IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్‌ ఎదురుచూడాల్సిందే! | "No Debut For Vaibhav Suryavanshi Yet...": Team India Backs Sanju Samson Despite Ireland T20 Series Whitewash | Sakshi
Sakshi News home page

IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్‌ ఎదురుచూడాల్సిందే: కోచ్‌

Jun 29 2026 1:10 PM | Updated on Jun 29 2026 1:39 PM

Should Wait: Vaibhav Sooryavanshi Debut In England Ruled Out By Coach

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియాపై మాజీ ‍క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి.. చెత్త ప్రదర్శనతో మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు. ప్రపంచ చాంపియన్‌గా ఐరిష్‌ గడ్డపై అడుగుపెట్టి అతి విశ్వాసంతో కొంపముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బెంచ్‌కే పరిమితం
ఇక మరికొందరు.. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీని అరంగేట్రం చేయించకపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఈ పిల్లాడిని ఆడిస్తేనైనా ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్‌ను రెండు మ్యాచ్‌లలోనే బెంచ్‌కే పరిమితం చేసింది.

ఐర్లాండ్‌ చేతిలో వైట్‌వాష్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటనలోనైనా వైభవ్‌ సూర్యవంశీని ఆడిస్తారేమోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ ర్యాన్‌ టెన్‌ డష్కాటే ఆ అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు.

సంజూకు మా మద్దతు ఉంటుంది
‘‘అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు వైభవ్‌ సూర్యవంశీ పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, సంజూ శాంసన్‌ను తుదిజట్టు నుంచి తప్పించడం కూడా సాధ్యం కాదు.

మూడు నెలల క్రితం జట్టు ప్రపంచకప్‌ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ 2026లో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో అతడు విఫలం కావొచ్చు. అయినప్పటికీ మా ఆటగాళ్లకు మేము మద్దతుగానే నిలబడతాము.

అతడిలో ఆత్మవిశ్వాసం పెంచేలానే మా చర్యలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతాము. అరంగేట్రం చేసేందుకు వైభవ్‌ ఎంత ఆసక్తిగా ఉన్నాడో.. అతడి ఆటను చూడాలని మేమూ అంతే ఆతురతతో ఎదురుచూస్తున్నాం.

వైభవ్‌ వేచిచూడక తప్పదు!
అయితే, అందుకు ఇంకాస్త సమయం ఉంది. మిగతా ఆటగాళ్ల గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంటుంది. అంతమాత్రాన వైభవ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటలేడని మేము భావిస్తున్నట్లు కానేకాదు’’ అని డష్కాటే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ పర్యటనలోనూ వైభవ్‌ అరంగేట్రం చేయకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ పూర్తిగా విఫలమైంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (49) రాణించగా.. మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (5), వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ (1) నిరాశపరిచారు.

ఇక రెండో టీ20లో సంజూ, అభిషేక్‌.. ఇద్దరూ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగి జట్టు కొంపముంచారు. ఇషాన్‌ కిషన్‌ (12) అనవసరంగా పరుగుకు వెళ్లి రనౌట్‌ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను పసికూన ఐర్లాండ్‌కు కోల్పోయింది. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చగా మిగిలిపోనుంది.

చదవండి: IND vs IRE 2nd T20: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement