మరో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానంపై కాంగ్రెస్‌ కన్ను | Congress Keen to Win Jubilee Hills Bypoll | Sakshi
Sakshi News home page

గెలిచే నాయకుడి కోసం హస్తం పార్టీ సర్వే

Jun 16 2025 7:55 PM | Updated on Jun 16 2025 8:03 PM

Congress Keen to Win Jubilee Hills Bypoll

ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత 

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల్లో విజయం స్ఫూర్తితో.. 

లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంక్‌ 

టికెట్‌ రేసులో ముగ్గురు నేతలు  

సాక్షి, హైద‌రాబాద్‌: అధికార కాంగ్రెస్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను తీవ్రంగా పరిగణిస్తోంది. నగరంలోని మరో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానాన్ని ఉప ఎన్నికల్లో దక్కించుకునేందుకు పకడ్బందీగా వ్యూహ రచన చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. వాస్తవంగా బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానమైన జూబ్లీహిల్స్‌లో గట్టెక్కడం  క్లిష్టమైనా.. అధికార పక్షం కావడంతో ఉప ఎన్నికల కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది. కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీటును గెలుచుకున్న ధీమాతో జూబ్లీహిల్స్‌ సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పలువురు టికెట్‌ ఆశిస్తున్నా.. అధిష్టానం సర్వే నిర్వహించి గెలుపు గుర్రాన్ని బరిలో దింపాలని యోచిస్తోంది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా కొనసాగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి.. రాజధాని నగరంలో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ స్థానం దక్కింది. తాజాగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో మరో నియోజకవర్గం చేజిక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అయితే.. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గెలుపుపై మజ్లిస్‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వాస్తవంగా నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. మజ్లిస్‌ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈసారి కూడా బరిలో దిగితే కాంగ్రెస్‌ గట్టెక్కడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ సంపన్నులతో పాటు ముస్లింలు అత్యధికం ఉండే నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్‌ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్‌ 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్‌ నాయకుడు పి.జనార్దన్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్‌ రెడ్డి  కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్‌ తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారి 2018, 2023 వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన విష్ణువర్ధన్‌ రెడ్డి  2014, 2018 వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు టికెట్‌ నిరాకరించి క్రికెటర్‌ అజహరుద్దీన్‌ను బరిలో దింపడంతో విష్ణువర్ధన్‌ బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు మాత్రం ఓటమి తప్పలేదు.

టికెట్‌ రేసులో ముగ్గురు నేతలు.. 
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్‌ (Azharuddin) మళ్లీ టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మైనారిటీ కోటా కింద మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  

మరోవైపు జూబ్లీహిల్స్‌లో పేరొందిన చిన్న శ్రీశైలం యాదవ్‌ కుమారుడు కాంగ్రెస్‌ నేత నవీన్‌ యాదవ్‌ ఈసారి బరిలో దిగేందుకు టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్‌ ఎంపీ సీటు హామీతో నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) కాంగ్రెస్‌లో చేరారు.  2014 ఎన్నికల్లో నవీన్‌ యాదవ్‌ మజ్లిస్‌ పార్టీ నుంచి పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్‌ బరిలో దింపక పోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్‌ దక్కలేదు. ఈసారి టికెట్‌ తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.

చ‌ద‌వండి: జూలై రెండో వారంలో స్థానిక సంస్థ‌ల న‌గారా  

కార్మిక నేత దివంగత పీజేఆర్‌ (PJR) కూతురు, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు. అక్కడి నుంచి గెలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరడంతో భవిష్యత్తులో సైతం ఖైరతాబాద్‌పై ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. దీంతో తన తండ్రి చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్‌పై విజయారెడ్డి దృష్టి సారించి టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.

పెరిగిన ఓటు బ్యాంక్‌పై ఆశలు.. 
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఓటు బ్యాంక్‌ పెరగడంతో ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం అదే పునరావృత్తమైతే విజయం సునాయాసమేనని కాంగ్రెస్‌ భావిస్తోంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిన బీఆర్‌ఎస్‌కు 43.94 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్‌ 35.03 శాతం ఓట్లతో రెండో స్థానానికి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ ఇక్కడ తన ఓటు శాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది. ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు పునరావృత్తం కావచ్చని అంచనా వేస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement