ఆ ఫొటోలు ఆనాటివి.. వాళ్లతో సంబంధం లేదు! | Arvind Kejriwal On Shaheen Bagh Shooter It Is BJP Petty Conspiracy | Sakshi
Sakshi News home page

ఇంకా 48 గంటలే ఉంది.. అందుకే ఇలా..

Feb 5 2020 12:47 PM | Updated on Feb 5 2020 1:05 PM

Arvind Kejriwal On Shaheen Bagh Shooter It Is BJP Petty Conspiracy - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్రం హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసులతో కలిసి కుట్రకు తెరతీశారని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహిన్‌ బాగ్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్‌ గుజ్జార్‌ అనే వ్యక్తి నిరసనకారులపై కాల్పులకు దిగాడు. ఇక ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరుగనున్న క్రమంలో బీజేపీ- ఆప్‌ నేతలు షాహిన్‌బాగ్‌ కాల్పుల విషయంలో పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా కపిల్‌ గుజ్జార్‌ ఆప్‌నకే చెందిన వ్యక్తి అని బీజేపీ ఆరోపించగా.. ఆప్‌ నేతలు వారి విమర్శలను తిప్పికొట్టారు.(దీనినే ఉగ్రవాదం అంటారా: సీఎం కుమార్తె)

ఈ నేపథ్యంలో కపిల్‌.. ఆప్‌నకే చెందినవాడంటూ ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆప్‌ నేతలతో కపిల్‌ దిగిన ఫొటోలు విడుదల చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన కపిల్‌ కుటుంబ సభ్యులు.. తమకు ఆప్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్‌ నేతలు తమ ఇంటికి వచ్చినప్పుడు ఆప్‌ క్యాపులు ధరించి ఫొటోలు దిగామని పేర్కొన్నారు. పోలీసులు ఇప్పుడు చూపిస్తున్న ఫొటోలు అవేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌... ‘‘కాల్పులు జరిపేంత సామర్థ్యం మాకు ఉందని మీరు భావిస్తున్నారా? కాల్పులు జరిపిన వ్యక్తి కుటుంబమే మా పార్టీతో వాళ్లకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పోలింగ్‌కు ఇంకా 48 గంటలే సమయం ఉన్నందున వాళ్లు(బీజేపీ) పోలీసులను ప్రయోగిస్తున్నారని ఎవరైనా చెప్పగలరు’ అని వ్యాఖ్యానించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement