తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సోలో హీరోగా 10 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ‘నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించిన ఆయనకు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతూ వర్మ నటించారు.
ఈ చిత్రంలో రిషి పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘పెళ్ళిచూపులు’ సినిమాతో సోలో హీరోగా మారారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యశ్ రంగినేని నిర్మించిన ఈ మూవీ 2016 జూలై 29న విడుదలై, ఘన విజయం సాధించింది. హీరోగా మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సంపాదించుకుని, బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించారు విజయ్. ‘పెళ్ళి చూపులు’ విడుదలై బుధవారానికి పదేళ్లు పూర్తయింది. ఈ రకంగా హీరోగా ఇండస్ట్రీలో పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారాయన. ‘పెళ్ళి చూపులు’ విజయంతో విజయ్ దేవరకొండ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
‘టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, ఫ్యామిలీ స్టార్, ఖుషి, కింగ్డమ్’ ఇలా.. వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు విజయ్ దేవరకొండ. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాలో అర్జునుడి పాత్రలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారాయన. ‘‘విజయ్ దేవరకొండ ఈ దశాబ్దకాలంలో జయాపజయాలు, ఎత్తుపల్లాలు, ప్రేమ, ద్వేషం ఎదుర్కొన్నారు. రౌడీ వేర్ బ్రాండ్తో ఒక వ్యాపారవేత్తగానూ సక్సెస్ అయ్యారు. ‘ది దేవరకొండ ఫౌండేషన్’ పేరుతో పేద, మధ్య తరగతి వారికి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇటీవల తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిభ గల 180 మంది పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించారు’’ అని ఆయన టీమ్ పేర్కొంది. ఇదిలా ఉంటే... విజయ్ దేవరకొండ ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ మూవీ సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది. అలాగే రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన’ అనే సినిమా చేస్తున్నారు విజయ్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబరులో రిలీజ్కు రెడీ అవుతోంది. అదే విధంగా శౌర్యువ్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనూ ఓ సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ.


