అయ్యో కేజ్రీవాల్‌.. ఆలస్యమైందా!

Arvind Kejriwal Fails To Reach ECI Office On time Due To Roadshow File Nomination Tomorrow - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం నామినేషన్‌ వేయలేకపోయారు. ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయానికి ఆలస్యంగా రావడంతో ఎన్నికల సంఘం అధికారులు ఆయన నామినేషన్‌ పత్రాలను స్వీకరించలేదు. దీంతో మంగళవారం ఆయన మరోసారి ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫీస్‌కు వచ్చి నామినేషన్‌ వేయనున్నారు.

న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేసేందుకు బయలుదేరుతూ ఆయన భారీ రోడ్‌షో‌లో పాల్గొన్నారు. తొలుత చారిత్రక వాల్మీకి మందిర్‌లో భగవాన్ వాల్మీకి ఆశీస్సులు తీసుకున్న అనంతరం రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ట్రేట్‌మార్క్ టోపీ, చేతిలో ఆప్ ఐదేళ్ల ప్రోగ్రస్ కార్డును పట్టుకుని కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, కుమార్తె హర్షిత, కుమారుడు పులకిత్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు రోడ్‌షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆప్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కేజ్రీవాల్‌కు స్వాగతం పలికారు.

(చదవండి : ఆప్‌ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్‌)

అయితే జనాలు భారీగా తరలిరావడంతో రోడ్‌ షో ఆలస్యంగా ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటల కంటే ముందే రావాల్సి ఉండగా... భారీ ర్యాలీ కారణంగా రాలేకపోయారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు కేజ్రీవాల్‌ నామినేషన్‌ పత్రాలను స్వీకరించలేదు. మంగళవారం వచ్చి నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు వెలువడనున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top