సాక్షి,అమరావతి: రాష్ట్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15,000 ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కారు.
ఈ ఏడాది కూడా తల్లుల ఖాతాల్లో కేవలం రూ.13,000 మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూల్ నిర్వహణ (మెయింటెనెన్స్ ఫండ్) పేరుతో ప్రతి విద్యార్థి డబ్బుల నుండి రూ.2,000 ముందస్తు కోత విధించింది. గతేడాదికూడా ఇలాగే రూ.2,000 కోత పెట్టి, ఆ నిధులను స్కూళ్లకు కేటాయించని ప్రభుత్వం.. ఈ ఏడాది మళ్లీ అదే దారిలో పయనిస్తూ రూ.2,000 కోత పెట్టడం గమనార్హం. ఇలా మొత్తంగా మూడేళ్ల కాలంలో ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.19,000 లబ్ధిని ప్రభుత్వం ఎగనామం పెట్టింది.
ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. కానీ, ఇప్పుడు క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఏకంగా 14 రకాల కఠినమైన షరతులు, నిబంధనలను తెరపైకి తెచ్చారు. ఈ కొరడా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ ఆంక్షలన్నింటినీ దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా కేవలం 67,47,190 మంది విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా తేలడంతో, ఆ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.


