breaking news
-
అసెంబ్లీలో పాడి వేడి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీపీ గౌస్ ఆలం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య వార్ ముదురుతోంది. ఇంతకాలం జిల్లాకు పరిమితమైన ఈ గొడవకు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా మారింది. సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి ఆరోపణల డోసు పెంచారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో సీపీ ఆయన మిత్రులతో కలిసి ఫైరింగ్ సాధన చేయడంతోనే బోనాలపల్లెలో అమృతమ్మ అనే వృద్ధురాలికి తూటా గాయమైందని ఆరోపించారు. కరీంనగర్ కమిషనరేట్కు చెందిన పలువురు కానిస్టేబుళ్లు, వాహనాలను హైదరాబాద్లో సీపీ ఇతర పనులకు మోహరిస్తున్నారని సభలో పేర్కొన్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై స్పందించాలని మంత్రి శ్రీధర్బాబుతోపాటు, మంత్రులు పొన్నం, అడ్లూరికి విజ్ఞప్తి చేశారు. పాడి ఆరోపణలపై స్పందించిన మంత్రి శ్రీధర్బాబు ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.దొంగ ఆఫీసర్లు.. డ్రగ్స్ తీసుకున్నారా? అంటూ..సభ అనంతరం పాడి కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలగందుల ఫైరింగ్ రేంజ్లో కాల్పులు జరిగిన సమయంలో సీపీ గౌస్ ఆలం లీవ్లో ఉన్నట్లుగా పోలీసులు విడుదల చేసిన ప్రకటనను తప్పుబట్టారు. అదంతా డీటీపీ చేశారంటూ కొట్టిపారేశారు. ముందే రాసుకున్న లీవ్ లెటర్పై పెన్నుతో డేటు వేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి దొంగ పోలీసాఫీసర్లకు మద్దతుగా నిలవడమేంటని ఐపీఎస్ ఆఫీసర్లను ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ, హుజురాబాద్ ఏసీపీలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. తన ఆరోపణలపై విచారణ జరిపించి తప్పు మాట్లాడితే.. ముక్కు భూమికి రాస్తానంటూ పునరుద్ఘాటించారు. కరీంనగర్ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ఆలంకు వ్యతిరేకంగా ఉన్నారని, అందువల్లే తనకు సీపీ గురించిన సమాచారం అంతా అందుతోందని వెల్లడించారు. తన మీద సీఐడీ కేసులు పెట్టడం కాదని, చేతనైతే సీపీ మీద విచారణకు సిట్ వేయాలని కోరారు.ఈనెల 30వ తేదీ వరకే డెడ్లైన్సీపీ పవిత్ర రంజాన్మాసంలో జల్సాలు చేసుకున్నారని, ఆ పార్టీలో పోలీసులు ఎగిరిన తీరు చూస్తుంటే.. పీకల్లోతు మందు తాగారా, డ్రగ్స్, గంజాయి ఉన్నాయా అని ప్రశ్నించారు. కరీంనగర్ యువతకు పోలీసులు ఏం సందేశం ఇస్తున్నారు అని నిలదీశారు. వెంటనే డీజీపీ, మంత్రి శ్రీధర్బాబు చర్యలు తీసుకోవాలని, 30వ తేదీలోగా చర్యలు తీసుకోవాలని లేకపోతే మరిన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. ఇటీవల ప్రెస్మీట్లో సీపీకి సంబంధించిన ఆధారాలు బయటపెడతానని చెప్పిన పాడి అన్నంత పనిచేశారు. 30వ తేదీలోగా సీపీపై చర్యలు లేకపోతే మరిన్ని విషయాలు వెల్లడిస్తానని చెబుతుండటంతో.. పాడి ఆరోపణలపై ఇటు డిపార్ట్మెంట్, అటు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. -
