breaking news
Naveen Yadav
-
మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీవ్రంగా పరిగణిస్తోంది. నగరంలోని మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో దక్కించుకునేందుకు పకడ్బందీగా వ్యూహ రచన చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వాస్తవంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్లో గట్టెక్కడం క్లిష్టమైనా.. అధికార పక్షం కావడంతో ఉప ఎన్నికల కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న ధీమాతో జూబ్లీహిల్స్ సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నా.. అధిష్టానం సర్వే నిర్వహించి గెలుపు గుర్రాన్ని బరిలో దింపాలని యోచిస్తోంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా కొనసాగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి.. రాజధాని నగరంలో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం దక్కింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో మరో నియోజకవర్గం చేజిక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అయితే.. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గెలుపుపై మజ్లిస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వాస్తవంగా నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. మజ్లిస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈసారి కూడా బరిలో దిగితే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.జూబ్లీహిల్స్ సంపన్నులతో పాటు ముస్లింలు అత్యధికం ఉండే నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్ 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మారి 2018, 2023 వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 2014, 2018 వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించి క్రికెటర్ అజహరుద్దీన్ను బరిలో దింపడంతో విష్ణువర్ధన్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్కు మాత్రం ఓటమి తప్పలేదు.టికెట్ రేసులో ముగ్గురు నేతలు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ (Azharuddin) మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మైనారిటీ కోటా కింద మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్లో పేరొందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈసారి బరిలో దిగేందుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో నవీన్ యాదవ్ (Naveen Yadav) కాంగ్రెస్లో చేరారు. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దింపక పోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: జూలై రెండో వారంలో స్థానిక సంస్థల నగారా కార్మిక నేత దివంగత పీజేఆర్ (PJR) కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు. అక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరడంతో భవిష్యత్తులో సైతం ఖైరతాబాద్పై ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. దీంతో తన తండ్రి చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్పై విజయారెడ్డి దృష్టి సారించి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.పెరిగిన ఓటు బ్యాంక్పై ఆశలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో ఓటు బ్యాంక్ పెరగడంతో ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం అదే పునరావృత్తమైతే విజయం సునాయాసమేనని కాంగ్రెస్ భావిస్తోంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిన బీఆర్ఎస్కు 43.94 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్ 35.03 శాతం ఓట్లతో రెండో స్థానానికి పడిపోయింది. లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇక్కడ తన ఓటు శాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది. ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు పునరావృత్తం కావచ్చని అంచనా వేస్తోంది. -
తారంగ హిట్టవ్వాలి – ఎంపీ దయాకర్
‘‘తారంగ’ ట్రైలర్ చూస్తుంటే బలమైన కథతో దర్శకుడు చక్కగా తీశాడనిపిస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘సారంగ’ హిట్టయి, పెద్ద సినిమా అవ్వాలి’’ అన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి, పూజ నాగేశ్వర్ కీలక పాత్రల్లో సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తారంగ’. శ్రీనివాస రెడ్డి కర్రి నిర్మించిన ఈ సినిమా టీజర్ను పసునూరి దయాకర్, గ్లింప్స్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొటీ చేసిన నవీన్ యాదవ్ విడుదల చేశారు. నిర్మాత టి. రామ సత్యనారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ లవ్స్టోరీగా మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు సంపత్ కుమార్, శ్రీనివాస రెడ్డి కర్రి. -
ఆ నలుగురు హడల్
