సాక్షి, తాడేపల్లి: చేనేత కార్మికుల సంక్షేమంలో వైఎస్ జగన్ ప్రభుత్వం గేమ్ ఛేంజర్గా నిలిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పేర్లు మార్చడానికే పరిమితమైన "నేమ్ ఛేంజర్"గా మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ హయాంలో ఐదేళ్ల పాటు నిరంతరంగా అమలైన వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి పేరు మార్చి, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి, రెండేళ్ల ఆలస్యంగా అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం చేనేత కుటుంబాలను తీవ్రంగా నిరాశపరిచిందని ధ్వజమెత్తారు. ప్రెస్మీట్లో రమేష్ యాదవ్ ఏమన్నారంటే..
గత ప్రభుత్వంలో ఐదేళ్లు నిర్వీరామంగా నేతన్న నేస్తం..
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి ఐదేళ్ల పాటు ప్రతి ఏడాది రూ.24 వేల చొప్పున సుమారు 80 వేలకుపైగా చేనేత కుటుంబాలకు అందించింది. ఒక్కో కుటుంబానికి మొత్తం రూ.1.20 లక్షలు చేరేలా చేసి, ఐదేళ్లలో సుమారు రూ.970 కోట్లను వెచ్చించి చేనేత కుటుంబాలకు అండగా నిలిచింది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ పథకం అమలు ఆగలేదు
పేరు మార్చి నేతన్నలకు వెన్నుపోటు
చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న నేస్తం పేరును 'నేతన్న భరోసా'గా మార్చడమే తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు. 2025 ఆగస్టు 7న రూ.25 వేల ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి, రెండేళ్ల పాటు అమలు చేయకుండా ఆలస్యం చేశారు. చివరకు కేవలం రూ.1,000 మాత్రమే పెంచి, 80 వేలకుపైగా ఉన్న లబ్ధిదారులను 54 వేలకే పరిమితం చేసి సుమారు 30 వేల మంది నేతన్నలను ఈ పథకం పరిధి నుంచి తప్పించింది.
ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వెంటనే చెల్లించాలి
నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించిన బకాయిలతో కలిపి అర్హులైన 80 వేలకుపైగా నేతన్నలందరికీ ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున వెంటనే చెల్లించాలి. పేర్లు మార్చడం కాదు.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన స్థాయిలో సంక్షేమాన్ని కొనసాగించగలిగితేనే చేనేత కుటుంబాలకు నిజమైన న్యాయం చేసినట్టవుతుంది అని రమేష్ యాదవ్ పేర్కొన్నారు.


