-
వైఎస్సార్సీపీ పిటిషన్పై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతాను చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా బ్లాక్ చేయించడంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మెటా సంస్థను ఆదేశించింది. వారికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, జస్టిస్ రఘునందన్రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.తమ పార్టీ అధికార ఫేస్బుక్ అకౌంట్ను బ్లాక్ చేయడాన్ని సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరామ్ వాదనలు వినిపించారు. వైఎస్సార్సీపీ ఫేస్బుక్ అకౌంట్ను ఏకపక్షంగా బ్లాక్ చేశారని తెలిపారు. ఎవరు ఆదేశిస్తే బ్లాక్ చేశారో చెప్పడం లేదన్నారు. ఎలాంటి నోటీసు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో మెటా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన వివరించారు. ఐటీ చట్ట నిబంధనలను కాలరాసిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఆగస్ట్ 13కు వాయిదా వేసింది. -
‘సీఐపై కేసు.. సాయికృష్ణను చంపేశామని సర్కార్ ఒప్పుకుంది’
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో జంగిల్ రాజ్ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేశారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు.సాయికృష్ణ కేసు విషయమై తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు అవుతుంది. రెండు మూడు కేసులు ఉంటే చంపి బూడిద చేస్తారా?. చంపి బూడిద చేసే హక్కు ఎవరు ఇచ్చారు?. సీఐ మీద కేసు పెట్టడం ద్వారా సాయికృష్ణను చంపేశామని ప్రభుత్వం ఒప్పుకుంది. సాయికృష్ణ తల్లి శోకం మీ కంటికి కనిపించడం లేదా?. ఆ తల్లి కన్నీరు చూసి రాష్ట్ర ప్రజానీకం తల్లడిల్లిపోతుంది.సాయికృష్ణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయి కృష్ణ ఉదంతం పోలీసులకు కనువిప్పు కావాలి. సాయికృష్ణ హత్య వ్యవహారంలో A1గా చంద్రబాబును పెట్టాలి. లోకేష్, అనిత, డీజీపీ, సీపీ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మన రాష్ట్రానికి చేతకాని సీఎం అధికారంలో ఉన్నారు. లాకప్ డెత్ జరిగితే మేకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాయి కృష్ణ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. -
డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరగాలి: సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందోని ఆరోపించారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘డీఎస్సీ నియామకాల్లో అర్హులకు ఉద్యోగాలు అందలేదు. అర్హులైన నిరుద్యోగులకు అవకాశాలు దక్కలేదు. డీఎస్సీ పేపర్ లీక్ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ జరగాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయి. డీఎస్సీ పేపర్ను రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగులు ఇచ్చారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో టీడీపీ సానుభూతిపరులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. వేలాది మంది మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. టీడీపీ స్వప్రయోజనాలు కాపాడే రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయిస్తున్నారు. భూముల కేటాయింపులపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి. రెండు లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు 20,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 5000 రూపాయల లోపే చదరపు అడుగుకు నిర్మాణం ఖర్చు పెడుతున్నారు. ఇదే అమరావతిలో జరుగుతున్న లూటికి నిదర్శనం. ఎన్హెచ్ఏ జాతీయ రహదారుల నిర్మాణానికి కిలోమీటర్కు 20 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారు. అదే అమరావతిలో 58 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో కూడా నిర్మాణపు ఖర్చులు ఈ స్థాయిలో లేవు. ఈ అంశాలపైన సమగ్రమైన సీబీఐ దర్యాప్తు జరగాలి. ఏపీలో దారుణమైన పాలనను కేంద్ర ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్తాం’ అని తెలిపారు. అనంతరం, గాదె సాయికృష్ణ కేసు విషయమై వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో పైశాచిక పాలన జరుగుతోంది. సీఐని సస్పెండ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అని ప్రశ్నించారు. ఆ తల్లికి ప్రభుత్వ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘తమిళనాడులో లాకప్ డెత్ జరిగితే పోలీసులకు జీవిత శిక్ష విధించారు. ప్రాణాలు తీసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారు?. తమిళనాడు కంటే ఘోరమైన ఘటన ఇది. ఎవరికి అన్యాయం జరిగిన వారి పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది అని స్పష్టం చేశారు. -
సీబీఐ దర్యాప్తు జరగాలి
సాక్షి, అమరావతి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన గిగ్ వర్కర్ సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని, అందుకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో విజయవాడ కమిషనర్తో పాటు, రాష్ట్ర డీజీపీకి కూడా ప్రమేయం ఉందన్నారు. కేవలం కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేశారని, విజయవాడ సీపీ, డీజీపీతో సహా బాధ్యులందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని తేల్చి చెప్పారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురైన గాదె సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులను గురువారం ఆయన పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి జరిగిన దారుణం గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్కరూ ఆలోచించాలివిజయవాడ నడిబొడ్డున, అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే డీజీపీ కార్యాలయం. విజయవాడలోనే కమిషనరేట్ కూడా ఉంది. ఇక్కడే ఏసీపీ పరిధి. ఇదే పరిధిలోనే కృష్ణలంక పోలీసు స్టేషన్ ఉంది. ఇదే పోలీసు స్టేషన్ పరిధిలోనే ఈ తల్లి (జగన్ పక్కనే ఉన్న సాయికృష్ణ తల్లి) ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెబుతూ రోదిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఒకటే ఆలోచన చేయమని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంత మంది పోలీసులు, వీరు చేసే పనుల వల్ల ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్కు వెళ్లడానికి భయపడే పరిస్ధితి నెలకొంది. అలా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. అందరూ కూడబలుక్కుని ఒకరినొకరు ఎలా వెనకేసుకు వస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం. ‘పోలీసులు చెబుతున్నట్లు నా కొడుకు దోపిడీలు, దొంగతనాలు చేసి కోట్లు గడిస్తే, ఒక గిగ్ వర్కర్గా ఎందుకు పని చేస్తాడు బాబూ..’ అని ఆ తల్లి తన గోడు వెళ్లబోసుకుంది. ఆ కుటుంబం పరిస్థితి అంత దారుణంగా ఉంది.‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో’ అన్న పోలీసులు ఆ రోజు (మే 9) నుంచే సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగితే, ‘నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో..’ అంటూ ఈ తల్లిని సీఐ హేళనగా మాట్లాడారు. ఆ రోజు నుంచి ప్రతి రోజూ ఆ స్టేషన్లో జరుగుతున్న విషయాల మీద మిగతా వాళ్లు సమాచారం ఇస్తుంటే, తన కుమారుడిని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారని ఆ తల్లికి అర్థమైంది. దీంతో ప్రతి రోజూ అదే పోలీసు స్టేషన్కు వెళ్లి నా కొడుకును నాకు చూపించమని బాధ పడిన పరిస్థితులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద ఈ తల్లితో పాటు చిన్నమ్మ అయిన లాయర్ డీజీపీ ఆఫీసుకు వెళ్లి రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు.హైకోర్టును ఆశ్రయించాక ఒప్పుకున్నారుతన కుమారుడికి ఏదో జరిగిందని ఆ తల్లికి అర్థమై.. తన కొడుకు కనిపించడం లేదు, వీళ్లు ఏదో చేశారని జూన్ 2న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవడంతో పాటు, మన లాంటి వాళ్లంతా ఆ తల్లికి అండగా నిలబడితే గత్యంతరం లేక ఈ రోజు సీఐపై చర్యలు తీసుకున్నారు. చంపేశాడనే కదా సీఐని సస్పెండ్ చేసింది! అంటే ఒకే పోలీసు స్టేషన్లోనే, ఆ సీఐని కాపాడుతూ ఏసీపీ, ఏసీపీని కాపాడుతూ కమిషనర్, కమిషనర్ను కాపాడుతూ డీజీపీ.. ఇలా అందరికీ తెలిసి ఆ స్టేషన్లో జరిగింది ఒక హత్య మాత్రమే కాదు. పోలీసు స్టేషన్లలో ఇలా కొడుతూ ఒకరి చావుకు కారణమైతే, ఇంకొకరు ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నేను ఒకటే చెబుతున్నా. సస్పెన్షన్ అంటే ఏంటి? టెంపరరీగా ఒక పోలీసు అధికారిని డ్యూటీ నుంచి తప్పించడం. అంటే.. గోళ్లు పీకి, చిత్ర హింసలు చేసి హత్య చేస్తే ఆ వ్యక్తిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఇదా చేయాల్సింది? అది కూడా ఇంత పెద్ద ఇష్యూ జరిగి బయటికి వస్తే ఆ సస్పెన్షన్ చేశారు. ఇది బయటికి రాకపోయుంటే ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు.కృష్ణలంకలో జనానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది కదా..ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే..ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్ను, డీజీపీని మర్డర్ కేసు పెట్టి ఛార్జ్ చేయాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్బందీగా, కలిసికట్టుగా నేరం చేసి.. తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది? ఆ పిల్లాడి వయసు 23 ఏళ్లు. అంటే వీళ్లంతా చిన్న పిల్లలే. తెలిసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు. కోర్టు ఈ పిల్లాడిని ప్రొడ్యూస్ చేయమని సమన్ జారీ చేసింది. పోలీసులు చేయాల్సింది ఏంటి? ఆ పిల్లాడిని కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఆ పిల్లాడు తప్పు చేశాడా, లేదా అన్నది విచారణ చేసి కోర్టు నిర్ధారిస్తుంది. ఆ తర్వాత తప్పు జరిగిందని తేలితే కోర్టు శిక్ష వేస్తుంది. కానీ ఇక్కడ కోర్టు పాత్ర లేదు. వీళ్లే తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారు.సీఐ మాత్రమే బాధ్యుడు కాదుసీఐ, ఏసీపీ, కమిషనర్ దగ్గరి నుంచి డీజీపీ దాకా ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి దగ్గరుండి కంటి తుడుపు చర్యలు చేపట్టి, కేవలం సస్పెన్షన్తో సరిపెడితే వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? ఫుల్ స్టాప్ పడాలంటే దీని మీద సీబీఐ దర్యాప్తు జరగాలి. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది బయటికి రావాలి. ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు డిలే జరిగింది? సస్పెన్షన్ మాత్రమే చేసి టెంపరరీగా సీఐని ఉద్యోగం నుంచి పక్కన బెట్టారంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రైమ్లో సీఐ ఒక్కడే కాదు.. ఏసీపీ, సీపీ, డీజీపీ ఇన్వాల్స్ అయి ఉన్నారు. అందుకే సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాం. న్యాయ పోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సాసీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం.మే నెలలోనే రెండు ఘటనలుమే నెలలో సాయికృష్ణది ఓ ఘటన అయితే, క్రాంతికుమార్ అనే మరో యువకుడిది ఆత్మహత్య ఘటన. పలానా పోలీసు స్టేషన్ పరిధిలో పలానా సీఐ రోజూ నన్ను కొడుతున్నాడు.. నేను తట్టుకోలేకపోతున్నాను.. నా చావుకు కారణం ఆ సీఐ.. అని మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. (కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని, తన చావుకు సీఐ కారణమని మరణ వాంగ్మూలం ఇస్తూ క్రాంతికుమార్ విడుదల చేసిన సెల్ఫీ వీడియోను మీడియా ఎదుట జగన్ ప్రదర్శించారు).సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేమే 9వ తేదీ నుంచి రెండు మర్డర్ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారు. ఏ విధంగా వీళ్లంతా నేరాన్ని బయటికి రాకుండా చేస్తున్నారో అర్థం అవుతోంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి, సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఇన్ఛార్జ్లు వచ్చి మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి. కమిషనర్, డీజీపీ వంటి వంటి వ్యక్తులు పూర్తిగా ఇన్వాల్స్ అయ్యి.. నేరం చేయించారని కనిపిస్తున్నా, ఓ ఎస్పీ స్థాయి అధికారికి వీళ్లు దర్యాప్తు చేయడానికి బాధ్యత అప్పగించారట! అంటే వీళ్లు లా అండ్ ఆర్డర్తో, ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం. అందుకే సీఐ మొదలు ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే. దోషులు ఎవరో తెలిసి కూడా ఎలా కాపాడుతున్నారు.. ఎందుకు ఇలాంటి లాకప్ డెత్లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ విచారించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో దుర్మార్గ పాలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందని, దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలను చంద్రబాబు బుట్టదాఖలు చేసి.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎత్తి చూపారు. చంద్రబాబు మోసాలను ఎవరైనా ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు.. రెడ్బుక్ రాజ్యాంగంతో అణగదొక్కే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి.. మిగిలింది మూడేళ్లు మాత్రమే.. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది.. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుందని స్పష్టం చేశారు. ‘వచ్చే రెండేళ్లు పార్టీకి ఎంతో కీలకమైన సమయం.. పార్టీలో ప్రతి ఒక్కరూ నిత్యం ప్రజలతో మమేకం కావాలి.. మీరు ప్రజల కోసం నిలబడండి.. వారి కోసం కష్టపడండి.. మీ అందరి బాధ్యత నాది. నేను స్వయంగా చూసుకుంటాను.. జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది.. అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే కొనసాగిస్తాం’ అని పునరుద్ఘాటించారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతోన్న వైఎస్ జగన్.. ఆ దిశలో భాగంగా గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. కార్యకర్తలు, నాయకులను ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలు, ఏజెన్సీలో అభివృద్ధి ప్రాజెక్టులతో గిరిజనులకు మేలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..మన పాలన, చంద్రబాబు పాలనపై ప్రతి ఇంట్లో చర్చ » ‘ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి నాకన్నా మీకే బాగా తెలుసు. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. ఈ రెండేళ్ల పాలన ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకు ముందు జగన్ను చూశాం.. ఆయన ఐదేళ్ల పాలన చూశామని, ఆ పాలనకు, ఇప్పుడు చంద్రబాబు రెండేళ్ల పాలనకు మధ్య తేడా ఏమిటనేది ప్రతి ఇంట్లో చర్చించుకుంటున్నారు. మన ఐదేళ్ల పాలనలో గతంలో ఎప్పుడూ చూడని, ఎప్పుడూ జరగని విధంగా పాలన అందించామని గర్వంగా చెబుతున్నా. » మనం రాక ముందు వరకు మేనిఫెస్టో అంటే ఏ మాత్రం విలువ ఉండేది కాదు. ప్రజలకు ఎన్నెన్నో చేస్తామని ఎన్నికల్లో మాట చెప్పి, ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసేవారు. అదే మనం వచ్చాక, తొలిసారిగా మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి, 99 శాతం అమలు చేసిన పార్టీ ఒక్క మన వైఎస్సార్సీపీ మాత్రమే. బడ్జెట్ సమావేశాలకు ముందే పథకాలు, తేదీలు ప్రకటించి, క్రమం తప్పకుండా అమలు చేసింది కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా పరిపాలనలో మార్పులు కూడా చేశాం.» మనం రాకముందు స్కూళ్లు ఎలా ఉండేవి? మనం వచ్చిన తర్వాత ఎలా మారాయి?.. అనేది నాకన్నా మీరు బాగా చెప్పగలుగుతారు. మనం రాక ముందు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు ఎలా ఉండేది? మనం వచ్చాక ఆరోగ్యశ్రీని ఎంత బాగా అమలు చేశాం.. అనేది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు వ్యవసాయం ఎలా ఉండేది? రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు.. మనం వచ్చిన తర్వాత రైతన్న ఎలా బాగుపడ్డాడు.. వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది మీరే బాగా చెప్పగలరు. మనం రాక ముందు గ్రామాల్లో ఏ పథకం అందక, పరిపాలన అందక, దేనికైనా ఎవరెవరికో డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. అదే మన వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక, పాలన ఎలా మారింది? గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలు ఎలా అందాయి? అన్నీ చేసి చూపించాం. » సచివాలయాల వ్యవస్థ.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్. ఇంటి గడప వద్దే ప్రభుత్వ పథకాలు అందాయి. ఇన్ని గొప్ప మార్పులు తీసుకురాగలిగాం. విద్య, వ్యవసాయం, వైద్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చాం. దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం. వారికి తోడుగా నిలబడ్డాం. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ను సచివాలయంలో ఉంచాం. గిరిజనులు.. గిరిజన ప్రాంతాల్లో మార్పులు » ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూడా మన హయాంలోనే జరిగింది. ఎప్పుడూ చూడని విధంగా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేశాం. 3,22,528 ఎకరాలు, ఆర్ఓఎఫ్ఆర్ డీకేటీ భూముల భూ పట్టాలు పంపిణీ చేశాం. ఒక్క రంపచోడవరంలోనే 20 వేల మందికి 80 వేల ఎకరాల భూముల ఆర్ఓఎఫ్ఆర్ డీకే పట్టాలు పంపిణీ చేశాం. » ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుడితే, వాటిలో ఒక్క మన ప్రాంతంలోనే పాడేరు, పార్వతీపురంతో పాటు, ఏజెన్సీ ముఖ ద్వారమైన నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు తెచ్చాం. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. మన గిరిజనులు బాగు పడాలి.. వారు చదువుల్లో ముందుండాలన్న ఆరాటం కేవలం మన ప్రభుత్వంలోనే కనిపించింది. » ఎప్పుడూ చూడని విధంగా ఐటీడీఏల పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో తలపెట్టి, వేగంగా పనులు చేశాం. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగాయని గర్వంగా చెప్పగలను. ఒక తపన, తాపత్రయంతోనే ఇవన్నీ చేశాం. మనుషుల జీవితాలు బాగు పడాలి. వారి బతుకులు మారాలి. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న తపనతో పని చేశాం.ప్రశ్నిస్తే ఓర్చుకోలేకపోతున్నారుచంద్రబాబుకు ఎందుకు ఓటేశాం? జగన్ను ఎందుకు పోగొట్టుకున్నామనే విషయంపై ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. మిగిలింది మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. త్వరలోనే దుర్మార్గ పాలన పోతుంది. అంతా అన్యాయమైన పాలన. చంద్రబాబు మోసాలపై ప్రశ్నిస్తే దొంగ కేసులు.. దొంగ సాక్ష్యాలు.. వేధింపులు. రెడ్బుక్ రాజ్యాంగం.. అందరినీ కోరేది ఒక్కటే. చీకటి ఎప్పటికైనా పోతుంది. వెలుగు రాక తప్పదు.ఎన్నికల ముందు వారేం చెప్పారు?ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ ఇచ్చేవి మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఇంకా ప్రతి ఇంటికి చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఫొటోలు, సంతకాలతో బాండ్లు పంపారు. ప్రతి ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారున్నారా? అయితే నీకు రూ.4 వేలు, నీకు రూ.4 వేలు. అలా ఏడాదికి రూ.48 వేలు ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలు కనబడితే ఏడాదికి నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని చెప్పారు. 18 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువకుడు కనిపిస్తే.. నీకు ఏడాదికి రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని చెప్పారు. మీకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్నాయా? మీరు రైతులా? అయితే మీకు రూ.26 వేలు ఇస్తామన్నారు. మనం ఇచ్చిన దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి, మేనిఫెస్టో చూపి, ఒక పద్ధతి ప్రకారం మోసం చేశారు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి? రెండేళ్లు గడిచాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటన్నది చూస్తే.. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున, రెండేళ్లలో రూ.36 వేలు బాకీ. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, రెండేళ్లలో ప్రతి పిల్లాడికి రూ.72 వేలు బాకీ. 50 ఏళ్లు నిండిన వారికి నెలకు రూ.4 వేల చొప్పున, రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మరోవైపు అమ్మ ఒడి తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. మిగిలిన వారికి ఇచ్చింది కూడా రూ.8 వేలు. రూ.9 వేలు మాత్రమే. కొందరికి రూ.13 వేలు ఇచ్చారు. రైతు భరోసా కింద పీఎం కిసాన్ కాకుండా రూ.20 వేలు ఇస్తానన్నాడు. అంటే రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది రూ.14 వేలు. ఇక్కడ బాకీ రూ.26 వేలు. గ్యాస్ సిలిండర్లు ఏటా మూడు ఉచితం అన్నారు. రెండేళ్లలో రెండు మాత్రమే ఇచ్చారు. అది కూడా అందరికీ ఇవ్వలేదు.పేదల పక్షాన నిలబడండి.. జగన్ 2.0లో మీకే అధిక ప్రాధాన్యం ఇంకా మూడేళ్లు. చివరి ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి. ఈ రెండేళ్లు చాలా ముఖ్యం. ఈ కాలంలో పార్టీని మోయాల్సిన బాధ్యత, బాధితులైన ప్రజల పక్షాన పార్టీ తరఫున నిలబడాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై ఉందని మర్చిపోవద్దు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. రేపు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0లో కార్యకర్తలను బాగా చూసుకుంటాను. గత పాలనలో మన కార్యకర్తలను అంత బాగా చూసి ఉండకపోవచ్చు. మనం రాగానే కోవిడ్ రావడంతో, రెండేళ్లు పరిపాలన మీదే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. కానీ, ఈసారి అలా ఉండదు. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మీ ఆధ్వర్యంలోనే, మీ చేతుల మీదుగానే అందిస్తాం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు పేదలకు అండగా, తోడుగా ఉండండి. అది మాత్రమే మిమ్మల్ని కోరుతున్నాను. మిగతా అన్ని విషయాల్లో మీకు తోడుగా నేనుంటాను’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పోలవరం ముంపు ప్రాంతాల్లో పరిహారం చెల్లింపుల్లో వివక్ష కొనసాగుతోందని సమావేశంలో కార్యకర్తలు ప్రస్తావించగా, దీనిపై పార్టీ తరఫున పోరాడుతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నిర్వాసితులు తమ పార్టీలో చేరితేనే పరిహారం ఇస్తామని చెబుతున్నారని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై పోరాటం కొనసాగిస్తామని, అయినా న్యాయం జరగకపోతే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో రంపచోడవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ నాగులాపల్లి ధనలక్ష్మితో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
‘చంద్రబాబూ.. బీచ్ల్లో బార్లపై ఉన్న శ్రద్ధ.. రైతులపై లేదా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కానీ ప్రభుత్వం మాత్రం బీచ్ల్లో బార్లు ఏర్పాటు చేయడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారని మండిపడ్డారు.తాడేపల్లిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘అన్నపూర్ణగా పిలుచుకునే ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో అనేక మంది రైతులు తనువు చాలించారు. ప్రభుత్వానికి రైతుల గురించి మాట్లాడే తీరిక లేదు. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో 60 నుంచి 65 శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రతిపక్ష నేతలను తిట్టడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. మంచి పనులు చేయటం మీద దృష్టి పెట్టకుండా నిత్యం వైఎస్ జగన్ మీద విషం చిమ్మే పనిలో ఉన్నారు.గతేదాడి వేలాది మంది రైతులు ఎరువులు, విత్తనాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు ఎరువుల మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోలేదు. ప్రతీ విషయంలో మోసం చేయటం చంద్రబాబు నైజం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నారు.. ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్ హయంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల రైతులు నిలబడ్డారు. జగన్ వచ్చిన తర్వాత 1700 కోట్లు ఖర్చు చేసి 9 గంటలు విద్యుత్ ఇచ్చారు. తోతాపురి మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఏడాది జగన్ వెళ్ళి ఆందోళన చేస్తే కేసులు పెట్టారు. ప్రతిపక్షంగా మేము గట్టిగా మాట్లాడితే మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులకు కావాల్సిన మినిమం సపోర్ట్ కూడా ప్రభుత్వం నుంచి లభించటం లేదు. ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.గాదె సాయికృష్ణ అనే యువకుడిని పోలీసులు చంపేశారు.. కనీసం డెడ్ బాడీ ఇవ్వాలని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేం ఇదే విషయం ప్రశ్నిస్తే కులాల ప్రస్తావన తీసుకువస్తారు. బీచ్లో బార్స్ పట్టడానికి ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ బ్లాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతుల ఉసురు తగిలితే గాలికి కొట్టుకుపోతారు. తక్షణమే రైతుల గురించి ఆలోచన చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
