు 2,300ప్రాంతాలలో నీటి సమస్యలు ఉండేవని, తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో సమస్యలు తీర్చిందన్నారు. ప్రస్తుతం 125ప్రాంతాలలో మాత్రమే సమస్యలు ఉన్నావని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక నివారణ చర్యలను చేపట్టిందన్నారు. తాను అవకాశవాద రాజకీయాలకు పాల్పడనని, ఢిల్లీని ప్రపంచంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ సూచనలు పాటిస్తా: కేజ్రీవాల్ -
ఉగ్రవాది అనేవాడు ఇన్ని త్యాగాలు చేయగలడా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్నవేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఆమ్ఆద్మీ పార్టీ నేతలు, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ ప్రవీణ్ వర్మ.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను టెర్రరిస్ట్తో పోలుస్తూ విమర్శించారు .దీనిపై కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ప్రజలకు మెడిసిన్ అందిస్తున్నాను, మెరుగైన విద్యను అందిస్తున్నాను. నా కోసం కానీ నా కుటుంబం కోసం కానీ నేను ఏమీ చేయడం లేదు. ఢిల్లీ ప్రజల కోసం రాత్రీంబవళ్లు కష్ట పడుతున్నాను. ఇవన్నీ చేస్తున్న నేను ఉగ్రవాదిని ఎలా అవుతాను’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘నేను మధుమేహం రోగిని, ప్రతి రోజు నాలుగు సార్లు ఇన్సులిన్ తీసుకుంటాను. రాజకీయాల్లోకి వెళ్లొద్దని డాకర్లు సూచించారు. అయినప్పటికీ నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నేను అనుకుంటే విదేశాల్లోకి వెళ్లి సుఖంగా బతకవచ్చు. విదేశాల్లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అయినా కూడా వెళ్లలేదు. కావాలనుకుంటే నా ఉద్యోగంలో తిరిగి చేరి సంతోషంగా ఉండవచ్చు. కానీ నేను ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను. ఒక ఉగ్రవాది ఇన్ని త్యాగాలు చేయగలడా? నేను ఉగ్రవాదినో లేదా వారి బిడ్డనో ఢిల్లీ ప్రజలే నిర్ణయిస్తారు’ అంటూ కేజ్రీవాల్ భాగోధ్వేగానికి లోనయ్యారు. కాగా, ఇటీవల ఓ ఎన్నికల ర్యాలీలో ఎంపీ ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ లాంటి వ్యక్తి మరోసారి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అరాచకాలు జరుగుతాయని, కశ్మీర్లో మాదిరి ఢిల్లీలో కూడా హిందూవులపై దాడులు జరుగుతాయని హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడం చేయాలా లేదా ఢిల్లీలోని కేజ్రీవాల్ లాంటి ఉగ్రవాదులతో పోరాటం చేద్దామా అని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రవీణ్ వర్మ వ్యాఖ్యలపై ఆప్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఉగ్రవాదితో పోల్చిన ప్రవీణ్ వర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
'మీ ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి'
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్కు ఓటు వేసి గెలిపించాలని తృణముల్ కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలను కోరింది. తాజాగా తృణముల్ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ బుధవారం ఢిల్లీలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదాకు ఓటు వేసి గెలిపించాలని ట్విటర్ ద్వారా ప్రజలను కోరారు. అంతేగాక ఈ ఎన్నికల్లో ఒక్క కేజ్రీవాల్నే కాకుండా ఆప్ అభ్యర్థులందరికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ' ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేయండి.. ఆప్ అభ్యర్థి రాఘవ్ చాదానను గెలిపించండి.. అరవింద్ కేజ్రీవాల్తో సహా ఆప్ అభ్యర్థులందరిని గెలిపించండి' అంటూ డెరెక్ ఒబ్రెయిన్ వీడియా ద్వారా ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్న సంగతి తెలిసిందే.(‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’) Vote for @AamAadmiParty Vote for the candidate from Rajendra Nagar constituency @raghav_chadha Vote for @ArvindKejriwal and all AAP candidates in Delhi WATCH pic.twitter.com/KcgHbPpkB7 — Citizen Derek | নাগরিক ডেরেক (@derekobrienmp) January 30, 2020 -
కేజ్రీవాల్.. చొక్కా విప్పి రా
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ముఖ్యంగా బీజేపీ, ఆప్ల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరుతోంది. బుధవారం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సవాలు విసిరారు. యమునా నది కాలుష్యం గురించి మాట్లాడిన షా.. కేజ్రీవాల్కు ధైర్యం ఉంటే చొక్కా విప్పి.. ఒక్కసారి అందులో మునిగి చూడాలని అన్నారు. అలాగైతే యమునా నదిలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఆయనకు తెలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఆప్ నేతలు యమునా నదిని శుభ్రపరుస్తామని చెప్పారు. అయితే కేజ్రీవాల్కు నేను మీకు ఈ రోజు సవాలు విసురుతున్నాను. మీరు మీ చొక్కా విప్పి.. యమునా నదిలో ఒక్కసారి మునిగి చూడండి. అప్పుడు ఆ నదిలో నీరు ఎంత కలుషితమైందో మీకే తెలుస్తుంద’ని అమిత్ షా అన్నారు. కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే యమునా నది శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో ప్రజలు కాలుష్యం లేని యమునా నదిలో దిగి స్నానం చేసేలా చేస్తామని అన్నారు. అలాగే సామాన్య ప్రజలతో కలిసి తాను కూడా యమునా నదిలో స్నానం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా కేజ్రీవాల్కు సవాలు విసిరినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం నిధులు కేటాయించాల్సిందిగా కేంద్రానికి కేజ్రీవాల్ లేఖ రాశారు. -
‘పవర్’ గేమ్
2002.. విద్యుత్ పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరించడానికి ముందు దశ. అప్పట్లో రాజధాని ఢిల్లీ అంటే పవర్కట్లకు కేరాఫ్ అడ్రస్.. అప్పట్లో అదే ఎన్నికల అంశం..ఆ తర్వాత కరెంట్ కష్టాలు తీరిపోయినా, విద్యుత్ బిల్లులు భారీగా పెరిగి వినియోగదారులకు షాకిచ్చాయి. అప్పుడు కూడా ఎన్నికల అంశం పవరే... అరవింద్ కేజ్రీవాల్ సీఎం అయ్యాక విద్యుత్ బిల్లుల్లో భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. అయినా ఈసారీ పవరే ఎన్నికల అంశం..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ చుట్టూ పవర్ఫుల్గా రాజకీయాలు నడుస్తున్నాయి. న్యూఢిల్లీ: 2013 ఎన్నికల్లో ఆనాటి షీలాదీక్షిత్ ప్రభుత్వంపై అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన పవర్ సత్యాగ్రహ అందరి దృష్టిని ఆకర్షించింది. విద్యుత్ బిల్లుల భారం భరించలేమంటూ ఆప్ ఇచ్చిన పిలుపు మేరకు వేలాది మంది మధ్యతరగతి ప్రజలు బిల్లులు కట్టడానికి నిరాకరించారు. ఆ ఎన్నికల్లో కరెంటే కేజ్రీవాల్కు గణనీయమైన సంఖ్యలో సీట్లు ఇచ్చింది. 2015 ఎన్నికల్లో ‘‘బిజిలి హాఫ్, పానీ మాఫ్’’అన్న కేజ్రీవాల్ హామీతో ఓట్ల సునామీ వెల్లువెత్తింది. మొత్తం 70 స్థానాల్లో 67 సాధించిన ఆప్ విపక్షాలకు గట్టి షాక్ వచ్చింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న కేజ్రివాల్ 400 యూనిట్ల వరకు వాడే విద్యుత్ వినియోగదారుల బిల్లుల్లో 50శాతం సబ్సిడీ ఇచ్చారు. 2020 ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఎం కేజ్రివాల్ మళ్లీ పవర్ గేమ్నే అస్త్రంగా చేసుకున్నారు. పవర్ రాయితీలు మరింత మందికి లబ్ధి చేకూరేలా సవరించారు. 200 యూనిట్ల వరకు ఖర్చు చేసినవారికి, లేదంటే నెలకి 800 రూపాయలు బిల్లు వచ్చిన వారికి పూర్తి మాఫీ చేస్తామన్నారు. 201–400 యూనిట్లు ఖర్చు చేసేవారికి బిల్లులో రూ.800 డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు. రాయితీ చుట్టూ రాజకీయం విద్యుత్ బిల్లులపై కొత్త రాయితీలను ఆప్ సర్కార్ ప్రకటించిన వెంటనే పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఉచితాలు ఎక్కువకాలం ఇవ్వలేరని మార్చి నాటికే ఆప్ ప్లేటు ఫిరాయిస్తుందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. బీజేపీ ప్రచారానికి కౌంటర్గా కేజ్రీవాల్ తన గ్యారంటీ కార్డుల్లో విద్యుత్ బిల్లుల మాఫీని కూడా చేర్చారు. అయిదేళ్ల పాటు సబ్సిడీకి ఢోకా ఉండదన్నారు. దీంతో కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసి 401–600 యూనిట్లు వాడే వారికి సబ్సిడీలిస్తామంటూ హామీలు ఇచ్చింది. ఈ పరిణామాలతోబీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ ఆప్ ఇచ్చిన సబ్సిడీలకు అయిదు రెట్లు ఎక్కువే ఇస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం విద్యుత్ బిల్లుల్లో 30 శాతం కంటే ఎక్కువ రాయితీ ఇవ్వలేమని తేల్చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందంటూ కేంద్ర మంత్రి, ఢిల్లీ ఎన్నికల ప్రచార సారథి ప్రకాశ్ జవదేకర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరోలా ఉంది. బాగా అభివృద్ధి చెందిన ఢిల్లీ ప్రజలకి ఇప్పుడు కావల్సింది సుపరిపాలన. దానికి తోడు ఇలాంటి రాయితీలు తోడైతే ఆప్ దూకుడుకి కళ్లెం వేయడం ఎవరి తరమూ కాదని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) విశ్లేషకుడు సంజయ్ కుమార్ అభిప్రాయపడుతున్నారు. ►ఢిల్లీలో గృహ విద్యుత్ వినియోగదారులు: 52.27 లక్షలు ►విద్యుత్ సబ్సిడీతో లబ్ధి పొందిన గృహాలు: 42 లక్షలు ►గృహ వినియోగదారుల శాతం: 80% ►కొత్త రాయితీలతో లబ్ధి పొందేవారు: 90% ►ప్రభుత్వ ఖజానాపై భారం: ఏడాదికి రూ. 2,250 కోట్లు -
‘వారు ఇళ్లలోకి వచ్చి హత్యాచారాలు చేస్తే దిక్కెవరు’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణచట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని షహీన్బాగ్లో నిరసనకు దిగిన ఆందోళనకారులను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘లక్షలాది మంది అక్కడ (షహీన్బాగ్) గుమికూడారు..వారు ఎప్పుడైనా మీ ఇళ్లలోకి వచ్చి మీ అక్కాచెల్లెళ్లు, కుమార్తెలపై హత్యాచారాలకు తెగబడవచ్చు..రేపపు మిమ్మల్ని మోదీజీ, అమిత్ షాలు కూడా కాపాడలేర’ని అన్నారు. పశ్చిమ ఢిల్లీకి పార్లమెంట్లో ప్రాతినిథ్యం వహిస్తున్న వర్మ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే షహీన్బాగ్ నుంచి ఆందోళనకారులను గంటలోనే ఖాళీ చేయిస్తామని వ్యాఖ్యానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దేశ ఐక్యతను చాటుతాయని అన్నారు.కాగా, దక్షిణ ఢిల్లీలోని షహీన్బాగ్లో నెలరోజులకు పైగా 200 మంది మహిళలతో పాటు వందలాది మంది సీఏఏను వ్యతిరేకిస్తూ నిరవధిక ధర్నా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో షహీన్బాగ్ ఆందోళన కేంద్రబిందువుగా నేతలు పరస్పర మాటల యుద్ధానికి తెరలేపుతుండటంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి : ఢిల్లీ అసెంబ్లీ పీఠం: ఈ అంచనాలు నిజమేనా? -
కేజ్రీవాల్పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ అన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని ఆయన తన ఎమ్మెల్యేలతో కొట్టించారని, ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలూ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సాక్షి టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కేజ్రీవాల్ పరిపాలన నచ్చకపోవడంతోనే.. ఆయనకు వ్యతిరేకంగా వందలమంది నామినేషన్లు వేశారని అన్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 45 సీట్లకుపైనే వస్తాయని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటిందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం రాకపోవడం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందన్నారు. దేశానికి మోదీ, ఢిల్లీకి బీజేపీ అనేది తమ నినాదమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎక్కడ గుడిసె ఉందో, అక్కడే నిరుపేదలకు ఇల్లు కట్టించి.. గ్యాస్, టాయిలెట్ సౌకర్యం కల్పించిందని చెప్పారు. కుషాల్ ఢిల్లీ తమ లక్ష్యమన్నారు. -
పాత, కొత్త కలయిక
న్యూఢిల్లీ: 22 ఏళ్లుగా అధికారాన్ని అందుకోవాలన్న ఆరాటంలో బీజేపీ.. హ్యాట్రిక్ విజయాల్ని సాధించి కూడా పోరాటం చేయలేని స్థితిలో కాంగ్రెస్ గ్యారంటీ కార్డును నమ్ముకుంటూ ముందుకు సాగుతున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థులే కీలకంగా మారారు. కేజ్రీవాల్ సర్కార్పై వ్యతిరేకత అంతగా లేదు. అందుకే ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ బలమైన అభ్యర్థులపైనే ఆశలు పెట్టుకుంది. మూడు పార్టీలు కూడా అనుభవానికి, కొత్త ముఖాలకి సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. కాంగ్రెస్, ఆప్ మధ్య ఆఖరి నిమిషంలో గోడ దూకుడు రాజకీయాలు ఎక్కువగా ఉండడంతో ఎవరు ఏ పార్టీ అభ్యర్థులోనన్న గందరగోళం కూడా నెలకొంది. హోరాహోరీ... చాందినీ చౌక్ నియోజకవర్గంలో ఆప్ నుంచి కాంగ్రెస్ గూటికి తిరిగి చేరుకున్న అల్కా లంబా పోటీపడుతుంటే, కాంగ్రెస్ నుంచి ఆప్లోకి జంప్ చేసిన అయిదు సార్లు ఎమ్మెల్యే అయిన ప్రహ్లాద్ సింగ్ స్వాహ్నే బరిలో ఉన్నారు. ఇక బీజేపీ తరపున మాజీ కౌన్సిలర్ సుమన్ కుమార్ గుప్తా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో హోరాహోరి పోరాటం నెలకొందని కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా స్వయంగా అంగీకరించారు. ► ద్వారకాలో కూడా ఆప్ రెబెల్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ ఉంటే, ఆప్ తరఫున గత వారంలోనే కాంగ్రెస్ నుంచి వచ్చిన వినయ్ మిశ్రా పోటీ పడుతున్నారు. కాంగ్రెస్లో అత్యంత పేరున్న మహాబల్ మిశ్రా కుమారుడే వినయ్మిశ్రా. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ప్రద్యుమ్న రాజ్పుత్ అంతగా ప్రముఖుడు కాదు. ► ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా కుమార్తె శివానీ చోప్రా ఆప్ అభ్యర్థి అతిషిపై కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ► గాంధీనగర్లో బీజేపీ తరఫున ఆప్ నుంచి పార్టీ ఫిరాయించిన అనిల్ బాజ్పాయ్ రంగంలో ఉంటే, కాంగ్రెస్ నుంచి అర్వీందర్ సింగ్ లవ్లీ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆప్ నవీన్ చౌదరి అనే కొత్త నేతకు టిక్కెట్ ఇచ్చింది. ► సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు అత్యధికంగా జరిగిన సీలమ్పూర్లో కాంగ్రెస్ దిగ్గజం మాట్నీ అహ్మద్, ఆప్ అభ్యర్థి అబ్దుల్ రెహ్మాన్ను ఎదుర్కొంటున్నారు. ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ పూర్వంచలి కార్డును బయటకి తీసి కౌశల్ మిశ్రాను బరిలో దింపింది. కాంగ్రెస్కు కాస్తయినా కలిసొస్తుందా? అభ్యర్థుల ఎంపిక అందరికంటే ఎక్కువగా కాంగ్రెస్కే కలిసి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అభ్యర్థి బలం, సీఏఏ వ్యతిరేక నినాదాలతో ఆ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ఆప్ ఓట్లను భారీగా చీలుస్తుందని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ రాయ్ అంచనా వేస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత పథకాలు, సుపరిపాలన, పథకాల కొనసాగింపు కోసం ఇచ్చే గ్యారంటీ కార్డులనే నమ్ముకుంది. అయితే ఆ పార్టీ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనలు చేపట్టకపోవడంతో ముస్లిం సామాజిక వర్గంలో వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్ రాయ్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ వ్యతిరేకత ఆప్ విజయావకాశాల్ని దెబ్బ కొట్టలేకపోవచ్చునని ఆయన అంటున్నారు. సీలమ్పూర్, ఓఖ్లా, మాతియా మహల్, బల్లిమారన్, ముస్తాఫాబాద్ నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం అధికం. ఈ త్రిముఖ పోటీలో అభ్యర్థుల బలం ఏ పార్టీకి కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే. ఈ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ చాందినీ చౌక్, ద్వారక, గాంధీనగర్, సంగమ్ విహార్, కల్కాజీ, గ్రేటర్ కైలాశ్, కృష్ణా నగర్, మంగోల్పురి -
ఢిల్లీ అసెంబ్లీ పీఠం: ఈ అంచనాలు నిజమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న జరగుతున్న ఎన్నికల వేడి బయటకు అంతగా కనిపించడం లేదు. అయినప్పటికీ ఈసారి అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలుస్తుందా? అన్న విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకుగాను అరవింద్ కేజ్రివాల్ నేతత్వంలో ఆప్ 67 సీట్లతో అఖండ విజయం సృష్టించగా, ఆ తర్వాత 2017లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మూడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 56 శాతం ఓట్లతో మొత్తం ఏడు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా తోడవడంతో బీజేపీ గెలుస్తుందని అంచనాలు వేసిన వారు లేకపోలేదు. అయితే జనవరిలో ‘సీ ఓటరు’ విడుదల చేసిన ముందస్తు ఎన్నికల సర్వే ప్రకారం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్కు 53 శాతం ఓట్లు, బీజేపీకి 29 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి నాలుగు శాతం కన్నా తక్కువ సీట్లు వస్తాయని తేలింది. సీట్ల సంఖ్యను మాత్రం ఆ సర్వే వెల్లడించలేదు. తాజాగా విడుదలైన ‘న్యూస్ఎక్స్-పోల్స్ట్రాట్’ ముందస్తు ఎన్నికల సర్వే ప్రకారం ఆప్నకు 48.56 శాతం ఓట్లతో 53 నుంచి 56 అసెంబ్లీ సీట్లు, బీజేపీకి 31.7 శాతం ఓట్లతో 12-15 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 9.64 శాతం ఓట్లతో రెండు నుంచి నాలుగు సీట్లు లభిస్తాయి. (అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!) ఈ అంచనాలు నిజమేనా? ఈ ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ ప్రభావాన్ని తట్టుకొని అరవింద్ కేజ్రివాల్ తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకరాగలరా? అదే నిజమైతే అందుకు దోహదపడే అంశాలేమిటీ? 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో పోటీ చేసిన కేజ్రివాల్, 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి దెబ్బతిన్నారు. అప్పటి వరకు పోరాటమే తన తత్వమంటూ చెప్పుకున్న కేజ్రివాల్, బీజేపీ సానుభూతిపరులను కూడా తనవైపు తిప్పుకోవాలన్న తలంపుతో అభివృద్ధి మంత్రంతో పెద్దన్న పాత్రను పోషించడం ప్రారంభించారు. (రాజధాని రంగస్థలం) ఇందులో భాగంగా విద్యుత్, నీళ్లు, విద్య, ఆరోగ్యం అనే నాలుగు ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ఎజెండా అందుకున్నారు. నగరంలో విద్యుత్, నీళ్లు సరఫరాను బాగా మెరగుపర్చారు. పేదలకు సబ్సిడీలను పెంచారు. విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించారు. ప్రభుత్వ విద్యా విధానంలో ఢిల్లీ మోడల్ను తాము కూడా ప్రవేశపెడతామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, ఢిల్లీ నగరంలో ఆప్ అమలు చేస్తున్న ‘మొహల్లా క్లినిక్ మోడల్’ అద్భుతమంటూ పలు స్వతంత్య్ర సంస్థలు ప్రశంసించడం ఇందుకు తార్కాణం. కేజ్రివాల్ ప్రభుత్వం పనితీరు బాగుందని 86 శాతం మంది అంగీకరించినట్లు ‘రిలబుల్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ 2019, డిసెంబర్లో నిర్వహించిన సర్వేలో వెల్లడవడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన ప్రధాన అంశం. అదే విధంగా కాంగ్రెస్-బీజేపీలపై విమర్శల జోలికి వెళ్లకుండా ప్రధానంగా అభివృద్ధిపైనే దృష్టి పెడుతున్న కేజ్రివాల్కు సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నోరు విప్పక తప్పలేదు. దీని ప్రభావం ప్రతికూలంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా ?, ఏదైనా ఎంతుంటుంది ? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం స్పష్టత లభించడం లేదు. ఈ అంశాన్ని పక్కన పెడితే ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు నూటికి నూరు శాతం నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: ఆప్ అభ్యర్థులు వీరే.. -
అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని, పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. షహీన్బాగ్లో జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని అమిత్ షా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం ట్విటర్ వేదికగా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ‘ఢిల్లీపై ప్రేమతో ఓటు వేయండి అంతేచాలు. ప్రస్తుతం ప్రభుత్వంపై ఎలాంటి అసహనంలేదు. సోదరభావం, స్నేహ భావానికి ఎలాంటి ప్రమాదంలేదు’ అని అమిత్ షాకు కౌంటర్ ఇచ్చారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు ప్రశాంత్ కిషోర్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ఆయన.. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు రాజకీయ సలహాదారుడిగా సేవలు అందిస్తున్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపునకు తెరవెనుక ప్రణాళికలు రచిస్తున్నారు. -
కపిల్ మిశ్రాపై 48 గంటల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ మోడల్ టౌన్ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రాపై ఎన్నికల సంఘం 48 గంటల ప్రచార నిషేధం విధించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్–పాక్ ఎన్నికలుగా వర్ణిస్తూ కపిల్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈసీ ఆదేశాల మేరకు ట్విట్టర్ సంస్థ కపిల్ చేసిన ట్వీట్లను తొలగించింది. -
'జిన్నానా? భారతమాతానా? తేల్చుకోండి'
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయ నేతల్లో మరింత దూకుడు పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని పాకిస్తాన్ తో, బీజేపీని ఇండియాతో పోల్చుతూ.. ఫిబ్రవరి 8న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఢీకొనబోతున్నాయంటూ బీజేపీ నేత కమల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులిచ్చిన సంగతి మరువక ముందే ఢిల్లీ బీజేపీ ఇన్ చార్జిగా వ్యవహరిస్తోన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని షాహిన్బాగ్లో ఏర్పాటు చేపిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకాశ్ జవదేకర్ మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్లో డిసెంబర్ నుంచి నిరవధిక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ.. ఆ ఉద్యమం వెనుక చీకటి శక్తులు ఉన్నాయని, ఆ చీకటి శక్తులకు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు అండగా నిలిచాయని కేంద్ర మంత్రి జవదేకర్ ఆరోపించారు. షాహీన్ బాగ్ లో నిరసనకారులు.. జిన్నా కోరిన స్వాతంత్ర్యం(జిన్నా వాలీ ఆజాదీ) అంటూ నినాదాలు చేస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జిన్నా కావాలో? భారతమాతకు జై అంటారో ఢిల్లీ ఓటర్లు నిర్ణయించుకోవాలని జవదేకర్ పేర్కొన్నారు. (ఫిబ్రవరి 8న భారత్-పాక్ పోరు : కపిల్ మిశ్రా) -
పూర్వాంచలే కీలకం
త్రిముఖ పోటీ నెలకొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల దృష్టి పూర్వాంచల్ (ఢిల్లీ తూర్పు ప్రాంతం) ఓట్లపైనే పడింది. అక్కడ వలస వచ్చిన ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 శాతానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. దీంతో వారి ఓట్లను ఆకర్షించడానికి అన్ని పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. దశాబ్దాల తరబడి ఈ వలసదారులు తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తమకు సంప్రదాయంగా మద్దతు ఇస్తున్న పంజాబీ, వైశ్య ఓటర్లపైనే ఆధారపడుతూ వీరిని నిర్లక్ష్యమే చేసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అత్యధికంగా పూర్వాంచల్ వర్గానికే టిక్కెట్లు ఇచ్చి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 12 మంది ఎమ్మెల్యేలు పూర్వాంచల్కు చెందినవారే కావడం విశేషం. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రి గోపాల్ రాయ్, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, దిలీప్ పాండే, సోమ్నాథ్ భారతి వంటి వారు ఆప్లో ఉంటూ చక్రం తిప్పుతున్న ప్రధాన నాయకులు. ఈ పరిణామంతో ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కూడా పూర్వాంచల్ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. బీజేపీ వ్యూహమేంటి ? ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు మనోజ్ తివారీ చేతికి వచ్చాక పార్టీ వ్యూహాల్లో మార్పులు వచ్చాయి. ఆయన ఎక్కువగా పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. నితీశ్కుమార్కు చెందిన జనతా దళ్ (యునైటెడ్), రాం విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీతో పొత్తు కుదుర్చుకున్న కమలనాథులు వలసదారులకు 10 టిక్కెట్లు ఇచ్చారు. వీరిలో పూర్వాంచల్కు చెందిన ఎనిమిది మంది, ఉత్తరాఖండ్కు చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ప్రాంతవాసులు ఉంటున్న అనధికార కాలనీలన్నింటినీ కేంద్రం రెగ్యులరైజ్ చేసింది. అంతేకాదు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ఉంటే జరిగే ప్రయోజనంపైనే విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కమలనాథుల బాటలోనే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంచుమించుగా బీజేపీ బాటలోనే నడుస్తూ పూర్వాంచల్తో పాటు ముస్లిం, మైనార్టీ ఓట్లను కూడా దక్కించుకునేలా ప్రణాళికలు రచించింది. లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ వలసదారులతో పాటు ముస్లింలకు కూడా సీట్లు ఇచ్చింది. బిహార్ వలసదారుల ఓట్లను సంపాదించుకోవడానికి ఆర్జేడీ నాలుగు స్థానాలు కేటాయించింది. మాజీ క్రికెటర్, బిహార్కు చెందిన కీర్తి ఆజాద్ కాంగ్రెస్లో పూర్వాంచల్ ఫేస్గా మారారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల ప్రచార బాధ్యతల్ని తానే నిర్వహిస్తున్నారు. వలస ఓట్లను కాపాడుకునే ప్రయత్నాల్లో కేజ్రీవాల్ గత ఎన్నికల్లో వలసదారుల ఓట్లన్నీ గంపగుత్తగా పొందిన ఆప్ ఈసారి ఆ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. వలసదారులు ఉండే కాలనీలకు సబ్సిడీ ధరలకే విద్యుత్ అందిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే నీళ్లు, కరెంట్ వంటివన్నీ తక్కువ ధరకే అందిస్తామన్న హామీతో గ్యారంటీ కార్డులు కూడా జారీ చేస్తోంది. ఈసారి కూడా అక్కడ 12 మందికి టిక్కెట్లు ఇచ్చింది. ఎన్నికల వేళ ఢిల్లీలో 300 ప్రాంతాల్లో అపాన్ పేరిట పూర్వాంచల్ ఫెస్టివల్ నిర్వహించింది. ఉత్తర బిహార్లో అత్యధికంగా మాట్లాడే మైథిలి భాషను ఢిల్లీ స్కూళ్లలో ఆప్షనల్గా ప్రవేశ పెట్టింది. పూర్వాంచల్ వాసుల చాత్ పండుగ కోసం యుమునా తీరం వెంట వెయ్యికి పైగా ఘాట్లను నిర్మించింది. -
వివాదాస్పద ట్వీట్ చేసిన మిశ్రాకు నోటీసు..
-
'శ్వాస ఉన్నంత వరకు ఓటు వేస్తూనే ఉంటా'
ఢిల్లీ : 'నా దృష్టిలో ఓటు అనే పదానికి చాలా విలువ ఉంది. ఈ ఆయుధంతోనే రాజకీయ పార్టీల భవితవ్యం ముడిపడి ఉంటుంది.అందుకే నా చివరి శ్వాస వరకు నేను ఓటు వేస్తూనే ఉంటానని' 110 ఏళ్ల వృద్దురాలు కలితారా మండల్ పేర్కొన్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కలితారా మండల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్రానికి పూర్వం కలితారా మండల్ కుటుంబసభ్యులు బంగ్లాదేశ్లోని బరిసాల్ ప్రాంతంలో నివసించేవారు. అయితే బంగ్లాదేశ్ విభజన అనంతరం వీరి కుటుంబం ఢిల్లీకి వచ్చి స్థిరపడింది. ఈ నేపథ్యంలో మండల్ను ఒక మీడియా చానెల్ పలకరించింది. విభజన తర్వాత తొలిసారి ఓటు ఎప్పుడు వేసారని కలితారా మండల్ను అడగ్గా..' నాకు ఆ విషయం గుర్తు లేదు గాని కాంగ్రెస్ పార్టీకి ఎక్కవసార్లు ఓటు వేశాను. విభజన అనంతరం మా కుటుంబం చాలా కాలం శరణార్థుల శిబిరంలో జీవించాము.ఆ తర్వాత మేము అక్కడి నుంచి చత్తీస్ఘర్కు వెళ్లిపోయాము. నా పెద్దకొడుకు సుఖ్రాజన్ మండల్ ఉద్యోగ విషయమై ఢిల్లీకి బదిలీ అవ్వడంతో అప్పుడప్పుడు అక్కడికి వెళ్లేదాన్ని. తర్వాత నా చిన్నకొడుకు వ్యాపారాన్ని ఢిల్లీకి మార్చడంతో అప్పటి నుంచి మేము ఢిల్లీలోనే నివసిస్తున్నాం. అప్పటి నుంచి 2014 వరకు అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశాను. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారి ప్రధాని మోదీ బొమ్మను చూశాను. ఆయన గురించి నా కుటుంబసభ్యులు వివరించడంతో అప్పటి ఎన్నికలలో హస్తం గుర్తుకు కాకుండా పువ్వు గుర్తుకు ఓటు వేశాను. ఇందిరాగాంధీ మరణించినప్పుడు ఢిల్లీలో తలెత్తిన భీతావహ పరిస్థితులు నాకు ఇంకా గుర్తున్నాయి' అంటూ కలితారా మండల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో కలితరా మండల్ ఓటు వేయనున్నారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలో కొందరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పమని అడిగితే.. తనకు హస్తం, పువ్వు తప్ప ఇంక ఏం గుర్తులు తెలవదని మండల్ సమాధానమిచ్చారు. 2014లో ఢిల్లీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కలితారా మండల్ తన మనవడిని తీసుకొని వీల్చైర్లో వెళ్లి ఓటు వేసి వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం పోస్టల్ బాలెట్ ద్వారా మండల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు ఆర్మీ కుటుంబసభ్యలకు మాత్రమే పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం ఉండేది. అయితే ఢిల్లీ ఎన్నికల సంఘం రాష్ట్రంలో 80ఏళ్లు పైబడిన వృద్దులకు పోస్టల్ బాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించింది. మండల్తో పాటు మొత్తం 4వేలమంది పోస్టల్ బాలెట్ ద్వారా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకోనున్నారు. -
‘ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ సర్కార్ కురిపిస్తున్న ఉచిత వరాలపై విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తన చర్యలను సమర్ధించుకున్నారు. పరిమితంగా చేపట్టే ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఉపకరిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఉచిత పథకాలు ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని, ఇవి పేదల చేతిలో డబ్బు ఉండేలా చేయడంతో వ్యవస్థలో డిమాండ్ పెరుగుతాయని వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్లకు, అధిక పన్నులకు తావివ్వని రీతిలో పరిమితంగానే ఉచిత వరాలు ఉండాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీ ప్రజలకు అభివృద్ధి, భద్రత అవసరమని ఉచిత నీరు, విద్యుత్ వంటి వరాలు కాదని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఆరోపించారు. ఇక ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ తప్పుడు హామీలు గుప్పిస్తున్నారని కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా సైతం విమర్శలు గుప్పించారు. దేశంలో తప్పుడు వాగ్ధానాలపై పోటీ జరిగితే కేజ్రీవాల్ ముందువరసలో ఉంటారని ఎద్దేవా చేశారు. చదవండి : ఐదేళ్లలో పెరిగిన కేజ్రీవాల్ ఆస్తులు.. -
భారత్-పాక్ వ్యాఖ్యలు.. ఈసీ నోటీసు
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించింది. ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ పోరు ఉంటుందని ఆప్ను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆప్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కపిల్ మిశ్రాకు నోటీసులు జారీచేశారు. ఎన్నికల నియమావళి క్లాజ్ 1(1) ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకే షోకాజ్ నోటీస్ జారీ చేశామని ఈసీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 8న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ను తలపించనున్నాయని బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ట్వీట్పై రాజధాని రాజకీయ వాతావరణం వేడెక్కింది. షాహిన్ బాగ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ నిరసనలు చేయిస్తుందని విమర్శించారు. పాకిస్తాన్ షాహిన్బాగ్లో ప్రవేశించి మినీ పాకిస్తాన్గా మార్చిందని మండిపడ్డారు. ఢిల్లీలోని చంద్బాగ్, ఇందర్లోక్ ప్రాంతాలలో చట్టాలు అమలు కావడం లేదని అన్నారు. ఢిల్లీని ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు మినీ పాకిస్తాన్లు చేశాయని విమర్శించారు. ఎన్నికల్లో వారికి సరైన జవాబు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మోడల్ టౌన్ నుంచి పోటీ చేస్తున్న కపిల్ మిశ్రా నామినేషన్ పత్రాలను తప్పుగా జతపరచారని..మిశ్రా అభ్కర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
రాజధాని రంగస్థలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ రూటే వేరు. చదువుకున్న వారితోపాటు ఆస్తిపరులూ ఇక్కడే ఎక్కువ. తలసరి ఆదాయంలో గోవా తర్వాత స్థానం ఢిల్లీదే. అందుకే అభివృద్ధి కంటే ఇతర అంశాలే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఇండియా వర్సస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కపిల్ మిశ్రా చేసిన కామెంట్లు వివాదం రేపుతున్నా వన్డే క్రికెట్ మ్యాచ్కున్న ఉత్కంఠ రేగుతోంది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే హిందూత్వ ఎజెండా, మోదీ క్రేజ్తోనే బీజేపీ ఎన్నికల గోదాలో దిగుతోంది. కుటుంబానికి పెద్ద కొడుకులా పనిచేస్తున్నానంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సుపరిపాలననే నమ్ముకుంటూ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపి పూర్వ వైభవాన్ని సాధించాలన్న పట్టుదలతో ఉంది. కేజ్రీవాల్ పాలన ఆప్ని గట్టెక్కిస్తుందా ? అయిదేళ్లలో తన పనితీరు నచ్చితేనే మరోసారి ఓటు వేయండి అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్నాళ్లూ తాను చేసిన సుపరిపాలననే ఆయన నమ్ముకున్నారు. నెలకి 20 కిలో లీటర్ల కంటే తక్కువ వాడుకున్న వారికి ఉచితంగా నీరు, 32 శాతం వరకు తగ్గిన విద్యుత్ ధరలు, స్కూలు ఫీజుల్ని పెంచకపోవడం, ఆమ్ ఆద్మీ మొహల్లా క్లినిక్ (ఏఏఎంసీ)ల ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షలు వంటివి మళ్లీ గెలిపిస్తాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేకపోయినప్పటికీ లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల మధ్య వ్యత్యాసంపై ఓటర్లలో పెరగుతున్న అవగాహన తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. ఆప్ అనుకున్నట్టుగానే లోక్సభ బీజేపీకి, శాసనసభ ఆప్కి అన్న పోస్టర్లు రాజధాని వీధుల్లో కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా కేజ్రీవాల్ హుందాగా ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్తో పోలిస్తే అభ్యర్థుల బలం లేకపోవడం పార్టీకి మైనస్గా మారింది. ఎన్నికల్లో ఎక్కువగా కొత్త ము ఖాలకి టిక్కెట్లు ఇచ్చి కేజ్రీవాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మోదీ ఇమేజ్తోనే: 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ వేవ్ ఢిల్లీలో బలంగా వీచింది. ఏడుకి ఏడు స్థానాలను రెండు సార్లు సాధించింది. కానీ, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి ఉన్న క్రేజ్ పనిచేయలేదు. 2013లో హర్షవర్ధన్, 2015లో కిరణ్ బేడీని ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించిన బీజేపీ ఈ సారి ఎన్నికల్ని మోదీ వర్సస్ కేజ్రీవాల్గానే చూస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా జాతీయ స్థాయి అంశాలకే ప్రాధాన్యం ఇవ్వనుంది. కాంగ్రెస్ బలపడుతుందా ? రాజధాని ఢిల్లీ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. 1998 నుంచి 2013లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగేవరకు ఆ పార్టీకి ఎదురే లేకుండా పోయింది. అప్పట్నుంచి జాతీయ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోయింది. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తర్వాత స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొట్టిన ఓట్లను తిరిగి రాబట్టడం కోసం కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్నే నమ్ముకుంది. -
ఫిబ్రవరి 8న భారత్-పాక్ పోరు..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కపిల్ మిశ్రా గురవారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఫిబ్రవరి 8న భారత్-పాకిస్తాన్ మధ్య పోరు జరుగుతోంది. దీని కోసం మారాణాయుధాలతో పాకిస్తాన్ సైన్యం ఢిల్లీ సమీపంలోని షెహన్బాగ్కు చేరుకుంది. భారత్ చట్టాలను గౌరవించకుండా అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నుతోంది’ అని వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆమ్ఆద్మీ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార ఆప్ సర్కార్పై బీజేపీ నేతలు మాటాల దాడిని ప్రారంభించారు. ఢిల్లీలోని మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కపిల్ మిశ్రా బరిలో నిలిచారు. అయితే బుధవారం ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్లో పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి కూడా వారు ఫిర్యాదు చేశారు. ఆప్ నేతల చర్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన కపిల శర్మ ఆ పార్టీనేతలను పాకిస్తాన్ ఉగ్రవాదులుగా అభివర్ణించారు. కాగా ఆయన వ్యాఖ్యలపై ఆప్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలిన ఈసీని డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్రాపై గతంలో శాసనసభలో ఫిరాయింపు వ్యతిరేక చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ తీరుతో తీవ్రంగా విభేదించిన మిశ్రా పార్టీకి రాజీనామా చేసి గత ఆగస్ట్లో బీజేపీలో చేరారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
కమల్నాథ్ ప్రచారం చేస్తే అడ్డుకుంటాం..
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఫిబ్రవరి 8న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ప్రచారం చేస్తే అడ్డుకుంటామని ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ హెచ్చరించింది. ఢిల్లీ ప్రచార బాధ్యతలను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో కమల్నాథ్ పేరు ఉండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీలో కమల్నాథ్ ఎక్కడ ప్రచారం చేసినా అడ్డుకుంటామని అకాలీ దల్ నాయకుడు, ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ మాజిందర్ సింగ్ సిర్సా స్పష్టం చేశారు. సిర్సా మాట్లాడుతూ..సిక్కుల ఊచకోతకు కారణమైన వారిని కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. కమల్నాథ్ నేరాలను రుజువు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు సీఎం పదవి ఇచ్చిందని విమర్శించారు. -
మా ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆస్పత్రులు, పాఠశాలలు తమ హయాంలో వేగంగా అభివృద్ధి చేశామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన ఆస్పత్రులు, పాఠశాలలు మరింత అభివృద్ది చెందాలంటే ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వేరే పార్టీ అధికారంలోకి వస్తే తాము సాధించిన అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని అన్నారు. మరోసారి ఆప్ అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ మెరుగుపరచడానికి మరింత కృషి చేస్తామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 70 సీట్లకు గాను 67 సీట్లను సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రజల సంతోషం కోసం ఎంతో కృషి చేశానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా తనకే ఓటు వేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పెద్ద కుమారుడిలా సేవలందిస్తానని అన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ఉచిత విద్యుత్, త్రాగునీరు అందించామని తెలిపారు. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయని, 70 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులు కేవలం 5సంవత్సరాలలో పూర్తి చేయలేమని అన్నారు. పనులన్నీ పూర్తి కావాలంటే మరికొంత సమయం కావాలని అన్నారు. ఢిల్లీ ప్రజలు స్థానిక సమస్యలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు. -
అగ్రనేతల జాబితాలో సిద్ధూ, సిన్హా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి ఫిబ్రవరి 8న జరిగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వాయ్నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. అగ్ర నేతలు పాల్గొనే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్జోత్ సింగ్ సిద్ధూ, ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్నాథ్, అమరీందర్ సింగ్లకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చోటు లభించిడం విశేషం. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 66స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా రోమేష్ సబర్వాల్ తలపడనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలకు జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్ -
కేజ్రీవాల్ నామినేషన్పై ఉత్కంఠ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయడంపై ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. సోమవారమే నామినేషన్ దాఖలు చేయాలని చూసిన కేజ్రీవాల్.. భారీ రోడ్ షో కారణంగా అది కాస్త వాయిదా పడింది. దీంతో నేడు కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయడానికి జామ్నగర్ హౌస్లోని ఎన్నికల కార్యాలయానికి వచ్చారు. అయితే అప్పటికే అక్కడ 50 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు క్యూలో వేచిఉన్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి నేడే చివరి రోజు కావడంతో.. ఆయన నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనేది ఈ సాయంత్రానికి తెలనుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేసేందుకు క్యూలో వేచి ఉన్నారని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మీడియాకు తెలిపారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు మాత్రం కేజ్రీవాల్ అందరిలాగానే క్యూ లైన్లో వచ్చి నామినేషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. తమ కంటే ముందుగా కేజ్రీవాల్ను అనుమతించబోమని చెబుతున్నారు. -
‘ఎలక్టోరల్ బాండ్స్’పై స్టే ఇవ్వం: సుప్రీం
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులను అందించే ‘ఎలక్టోరల్ బాండ్స్’ పథకంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. 2018లో ప్రారంభమైన ఈ పథకంపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర స్టే విధించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) అనే స్వచ్చంధ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ల ధర్మాసనం విచారణ జరిపింది. స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. నల్లధనాన్ని అధికార పార్టీకి అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతోందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకం మరింత దుర్వినియోగమయ్యే అవకాశముందని ఏడీఆర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకాన్ని అన్యాయంగా పునఃప్రారంభించారని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కోసం 10 రోజుల పాటు బాండ్స్ అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నామినేషన్కు ఆలస్యమైన కేజ్రీవాల్.. దాంతో..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నామినేషన్ వేయలేకపోయారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి ఆలస్యంగా రావడంతో ఎన్నికల సంఘం అధికారులు ఆయన నామినేషన్ పత్రాలను స్వీకరించలేదు. దీంతో మంగళవారం ఆయన మరోసారి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కు వచ్చి నామినేషన్ వేయనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరుతూ ఆయన భారీ రోడ్షోలో పాల్గొన్నారు. తొలుత చారిత్రక వాల్మీకి మందిర్లో భగవాన్ వాల్మీకి ఆశీస్సులు తీసుకున్న అనంతరం రోడ్షోలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్రేట్మార్క్ టోపీ, చేతిలో ఆప్ ఐదేళ్ల ప్రోగ్రస్ కార్డును పట్టుకుని కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు రోడ్షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్కు స్వాగతం పలికారు. (చదవండి : ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్) అయితే జనాలు భారీగా తరలిరావడంతో రోడ్ షో ఆలస్యంగా ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల కంటే ముందే రావాల్సి ఉండగా... భారీ ర్యాలీ కారణంగా రాలేకపోయారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు కేజ్రీవాల్ నామినేషన్ పత్రాలను స్వీకరించలేదు. మంగళవారం వచ్చి నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. -
ఢిల్లీ బరిలో ఆర్జేడీ
న్యూఢిల్లీ: లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కూటమిలోని ఆర్జేడీ 10 శాతం సీట్లు కావాలని డిమాండ్ చేసినప్పటికీ.. చివరకు నాలుగింటితో సరిపెట్టుకుంది. అభ్యర్థుల పేర్లను సోమవారం విడుదల చేయనుంది. ఢిల్లీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల దాఖలు మంగళవారంతో ముగియనుంది. -
