పట్నా: ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ సీటుకు జరిగే ఉప ఎన్నికలో పోటీ చేస్తానని తెలిపారు. ఈ ఎన్నిక రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రిఫరెండం వంటిదని, అక్కడున్న 4 లక్షల ఓటర్లు మార్పు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు.
ఆదివారం ఆయన పట్నాలో మీడియాతో మాట్లాడారు. 2006నుంచి బంకీపూర్ నుంచి ఎన్నికవుతున్న నితిన్ నబీన్ ఈ ఏడాది ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నికవడంతో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేశారు. ఈ నెల 30వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. తనకు మద్దతివ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు బీజేపీని కోరుతానన్నారు. తాము పోటీ చేస్తామని ఆర్జేడీ ప్రకటించింది.
బీహార్ రాజకీయాల్లో బంకిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ, జన్ సూరజ్ పార్టీలకు ప్రతిష్టాత్మక పోరుగా మారింది. బీజేపీకి కంచుకోటగా భావించే ఈ స్థానానికి జూలై 30న పోలింగ్ జరగనుండగా, ఆగస్టు 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నిక ఒకవైపు బీజేపీ సంస్థాగత బలానికి, నితిన్నబీన్ రాజకీయ వారసత్వానికి పరీక్ష కాగా.. మరో వైపు 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రశాంత్ కిషోర్.. ఈ ఉప ఎన్నిక తన పార్టీ బలోపేతానికి అవకాశంగా భావిస్తున్నారు.


