సాక్షి, విశాఖపట్నం: గుంటూరులో సభ్య సమాజం తల దించుకునే ఘటన జరిగిందని.. టీడీపీ నేతలు కాలకేయుల్లా మారిపోయారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళలు కూటమి పాలనలో స్వేచ్ఛగా బతకలేరా..?. మల్లెల మూర్తి అనే వ్యక్తి నీటి కుళాయి కోసం మహిళ వద్ద రూ.10 వేలు లంచం అడిగాడు. అక్కడ తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను వివస్త్రను చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావా..?. మహిళలపై వేధింపులు, దాడుల్లో కూటమి నేతలు ఉన్నారు. గుంటూరు ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరులు సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ నాయకులు ఇలాంటి పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ అంటే దుస్సాసన, దుర్మార్గుల పార్టీ. ఇలాంటి సంఘటన జరిగినందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. హోం మంత్రి ఇప్పుడు వీడియో కాల్లో పరామర్శ చేస్తారా..?. ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలి. టీడీపీ కార్యకర్తలు ఇంతటి దారుణనికి ఒడిగడితే మహిళా కమిషన్ ఏం చేస్తుంది?
..ఘటన జరిగి మూడు రోజులు అయితే మీకు తెలియదా..?. సీఎం చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మల్లెల మూర్తి మీ పార్టీ కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి గళ్ళా మాధవి పేటెంట్. అంబటి ఇంటిపై దాడి చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దారుణాలకు టీడీపీ నాయకులు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే నజీర్పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే మహిళను లోబరుచుకొని అబార్షన్ చేయిస్తే చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే మిగతా వారు ఇలాగే చేస్తారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను మోసం చేస్తే మీరు ఏం చేశారు?. కిరణ్ రాయల్ వలన లక్ష్మి అనే మహిళ ఇబ్బంది పడితే మీరు ఏం చర్యలు తీసుకున్నారు’’ అంటూ వరుదు కళ్యాణి నిలదీశారు.


