అంతులేని యోగ సంపద! | Sakshi Editorial On International Yoga Day Chandrababu Govt By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

అంతులేని యోగ సంపద!

Jun 22 2025 12:24 AM | Updated on Jun 22 2025 12:24 AM

Sakshi Editorial On International Yoga Day Chandrababu Govt By Vardhelli Murali

జనతంత్రం

‘అంతులేని కథ’ అనే ఒక సినిమా ఉంది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ’70వ దశకంలో సంచలన చిత్రం. ఓ కుటుంబ యజమాని తన బాధ్యతల్ని వదిలేసి పారిపోతాడు. పెళ్లీడొచ్చిన పెద్ద కూతురు ఆ భారాన్ని తన భుజాలమీదేసుకుని బండి నడిపిస్తుంది. అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత పారిపోయిన పెద్దమనిషి ఇంటికి ఉత్తరం రాస్తాడు. ఇన్నేళ్లూ తాను కష్టపడి సంపాదించిన అంతులేని సంపదతో తిరిగొస్తున్నానని ఆ ఉత్తరంలో చెబుతాడు. ఇల్లంతా పండుగ వాతావరణం. ఆ రోజు రానే వచ్చింది. ఆయన దిగనే దిగాడు. 

కాకపోతే కాషాయ దుస్తుల్లో, సన్యాసి వేషంలో! షాక్‌ తిన్న కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన ఉత్తరంలో రాసిన సారాంశాన్ని వివరిస్తాడు. తన ఉద్దేశంలో సంపద అంటే భక్తి సంపద, జ్ఞాన సంపద, తపః సంపద, మోక్ష సంపద... ఇవి దండిగా సంపాదించానని చెబుతాడు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని ఒక గొప్ప ఈవెంట్‌గా మలుచుకునేందుకు ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ అక్కరకొచ్చింది. ప్రధానిని పిలుచుకున్నారు. 3 లక్షల మందితో విశాఖ తీరంలో ఆసనాలు వేయించి, గిన్నిస్‌ బుక్‌ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 

గతంలో ఎవరూ చేయని ఘనమైన కార్యాన్నే గిన్నిస్‌ బుక్‌ వాళ్ళు రికార్డులోకి ఎక్కిస్తారు. ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని తాపేశ్వరం స్వీట్‌ షాప్‌ వాళ్లు 29,465 కిలోల బరువు ఉన్న లడ్డూను తయారు చేసినందుకు షాపు యజమాని పోలిశెట్టి మల్లిబాబుకు గిన్నిస్‌ బుక్‌లో చోటు దొరికింది. 

రామ్‌ సింగ్‌ అనే జైపూర్‌ వాసి నాలుగున్నర మీటర్ల పొడవైన మీసాలు పెంచి ఈ ఘనత సాధించాడు. ఆంటోనీ విక్టర్‌ అనే మరో భారతీయుడు చెవుల మీద ఏడు ఇంచుల పొడవైన వెంట్రుకల్ని పెంచాడు. ఇదేమీ చిన్న ఫీట్‌ కాదు కదా! అందుకే గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది.

అట్లాగే చేతి వేళ్లకు ఉన్న గోళ్ళను ఎనిమిదిన్నర మీటర్లు పెంచి ఒకరు, తలకాయతో 46 టాయిలెట్‌ సీట్లను పగలగొట్టి మరొకరు, 459 స్ట్రాలను ఒకేసారి నోట్లో కుక్కి ఇంకొకరు ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశిష్ట ఘనతలు ఆంధ్రప్రదేశ్‌కు రెండు లభించాయి. 

ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందికి పైగా యోగా చేసినందుకు ఒకటి, 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసినందుకు మరొకటి! గిన్నిస్‌ రికార్డుల కోసం ఎక్కువ మందితో ఒకే చోట డాన్సులు చేయించడం, డ్రమ్స్‌ వాయించడం, పాటలు పాడించడం వంటి కార్యక్రమాలను సాధారణంగా పెద్ద పెద్ద ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల వాళ్ళు చేస్తుంటారు. 

ఇది మరీ పెద్ద రికార్డు కనుక స్వయంగా ప్రభుత్వమే తన భుజాల మీదకు ఎత్తుకుంది. డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా వెళ్లాలని తాఖీదులు వెళ్లాయి. స్వచ్ఛంద సంస్థలని బలవంతంగా రంగంలోకి దింపారు. 

సంక్షేమ పథకాల లబ్ధిదారులందరూ హాజరయ్యే బాధ్యతను ప్రభుత్వ అధికారులకు అప్పగించారు. వేలాది బస్సులను ఏర్పాటు చేశారు. టీ షర్టులను, మ్యాట్లను ఉచితంగా అందజేశారు. ఐదు లక్షలు టార్గెట్‌గా పెట్టుకుంటే, అటెండెన్స్‌ మూడు లక్షల మార్కు దాటింది. 

కార్యక్రమం విజయవంతం కావడం, ఒకేసారి రాష్ట్రానికి విశిష్టమైన రెండు గిన్నిస్‌ రికార్డులు లభించటం సహజంగానే ముఖ్యమంత్రిని మిక్కిలి సంతోషపరిచింది. కార్యక్రమం ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. 

విశాఖపట్నం అంటే తనకెంతో ఇష్టం కనుక ఈ ఘనత విశాఖకు లభించేలా చేశానని అర్థం వచ్చేలా మాట్లాడారు. హుద్‌హుద్‌ తుఫాను వచ్చినప్పుడు తను విశాఖలోనే బస్సులో కూర్చుని అజమాయిషీ చేసిన సంగతిని గుర్తు చేశారు. ముంబయ్‌ని మించి, విశాఖలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. 

కార్యక్రమం సందర్భంగా ప్రధాని సమక్షంలో ఆయనను చరిత్ర సృష్టించిన వ్యక్తిగా పొగిడిన బాబు – మీడియా సమావేశంలో ఆయనకు మరిన్ని పొగడ్తలు తగిలించారు. ఒక ప్రభుత్వం ఏడాది పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్నప్పుడు సహజంగా ఫోకస్‌ కావాల్సిన అంశాలు, చర్చనీయాంశాలు కావలసిన సంగతుల స్థానాన్ని ఇటువంటి మెగా ఈవెంట్‌ ఆక్రమించడం కూడా బాబు ఆనందానికి ఇంకో కారణం కావచ్చు. 

సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డును తెచ్చిపెట్టిన గిరిజన బాలలు విశాఖలో ఆకలితో అలమటించారని, పడుకునేందుకు, కనీస అవసరాలకు చోటు దొరక్క అగచాట్ల పాలయ్యారని వస్తున్న వార్తలు, తన ఆనందానికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టంలేదు. అందుకే ఆ ఘటనపై విచారమూ లేదు... విచారణా లేదు.

ప్రభుత్వం ఏడాది పాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చనీయాంశం కావలసిన అంశాలను ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి మొన్న జనం ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో గణాంకాల సహితంగా నిరూపించారు. 

ఆయన సొంత గణాంకాలు కావవి! ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థల గణాంకాలతోనే జగన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు. ఏడాది కాలంలోనే లక్షా అరవై వేల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించారు. ఏడాదిగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని నిలిపివేయడంపై నిలదీశారు. 

ప్రభుత్వ బడుల్లో అందుతున్న నాణ్యమైన విద్యకు బ్రేకులు వేయడంలోని ఔచిత్యం ఏమిటని అడిగారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్‌’, ‘ఆరోగ్యశ్రీ’ బకాయిల ఎగవేతపై, రైతాంగాన్ని కష్టాల కడలిలో ముంచడంపై తూర్పారబట్టారు. అన్నింటినీ మించి ‘‘ఎన్నికల బాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీయండి’’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. 

‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి ఇంటింటికీ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసింది. ‘‘చంద్రబాబు నాయుడు – పవన్‌ కల్యాణ్‌ అను మేము రాష్ట్ర ప్రజలు మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాం. 

మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ష్యూరిటీ పత్రంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము’’ అని పేర్కొంటూ వారిద్దరూ ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ఆ పత్రంలో కుటుంబ యజమాని పేరు, తండ్రి పేరు, వయసుతోపాటు కుటుంబ సభ్యుల సంఖ్యను, తాము హామీ ఇస్తున్న పథకాల్లో ఆ కుటుంబానికి వర్తించే వాటిని పేర్కొన్నారు. 