సాక్షి,సిటీబ్యూరో: గత ఎన్నికల్లో వారు ఓటమి చెందినా వారివారి పార్టీలను వీడలేదు. ఈ నాలుగున్నరేళ్లు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానాలు తమకు తప్పకుండా టికెట్ ఇస్తాయని ఆశించారు. కానీ కారణాలు ఏమైనా అనుకున్నది జరగలేదు. టికెట్ల పంపకాల్లో వారిని పక్కన పెట్టారు. దీంతో కలత చెంది తిరుగుబావుటాలు ఎగరేసి నగరంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. తాము ఆశించిన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుంచి కొందరు, స్వత్యంత్ర అభ్యర్థులుగా మరికొందరు బరిలోకి దిగారు. ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తమ బలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని బూత్ స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే, ఈసారి అధికంగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల టికెట్ ఆశించి భంగపడ్డ వారే రెబల్స్గా పోటీలో ఉండడంతో తమ ఓటు బ్యాంక్కు ఏ రూపంలో గండి పడుతుందోనన్న భయం అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. జూబ్లీహిల్స్లో నవీన్ స్వతంత్ర బావుటా గడిచిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. అయితే, ఈసారి ఆయనకు ఎంఐఎం టికెట్ నిరాకరించింది. స్థానికంగా బలమైన కేడర్ గల నవీన్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో బూత్ ల వారిగా ఇప్పటికే కమిటీలను నియమించుకుని పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతున్నారు. సహజంగా ఎంఐఎం–టీఆర్ఎస్ల మధ్య ఉన్న సఖ్యత నవీన్యాదవ్ పోటీతో చెడిపోయింది. దీంతో మైనారిటీ ఓట్లపై టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పెట్టుకున్న ఆశలు నెరవేరే పరిస్థితి లేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జిగా పనిచేసిన మన్నె గోవర్ధన్రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి భారీగానే ఓట్లు సాధించారు. ఈసారి కూడా టికెట్ తనకే ఇస్తారని ఆశించినా నెరవేరలేదు. దీంతో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. గోవర్ధన్రెడ్డి భార్య కవిత వెంకటేశ్వరనగర్ కార్పొరేటర్గా కూడా పనిచేస్తుండడం, ఆయనపై సాను భూతి వ్యక్తం ఉండడంతో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కూకట్పల్లిలో హరీష్రెడ్డి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ పన్నాల హరీష్రెడ్డి కూకట్పల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హరీష్ సతీమణి బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య సైతం విస్తృతంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటి దాకా హరీష్ నియోజకవర్గాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. బూత్స్థాయిలో విస్తృతమైన అనుచరగణాన్ని తయారు చేసుకుని ముందుకు వెళుతున్నారు. హరీష్ టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ ఓట్లు సైతం భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మేడ్చల్ నియోజకవర్గంలోనూ మాజీ టీఆర్ఎస్ నాయకుడు నక్కా ప్రభాకర్గౌడ్ ప్రధాన పార్టీలకు గట్టి సవాల్నే విసురుతున్నారు. ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవంతో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలను మించి ర్యాలీలు నిర్వహిస్తుండడం విశేషం. -
దత్తాత్రేయ ఇల్లు ముట్టడి
‘తెలంగాణ జాగృతి’ విద్యార్థులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తల అరెస్టు హైదరాబాద్: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని తెలంగాణ జాగృతి యువజన విభాగం కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. రోహిత్ ఆత్మహత్యకు బండారు దత్తాత్రేయ కారణమయ్యారని, ఆయన తక్షణం మంత్రిపదవికి రాజీనామా చేయాలని, దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాంనగర్లోని దత్తాత్రేయ నివాసాన్ని తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్, గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ యాదవ్ల ఆధ్వర్యంలో 100 మందికిపైగా విద్యార్థులు ముట్టడించారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తోసుకుని గేటు లోపలికి చొరబడి బైఠాయించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో మంత్రి తన నివాసంలో లేకపోవడంతో ఆయన వచ్చి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలబోమన్నారు. ముషీరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్కు తరలించారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆందోళన: కేంద్రమంత్రి దత్తాత్రేయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ‘మాదిగ రాజ్యాధికార పోరాట సమితి’ కార్యకర్తలు మంగళవారం దత్తాత్రేయ నివాసం ముట్టడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ‘మాదిగ రాజ్యాధికార పోరాట సమితి’ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన నవీన్రాజు మాదిగ, ఈశ్వర్, వినోద్కుమార్ తదితరులు ఉన్నారు.