మేనిఫెస్టో విడుదల చేసిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ : కీలకమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమ్ఆద్మీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేశారు. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిన కేజ్రీవాల్.. విద్యార్థులకు కూడా ఆ పథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. అలాగే 24 గంటలు త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి చిన్నారికీ ప్రపంచ స్థాయి ఉచిత విద్య, ఢిల్లీ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన వాతావరణం, కాలుష్యం నియంత్రణ, క్లీన్ యమునా, వైద్య, ఆరోగ్యంలో కీలక సంస్కరణలు మరికొన్ని ప్రజాకర్షణ పథకాలతో కూడిన మేనిఫెస్టోను కేజ్రీవాల్ ఆదివారం విడుదల చేశారు. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. (మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె) -
కేజ్రీవాల్పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ద్వారక్ నియోజకవర్గ టికెట్ను తిరిగి తనకు ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ.10 నుంచి15 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో తాను షాక్కు గురయ్యానని, అంత డబ్బు కేజ్రీవాల్కు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనకు టికెట్ దక్కలేదని వాపోయారు. తన స్థానంలో వినయ్ మిశ్రాకు ద్వారక్ స్థానం కేటాయించారని తెలిపారు. ఆదర్శ్ వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. (మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె) మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ఆప్కి గుడ్బై చెప్పి, శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన... ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్ సమయం కూడా ఇవ్వడం లేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ టికెట్ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అభిప్రాయం చెప్పమని కేజ్రీవాల్ను కోరగా ఆయన ముందుకు రాలేదని ఆదర్శ్ పేర్కొన్నారు. (హస్తం గూటికి చేరిన ఆదర్శ్ శాస్త్రి) -
54 మందితో కాంగ్రెస్ జాబితా
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థుల జాబితా వెల్లడించింది. అందులో కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్ పటేల్ నగర్ నుంచి, ఆప్ నుంచి హస్తం గూటికి చేరిన అల్కా లాంబా చండీ చౌక్ నుంచి పోటీ చేయనున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు పోటీగా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు బీజేపీ భారీ ప్లాన్తో బరిలోకి దిగుతోంది. రానున్న 20 రోజుల్లో 5 వేల ర్యాలీలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ బీజేపీలోని టాప్ 100 మంది నేతలు రోజుకు సుమారు నాలుగు ర్యాలీలు నిర్వహించేలా, ప్రతి ర్యాలీకి 200 మందిలోపే ప్రజలు హాజరయ్యేలా ప్రణాళిక రచించింది. -
హస్తం గూటికి చేరిన ఆదర్శ్ శాస్త్రి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి హస్తం గూటికి చేరారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ఆప్కి గుడ్బై చెప్పి, శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన... ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు. శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్ సమయం కూడా ఇవ్వడం లేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ టికెట్ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అభిప్రాయం చెప్పమని కేజ్రీవాల్ను కోరగా ఆయన ముందుకు రాలేదని ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా, పిసి చాకో, ముఖేష్ శర్మ కూడా పాల్గొన్నారు. కాగా షీలా దీక్షిత్ ప్రభుత్వంలో ఆదర్శ్ శాస్త్రి మంత్రిగా పనిచేశారు. అయితే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ .... సిట్టింగ్ల్లో 15 మందికి టికెట్లు నిరాకరించారు. అందులో ఆదర్శ్ శాస్త్రి కూడా ఉన్నారు. చదవండి: మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం! -
మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక వ్యూహాలతో ఎన్నికల రంగంలో బిజీబిజీగా ఉన్నాయి. రెండోసారి విజయం సాధించాలని ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగానే శనివారం కేజ్రీవాల్ భార్య సునీత, అతని కుమార్తె హర్షిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓట్ల కోసం ఢిల్లీ వీధుల్లో ఇద్దరూ చమటోడుస్తున్నారు. తన తండ్రికి ఓటు వేసి మరోసారి గెలిపించాలని హర్షిత ఓటర్లును కోరుతున్నారు. అయితే భార్య, బిడ్డల కష్టం ఏమేరకు ఫలిస్తుందనేది ఫలితాల అనంతరం తేలనుంది. (త్రిముఖ పోరులో పీఠం ఎవరిది..?) దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా హస్తినలో అధికారానికి దూరంగా ఉన్న.. కమళనాధులు విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చూస్తున్నారు. ఇక గత వైభవం కోసం హస్తం పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. (ఢిల్లీని ఊపేస్తున్న.. ‘లగే రహో కేజ్రీవాల్’) -
అదంతా అబద్ధం.. నిర్భయ తల్లి ఆశాదేవీ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్భయ తల్లి ఆశాదేవి పోటీ చేస్తారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం కేజ్రీవాల్పైనే ఆమె పోటీకి దిగుతారని.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేసిందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ వార్తలపై ఆశాదేవీ వెంటనే స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని.. తాను ఏ పార్టీతో సంప్రదింపులు జరుపలేదని స్పష్టం చేశారు. అయితే, తన కూతురు నిర్భయ విషయంలో న్యాయం జరిగితే చాలని అన్నారు. తన కూతురుకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరకుండా పోరాటం కొనసాగిస్తానన్నారు. కాగా నిర్భయ దోషులకు ఉరిశిక్షను విధించాలని ఆశాదేవీ పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. (నిర్భయ దోషులకు కొత్త డెత్వారెంట్లు జారీ) -
ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం ఉదయం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజే.. ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. సిట్టింగ్ల్లో 15 మందికి టికెట్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. 46 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయించారు. కేజ్రీవాల్ న్యూఢిలీ అసెంబ్లీ స్థానం నుంచి, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. 2015లో 6గురు మహిళలకు టికెట్ కేటాయించిన ఆప్.. ఈ సారి 8 మందికి అవకాశం కల్పించింది. పోలింగ్ కేవలం 25 రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. దేశ రాజధానిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఆప్ అభ్యర్థులు వీరే.. -
కేజ్రీవాల్కు కొత్త చిక్కులు.. రూ.500 కోట్ల దావా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార వేడి పెరిగింది. అధికార, విపక్ష పార్టీలైన ఆమ్ఆద్మీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ సీఎం కేజ్రీవాల్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆప్ ఇటీవల విడుదల చేసిన ‘లగే రహో కేజ్రీవాల్’ అనే ప్రచారం గీతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పాట తన బోజ్పురి సంగీత అల్బమ్కు చెందిన ఎడిటెడ్ వెర్షన్ అని, తన పాటను కాపీ చేసే హక్కు ఆప్ సర్కార్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. (ఊపేస్తున్న.. ‘లగే రహో కేజ్రీవాల్’) దీనిపై తాను న్యాయపోరాటానికి దిగుతానని, తన మేధో సంపత్తి హక్కులు ఉపయోగించుకున్నందుకు రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసినట్లు మనోజ్ తివారీ ప్రకటించారు. అలాగే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపామన్నారు. అబద్దాలను ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్పై ఆప్ ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘లగే రహో కేజ్రీవాల్’ అంటూ సాగే ఈ ప్రచారం గీతం ఢిల్లీ ప్రజలను విశేషంగా అకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. (తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం!) -
ఢిల్లీని ఊపేస్తున్న.. ‘లగే రహో కేజ్రీవాల్’