సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘మంగళవారం’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్గా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘శ్రీనివాస మంగాపురం’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు(జులై 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
పెద్దిరెడ్డి(‘కిక్’శ్యామ్).. తిరుపతిలో మంచి పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి. ఆయన ఫ్యామిలీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా జనాలు భయపడిపోతారు. అలాంటి వ్యక్తి కూతురు మంగ(రాషా తడాని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు శ్రీనివాస్(జై కృష్ణ). అతనికి తిరుపతి కొత్త. జులాయిగా తిరిగే స్వతంత్ర బాబు(నరేశ్)తో స్నేహం ఏర్పరచుకొని మంగ చుట్టూ తిరుగుతుంటాడు. మంగ మాత్రం అతన్ని పట్టించుకోదు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇంతలోనే వేరే వ్యక్తితో మంగకు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయినా కూడా తన ప్రేమ విషయాన్ని మంగతో పంచుకుంటాడు శ్రీనివాస్. ఆమె రిజెక్ట్ చేసినా..వదిలిపెట్టడు. ఎందుకలా? అసలు శ్రీనివాస్ ఎవరు? తిరుపతి ఎందుకు వచ్చాడు? నిజంగానే మంగతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడా? వాసుబాబు ఎవరు? బళ్లారి డాన్ వెంకటప్పయ్యనాయుడు(మోహన్ బాబు)తో శ్రీనివాస్కి ఉన్న సంబంధం ఏంటి? మంగ ప్రేమ కోసం శ్రీనివాస్ ఏం చేశాడు? చివరకు మంగ, శ్రీను ఎలా కలిశారు? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరో వస్తున్నాడంటే కచ్చితంగా ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. అందుకే ‘శ్రీనివాసమంగాపురం’ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డారు. అజయ్ భూపతి బలమైన కథతోనే ఘట్టమనేని వారసుడిని పరిచయం చేస్తాడేమో అనుకున్నారు. కానీ రొటీన్ కమర్షియల్ స్టోరీతో జై కృష్ణని లాంచ్ చేశాడు.
వాస్తవానికి స్టార్ హీరోల వారసుల ఎంట్రీ దాదాపు ఇలాంటి కమర్షియల్ చిత్రాలతోనే ఉంటుంది. తొలి చిత్రంతోనే మాస్గా నిలబడే ప్రయత్నం చేస్తారు. జై కృష్ణ కూడా అదే చేశాడు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. వైవిధ్యమైన కథలనే ఆదరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘శ్రీనివాసమంగాపురం’ కథకు ఓకే చెప్పి జై కృష్ణ పెద్ద సాహసమే చేశాడు.
ఇక దర్శకుడు అజయ్ భూపతి కూడా బలమైన కథను కాకుండా.. కమర్షియల్ ఎలిమెంట్స్ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాస్ హీరోకు కావాల్సిన లవ్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలన్నీ ఇందులో ఉన్నాయి. కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. ప్రేమ కథను కూడా గుండెలకు హత్తుకునేలా చూపించలేదు.

ఓ యాక్షన్ సీన్తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెద్దిరెడ్డి పాత్ర పరిచయం.. హీరో, హీరోయిన్ల ఎంట్రీ ఇలా చకచకగా జరిగిపోతుంది. హీరో.. హీరోయిన్ని చూడగానే పాట.. ఒక్కసారి మాట్లాడగానే మరో పాట.. కాసేపటికి ఇంకో పాట..ఇలా మొదటి 40 నిమిషాల్లోనే మూడు పాటలు వచ్చి.. చిరాకు తెప్పిస్తాయి. లవ్ సీన్స్ కూడా రొటీన్గానే సాగుతాయి.
అయితే స్వతంత్ర బాబు పాత్ర ఎంట్రీ, ఆయన చేసే కామెడీ కొంతవరకు ఎంటర్టైన్ చేస్తాయి. మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా పర్వాలేదు. హీరోయిన్ వెనుక హీరో పడడం.. ఆమె కూడా ఇతన్ని తెలిసిన వ్యక్తిలా చూడడం.. ప్లాష్బ్యాక్లో ఏదో ఉంటుందనే క్యూరియాసిటీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ఇది రొటీన్ లవ్స్టోరీ అని అర్థమైపోతుంది. గతంలో చూసిన చాలా సినిమాలు గుర్తుకు వచ్చేలా సన్నివేశాలు సాగుతుంటాయి. క్లైమాక్స్ కూడా అలానే ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..
తొలి సినిమానే అయినా జై కృష్ణ చక్కగా నటించాడు. లుక్స్ పరంగానూ తెరపై చూడడానికి బాగున్నాడు. యాక్షన్ సీన్స్తో పాటు డ్యాన్స్ కూడా బాగానే చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో మాత్రం అనుభవలేమి కనిపించింది. రెండు, మూడు సినిమాలు పడితే.. నటుడిగా మరింత రాటుదేలుతాడు. మంగ పాత్రకి రాషా తడాని న్యాయం చేసింది.
ఇక మోహన్ బాబు తెరపై కనిపించేది కాసేపే అయినా మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కిక్ శ్యామ్, అజయ్, వాసుకితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో 'అల్లల్లే...' ఆకట్టుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