‘సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమైందని వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్ ఆరోపించారు. సీపీగా రాజశేఖర్ బాబు వచ్చాక విజయవాడ గాడి తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరం విజయవాడలో జరిగింది. పోలీసులే యువకుడిని కొట్టి చంపేసి, కాల్చి బూడిద చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు.గాదె సాయికృష్ణ ఘటనపై దేవినేని అవినాష్ స్పందిస్తూ..‘విజయవాడ నగరంలో పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. రెండేళ్లుగా గంజాయి విక్రయాలు, సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో లా అండ్ ఆర్డర్ని సీపీ రాజశేఖర్ బాబు గాలికి వదిలేశారు. దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే సీపీ పట్టించుకోవడం లేదు. రౌడీ షీటర్స్ నడిరోడ్డుపై ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దర్జాగా తిరుగుతున్నారు. పేకాట క్లబ్లు విచ్చలవిడిగా నడుస్తున్నా సీపీ పట్టించుకోరు.సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది. సీపీ బాధ్యత వహించాలి సమాధానం చెప్పాలి. సీపీ ఎందుకు మాట్లాడటం లేదు?. వైఎస్సార్సీపీ నేతల్ని వేధించడంలో సీపీ రాజశేఖర్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కళ్లలో ఆనందం చూడటానికే సీపీ పని చేస్తున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమై బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు?. మీ పార్టీల జెండాలు పట్టుకుని ఎన్నికల్లో తిరిగిన కుటుంబానికి మీరు ఇచ్చిన భరోసా ఏది?. సాయికృష్ణను కొట్టి చంపేసి కాల్చి బూడిద చేశారు. ఇదే నిజం. బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కనీసం పరామర్శించలేదు. జనసేన ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసు ఏకంగా డబ్బులిస్తామని సెటిల్మెంట్ చేస్తున్నాడు’ అంటూ విమర్శలు గుప్పించారు. -
మామిడి పంటకు గిట్టుబాటు ధర.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో మామిడి రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ సంఘీభావం తెలిపింది. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మామిడి రైతులతో కలిసి పార్టీ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. జీడి నెల్లూరు జైన్ ఫ్యాక్టరీ ఎదుట వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆధ్వర్యంలో నిరసన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున మామిడి రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.కాగా, గత ఏడాది మామిడి పంటకు కిలో 12 రూపాయలు గిట్టుబాటు ధరను ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది మామిడి పంటను తక్కువ ధరకే కిలో 4 నుంచి 5 రూపాయలకు మించి జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయడం లేదు. జ్యూస్ ఫ్యాక్టరీల యజమాన్యాలు సిండికేట్గా మారి మామిడి రైతులను నిలువు దోపిడి చేస్తున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోతాపురి మామిడి పంటకు కిలో 15-20 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మామిడి రైతులకు మద్దతుగా నిలవడంతో ముందుగా మామిడి లోడు ట్రాక్టర్లను పోలీసులు లోపలికి పంపించారు. జైన్ ఫ్యాక్టరీ ఎదుట భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక, మూడు నుంచి నాలుగు రోజుల పాటు మామిడి రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. -
చంద్రబాబూ.. ప్రజల కోసమా?.. పబ్లిసిటీ కోసమా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు భలే తమాషాగా ఉంటాయి. జనం నమ్ముతారా? లేదా? అన్నదానితో ఆయనకు నిమిత్తం ఉండదు. ప్రజలు వింటున్నారా? లేదా? అన్నదానితో సంబంధం ఉండదు. తన టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్లోని పాయింట్లను అన్నిటిని చెప్పానా? లేదా? అన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఆయా సభలలో చేసిన ఒక వ్యాఖ్య చూడండి. 'బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకునే పరిస్థితి ఉండదు" అని ఆయన అన్నారు. ఇది గత ముఖ్యమంత్రి జగన్పై చేసిన పరోక్ష ఆరోపణ అని తెలుస్తూనే ఉంది. కాని ప్రజలు తమకు ప్రభుత్వంలో ఉన్నవారు ఇస్తామన్న సంక్షేమ స్కీమ్లు ఇచ్చారా? లేదా? తమకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందా? లేదా? అన్నది చూస్తారు తప్ప, తమ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ అందించారా?లేదా? అని ఎవరైనా ఆలోచన చేస్తారా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం లేకపోలేదు.గత జగన్ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందించడమే కాకుండా, వారికి అన్ని అవసరాలలోనూ వెన్నంటి ఉండేవారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లడం అంటే ఏమిటో ఆ రోజుల్లో జనం చూశారు. ఆ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని గుర్తించారు. అంతే! వెంటనే పరకాయ ప్రవేశం చేసేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జగన్ ఐదువేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటన చేశారు. పైగా అది కూడా తెలుగువారంతా పవిత్రంగా భావించే ఉగాది నాడు పూజలు చేసి మరీ చంద్రబాబు ఈ ఉపన్యాసం ఇచ్చారు. ఎవరినైనా మోసం చేయాలనుకుంటే వారికి ఏదైనా ఆశ చూపాలని ఒక సినిమా డైలాగు ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తనకు భోజనం చేయడానికి డబ్బు లేదని సాయం చేయాలని రోడ్డు పక్కన ఉన్న ఒకాయనను అడుగుతాడు. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించడు. పైగా తిడతాడు. ఆ తర్వాత అదే వ్యక్తి తన వద్ద ఉన్న వాచ్ ఖరీదు ఐదువేలు అని, తనకు అత్యవసరం కనుక 500 రూపాయలకే ఇవ్వాలని అనుకుంటున్నానని, తీసుకోండని రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతనినే కోరతాడు. నిజానికి దాని ఖరీదు 150 రూపాయలే. ఆ వాచ్ను పరిశీలించిన అతను 400 రూపాయలకు ఇస్తే తీసుకుంటానని అంటాడు. ఆ రకంగా వాచ్ అమ్మిన వ్యక్తి లాభపడతాడన్నమాట.ఆశకు లొంగి రెండో వ్యక్తి మోసపోయాడన్నమాట. ఈ కథకు, చంద్రబాబు ప్రకటనకు నేరుగా సంబంధం ఉందా? లేదా అన్నది పక్కనబెడితే, ప్రజలను ఆశపెట్టి వారికి ఆకర్షించడంలో చంద్రబాబు సిద్దహస్తుడే అన్న అభిప్రాయం ఉంది. ఆ రకంగా వలంటీర్లను వలలో వేసుకుని, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మొత్తం వలంటీర్ల వ్యవస్థకే పంగనామాలు పెట్టారు. దాంతో అంతకుముందు జగన్ టైమ్లో ఇచ్చిన ఐదువేల గౌరవ వేతనం రాకుండా పోయింది. అలాగే ప్రజలు తమ ఇళ్లవద్దనే అందుకుంటున్న సేవలకు మంగళం పలినట్లయింది. పైగా పెన్షన్ ఇవ్వడానికో, లేదా మరో కార్యక్రమం నిమిత్తమో చంద్రబాబు ప్రత్యేక హెలికాఫ్టర్ వేసుకుని వెళతారు. దీనికి లక్షల్లో ఖర్చు చేయాలి. అలాగే వెళ్లిన గ్రామంలో సభ నిర్వహణకు మరిన్ని లక్షల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది.వృద్దాప్య పెన్షన్ జగన్ టైమ్లో మూడువేల రూపాయలు ఉండేది. దానిని వలంటీర్ల ద్వారా మొదటి తేదీ తెల్లవారేసరికల్లా అందించేవారు. ఇప్పుడు దానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి నాలుగువేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు హెలికాఫ్టర్ టూర్ చేయడం గొప్ప సంగతి అని ప్రొజెక్టు చేసుకుంటున్నారు. ఒక ఇంటికి వెళితేనే ఆయనకు అంత తృప్తి అయితే, వైఎస్సార్సీపీ హయాంలో అందరి ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పెన్షన్ అందిస్తే, అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చినట్లవ్వదా! అన్నది వైఎస్సార్సీపీ ప్రశ్న. పోనీ ఇలా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా చేశారా? అంటే లేదు.1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన పవర్ లో ఉన్నారు కదా! ఆ టైమ్లో ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఇప్పుడు వలంటీర్ల బదులు గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు కాని, అది అంత సఫలం అవుతున్నదా? అన్నది చర్చ ఉంది. కాగా సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ వేధింపులను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి.గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఒక్కటే కాదు. పౌరసరఫారాల శాఖ అందించే బియ్యం, ఇతర వస్తువులను కూడా వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఇవ్వడం లేదే! అప్పట్లో ప్రత్యేకంగా వ్యాన్లు పెట్టి సరుకులను డోర్ డెలివరీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి జనం సరుకులు తీసుకోవలసి వస్తోంది. అనేక చోట్ల ప్రజలు క్యూలలో, రద్దీలో గుమికూడవలసి వస్తోంది. ఇది ప్రజలకు సౌకర్యం కల్పించినట్లు అవుతుందా? ఇదే కాదు.. ప్రజలు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో కాని, అప్లికేషన్లు పెట్టుకోవడంలో కాని, అనేక రకాలుగా వలంటీర్ల సేవలను ప్రజలు పొందేవారు. ఆ వ్యవస్థను తీసివేసి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.వలంటీర్లు ఆందోళనలు చేసి కూటమి ప్రభుత్వంలో తమ ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకున్నారు. జగన్ కూడా కొన్ని స్కీమ్ల అమలు నిమిత్తం ఆయా చోట్ల సభలు నిర్వహంచకపోలేదు. అయినా జగన్ బటన్ నొక్కడమే చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అది వేరే సంగతి. విపక్షంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడం ఏముంది.. మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని విమర్శలు చేసేవారు. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కడం తప్పు అన్నట్లు చెబుతున్నారు. ఒకవైపు పొదుపు మంత్రం చెబుతూ, దుబారాపై ఆదేశాలు ఇస్తూ, తానేమో ప్రజల డబ్బును లక్షలలో వృధా చేస్తున్నారు. అది గొప్ప విషయం అని జనాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.వృద్దాప్య పెన్షన్ను సీఎం ఇచ్చినా, వలంటీర్ ఇచ్చినా లబ్దిదారులకు తేడా ఉండదు. వారికి కావల్సింది ఆర్థికసాయమే. వెయ్యి రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల ప్రచారం చేసుకోవలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలలో అనేకమైన వాటిని ఎగవేసి, దానిని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు నానా పాట్లు పడడానికి ఈ సభలు, ఈ జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలను స్వయంగా కలిసి కష్ట సుఖాలను నిజంగా చంద్రబాబు తెలుసుకుంటున్నారా? లేక తన పబ్లిసిటీలో భాగంగా దీనిని ఒక ఈవెంట్ గా మార్చారా? అన్నది చర్చనీయాంశమే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
రంపచోడవరం కేడర్తో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రంపచోడవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతోంది. -
నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై ప్రముఖ న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏదైనా కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన నిబంధన ఉందని అన్నారు. అయితే గాదె సాయికృష్ణ వ్యవహారంలో ఆ నిబంధనలు పాటించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. సాయికృష్ణ కేసులో కూటమి ప్రభుత్వ పనితీరు.. ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ. భారతదేశ చరిత్రలో ఇంత హీనమైన, హేయమైన ఘటన ఎప్పుడూ లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూటకట్టి అటకపై పడేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారమైనా తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే కొందరు పోలీసులు చేసేదే లాకప్ డెత్. చట్టాలు అప్ గ్రేడ్ అయినట్లు పోలీసులు కూడా అప్ గ్రేడ్ అయినట్లున్నారుఏపీ హోంమంత్రికి ఓ కత్తెర మంత్రి. ఇన్ విజిబుల్ పోలీసింగ్ అని ఏదో ఒక్క అర్ధం చెబుతున్నారామె. నా పాతికేళ్ల న్యాయవృత్తిలో ఇలాంటి పదాలు నేనెప్పుడూ వినలేదు. లాకప్ డెత్ లు జరిగినపుడు పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారుసాయికృష్ణను చంపేసి బూడిద చేశారని అతని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకుని చూపించమని పోలీసులను సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకూ నేను అండగా ఉంటా. న్యాయపరంగా అవసరమైతే సాయం అందిస్తా. సాయికృష్ణకు జరిగిన అన్యాయం పై కులమతాలకు అతీతంగా అండగా నిలవాలిహోంమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. మే 9 నుంచి ఈరోజు వరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని బయటపెట్టాలి. స్టేషన్ మొత్తం సిసి కెమెరాలు ఉంటే.. సీఐ రూమ్లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు. ఏపీలో ప్రతీ స్టేషన్లో ఇంటరాగేషన్ కోసం వ్యక్తిగత రూమ్ లు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణలంక సీఐ వ్యక్తిగత రూమ్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయిసాయికృష్ణ మృతి కేసులో ఏ1 ముద్దాయి మంత్రి లోకేష్. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే ఏపీలో లా అండ్ ఆర్డర్ పాతరేశారు. ఏ2 ముద్దాయి సీఎం చంద్రబాబు. చంద్రబాబు కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడు. లోకేష్ దుర్యోధనుడి మాదిరి రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు. ఈ కేసులో ఏ3 ముద్దాయి పవన్ కళ్యాణ్. పవన్ తనకు దేవుడిచ్చిన అన్న అని లోకేష్ అంటున్నాడు. పదేళ్లక్రితం ఇదే దేవుడిచ్చిన అన్నను పచ్చి బూతులు తిట్టించింది లోకేష్ కాదా?. కౌరవులకు ఉన్న ఏకైక సోదరి హోంమంత్రి అనిత*తెనాలిలో ఎన్డీపీఎస్ కేసులో ముగ్గురు యువకులను నడిరోడ్డు పై పోలీసులు చితకబాదారు. తెనాలి ఘటన చూశాక న్యాయవాదులు, న్యాయ మూర్తులు నీళ్లులేని బావిలో దూకి చావాలి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయవ్యవస్థ.. పోలీసులు కాదు. కాపీ కొట్టి పాసై టీచర్ అయిన హోంమంత్రి ఈ విషయం తెలుసుకోవాలి. సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పడానికి కాదు నీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. హెరిటేజ్ మీద ఎవరైనా మాట్లాడగానే సీఎఫ్ఓ మాదిరి హోంమంత్రి తెరపైకి వస్తారు. ఎందుకు సాయికృష్ణ అంశం పై హోంమంత్రి మాట్లాడలేదు. ఎందుకు హోంమంత్రి సీఐపై మాట్లాడలేదు. జడ్జీలను సైతం కొనేద్దామని భావన ఈ పోలీసులు, మంత్రులది.సాయికృష్ణ చనిపోయిన రోజునే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి తెలుసు. సీఎం, హోంమంత్రి మనల్ని కాపాడతాడని సీఐకి సీపీ భరోసా ఇచ్చారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని తక్షణమే సస్పెండ్ చేయాలి. సీపీతో పాటు ఆరోజే హోంమంతికి కూడా ఈ విషయం తెలుసు. వారం రోజుల తర్వాత సీఎం,డిప్యూటీ సీఎంకు కూడా తెలుసు.. హోంమంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. రాజశేఖర్ బాబు ఇక్కడ ఉండగా విచారణ సజావుగా సాగదు. కాబట్టి సీపీగా రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలి. క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు. పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇలా లాకప్ డెత్ లు చేయడమేనా పోలీస్ వ్యవస్థ అద్భుత పనితీరు?. రెండు కేసులున్న వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే.. 40 కేసులున్న చంద్రబాబును ఏ స్టేషన్కు పంపిస్తారు?. వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపణలున్న లోకేష్ ను ఏ స్టేషన్ కు పంపిస్తారు?. హోంమంత్రి మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా నీ శాఖ పై పెడితే బాగుంటుందిఈ రెండేళ్లలో ఆడపిల్లల పై ఏపీలో జరిగిన నేరాల సంఖ్య 44,586. శిక్షలు పడింది కేవలం 541 కేసుల్లో మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం నాలుగు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన డేటా 10 క్లాస్ ఫెయిల్ అయిన మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా?. హోం శాఖ నిర్వహిస్తున్న హోంమంత్రికి.. డీజీపీకి సిగ్గుండాలిసీఎం సొంత జిల్లాలో కేవలం 10 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. డిప్యూటీ సీఎం జిల్లాలో శిక్షపడింది 14 కేసుల్లో మాత్రమే. రాష్ట్రంలో 46 వేల మంది ఆడిపిల్లలకు అన్యాయం జరిగితే ఏనాడైనా వారి ఇంటికి వెళ్లారా డిప్యూటీ సీఎం?. ఉపముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏంపీకారు?. పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనాగతంతో పోల్చుకుంటే 24 శాతం ఆడపిల్లల పై నేరాలు పెరిగాయి. పోలీస్ డిపార్ట్ మెంట్కు క్రెడిట్ ఇవ్వాలని అడగడానికి సిగ్గుందా?. సాయికృష్ణ మృతదేహాన్ని కాని..అతని బూడిదను కానీ ఇచ్చి అప్పుడు క్రెడిట్ తీసుకోండి. సాయికృష్ణ తల్లి కన్నీళ్లకు సమాధానం చెప్పి క్రెడిట్ తీసుకోండి. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ బ్రతికేహక్కుంది. మోకీళ్లు తీసేస్తా ... అరచేతిలో రేఖలు చెరిపేస్తానని డిప్యూటీసీఎం చెబుతుంటే పోలీసులకు ఏం ఇండికేషన్ ఇచ్చినట్లు?. సిగ్గులేకుండా సోషల్ మీడియాలో సాయికృష్ణ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. సాయికృష్ణ తల్లి కడుపుకోతతో బాధపడుతోంది. ఆ తల్లికి దళితసోదరులంతా అండగా నిలవాలి. కాపుల ఓట్లు వేయించుకుని పవన్ కాపులను గాలికి వదిలేశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు అని జడ శ్రవణ్ మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? అనే అంశం ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పోలీసు శాఖ నుండి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది. -
నన్ను గెలికితే.. ‘ఆపరేషన్ సింధూర్’ తప్పదు!
జమ్మలమడుగు: ‘‘నేను ఎవరి జోలికీ వెళ్లను, ఎవరినీ గెలకను.. కానీ నన్ను ఎవరైనా గెలికితే మాత్రం ‘ఆపరేషన్ సింధూర్’ చేపడతా’’ అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సి.ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర బెదిరింపులకు దిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా జమ్మలమడుగులో నిర్వహించిన ర్యాలీ అనంతరం పాత బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభ ప్రారంభం నుంచి ఎమ్మెల్యే ప్రసంగిస్తున్నంత సేపూ కింద ఉన్న కొందరు కార్యకర్తలు అరుస్తూ గోల చేస్తుండటంతో ఆదినారాయణరెడ్డి తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆవేశంతో..కోపంతో ఊగిపోతూ.. ‘‘నేను మూడు రెండు వేసి అరుస్తాను.. నేను ఆరు వేసినా అరవకుండా ఉంటారా?’’ అంటూ హెచ్చరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నివిధాలుగా అభివృద్ధి చేశామంటూ ప్రగల్భాలు పలికారు. నియోజకవర్గంలో చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ఆయన మైకులో చెబుతుండగానే.. కింద ఉన్న ఒక చేనేత కార్మికుడు గట్టిగా స్పందిస్తూ, తనకు ఇంత వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు రాలేదని అందరి ముందూ వాపోవడంతో సభలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది.వైఎస్సార్సీపీ సభకు పోటీగా పెట్టినా.. వెలవెలబోయిన కూటమి సభ!ఈ నెల 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన ’వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చి సభను భారీగా విజయవంతం చేశారు. దానికి పోటీగా ఎలాగైనా సరే జమ్మలమడుగులో అంతకంటే పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి తామేంటో నిరూపించుకోవాలని కూటమి నేతలు ఆశపడ్డారు. అయితే, వైఎస్సార్సీపీ సభకు వచ్చిన జనంలో సగం మంది కూడా ఈ రోజు కూటమి సభకు రాలేదని, కేవలం నాలుగు నుంచి ఐదు వేల మంది మాత్రమే హాజరయ్యారని అక్కడికి వచ్చిన వారి సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకోవడం ఇక్కడ కొసమెరుపు. -
సమాధానం చెప్పలేక ఉత్తర కుమార సవాళ్లా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 స్కామ్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో చర్చకు తాను సిద్ధమని.. సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా సరే.. లేదా తనను చెప్పమన్నా రెడీ అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతి సవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని.. ఈలోగా డీఎస్సీ స్కామ్పై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజల ఎదుట ఉంచిన అంశాలను మరోసారి గుర్తు చేస్తున్నామని.. ముందు వాటికి జవాబు చెప్పాలని సూచించారు. ‘లోకేశ్..! సరుకు లేక సవాళ్లు విసరడం ఏమిటి? వైఎస్ జగన్ ప్రెస్మీట్ విన్నావా అసలు? నువ్వుగానీ, మీ నాన్న గానీ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు. వినలేదా? లేక విని కూడా వినపడనట్లు నటిస్తున్నారా? అని ఈ రాష్ట్రంలో యువత అడుగుతోంది.. తల్లిదండ్రులు అడుగుతున్నారు.. ప్రజలు అడుగుతున్నారు.. జగన్ ప్రశ్నలకు జవాబు చెబుతారని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ప్రతి నిరుద్యోగి నీ నుంచి సమాధానం ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ సూటిగా, స్పెసిఫిక్గా ప్రశ్నలు అడిగారు. వాటికి నేరుగా జవాబు చెప్పే ధైర్యం లేక 200 మీటర్ల దూరంలో నీ ఇల్లు ఉంది అని సవాల్ విసురుతావా? మీ నాన్న సవాల్ విసిరితే ఏదైనా అర్ధం ఉంటుంది. మెగా డీఎస్సీ స్కామ్పై అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీన్ని బట్టి తప్పు జరిగిందని అర్థమవుతోంది. అది నీకు కూడా తెలుసు. దాన్ని డైవర్ట్ చేయటానికే సవాల్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారు. అయినా నువ్వు అడుగుతున్నావ్ కాబట్టి.. ఆ దగా పడ్డ డీఎస్సీ అభ్యర్థులతోనే కలసి వస్తా. వాటికి సమాధానం చెప్పు.. మనిద్దరం మంత్రులుగా చేశాం కాబట్టి సమ ఉజ్జీలం.. నీ స్థాయికి నేను చాలు.. అయినా నీకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటా. అందుకే ఆ ప్రశ్నలన్నీ మళ్లీ నిన్ను అడుగుతున్నా. నీకు గుర్తుండేలా ఈసారి అన్ని పత్రికల్లో ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టి ప్రచురించమని కోరుతున్నా. పార్టిసిపెంట్కు ఉద్యోగం ఇచ్చేసి.. గోల్డ్మెడల్ సాధించిన వారికి పోస్టు ఎందుకు ఇవ్వరని గోల్డ్మెడల్ విజేత, డీఎస్సీ అభ్యర్థి దుర్గయ్య అడిగిన ప్రశ్నకు నీ దగ్గర జవాబేది లోకేశ్? ముందు దుర్గయ్య ప్రశ్నకు జవాబు చెప్పు. తరువాత నేను వస్తా.. ’అని పేర్ని నాని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ స్కామ్పై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని వ్యాఖ్యానించారు. డీఎస్సీ స్కామ్ను బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కామ్ జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని గుర్తు చేశారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, అవినీతిమయమైన నియామక ప్రక్రియను ఎన్నడూ చూడలేదన్నారు. 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నలకు జవాబేది లోకేశ్..?1. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి (నవీన్) ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి మెగా డీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? మరి మొదటి ర్యాంకు వచ్చిన నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? లాగిన్ ఐడీ ఎందుకు బ్లాక్ చేశారు? డేటా ఎందుకు తొలగించారు? అతడి వివరాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? సర్టిఫికెట్ వెరిఫికేషన్కు ఎందుకు పిలవలేదు? అంటే పేపర్ లీకేజీ జరిగిందని మీరు ఒప్పుకున్నట్లే కదా? వెరిఫికేషన్కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? అదే నిజమైతే అతడు ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?2. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీఓ నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాలి. కానీ జీవో నెం:4, జీఓ నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏమిటి? అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు టీచర్ పోస్టులు ఎలా ఇస్తారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జీఓ నెం:25, జీఓ నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కామ్ కాదా?3. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? జూడో అసోసియేషన్కు మీ ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లు ఇచ్చిందీ ఆ అసోసియేషన్లే.. అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?4. క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా కేవలం పార్టిసిపెంట్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?5. మెరిట్, ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు, ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి? అనే విషయాలన్నీ మీకు ముందుగానే తెలుసు కాబట్టి అన్నీ పరిశీలించాకే రూల్ నంబర్ 20 ప్రకారం వెరిఫికేషన్కు 1 : 1 పద్ధతిలో పిలిచారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్.. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఉమెన్, స్పోర్ట్స్, ఎక్స్సర్వీస్ మెన్, జోన్.. ఇలా వివిధ కేటగిరీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందుగానే మీకు తెలుసు. కానీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తరువాత, అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలాక కూడా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఎవరి కోసం ఆ సర్దుబాటు? ఇది దగా.. మోసం.. స్కామ్ కాదా?6. టీచర్ల పోస్టులు రూ.15 – 20 లక్షలకు అమ్ముకుంటూ బేరసారాలు జరిగిన ఓ వీడియో బయటకు వచ్చింది. దానికి సమాధానం ఏది? పోలీసులు నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకొన్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?7. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్కు అప్పగించేవారు. గోప్యత, పారదర్శకత కోసం వేర్వేరు వ్యక్తులకు అప్పగించేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్ను పక్కన పెట్టి ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించారు. దీనిపై సమాధానం ఏది?8. డీఎస్సీల చరిత్ర చూస్తే.. కలెక్టరేట్ వద్ద నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులో కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?9. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ప్రభుత్వం అత్యంత దారుణంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహార మే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు మీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా? ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే సీబీఐతో విచారణ జరిపించాల్సిన అవసరం లేదా? డీఎస్సీ 2025లో టీజీటీ (తెలుగు) జోన్–2లో తనకు 6వ ర్యాంకు వచ్చినట్లు హైకోర్టుకు తెలిపిన నవీన్ -
‘సర్’ పేరుతో భారీ ఎత్తున ఓట్లు తొలగించే కుట్ర’
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ లోపభూయిష్టంగా మారిందని, మై టీడీపీ యాప్ ద్వారా ఓట్ల చోరీకి అధికార పార్టీ మరోసారి ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. శింగనమల నియోజకవర్గంలో టీడీపీ నేతల కన్నుసన్నల్లో సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను తాము అడ్డుకుని ప్రశ్నిస్తే పొరబాటు జరిగిందని చెప్తున్నారని శైలజానాథ్ తెలిపారు.రాష్ట్రంలో ఎస్ఐఆర్ను అడ్డుపెట్టుకుని భారీ ఎత్తున దళితులు, మైనార్టీలు, పేదల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈసీ వెంటనే జోక్యం చేసుకుని అక్రమాలను అడ్డుకోవాలని సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సాకే శైలజానాథ్ ఇంకేమన్నారంటే..ఎస్ఐర్ పేరుతో భారీగా ఓట్లు తొలగించే కుట్రఎస్ఐర్ పేరు మీద ఓట్ల సవరణ కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోంది. దీన్ని పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్దంగా దీన్ని చేపట్టాలని ముందు నుంచీ కోరుతున్నాం. మా పార్టీ గతంలో ఎన్నోసార్లు అనేక వేదికలపై ఈ డిమాండ్ చేసింది. 16వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియపై మాకు ఉన్న అనుమానాలు, మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల డేటా చోరీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఫిర్యాదు చేశాం. దీనిపై మా నాయకులు సచివాలయంలో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఎవరికి మేలు చేయానుకుంటున్నాయి?చంద్రబాబు ఎలాగో తనకు తాను తప్ప ఎవరికీ మేలు చేయడు. గతంలో సేవామిత్ర పేరు పెట్టి దాదాపు వైఎస్సార్సీపీకి చెందిన 30 లక్షల ఓట్ల గల్లంతు చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై న్యాయస్థానాల్ని ఆశ్రయించి వాటిని కాపాడుకున్నాం. కాబట్టి ఎన్టీయే నుంచి, టీడీపీ నుంచి పారదర్శకత ఊహించలేం. పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్ని చూసిన తర్వాత, బీహార్లో మేం బతికే ఉన్నాం అని సుప్రీంకోర్టుకు ఓటర్లు చెప్పుకున్న తర్వాత కూడా న్యాయం జరగలేదు.ఆయా రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా వచ్చాయో చూశాం. వీటిని అనూహ్యం అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏపీలోనూ అదే తంతు కొనసాగుతుందని చెప్పడానికి మేం వెనుకాడట్లేదు. ఎస్ఐర్ ప్రక్రియలో వైరస్ తరహాలో టీడీపీ చొరబడింది. మై టీడీపీ యాప్ పెట్టుకుని కుట్రకు తెరలేపింది. ఈ యాప్లో ఎన్నికల కమిషన్ ప్రచురించిన దాని కంటే స్పష్టంగా ఓటర్ల వివరాలు ఉన్నాయి. బీఎల్వో ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలు ఫొటో తీసుకుని టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తున్నారు.అనంతపురంలో టీడీపీ కన్నుసన్నల్లో ఎస్ఐఆర్అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 20కి పైగా బూత్లను మేం పరిశీలించాం. చంద్రబాబు, ఆయన పార్టీ నేతల ఆదేశాలతో అధికారులు ముసుగులు తీసేసి మరీ ప్రత్యక్షంగా బరి తెగిస్తున్నారు. టీడీపీ యాప్ ప్రభుత్వ అధికారులు పెట్టిన గ్రూప్స్లో వచ్చింది. ప్రశ్నిస్తే పొరబాటున పెట్టామని చెప్పి తీసేశారు. టార్గెట్గా ఓట్లను తొలగిస్తున్నారు. ముఖ్యంగా దళితులు, మైనార్టీలు, అన్ని కులాల్లో పేదల ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతోంది. దీనికి పరాకాష్టగా ఇవాళ శింగనమలలోని ఓ బూత్లో నాయీ బ్రహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ పంచాయతీ కార్యదర్శి సీట్లో కూర్చుని ఎస్ఐర్ ప్రక్రియలో దూరాడు.పంచాయతీ కార్యదర్శి నిలబడి సమాధానం చెప్తున్నారు. మేం అడ్డుకుంటే పొరబాటు అంటున్నారు. ఇది పొరబాటు కాదు, టీడీపీ ప్రణాళికాబద్ధమైన కుట్ర. దళితులు, మైనార్టీలు, పేదల హక్కుల్ని హరించే కుట్ర ఇది. గతంలోనే ఇది నిరూపితమైంది. ఎన్నికల కమిషన్ అధికారులు ప్రజల ఓట్లను న్యాయంగా కాపాడుతున్నారా లేదా అని అడుగుతున్నాం. అక్కడికక్కడే ఫొటోలు తీయడం, కులం, మతం రాసుకుని వెళ్తుంటే మీరు ఏం చేస్తున్నారు. ఒకాయన ఇందులో ఏం తప్పుందని అడుగుతున్నారు. ఓటరుకు సంబంధించిన ప్రతీ విషయం గోప్యంగా ఉండాలన్న విషయం మీకు తెలియదా? ప్రజల ఓట్లు లేకుండా చేయడానికి భారీ కుట్ర జరుగుతుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.ఈసీ పారదర్శకంగా ఎస్ఐఆర్ నిర్వహించాలిశింగనమల నియోజకవర్గ కేంద్రంలోనే ఇలా జరుగుతోందంటే ఇక మారుమూల ప్రాంతాల్లో ఏం జరుగుతోందో ఊహించుకోవచ్చు. మీ సీఐలు ఉన్నా ఇలాఖాలో అధికారుల్ని బెదిరించి, ఎన్యుమరేషన్ ఫామ్లు తీసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. ఇది వదిలేసి, బుక్క రాయసముద్రంలో ఏటీఎం ఎత్తుకుపోతే అది పెద్ద విషయమని పోలీసులంతా అక్కడికి వెళ్లిపోయారు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల హక్కు ముఖ్యం కాదా? ఎస్ఐర్ ఫారం నింపి ఇస్తే అది కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్తుందా లేదా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుందా అని జనానికి అనుమానాలు వస్తున్నాయి.క్షేత్రస్దాయిలో టీడీపీ కార్యకర్తలు, నాయకుల తీరు చూస్తుంటే ఇది అర్థమవుతోంది. సర్ ప్రక్రియ కట్టుదిట్టంగా జరగాలి. ఎన్నికల సంఘం నుంచి మా ఫిర్యాదుపై తగిన సమాధానం రాకపోతే ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు వైఎస్సార్సీపీ భారీ పోరాటాలకు సిద్ధంగా ఉంది. కులం, మతం, పార్టీ, ప్రాంతం, అధికారం పేరు చెప్పి ఓటర్లను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ప్రభావానికి లోనుకాకుండా ఎస్ఐర్ ప్రక్రియను నిర్వహించాలి. ఈ ప్రక్రియలో తప్పిదాలు జరిగితే అంతిమంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని సాకే శైలజానాథ్ హెచ్చరించారు. -
నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతల సవాల్
సాక్షి, తాడేపల్లి: మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ మహిళా నేతలు సవాల్ విసిరారు. డీఎస్సీలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ ప్రకటించారు. తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు చేరుకున్న మహిళా నేతలు లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరీచౌదరి.. లోకేష్ స్థాయికి వైఎస్ జగన్ అవసరం లేదని.. దమ్ముంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్తో చర్చకు భరతమాత విగ్రహం దగ్గరే వేచి ఉంటామని మహిళా నేతలు తెలిపారు. -
బాబూ, పవన్ మాటల్లో హరితాంధ్ర.. చేతల్లో విధ్వంసాంధ్ర!
రాష్ట్రంలో ఏభై శాతం పచ్చదనమే లక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ సందేశం.. ఇవి వినడానికి ఎంత బాగున్నాయి.. నిజంగానే వీరిద్దరూ అదే లక్ష్యంతో పనిచేస్తుంటే అభినందించవచ్చు. కానీ జరుగుతున్నదేమిటి?. ఏపీలో ఈ మధ్య కాలంలో జరిగినంత పర్యావరణ విధ్వంసం మరెన్నడూ జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు.ఒకవైపు విశాఖలో కొండలను పిండి చేసేస్తున్నారు. ఇంకో వైపు డేటా సెంటర్ల పేరుతో విపరీతమైన కాలుష్యానికి కారకులయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాలలోని పచ్చటి భూములను ఎండబెట్టారు. కృష్ణానది తీరంలోనే నిబంధనలకు విరుద్దంగా నిర్మాణం అయిన భవనాలలోనే ముఖ్యమంత్రి, కీలక మంత్రి నివసిస్తారు. అయినా పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం గొప్పగా ఉపన్యాసాలు ఇస్తుంటారు. తద్వారా ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఒకటికి పదిసార్లు రుజువు చేసుకుంటున్నారని అనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అమరావతిలో కానీ, ఇప్పుడు విశాఖలో కాని ఎండలు తగ్గించాలని అధికారులను ఆదేశిస్తే వేడి తగ్గిపోతుందా? ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ముఖ్యమంత్రి బ్యాటరీ సైకిల్ తొక్కి ఫొటోలకు పోజులు ఇస్తే పర్యావరణాన్ని కాపాడినట్లు అయిపోతుందా?.అవసరమైన మేర భూమి తీసుకుని కావల్సిన భవనాలు నిర్మించుకుంటే సరిపోయేదానికి, వేల ఎకరాల పచ్చటి పొలాలను సమీకరించి, వేల కోట్లను ఓ 30 గ్రామాల పరిధిలో వెచ్చిస్తే ఏపీ ప్రజలందరికీ ఎలా ఉపయోగం జరుగుతుందో తెలియదు. అమరావతి గ్రామాలలో భూమి స్వభావం భారీ భవంతుల నిర్మాణానికి అనువుకాదని పలువురు నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు అనుసరించవలసిన పలు షరతులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించినా వాటిని గాలికి వదలివేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. విశేషం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అందులో అమరావతిలో జరుగుతున్న పర్యావరణ వినాశనం గురించి పవన్ గట్టిగా మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్నది తప్పు అని స్పష్టంగా చెప్పారు. అవసరమైతే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కూడా ఆయన ఆనాడు హెచ్చరించారు.2024 నాటికి ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. వెంటనే ఆయన వైఖరి కూడా మారిపోయింది. ఇప్పుడు అమరావతిలో పర్యావరణ విధ్వంసాన్ని సమర్థిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు కృష్ణా తీరం వెంబడి ఉన్న కరకట్ట ఇంటిలో ఉండడాన్ని కూడా పవన్ ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చాక ఆ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన లింగమనేని రమేష్ను జనసేన పక్షాన రాజ్యసభకు పంపారు. ఈయన చంద్రబాబును మించి అవకాశవాదం ప్రదర్శిస్తున్నట్లుగా అనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ రిషికొండపై అప్పటికే ఉన్న టూరిజం నిర్మాణాలను తొలగించి ప్రతిష్టాత్మకమైన రీతిలో కొత్త భవనాలను నిర్మిస్తే అది పర్యావరణానికి విఘాతం కలిగిస్తోందని, కొండకు గుండు కొడతారా అంటూ దుర్మార్గంగా చంద్రబాబు, పవన్ విమర్శించేవారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అయితే శరభ, శరభ అంటూ పూనకం వచ్చినట్లు వార్తలు ఇచ్చేది. ఇప్పుడు మొత్తం ప్లేట్ ఫిరాయించారు. గూగుల్ అదానీ డేటా సెంటర్ పేరుతో వందల ఎకరాల కొండలను ఇచ్చేశారు. వాటిని ఆ సంస్థలు తవ్విపారేస్తున్నా కిక్కురునడం లేదు. ఇప్పుడు సింహాచలం కొండలకు గుండు కొట్టినా అది సుందరమేనని వీరు భావిస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల పెద్దగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అమెరికా వంటి అభివృద్ది చెందిన దేశాలు డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల కలిగే కాలుష్యం, నీటి సమస్య, కరెంటు సమస్య వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని వ్యతిరేకిస్తున్నాయి. దానితో ఆ బహుళజాతి సంస్థలు అభివృద్ది చెందని, అభివృద్ది చెందుతున్న భారత్ వంటి దేశాలపై దృష్టి పెట్టాయని అమెరికాకు చెందిన ఒక మీడియా ఓ కథనాన్ని ఇచ్చింది. డేటా సెంటర్లు రావడం వల్ల ఏపీకి ప్రయోజనం అయితే స్వాగతించవచ్చు. కానీ వాటివల్ల ఎక్కువగా పర్యావరణ అనర్థం జరుగుతుంటే, దానికి ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే విశాఖకు తీరని నష్టం జరుగుతుందన్న భావన ఉంది. దానిపై ప్రజలలో కూడా అలజడి ఏర్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు డేటా సెంటర్ల వల్ల వచ్చే సమస్యలను ఆలోచించకుండా, కేవలం రాజకీయ కోణంలోనే మాట్లాడితే ఏపీకి ముఖ్యంగా విశాఖకు ఏం ప్రయోజనం కలుగుతుంది?. పైగా ఆ కంపెనీలకు వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ దీనిపై అభ్యంతరం చెబుతూ ఇప్పటికే చంద్రబాబుకు లేఖ రాశారు. రిలయన్స్ సంస్థ ప్రతిపాదిస్తున్న డేటా సెంటర్కు ఏభై వేల కోట్లు రాయితీలు ఇస్తున్నారని, అయినా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగడం లేదని ఆయన అన్నారు. వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయో, రావో తెలియని గూగుల్ డేటా సెంటర్కు 22వేల కోట్ల రాయితీలు ఇస్తున్నారు. మరో పర్యావరణవేత్త బొలిశెట్టి సత్య విశాఖ కొండలను తొలిచివేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. కొండపై జగన్ నిర్మాణం చేస్తే విధ్వంసం, కూటమి ప్రభుత్వం చేస్తే అభివృద్ది అవుతుందా? అని ప్రశ్నించారు.