ఆ పథకాల కింద వారికి మొదటి ఏడాది జరిగే లబ్ధిని, ఐదేళ్లలో జరిగే లబ్ధిని కూడా పేర్కొన్నారు. తెల్ల రేషన్‌ కార్డులు ఉన్న కోటీ నలభై లక్షల కుటుంబాలకు ఈ ప్రమాణ పత్రాలను పంపిణీ చేసినట్టు సమాచారం. జూన్‌ 2024 నుంచి ఈ హామీలు వర్తింపచేస్తామని కూడా ఈ పత్రంలో స్పష్టంగా రాశారు. ఆ లెక్కన ప్రమాణ పత్రాల సాక్షిగా ఏపీ ప్రజలకు ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయి పడిందని అంచనా.

ప్రతిపక్ష నాయకుడు ఆరోపణలు చేసినప్పుడు బాధ్యత గల ప్రభుత్వాలు దానికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. సమాధానం ఇవ్వకపోగా ప్రతిపక్ష నేత పిలుపునిచ్చినట్టుగా ఎవరైనా నిలదీస్తే తాట తీస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడం ఒక విడ్డూరం. పైగా అసలు కథను వదిలేసి ‘రప్పా రప్పా’ అనే ఓ పిట్ట కథను పట్టుకొని జగన్‌ మోహన్‌ రెడ్డి అనని మాటల్ని ఆయనకు ఆపాదించి మీడియాలో తెలుగుదేశం పార్టీ వీరంగం వేసింది. 

ఆ మీడియాలోనే చదివిన వాళ్లకు, చూసిన వాళ్లకు ఏం అర్థమవుతుంది? రెండున్నర గంటల మీడియా సమావేశంలో జగన్‌ మోహన్‌ రెడ్డి ‘రప్పా రప్పా’ అనే అంశంపైన మాత్రమే మాట్లాడారని అనుకుంటారు కదా! ఇదే తెలుగుదేశం పార్టీకి కావలసింది. ప్రతిపక్ష నేత లేవనెత్తిన అంశాలు జనంలోకి వెళ్ళకూడదు, చర్చ జరగకూడదు.

ఒకవేళ కూటమి పెద్దల ఖర్మ కాలి, ఈ ప్రమాణ పత్రాలను తీసుకుని కోటి కుటుంబాల వారు తమకు బకాయిలు ఇప్పించాలని కోర్టుల మెట్లెక్కితే? కోర్టులు ఎలా స్పందిస్తాయనేది పక్కన పెడదాం. ప్రభుత్వం మోసం చేసిందంటూ కోటి కాదు, పది లక్షల కుటుంబాల వారు ఒకేసారి ఫిర్యాదులు చేసినా అదే పెద్ద రికార్డు! 

దాని ముందు గిన్నిస్‌ రికార్డులు, పిన్నిస్‌ రికార్డులు అన్నీ బద్దలు కావాల్సిందే! ఇదిగో జనం నుంచి ఇటువంటి సామూహిక ఫిర్యాదులు రాకుండా వారి ఆలోచనలను హైజాక్‌ చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, గిన్నిస్‌ బుక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకున్నది. యోగా అనేది సర్వరోగాలకూ, సకల సమస్యలకూ ఏకైక దివ్యౌషధం అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు.

‘రోజు ఒక గంట యోగా చేయండి. అదే పదివేలు’ అని ముఖ్యమంత్రి పిలుపునిస్తున్నారు. యోగాపై విశాఖ డిక్లరేషన్‌ కూడా త్వరలో విడుదల చేస్తారట! బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నామని, యోగా–నేచురోపతి గేమ్‌ ఛేంజర్లుగా మారబోతున్నాయని ఆయన ప్రకటించారు. ఇక అల్లోపతి అటకెక్కినట్టేనా? యోగాభ్యాసాల్లో చేయించే ఎక్సర్‌సైజుల్లో చాలా స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు గతంలో పాఠశాలల్లో ఉన్న డ్రిల్‌ పీరియడ్లలో నేర్పించినవే. 

ఇప్పుడు మైదానాలు, స్పోర్ట్స్‌ టీచర్లు, స్పోర్ట్స్‌ పీరియడ్లను ఎత్తేశారు కాబట్టి, ఎవరింటి దగ్గర వాళ్లు గంటసేపు యోగా చేయమంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులైన కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ దివంగతులైన రోజు జూన్‌ 21. అదే రోజును ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించడం కేవలం కాకతాళీయమే కావచ్చు.

కానీ, ఈ ప్రకటన తర్వాత యోగా గురువులు తామరతంపరగా పుట్టుకొస్తున్నారు. యూట్యూబ్‌ల ద్వారా పాఠాలు చెబుతున్నారు. అందులో రోగాల స్పెషలిస్టులు కూడా బయలుదేరారు. నడుము నొప్పికి సేతుబంధాసనమట! సంతానం కలగాలంటే భుజంగాసనమట! ఇలానే కడుపునొప్పికి, గ్యాస్‌ మంటకు, దగ్గుకు, ఆయాసానికీ చివరికి ఎయిడ్స్‌కు, క్యాన్సర్‌కు కూడా యోగా చిట్కాలు చెప్పే గురువులు తయారయ్యారు. వీటన్నిటినీ వైద్యశాస్త్రం ఆమోదిస్తుందా, వీళ్ళందరికీ శరీర నిర్మాణ శాస్త్రంపై అవగాహన ఉన్నదా అనేవి ప్రశ్నార్థకాలు. ఆమధ్య ‘టెలిగ్రాఫ్‌ ఇండియా’ ఒక పరిశీలనాత్మక వ్యాసం రాసింది.
 
అందులో ‘అష్టాంగ యోగా’ను ఆచరిస్తున్న వారిలో 62% మంది మోకాలి నొప్పులు, పిక్క కండరాల సమస్యలను ఎదుర్కొంటున్నారట! ఏ వయసు వారు ఎటువంటి ఆసనాలు వేయవచ్చు? ఆసనాలు వేసే సరైన పద్ధతి ఏమిటనే అవగాహన శాస్త్రీయంగా కల్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి. 

యూట్యూబ్‌ సందేశాలు విని, పునర్‌ యవ్వనం ప్రాప్తిస్తుందని నమ్మి ముసలాళ్లు కూడా వజ్రాసనం వేసి కూర్చుంటే మోకాలి చిప్పలు దెబ్బతినవా? ఈ వేలం వెర్రిని నియంత్రించుకోకుంటే దుష్ఫలితాలు కూడా ఉంటాయని గ్రహించాలి.

పిల్లలు పాఠశాల మైదానాల్లో నేర్చుకునే జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్‌ వంటి క్రీడలకు, ఇంటి దగ్గర ఇరుకు గదుల్లో అభ్యసించే యోగా సరైన ప్రత్యామ్నాయమేనా అనేది కూడా ఆలోచించాలి. యోగాభ్యాసం ద్వారా శారీరక చురుకుదనం, మానసిక పరిపక్వత దేదీప్యమానమవుతుందనే అభిప్రాయం నిజమైతే దీన్ని ప్రమోట్‌ చేసే పద్ధతి గిన్నిస్‌ బుక్‌ ప్రదర్శనల ద్వారా కాదు. 

యోగాభ్యాసం ఫలితంగా ఫలానా అథ్లెట్‌ ఫలానా కప్పు గెలుచుకొచ్చారని, ఫలానా క్రీడా జట్టు ఫలానా టోర్నమెంట్‌ గెలిచిందని ఉదాహరించాలి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఫలానా వ్యక్తులు ఫలానా ఆవిష్కరణలు చేశారని, నోబెల్‌ బహుమతి గెలిచిన వారి మేధ వెనుక యోగాభ్యాసం ఉన్నదనేటటువంటి పాఠాలు ఎక్కువ మోటివేట్‌ చేస్తాయి. కాకపోతే అటువంటి ఉదాహరణల కోసం కాస్త కష్టపడి శోధించాలి.

‘సకల సమస్యలకు యోగానే మందు’ అనే ప్రచారాన్ని ముందుకు తెస్తున్న చంద్రబాబు లాంటి వాళ్లు ‘‘ప్రభుత్వ బడుల్లో టోఫెల్‌ పాఠాలెందుకు, సీబీఎస్‌ఈ ఎందుకు, ఐబి ఎందుకు, ఇంగ్లీష్‌ మీడియం ఎందుకు? యోగా ఉందిగా! 

‘ఆరోగ్యశ్రీ’ ఎందుకు, ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ఎందుకు? యోగా చేయండి చాలు!’’ అనే ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉన్నది. ‘అంతులేని కథ’లో సదరు సన్యాసిరావు సంభాషించిన జ్ఞాన సంపద, భక్తి సంపద, తపః సంపద మాదిరిగానే! ఇక ఆంధ్ర దేశంలో యోగ సంపద కూడా దినదిన ప్రవర్ధమానం కావచ్చు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement