కేజ్రీవాల్‌ ఉగ్రవాదే

Arvind Kejriwal is a terrorist, theres plenty of proof - Sakshi

కేంద్ర మంత్రి జవదేకర్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉగ్రవాది అని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సోమవారం వెల్లడించారు. గతంలో కేజ్రీవాల్‌ తనకు తానుగా అరాచకవాదినని ప్రకటించుకున్నారని, నా దృష్టిలో అరాచకవాదికి, ఉగ్రవాదికి మధ్య పెద్ద వ్యత్యాసం లేదని ప్రకాశ్‌ జవదేకర్‌ స్పష్టంచేశారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తాన్‌ కమాండో ఫోర్స్‌ చీఫ్‌ గురీందర్‌ సింగ్‌ నివాసమైన మోగాలో కేజ్రీవాల్‌ బస చేశారని గుర్తుచేశారు.

అది ఉగ్రవాది నివాసమని తెలిసీ కేజ్రీవాల్‌ బసచేశారని ప్రకాశ్‌ జవదేకర్‌ ఆరోపించారు. షహీన్‌బాగ్‌లో ఆందోళనలు చేస్తోన్న వారికి ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతు ఇస్తోందని ఆరోపించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారికి కేజ్రీవాల్‌ మద్దతు ఇచ్చారన్నారు. షహీన్‌బాగ్‌లో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న అరాచకవాదులకు మద్దతిచ్చిన నువ్వు నిజంగా ఉగ్రవాదివే అంటూ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top