సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రాషా తడానీ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మంచు మోహన్బాబు విలన్ పాత్ర పోషించారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రదర్శకుడు అజయ్ భూపతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అజయ్ భూపతి మాట్లాడుతూ.. 'సూపర్ స్టార్ కృష్ణగారి కుటుంబం నుంచి ఒక హీరోని పరిచయం చేయడం అంటే కచ్చితంగా బాధ్యత, ఒత్తిడి ఉంటుంది. అయితే నేను మొదట్లో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నిజానికి నేనెప్పుడూ నా శైలిలోనే సినిమాలు చేసుకుంటూ వెళ్తాను. ఆ సినిమాలకు సంబంధించిన వాళ్లు కూడా నా స్టైల్కే వదిలేశారు. కాకపోతే ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ కోసం జై కృష్ణతో నా ప్రయాణం మొదలైన తర్వాత తను నాకు వ్యక్తిగతంగా చాలా నచ్చాడు. కృష్ణగారంటే నాకు చాలా అభిమానం. ఆయన వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గరుండి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకున్నానని' దర్శకుడు తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ..'నిర్మాత కిరణ్గారికి నేను ఓ సినిమా చేయాలి. శ్రీనివాస మంగాపురం సినిమా అనుకున్నప్పుడు అశ్వినీదత్గారిని కలిశాను. ఆ తర్వాత జై కృష్ణను రెండు, మూడు సార్లు కలిశాను. తనపై నమ్మకం వచ్చిన తర్వాత ఈ మూవీ ఆరంభించాం. ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్తోనే కథ రాసుకున్నాను. ఈ కథ బ్యాక్డ్రాప్, క్యారెక్టర్ల పేర్లు, వాళ్ల లవ్ స్టోరీ... వీటన్నింటికీ ఈ టైటిల్ సరిపోతుంది. ఇది ఫిక్షన్ కథ అయినప్పటికీ నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగానూ కొన్ని సన్నివేశాలు రాశాను. ఈ సినిమా మొదలైన తర్వాత ప్రేక్షకులు కథతో, రాత్రులతో లీనమైపోతారు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఇది కంప్లీట్ ఎమోషనల్ లవ్స్టోరీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. గత 20 ఏళ్లుగా మోహన్ బాబుగారిని ఇంత ఎమోషనల్ పాత్రలో ఆడియన్స్ చూసి ఉండరు. జై కృష్ణ, మోహన్బాబుగారు, రాషా మధ్య వచ్చే సన్నివేశాలు హత్తుకుంటాయి. జీవీ ప్రకాశ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటాయి' అని అన్నారు.
మహేశ్ బాబు మా సినిమా చూసి అదిరిపోయింది... జై కృష్ణ, రాషా తడానీ జోడీ బాగుందన్నారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి అని మెసేజ్ పెట్టారు. ప్రభాస్గారు కూడా మా సినిమాని ప్రోత్సహించడం హ్యాపీగా అనిపించింది. దాదాపుగా నా కథలను సమాజం నుంచే తీసుకుంటాను. నా ఫిల్మోగ్రఫీలో శ్రీనివాస మంగాపురం ఫస్ట్ ప్లేస్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాను. నా తర్వాతి సినిమా ‘మంగళవారం 2’ త్వరలోనే మొదలవుతుందని దర్శకుడు వెల్లడించారు.


