టాలీవుడ్ హీరో శర్వానంద్ బైకర్ తర్వాత నటిస్తోన్న తాజా చిత్రం భోగి. ఈ మూవీకి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ క్లైమాక్స్ సీన్ షూటింగ్ పూర్తయిందని చిత్రబృందం తెలిపింది. ఈ సీన్ కోసం భారీ సెట్ వేసినట్లు వెల్లడించింది. దిలీప్ సుబ్బరాయన్ మాస్టర్ కొరియోగ్రఫీలో 22 రోజుల పాటు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసినట్లు తెలిపారు. దాదాపు 3 నెలల ప్లానింగ్, 800 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఈ సీక్వెన్స్ తెరకెక్కించారు.
కాగా.. ఈ చిత్రాన్ని 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది.


