సాక్షి, తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు కోసం యాప్ డిజైన్ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండేలా ఈ యాప్ను రూపొందించారు. సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నుంచి ఇవాళ అధికారిక ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరిస్తున్నామన్నారు.
‘‘ఈ రోజు ఏం జరుగుతోంది అంటే.. సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అదే జగన్ 2.0 సూపర్ యాప్. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు.
..అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు కూడా వారికి ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు కూడా దీనివల్ల తిప్పి కొట్టొచ్చు.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ, ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్లో ఉండే అవకాశం ఉంటుంది.
👉 Click here to download the Jagan 2.0 Super App.
ఈ యాప్లో మరో మంచి అంశం ఏమిటంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది.

..పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు కూడా గురవుతున్న వారు ఇప్పుడు డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఆ డైరీ కూడా ఈ యాప్తో అనుసంధానం అవుతుంది. అంటే ఈ యాప్లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు.

..ఇతర సోషల్ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్యాప్ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు’’ అని వైఎస్ జగన్ వివరించారు.