ఇక సముద్ర తీరంలో నిర్మాణాల నిమిత్తం సీఆర్జడ్ నిబంధనల మార్పునకు సూచనలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడంపై కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు విశాఖ బీచ్లో మద్యం పాకలను అనుమతించడంపై కూడా జనం మండిపడుతున్నారు. అమరారాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యాన్ని సరిచేసుకోవాలని జగన్ ప్రభుత్వం నోటీసు ఇస్తే, పరిశ్రమను తరిమేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఘనత టీడీపీది, ఎల్లో మీడియాదే. ఇప్పుడేమో కాలుష్యంపై మరో రకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. ఆయన సందర్భాన్ని బట్టి అభిప్రాయాలను మార్చేసుకుంటారు. కొద్ది కాలం క్రితం సమీక్షలో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఇతర శాఖల ప్రతిపాదనలకు గాను అడవులలో చెట్టు నరకడానికి, నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన కోప్పడ్డారు. పర్యావరణ దినోత్సవం నాడు మాత్రం ఏభై శాతం పచ్చదనమే లక్ష్యమని గంభీర ప్రకటనలు చేశారు.ఏపీలో కాలుష్య సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది ఈ మద్య పవన్ రాజమండ్రి సందర్శన సందర్భంగా మరోసారి బయటపడింది. పేపర్ మిల్లు వ్యర్ధ జలాలపై తనకు ఎదురైన సమస్యను మంత్రి దుర్గేష్ వివరించగా, ఆయనపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసి, ఆ పరిశ్రమ వారు తనతో మాట్లాడాలని అన్నారట. రాబోయే గోదావరి పుష్కరాలలో కెమికల్ స్నానాలు చేస్తారా అని కూడా పవన్ సీరియస్గా ప్రశ్నించారు. దీనిని బట్టే గోదావరిలో ఏ మేరకు కాలుష్యం ఉందో అర్దం చేసుకోవచ్చు. ఏడాదిలోగా దీని నివారణకు ఏ మేరకు చర్యలు తీసుకుంటారన్నదానిపై ఆయనే సందేహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరిలో నదీ కాలుష్యం తీరుతెన్నులను కూడా ప్రస్తావించారు. చిత్తశుద్దితో ఆయన కాలుష్య నివారణకు ప్రయత్నిస్తే మంచిదే. కానీ, ఏదో సినిమాటిక్గా డైలాగులు చెప్పి ఊరుకుంటే ఉపయోగం ఉండదు. గ్రామాలలో చెత్త లేకుండా చేస్తామని గతంలో ప్రభుత్వం చెప్పినా, పరిస్థితి పెద్దగా మారినట్లు కనబడదు. ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణను ఒక నినాదంగా మార్చేసి తాము చేయవలసిన విధ్వంసం యథావిధిగా కొనసాగిస్తే ఏపీకి తీరని నష్టం చేసినవారు అవుతారేమోనన్న విషయాన్ని కూటమి పాలకులు ఆలోచించుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై నియోజకవర్గాల్లోని కో–ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలని, ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలకమని, సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. సర్ ప్రక్రియపై చర్చిస్తూ.. ఈ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత, దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు, తన అధికార దుర్వినియోగంతో ఏదో రకంగా వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బూత్కు కనీసంగా 50 ఓట్లు తొలగించాలని చూస్తున్నారని ఎత్తిచూపారు. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి అని, వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు దీన్ని అడ్డుకోవాలని, ప్రతి ఓటునూ కాపాడుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత, నిరంతర సమీక్షలు నిర్వహించాలని పార్టీ నేతలను ఆదేశించారు. -
‘అసలు సమస్యలు పక్కనపెట్టి ‘కూటమి’ డైవర్షన్ డ్రామా’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళల భద్రత, చిన్నారుల అదృశ్య ఘటనలు, శాంతిభద్రతల సమస్యలు, పెరుగుతున్న అప్పులు, సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు వంటి అసలు సమస్యలపై సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్రెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ కొత్త వివాదాలకు తెరలేపారని ఆక్షేపించారు.రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై చర్చ జరగకుండా దృష్టి మళ్లించడమే ఈ రాజకీయ రచ్చ వెనుక ఉద్దేశమని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రెస్మీట్లో వీరశేఖర్రెడ్డి ఏమన్నారంటే..అప్పుల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డుఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రభుత్వంపై రాష్ట్రం రూ.12 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అప్పుల్లో ఉందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేవలం జూన్ నెల తొలి 15 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు అప్పు చేసిన చరిత్ర చంద్రబాబు ప్రభుత్వానిది. మరోవైపు కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైయస్ జగన్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడంతో పాటు లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించింది.ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సూడాన్, సోమాలియా వంటి నిరుపేద దేశాల కంటే దారుణంగా తయారైంది. ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తోంది. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదు. చేయూత, చేదోడు వంటి సంక్షేమ పథకాలు అటకెక్కాయి. రైతులకు మద్దతు ధర లేదు.. రైతు భరోసా లేదు.రాష్ట్ర ఆదాయం ఆవిరివైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో తలసరి ఆదాయం, జీఎస్డీపీ, జీఎస్టీఎన్ వసూళ్లు, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ వృద్ధి, సేవారంగ వృద్ధి గణనీయంగా పెరిగాయి. కానీ నేడు ఆ ప్రగతి కనిపించడం లేదు. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, రాష్ట్ర సంపదనే ఆవిరి చేస్తున్నారు. క్వార్ట్జ్, మట్టి, ఇసుక, మద్యం, సిలికా, భూములు అన్నింటినీ టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు దారి మళ్లిపోవడంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది.మద్యం ఏరులై పారుతున్నా రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అమరావతి పేరుతో అంచనాలు పెంచి దోపిడీ చేస్తున్నారు. కూటమి పాలనలోనే రాష్ట్రం దివాళా దిశగా వెళ్తోందని కాగ్ లెక్కలే చెబుతున్నాయి. సంక్షేమ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదన్న నిరంకుశ ధోరణితో పాలన సాగుతోంది.గాడితప్పిన శాంతి భద్రతలురాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో హోంమంత్రి అనిత అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే చెబుతోంది. గంటకు ముగ్గురు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె స్వయంగా వెల్లడించారు. ముచ్చుమర్రిలో అదృశ్యమైన బాలిక ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు వారం రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాప్తాడులో మైనర్ బాలికపై అత్యాచారం, గుంటూరులో టీడీపీ నేతల ఆగడాలు, మహిళలపై వేధింపుల ఘటనలపై మౌనం పాటిస్తున్న ప్రభుత్వం.. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను మాత్రం రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తోంది.'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యా?రాష్ట్రంలో మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాల భద్రత కంటే హోంమంత్రిపై చేసిన 'మేకప్' వ్యాఖ్యలే పెద్ద సమస్యగా చూపించడం దురదృష్టకరం. టీడీపీ, జనసేన నేతలు గతంలో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మరిచి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. అసలు సమస్యలపై సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. నా కూతురు ఎక్కడ? నా కొడుకు ఎక్కడ? అని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి రాజకీయ రచ్చ చేయడం మానుకోవాలి. ఈ కీచక పాలనను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో ప్రజలే తగిన తీర్పు ఇస్తారు అని వీరశేఖర్రెడ్డి హెచ్చరించారు. -
‘శాంతి భద్రతల వైఫల్యంపై హోం మంత్రి పచ్చి అబద్ధాలు’
సాక్షి, విశాఖపట్నం: కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి, ఖాకీ దుస్తులను ఎల్లో యూనిఫామ్గా మార్చేశారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో నిత్యం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. క్రైమ్ రేట్ తగ్గిందంటూ హోంమంత్రి అనిత అధికారుల సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని తేల్చి చెప్పారు. చట్టాల అమల్లో ఏపీ దేశంలోనే 36వ స్థానానికి పడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత చీవాట్లు తిన్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ హోంమంత్రి తన సంస్కారహీన భాషను ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి.. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లైంగిక వేధింపుల నిందితుడు ఆదిమూలం, గర్భస్రావానికి కారణమైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రాష్ట్రంలోనైనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం పోలీసుల విధి. కానీ ఏపీలో మాత్రం కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అమలు చేయడానికి పోలీసులను వాడుకుంటున్నారు. పోలీసుల ఖాకీ దుస్తులను 'ఎల్లో యూనిఫామ్'గా మార్చిన ఘనత చంద్రబాబుదే. ఐపీఎస్ (IPS) కాస్తా కూటమి పాలనలో 'ఇండియన్ పొలిటికల్ పనిష్మెంట్ సర్వీస్' గా.. ఏపీపీఎస్ (APPS) కాస్తా 'ఏపీ పొలిటికల్ రివేంజ్ సర్వీస్' గా మారిపోయాయి.దేశవ్యాప్తంగా కేంద్రం తెచ్చిన 'బీఎన్ఎస్' చట్టాలను ప్రజల కోసం వాడుతుంటే, ఏపీలో మాత్రం వాటిని నిర్వీర్యం చేసి 'బాబు రాజకీయ న్యాయసంహిత చట్టాలు' గా మార్చివేశారు. పోలీసు బెల్టుపై ఉండే మూడు సింహాలు న్యాయం, చట్టం, నీతికి ప్రతీకలు. కానీ నేడు ఆ మూడు సింహాలను మూడు కూటమి పార్టీలకు తొత్తులుగా, కీలుబొమ్మలుగా మార్చేశారు.కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు.. పోలీసుల పక్షపాతంసాక్షాత్తూ పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా హోం శాఖ చేష్టలుడిగి చూస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు నడిబొడ్డున పోలీసుల ముందే టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఇంటిపై జేసీబీతో హత్యాయత్నానికి దిగితే.. దౌర్జన్యకారుడిని వదిలేసి బాధితుడిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గం. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవి .. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై పోలీసుల ముందే దాడి చేసి, ఆస్తులు తగలబెడితే.. తిరిగి అంబటి రాంబాబుపైనే కేసులు పెట్టారు తప్ప ఎమ్మెల్యే దంపతులపై చర్యలు లేవు.మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులతో దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఈ చర్యలు చూస్తుంటే పోలీసులు అరాచక శక్తులకు అండగా ఉంటున్నారనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోలీసులకు డీఏ, వీక్లీ ఆఫ్, ఐఆర్, పీఆర్సీ, సరండర్ లీవ్స్ ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ ఎగ్గొట్టి పోలీసులకే వెన్నుపోటు పొడిచారు.కేంద్ర హోంమంత్రి చీవాట్లు.. దేశంలోనే ఏపీ పోలీస్ ఆఖరి ర్యాంక్హోంమంత్రి అనిత, రాష్ట్ర పోలీస్ శాఖ పనితీరు వైఫల్యాలు జాతీయ స్థాయిలో బయటపడ్డాయి. ఏపీ పోలీసు వ్యవస్థ పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చీవాట్లు పెట్టిన మాట వాస్తవం కాదా? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కాల్ సెంటర్ (112) రెస్పాండ్ టైమ్ 18 నిమిషాలు ఉంటే, ఏపీలో అది 26 నిమిషాలు ఎందుకుంది? ప్రజలు రక్షించమని ఫోన్ చేస్తే 26 నిమిషాల దాకా పట్టించుకోని వ్యవస్థను పెట్టుకుని హోంమంత్రి అవార్డులు వచ్చాయని ఎలా చెప్పుకుంటారు? కొత్త చట్టాలైన బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ అమల్లో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏపీకి 36వ (చిట్టచివరి) ర్యాంకు వచ్చింది. ఇది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.ప్రభుత్వ సర్వేలోనే అట్టడుగు:కూటమి ప్రభుత్వం స్వయంగా చేసిన ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలోనే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. అందుకే ఈ రాష్ట్రంలో 'HM' అంటే హోం మంత్రి కాదు.. 'హెరాస్ మెంట్ మంత్రి' (Harassment Minister) లేదా హెడ్ స్ట్రాంగ్ మంత్రి' అని పిలుస్తున్నారు.ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక హోంమంత్రి అనిత వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమన్నారు. ఒక మాజీ మంత్రిని పట్టుకుని ‘వాడు, వీడు, ఎవడు వీడు’ అంటూ నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో తూలనాడటం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమన్నారు. "గతంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న అనిత గారు.. ఆరోజు పిల్లలకు నేర్పించిన సంస్కారం ఇదేనా?"గతంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ని ఏకవచనంతో పిలవడం, టీడీపీ ఆఫీసు వేదికగా గౌరవనీయులైన వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలపై అత్యంత హేయమైన పదజాలం వాడటం అనితకే చెల్లింది. మేము కూడా అదే భాషలో మాట్లాడగలం, కానీ వైఎస్సార్సీపీ సంస్కారం తమకు అడ్డువస్తోంది. ఎవరినైనా నోటికొచ్చినట్లు తిట్టి.. ఎవరైనా తిరిగి ప్రశ్నిస్తే 'మహిళా ట్యాగ్'ను తెరపైకి తెచ్చి రాజకీయం చేయడం అనితకు అలవాటుగా మారింది, ఆమె ప్రవర్తన చూసి టీడీపీలోని మహిళలే అసహ్యించుకుంటున్నారు.రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు..మహిళా హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళల రక్షణను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 70 మంది మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ముగ్గురు-నలుగురు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో 10 రోజుల క్రితం చిన్నపాప కనిపించకుండా పోతే ఆ తల్లి బాధను పట్టించుకున్న నాథుడే లేడు. ఎలమంచిలి రాంబల్లిలో మైనర్ బాలిక గొంతు కోసి చంపేస్తే ఆ కుటుంబానికి బాధ్యత గల హోంమంత్రి ఎందుకు ధైర్యం చెప్పలేదు? కాపు యువకుడిని లాకప్ డెత్ చేస్తే సదరు సీఐ, పోలీసులపై ఏం చర్యలు తీసుకున్నారు? గంజాయిని నిర్మూలించామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గంజాయి డాన్ సోహైల్ పోలీసుల నుంచే తప్పించుకున్నాడు. నిందితుడి గురించి మీడియా అడిగితే హోంమంత్రి తెల్లమొహం వేసుకుని అధికారుల వైపు చూడటం ఆమె అసమర్థతకు నిదర్శనం.పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలకు సూటి ప్రశ్నలుహోంమంత్రికి మద్దతుగా మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి పీతల సుజాత, ఎంపీ బైరెడ్డి శబరిలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. హోంమంత్రి అనిత అత్యంత అసభ్యంగా, రెచ్చిపోయి ప్రతిపక్షాల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఆమెకు ఎందుకు గడ్డిపెట్టలేదు? ఒక ముఖ్యమంత్రి తల్లిని, భార్యని అత్యంత నీచమైన పదజాలం వాడినప్పుడు ఆమెతో ఎందుకు క్షమాపణ చెప్పించలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద తిరిగి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలు ఇవన్నీ గమనించరు అని మీరు అనుకుంటున్నారా? మీ పార్టీ నేత బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారు. ఆ రోజు మీరు ఎందుకు స్పందించలేదు. మీకు బాధ్యత లేదా? ఇక డిప్యూటీ సీఎం ట్వీట్ చేస్తూ హోంమంత్రి గారి మీద వ్యాఖ్యలపై స్పందించారు. సభ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్న మీరు మీ తల్లిని తిట్టిని టీడీపీ నేతలకు సభ్యత, సంస్కారం నేర్పించరా?ఆ రోజు బండారు సత్యనారాయణ మాజీ మంత్రి రోజాపై అసభ్య వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ను హోటల్లో కలిస్తే.. పవన్ తనను అభినందించారని బండారు స్వయంగా చెప్పుకున్నారు. తోటి కళాకారిణిపై అంత అసహ్యంగా మాట్లాడితే మెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ సంస్కారమా? ప్రతిపక్ష మహిళలపై దాడులు జరిగినప్పుడు మీ సంస్కారం ఎక్కడికి పోయింది. ఒక మహిళకు నలుగురైదుగురు సార్లు అబార్షన్ చేయించిన మీ కూటమి ఎమ్మెల్యేపై కనీస చర్యలు ఎందుకు తీసుకోలేదు? సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా తిడుతూ పోస్టులు పెట్టే సంస్థ 'ఐటీడీపీ' (iTDP) మీ ఆఫీస్ నుంచే నడుస్తోంది కదా.. దానికి సభ్యత నేర్పరా?సీఎం బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణ "ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి" అని అసహ్యంగా మాట్లాడితే.. చంద్రబాబు నాయుడు "కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా" అని ఆడబిడ్డ పుట్టుకను అవమానిస్తే.. వారికి పవన్ కళ్యాణ్ సభ్యత, సంస్కారం నేర్పించరా? కూటమిలోని మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీ మహిళలకు మరొక న్యాయమా? ఒక్క మాట పొరపాటుగా మాట్లాడితే మా సీఎం మందలిస్తారని హోంమంత్రి చెబుతున్నారు... మరి విజయమ్మ, భారతమ్మలను దూషించినప్పుడు చంద్రబాబు ఎందుకు మందలించలేదు?.లీగల్ సెల్ నేత ఇంటిపై జేసీబీతో దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలి. కాపు యువకుడిని లాకప్ డెత్ చేసిన పోలీస్ అధికారి (CI)ని వెంటనే అరెస్ట్ చేయాలి. మహిళలను లైంగికంగా వేధించిన కూటమి నేత ఆదిమూలం, మహిళను వేధించి గర్భస్రావం చేయించిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్లను వెంటనే జైలుకు పంపాలి. మహిళా వీఆర్వోను వేధించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, మహిళను వేధించిన సంధ్యారాణి పీఏలను తక్షణమే అరెస్ట్ చేయాలి.హోంమంత్రి అనిత ఇప్పటికైనా తిట్ల పురాణం మానేసి శాంతిభద్రతల అమలుపై, మహిళా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో పాలనలో విఫలమైన అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, విఫల హోంమంత్రిగా అనిత చరిత్రలో మిగిలిపోతారని, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హెచ్చరించారు. -
‘ప్రజల ప్రాణాలంటే బాబు సర్కార్కు లెక్కే లేదు’
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా?రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు.ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలిమీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు: రితిక్ తండ్రి లవ్రాజుకల్తీ పాలు తాగి మా బాబు రితిక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి: రుహానియా తండ్రి రాకేష్ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా వైఎస్ జగన్ను కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు. -
‘సర్’పై అత్యంత అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పార్టీ సీనియర్ నాయకులతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ‘సర్’ జరుగుతున్న తీరు, అక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. ఈ నాలుగు వారాలు అత్యంత కీలకమన్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు రోజూ సమీక్ష చేయాలన్న వైఎస్ జగన్.. ఏదో రకంగా వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు.‘‘అధికార దుర్వినియోగంతో ఓట్లు తీసివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి బూత్కు 50 వైయస్సార్సీపీ ఓట్లు తీసేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు దీన్ని అడ్డుకోవాలి. ప్రతి ఓటునూ కాపాడుకోవాలి. ‘సర్’పై నియోజకవర్గాల్లోని కో-ఆర్డినేటర్లు, రీజనల్ ఇన్ఛార్జిలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ‘సర్’ ప్రక్రియ జరుగుతున్న తీరుపై ప్రతిరోజూ సమీక్ష చేయాలి. ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయలి..అప్పటికీ సమస్య పరిష్కారంకాకపోతే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకు రావాలి. సర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వద్దు. సర్ ప్రక్రియలో ఒక్కసారి ఓటు తొలగించిన తర్వాత దాన్ని తిరిగి చేర్పించాలంటే అత్యంత కష్టమవుతుంది. ప్రతి నియోకవర్గ సమన్వయకర్త దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గిమ్మిక్కులతో ఓట్లు తొలగించే తప్పుడు పనుల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియపై ప్రతి అంశంలోనూ అప్రమత్తత అవసరం. నిరంతరం సమీక్షలు నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
చంద్రబాబు సర్కార్ గుట్టు రట్టు..
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన విజయోత్సవ సభలో ప్రసంగించిన నేతలలో ఏదో తెలియని భయం వెన్నాడుతున్నట్లు అనిపిస్తే, వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన నిరసనలలో ఉత్సాహం, తెగింపు కనిపిస్తాయి. కూటమి నేతలు తమ ప్రసంగాలలో సాధించిన విజయాల గురించికన్నా మాజీ సీఎం జగన్ను దూషించడానికి, ద్వేషించడానికే ప్రాధాన్యం ఇచ్చారు.గత ప్రభుత్వం విధ్వంసం చేసిందంటూ ఒక పడికట్టు పదాన్ని పదే, పదే చెప్పి జనాన్ని నమ్మించడానికి యత్నం చేశారే తప్ప, ఏ రకమైన విధ్వంసమో వివరించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారు. అదేమంటే ప్రజావేదికను గత ప్రభుత్వం కూల్చడాన్ని ఆయన ఉదహరించారు. ఇది పాడిందే పాడరా అన్న చందంగా ఉంది తప్ప ఒక పాలకుడు చెప్పదగిన మాటగా కనిపించదు.నదీ గర్భంలో ప్రభుత్వమే అక్రమ నిర్మాణం చేపడితే అది సరైన విధానం కాదని ప్రజావేదిక పేరుతో ఉన్న ఒక షెడ్ను గత ప్రభుత్వం కూల్చింది. ఆ మాటకు వస్తే కృష్ణానది తీరాన అక్రమం నిర్మించిన భవనాలలో చంద్రబాబు, కీలక మంత్రి లోకేష్లతో పాటు పలువురు పలుకుబడి కలిగినవారు నివసించడం ఏ రకంగా చట్టబద్దమో ఇన్నేళ్లలో వివరించలేకపోయారు.అమరావతి గ్రామాలలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ చంద్రబాబు ఎదురు జగన్పై ఆరోపణలు చేయడం అర్ధరహితంగా కనిపిస్తుంది. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు అంటూ రాజమండ్రి, యలమంచిలి మొదలైన చోట్ల పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేసింది. కాని ఉండవల్లిలో కరకట్ట అక్రమ కట్టడంలో ఆయన ఎలా నివసిస్తున్నారో అర్థం కాదు. చంద్రబాబు మాట్లాడిన విషయాలలో ఎన్ని అసత్యాలు ఉన్నాయో చూడండి. విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు స్పీచ్కి ఎల్లో మీడియా హెడింగ్ పెట్టింది.అందులో నిజం ఉంటే సంతోషించవచ్చు. కాని ఏది విధ్వంసం, ఏది వికాసం అన్నదానిపై ముందుగా చంద్రబాబు క్లారిటీ తెచ్చుకోవాలి. ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తేవడం, నాలుగు ఓడరేవులు నిర్మించడం, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రిని నిర్మించడం, గ్రామ, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రం వంటివి నిర్మించడం విధ్వంసం ఎలా అవుతుంది? మెడికల్ కాలేజీలను, పోర్టులను, ఆర్టీసీ బస్టాండ్లను, ఏవి వీలైతే వాటన్నిటిని ప్రైవేటువారికి అప్పగించడాన్ని కదా విధ్వంసం అనాల్సింది. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయయడాన్ని మాట నిలబెట్టుకున్నట్లని అంటారు. అది 95 శాతం వైఎస్ జగన్ చేసి చూపించారు.మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నారు? ఒక్కటి, అరా తప్ప, ఏదైనా స్కీమ్ ను నిక్కచ్చిగా అమలు చేశామని చెప్పే పరిస్థితి లేదు. అన్ని చేసేశామని బుకాయించడంలోనే వీరి బలహీనత కనిపిస్తుంది. జగన్ యువత భవిష్యత్తును దెబ్బతీశారట. ఆయన టైమ్లో లక్షన్నర ఉద్యోగాలు ఏకకాలంలో ఇస్తే అది భవిష్యతుత్తు ఇచ్చినట్లు కాదన్నది చంద్రబాబు అభిప్రాయమా? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మెగా డీఎస్సీ అంటూ హడావుడి చేశారు కాని, అందులో జరిగిన అక్రమాలపై జగన్ వీటిపై సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ఎదురుదాడి చేస్తున్నారు.తనకు నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో ఉంచారని ఆయన అన్నారు. స్కిల్ స్కామ్పై కోర్టులో విచారణ జరగకుండా ఇప్పుడు ఎందుకు మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్ పేరుతో కేసును ఎలా ఉపసంహరించుకుంది కూడా చెబితే బాగుండేది కదా! అమరావతిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పిన చంద్రబాబు దాదాపు ఏభై వేల కోట్ల అప్పు తీసుకువచ్చి ఒకేచోట ఖర్చుచయడాన్ని, కేంద్ర ప్రభుత్వం చదరపు అడుగుకు ఆరువేల లోపు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 17 వేల నుంచి ఇరవై వేల వరకు వ్యయం చేయడం వల్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయా?లేదా? అన్నది చేస్తున్నది వివరించాలి కదా!ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్న హామీపై నిధులు లేవని చేతులు ఎత్తివేయడం సరైనదేనా? సంపద సృస్టించడం తెలుసునని ఎన్నికల ముందు కొట్టిన గప్పాలన్నీ అబద్దాలనేనని ఒప్పుకుంటారా? ఈ స్కీమ్ను అమలు చేయలేదన్న నిజాన్ని ఎంతో కొంత ఒప్పుకున్నందుకు సంతోషించాలి. మామూలుగా అయితే సూపర్ సిక్స్ అన్నీ చేసేశాం అంటూ చెబుతుండడం అసత్యమేనని అంగీకరించారన్నమాట. టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని అని అన్నారు. మరి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని ఎందుకు కొనసాగిస్తున్నారు?ఇరాన్ యుద్దంతో మామిడి, అరటి తదితర పండ్ల ధరలు పడిపోయాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు. గతంలో కరోనా వచ్చినప్పుడు జగన్ ఈ రైతులను ఎలా ఆదుకుంది తెలియదా? అయినా తాను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అంటూ స్పీచ్లు ఇచ్చింది చంద్రబాబే కదా! మరి ఇప్పుడు యుద్దం వస్తే రైతులను ఎలా ఆదుకోవాలో తెలియకపోతే ఆయన సీనియారిటీ ఏమైనట్లు? పెట్రోల్, డీజిల్పై పన్నులు తగ్గిస్తామని చెప్పిన కబుర్లు అన్నీ అబద్దాలేనని ఒప్పుకుంటున్నారా? గత ప్రభుత్వంలో పది లక్షల కోట్ల అప్పు జరిగిందని చెప్పడం అబద్దమా? నిజమా? అన్నది చంద్రబాబుకు తెలియదా?వైఎస్ జగన్ టైమ్లో కరోనా ఉన్నప్పటికీ మూడున్నర లక్షల కోట్ల అప్పు చేస్తే, ఈ రెండేళ్లలోనే మూడున్నర లక్షల కోట్ల అప్పు ఎలా చేశారో చంద్రబాబు చెప్పాలి కదా!ఎంతసేపు బురద వేయడమేనా? వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు, లోకేష్లు వ్యాఖ్యానించడంపై సజ్జల, కొడాలి నాని ఇచ్చిన కౌంటర్కు వీరు సమాధానం ఇవ్వలేకపోయారు. తమది పరశురాముడి గొడ్డలి అని, అవినీతి కూటమి ప్రభుత్వాన్ని గొడ్డలి కూకటి వేళ్లతో పెకలిస్తుందని వారు ధైర్యంగా చెప్పారు.టీడీపీ వెన్నుపోటు పార్టీ అన్న విమర్శను చంద్రబాబు, లోకేష్ లు తిప్పికొట్టలేకపోయారు. తమది వెన్నుపోటు పార్టీ అని చెప్పలేరు. అలాగని వెన్నుపోటు పొడవలేదని వాదించలేని నిస్సహాయ స్థితి కనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వంతు అబద్దాలతో పాటు కులం, మతం వద్దని, భారతీయత ముఖ్యమంటూ నీతులు చెప్పే యత్నం చేశారు. కాని ఏపీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎంతగా కుల, మత, విద్వేషాలు రేకెత్తించింది ప్రజలకు తెలియదా! లోకేష్ తన స్పీచ్లో జగన్పై అమర్యాదకర వ్యాఖ్యలు చేసి సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారు.ఎందుకంటే గతంలో నార్నె శ్రీనివాసరావు, కోలా కృష్ణమోహన్లు ఆయనపై చేసిన ఆరోపణల వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వైఎస్ జగన్పై అనవసర వ్యాఖ్యలు చేసి.. ఈ సమస్య తెచ్చుకోవడం లోకేష్కు ప్రయోజనమా? అవి ప్రచారంలోకి రావడం లోకేష్ కు ప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. విమర్శలలో హుందాతనం ఉండాలి. సంస్కారయుతంగా ఉండాలి. కాని చంద్రబాబు మాదిరి ఏదిపడితే అది మాట్లాడితే సరిపోతుందని అనుకుంటే లోకేష్ పొరబడుతున్నట్లే. కాలం మారిందన్న సంగతి గుర్తించకపోతే ఆయనకే నష్టం.రెడ్బుక్ గురించి ప్రస్తావించి ఏపీలో ఎంత అరాచక పాలన సాగుతోందో లోకేష్ గుర్తు చేసినట్లయింది. కాగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ధైర్యంగా ప్రభుత్వం అణచివేత చర్యలను ఎదుర్కుంటూ నిరసనలు తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ నినదించడానికి ఎక్కడా వెనుకాడలేదు. కూటమి సభలో జనం చాలావరకు మొక్కుబడిగా ఉన్నట్లు కనిపిస్తే, వైఎస్సార్సీపీ క్యాడర్ హోరెత్తించినట్లు అనిపిస్తుంది. కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ప్రస్తావించి వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తోందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రెండేళ్లుగా పచ్చి అబద్ధాల ప్రచారం, మోసం, కక్ష సాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్బుక్ పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు.వైఎస్ జగన్కు, చంద్రబాబుకు ఉన్న ఒక తేడా స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్ తన మానిఫెస్టోని సచివాలయంలో తన ఎదుట పెట్టుకున్నారు. అధికారులకు ఇచ్చి అమలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబేమో ఆ మానిఫెస్టోని, ఎన్నికలలో ఇచ్చిన బాండ్ల గురించి ఎన్నడూ ప్రస్తావించినట్లు కనబడదు. తిరుపతి సభకు హెలికాఫ్టర్ లో వస్తూ చదువుకున్నారట! ఎన్ని అబద్ధపు వాగ్దానాలు ప్రకటించి, ప్రజలను మభ్య చేసింది గుర్తు చేసుకుని నవ్వుకుని ఉండాలి. గత ఎన్నికలలో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని ఆయన అన్నారు కానీ.. ఏభై లక్షల మాయ ఓట్లు పోలైన సంగతిని పదే, పదే చెబుతున్న ప్రముఖ మేధావి, చంద్రబాబు వద్ద సలహాదారుగా గతంలో పనిచేసిన పరకాల ప్రభాకర్ ఆరోపిస్తున్న అంశంపై మాత్రం నోరు మెదపలేకపోతున్నారు.ఈ నేపథ్యంలోనే కూటమిలో విజయోత్సవ సంరంభం పెద్దగా కనిపించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్సీపీ ప్రజలలో దూసుకువెళ్లడానికి వెన్నుపోటుకు రెండేళ్ల నిరసనను వాడుకుందని చెప్పాలి. ప్రజలలో ఏర్పడుతున్న అసంతృప్తిని ఎలా తగ్గించాలో తెలియక కూటమి తికమక పడుతుంటే, జనం తమవైపు చూస్తున్నారన్న ఉత్సాహం వైఎస్సార్సీపీలో తొణికిసలాడుతోంది.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘సర్’లో టీడీపీ చొరబాటు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ.. టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైఎస్సార్ సీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా ‘సర్’ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్ను రూపొందించింది. ఓటర్ల కులం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు? అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం–7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్స్లు, సాఫ్ట్ కాపీలు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీఎల్ఏల వాట్సాప్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటవుట్లతో టీడీపీ బీఎల్ఏలు ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి గుచ్చి ఆరా తీస్తున్నారు. వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్వోలకు బ్లాక్ అండ్ వైట్ లిస్ట్ మాత్రమే ఇవ్వడం.. టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందచేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు.టీడీపీ కార్యాలయంలో బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణప్రత్యేకంగా సిద్ధంచేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా పథకాన్ని రచించింది. ‘సర్’లో భాగంగా సోమవారం నుంచి వచ్చేనెల 14వతేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ)ను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకుని వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించేందుకు ‘మై టీడీపీ పాస్పోర్టు’లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా, కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూత్లవారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందచేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటరు బూత్ నంబర్, ఓటరు ఐడీతో పాటు మొబైల్ నంబర్, ఓటరు కులం, ఏ పార్టీ సానుభూతిపరుడనే వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బీఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బీఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.టీడీపీ రూపొందించిన యాప్లో ‘సర్’ విభాగం ఒక్కో టీడీపీ బీఎల్ఏ పరిధిలో 50 ఓట్ల తొలగింపే టార్గెట్ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటరు వైఎస్సార్సీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెరతీశారు.ప్రతీ బీఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫారం–7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బీఎల్ఏ 50 వరకు ఫారం –7 దరఖాస్తులను బల్క్గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బీఎల్వోలను లోబర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నాడు ‘సేవామిత్ర’ పేరుతో ఇదే రీతిలో.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2019లో తెలుగుదేశం పార్టీ ఇదే విధానాన్ని అనుసరించడం ద్వారా వైఎస్సార్ సీపీకి చెందిన 39 లక్షల ఓట్లను తొలగించింది. ఈవీఎంలను అపహరించిన వేమూరి హరిప్రసాద్తో పాటు లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ కలిసి 3.50 కోట్ల మంది ఓటర్ల మాస్టర్ డేటా జాబితాను దొంగిలించి ఈ మొత్తం డేటాను టీడీపీకి ‘సేవామిత్ర’ యాప్లో నిక్షిప్తం చేసినట్లు బహిర్గతమైంది. ఈ మాస్టర్ డేటాలోని ఓటర్ల వివరాలను ఒక్కో సేవా మిత్రకు, పార్టీ బూత్ కన్వీనర్కు సేవా మిత్ర యాప్లో అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా ఓటర్ ఏ కులానికి చెందిన వారు? ఏ పార్టీ సానుభూతిపరుడు? ఓటరు ఏ ఊరిలో ఉంటున్నారు? అనే వివరాలను సేకరించి ఐటీ గ్రిడ్కు పంపించారు. ఈ సమాచారం ఆధారంగా ఆన్లైన్లో ఫారం 7 దాఖలు చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ ఓట్లను తొలగించారు. ఈ కుట్రపై అప్పట్లో వైఎస్సార్ సీపీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే విధంగా పోరాడింది. ‘సర్’లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించడానికి టీడీపీ కుట్రలు చేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. -
ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు: అంబటి
తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని అన్నారు. సెటిల్మెంట్లు, మద్యం, ఇసుక.. అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.‘‘రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా తమ నాయకుడి ఇంటిమీదకే వెళ్లి దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి, దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు’’ అని చెప్పారు.అతని మీద 94 కేసులు మందేసి, చిందేసిన ఎమ్మెల్యే చింతమనేనికి పోలీసులు మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘‘దీన్ని జంగిల్ రాజ్ అనరా? చికెన్ మీద కూడా ట్యాక్సులు వేసి దోచుకునే దుస్థితికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. మా ఇంటి మీద దాడి చేసిన వారిని వదిలేసి నాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉంది. చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. ఇప్పటికే అతని మీద 94 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు? దీనికి కూటమి నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. తమ దోపిడీకి ఎవరు అడ్డొస్తే వారిపై దాడి చేస్తున్నారు. లాకప్ డెత్ లు గతంలో విన్నాం. ఇప్పుడు ఆ శవాలను కూడా పోలీసులు దహనం చేసే పరిస్థితికి వచ్చింది. పోలీసులే రౌడీలుగా మారతారా? అసలు ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారు? హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు? లింగమనేని రమేష్ ఫ్లైట్ టిక్కెట్లు కొనటంతో జనసేన నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటో? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు ఎందుకు? పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం హాస్యాస్పదం. రిలీజ్ అయిన సినిమాని రీరిలీజ్ చేసినట్టుగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు కదా? ఇంకా జాతీయ రాజకీయాలు అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. రాష్ట్రం కోసం త్యాగం చేశానంటున్న పవన్ రానున్న రోజుల్లో జనసేనని టీడీపీకి త్యాగం చేస్తారేమో?’’ అని నిలదీశారు.


