గుంటూరు బాధితురాలికి వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ | Guntur Incident: YSRCP Women Leaders Visit Victim Slam CBN Govt | Sakshi
Sakshi News home page

గుంటూరు బాధితురాలికి వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ

Jul 20 2026 12:10 PM | Updated on Jul 20 2026 1:43 PM

Guntur Incident: YSRCP Women Leaders Visit Victim Slam CBN Govt

సాక్షి, గుంటూరు: ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కృష్ణబాబు కాలనీలో జరిగిన కీచక ఘటనపై వాళ్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తడంతో పాటు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

వైఎస్సార్‌సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రి విడదల రజిని, కాకాని పూజిత, నూరి ఫాతిమా, ఉప్పాల హారిక తదితర నేతలు బాధిత కుటుంబాన్ని కలిశారు. బాధితురాలికి ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

“ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారు”
ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని కూటమి ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధితురాలు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. “మహిళను వివస్త్రను చేసి కొట్టారు. ఏపీలో బిహార్‌ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మహిళపై టీడీపీ నేత దౌర్జన్యంగా వ్యవహరించారు” అని రజిని విమర్శించారు.

రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మహిళపై టీడీపీ నేత దౌర్జన్యంగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైంది. గూండా రాజ్యం నడుస్తోంది అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల భద్రతపై ప్రశ్నలు
రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

జరిగింది ఇదే.. 
గుంటూరు కృష్ణబాబు కాలనీలో చోటుచేసుకున్న ఘటన.. సంచలన చర్చకు దారి తీసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 15వ తేదీ రాత్రి ఆమె తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్‌ ద్వారా నీటిని పట్టుకుంటుండగా వివాదం మొదలైంది. 21వ డివిజన్‌ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులు నీటి విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. మూర్తి సోదరి, ట్రాన్స్‌జెండర్‌ మాధవి దాడి చేసి కొట్టారు.

ఆ తర్వాత ఆమెపై దాడి చేస్తూ దుస్తులు చింపివేసి అవమానించారు. రోడ్డుపైనే తనను వివస్త్రగా ఉంచి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆమె వేడుకున్నా కనికరించలేదు. స్థానిక మహిళలు జోక్యం చేసుకుని బాధితురాలికి దుస్తులు అందించి ఆదుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన సోదరి సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement