PC: BCCI
ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్-2026 చాంపియన్ హోదాలో ఐరిష్ గడ్డ మీద అడుగుపెట్టిన భారత జట్టు.. అనూహ్య రీతిలో తొలి టీ20లో ఓటమి పాలైంది. తాజాగా రెండో టీ20 మ్యాచ్లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
బెల్ఫాస్ట్లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ వేదికగా తొలి టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన ఆతిథ్య ఐరిష్ జట్టు చేతిలో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజాగా ఇదే వేదికపై రెండో టీ20లోనూ టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్నే ఎంచుకుంది.
154 పరుగులు
ఈ క్రమంలో ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అరంగేట్ర ఆటగాడు ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. శివం దూబే, అర్ష్దీప్ సింగ్ చెరో రెండు.. హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.
టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. జై ముంద్రా భారత ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మను డకౌట్ చేశాడు. ఇషాన్ కిషన్ 12 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (10) మరోసారి విఫలమయ్యాడు.
అక్షర్ పటేల్ 14 పరుగుల చేసి నిష్క్రమించాడు. ఇలాంటి తరుణంలో తిలక్ వర్మ అర్ధ శతకం (55)తో ఆశలు రేపగా.. శివం దూబే (20) కాస్త పోరాడాడు. అరంగేట్ర ఆటగాడు సూర్యాంశ్ షెడ్గే (1) పూర్తిగా నిరాశపరచగా.. హర్షిత్ రాణా (10 బంతుల్లో 21) వేగంగా ఆడి భారత శిబిరంలో గెలుపు ఆశలు చిగురింపజేశాడు.
ఒక్క పరుగు తేడాతో
కానీ హ్యారీ టెక్టార్ అతడిని పెవిలియన్కు పంపడంతో గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. గెలుపు కోసం ఆఖరి బంతికి ఎనిమిది పరుగులు కావాల్సి ఉండగా.. ప్రిన్స్ యాదవ్ సిక్సర్ బాదాడు. దీంతో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో జయభేరి మోగించింది.
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు తొలి ప్రయత్నంలోనే ఘోర అవమానం ఎదురైంది. ఏ ఫార్మాట్లోనైనా ఐర్లాండ్కు టీమిండియాపై ఇదే తొలి సిరీస్ విజయం. ఐర్లాండ్ బౌలర్లలోజై ముంద్రా మూడు, మాథ్యూ హోల్డర్ మూడు వికెట్లతో చెలరేగగా.. హంఫ్రేస్, హ్యారీ టెక్టార్ తలా ఒక వికెట్ తీసి.. ఈ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించారు.


