రామ్ చరణ్ 'పెద్ది' ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఇప్పటికే మిక్స్డ్ టాక్ వచ్చేసింది. దీంతో సందడి మరికొన్నిరోజులే ఉంటుంది. సోమవారం నుంచి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటనేది చూడాలి. మరోవైపు చరణ్ తర్వాత మూవీ గురించి కూడా అప్పుడే సోషల్ మీడియాలో డిస్కషన్స్ మొదలయ్యాయి. సుకుమార్తో చేయబోయే చిత్రం ఎప్పుడు మొదలవ్వొచ్చు? అనేది మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా)
రామ్ చరణ్, సుకుమార్ గతంలో 'రంగస్థలం' చేశారు. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీళ్ల కాంబోలోని రెండో మూవీ గురించి చాన్నాళ్ల క్రితం ప్రకటన వచ్చింది. ఇప్పుడు 'పెద్ది' రిలీజైపోవడంతో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులకు కుతుహలం కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు.
'పెద్ది' షూటింగ్ చివరిదశలో చరణ్ చేతికి గాయమైంది. కట్టుతోనే ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు సదరు గాయానికి సర్జరీ చేయనున్నారు. అలా దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. మరోవైపు సుకుమార్, చరణ్తో చేయాల్సిన సినిమా కోసం స్టోరీ ఇంకేం సిద్ధం చేయలేదు. దసరా లోపు స్టోరీ, స్క్రీన్ ప్లే ఓ కొలిక్కి రావొచ్చని అంటున్నారు. కానీ ఫెర్ఫెక్షన్ కోసం ఆరాటపడే సుక్కు.. దసరా కల్లా పూర్తి చేస్తాడా అనేది చూడాలి?
'పుష్ప' సినిమాల తర్వాత చరణ్ ప్రాజెక్ట్పైనే సుకుమార్ పనిచేస్తున్నప్పటికీ.. అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ ఏడాదిలో పూర్తయితే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి షూటింగ్ మొదలయ్యే అవకాశముంటుంది. లేదంటే మాత్రం మరో ఏడాది పట్టేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే రామ్ చరణ్కి లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది. ప్రస్తుతానికి సుకుమార్కి తప్పితే మరో దర్శకుడికి చరణ్ కమిట్మెంట్ ఇవ్వలేదు. అలానే పాన్ ఇండియా దర్శకులు కూడా ఎవరూ ఖాళీ లేనట్లే ఉన్నారు.
(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటం సాంగ్ వివాదం.. బుచ్చిబాబు సారీ చెప్పడం నచ్చలేదు)