మూసీ మంటలు.. కేటీఆర్ వర్సెస్ శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన, సుందరీకరణ ప్రాజెక్టు అంశం బుధవారం శాసనసభను కుదిపేసింది. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్, మంత్రి శ్రీధర్బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, సు«దీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డిలు మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నించారు. దాని డీపీఆర్ సిద్ధమైందా, ప్రాజెక్టు వ్యయం అంచనా ఎంత, నిర్వాసితుల సంఖ్య, వారి పునరావాస చర్యల గురించి ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్బాబు, ప్రాజెక్టు మొదటి దశకు డీపీఆర్ సిద్ధమైందని, మొదటి దశ అంచనా వ్యయం రూ.ఆరున్నర వేల కోట్ల నుంచి రూ.ఏడు వేల కోట్లని, దాదాపు 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని, నిర్వాసిత కుటుంబాలకు టీడీఆర్ను జారీ చేస్తామని, 2013 చట్టం ప్రకారం సహాయ పునరావాసాలు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రి, మూసీనది అభివృద్ధి సంస్థ ఎండీ భిన్న ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం అవసరమవుతుందని రెండు నెలల క్రితం ఇదే సభలో ప్రకటించిన శ్రీధర్బాబు, ఇప్పుడు డీపీఆర్ సిద్ధమైందని చెప్పటం వింతగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని సభలోనే శ్రీధర్బాబు చెప్పారని, కానీ, ఆ బ్యాంకును జనవరి, మార్చి నెలల్లో రెండు పర్యాయాలు సంప్రదిస్తే... తమకు డీపీఆరే అందలేదని, ఎలాంటి లోన్ మంజూరు చేయలేదని వెల్లడించినట్టు పేర్కొన్నారు. సమాచార లోపం వల్ల ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారా, లేదా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చెబుతున్నారా అంటూ నిలదీశారు. ప్రాజెక్టుకు ముఖ్యమంత్రేమో రూ.లక్షన్నర కోట్లని చెబుతుంటే, ఇప్పుడు మంత్రి శ్రీధర్బాబు ఆరేడువేల కోట్లని అంటున్నారని నిలదీశారు. మంత్రి శ్రీధర్బాబు 1,400 ఇళ్లు కూలుస్తామని అంటున్నారని, మరి గెజిట్లో 10 వేలకుపైగా నిర్మాణాలు ప్రభావితానికి గురవుతాయని ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బఫర్ జోన్ విషయంలో 50 మీటర్లని మంత్రి అంటే, అధికారుల మాటల్లో అది చాలా ఎక్కువగా కనిపిస్తోందన్నారు. బురద చల్లటం ఆపాలి: మంత్రి శ్రీధర్బాబు కేటీఆర్ మాటలపై మంత్రి శ్రీధర్బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వైఖరి ముందు నుంచీ మేం బురద చల్లుతాం...మీరు తుడుచుకోండి అన్నట్టుగా ఉంటోందని అసహనం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు మొదటి దశ డీపీఆర్లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయం అవుతుందని తాము స్పష్టంగా చెప్పామన్నారు. కేటీఆర్ మాత్రం రూ.లక్షన్నర కోట్ల కుంభకోణం అని అవాస్తవాలతో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. తాము చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అడ్డుగోడ కట్టాలని ఆ పార్టీ సంకుచిత ఆరోపణలు చేస్తోందని తిప్పికొట్టారు. మూసీకి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ జోన్గా గుర్తిస్తూ 2016 లో అప్పటి ప్రభుత్వం జీఓ ఇచ్చింది నిజం కాదా అని శ్రీధర్బాబు ప్రశ్నించారు. ఇప్పుడేమో ఇళ్లెలా తొలగిస్తారని ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు కోసం డీపీఆర్ రూపొందించిన మెయిన్ హార్ట్ అనే సింగపూర్ ఇంజనీరింగ్ సంస్థకు ఇటువంటి పనుల్లో అనుభవం ఉందని శ్రీధర్బాబు తెలిపారు. కేవలం రెండు నెలల్లో డీపీఆర్ ఎలా తయారైందని కేటీఆర్ ప్రశ్నించటం విడ్డూరమని, డీపీఆర్ తయారీ ఏడాది సమయం పట్టిందన్నారు. రుణం కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకుకు డీపీఆర్ ఇచ్చామని, తన తదుపరి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏదైనా కారణం చేత ఆ బ్యాంకుకు సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తామన్నారు. బీఆర్ఎస్కు మూసీ ప్రక్షాళన ఇష్టం లేదా: భట్టి బీఆర్ఎస్ సభ్యుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి తీవ్రంగా స్పందించారు. మూసీ ప్రక్షాళన ఆ పారీ్టకి ఇష్టం లేదోమోనని, దాని పరీవాహక ప్రాంత పేదల జీవితాలు బాగవ్వాలని ఆ పార్టీ కోరుకోవటం లేదేమోనని ఆరోపించారు. మూసి నిర్వాసిత పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ను ఆ ప్రాంతంలోనే నిర్మిస్తామన్నారు. ఈ విషయంలో తమ ప్రశ్నలకు మంత్రి నుంచి సరైన సమాధానాలు రాలేదని, ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించడంతో ఆ పార్టీ సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు. -
మళ్లీ తొక్కుకుంటూ వస్తాం.. : సీఎం రేవంత్రెడ్డి
⇒ రామాయణంలో రావణాసురునికి పట్టిన గతే ప్రతిపక్ష నేతలకు పడుతుంది. మంచి ఆలోచనతో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆలోచనలు చేస్తూ పథకాలు అమలు చేస్తుంటే.. రాక్షసుల మాదిరి విఘ్నాలు కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి రాక్షసులకు రామబాణం సమాధానం చెబుతుంది ⇒ మేం ఏం చేసినా కించపరిచేలా, అహంకారంతో మాట్లాడుతున్నారు. అది తమ జన్మహక్కు అని అనుకుంటున్నారు. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా (ప్రతిపక్ష హోదా) ఉండదు. భూకంపంలో కొట్టుకుపోతారు⇒ టీడీఆర్, హిల్ట్ పాలసీపై విచారణకు లేఖ రాయండి. వెంటనే మా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. విచారణకు వెనకాడినా లేదా వెనక్కి తగ్గినా క్షమాపణ చెబుతాంసాక్షి, హైదరాబాద్: 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిమ్మల్ని మళ్లీ తొక్కుకుంటూ అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ‘2023 ఎన్నికల్లో బరాబర్ మీ నెత్తిపై కాళ్లు పెట్టి తొక్కుకుంటూ ఇక్కడకు వచ్చాను. 2029లో మళ్లీ చూసుకుందాం. మళ్లీ తొక్కకపోతే చూడండి. మీరు ఎట్లా గెలుస్తారో చూస్తాను’అని ఆవేశంగా ప్రకటించారు. బుధవా రం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ రెండున్నర గంటలకుపైగా సుదీర్ఘంగా సీఎం ప్రసంగించారు. ‘ఇప్పటికైనా మీరు మర్యాదగా ఉండడం నేర్చుకుంటే మంచిది. కనీస మర్యాద దక్కుతుంది’అని హెచ్చరించారు. 2029 ఎన్నికలు కూడా కేవలం పాసింగ్ క్లౌడ్ మాత్రమే. 2034 వరకు ఈ ప్రభుత్వమే ఉంటుంది. అప్పటికే తెలంగాణ ఒక ట్రిలియన్ ఎకానమీగా ఎదుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’అని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్న హిల్ట్–పి, టీడీఆర్లకు సంబంధించి వారు లేఖ రాస్తే ఏ విచారణ కోరినా చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ‘కొందరు తమను తాము రాజులుగా భావిస్తున్నారు. రాచరిక పోకడలతో ప్రజాతీర్పును అవమానిస్తున్నారు. వారసత్వ రాజకీయాలను నమ్ముకుని అధికారం దక్కలేదనే దుఃఖంతో ఆరోపణలు, దు్రష్పచారంతో సభను తప్పుదోవ పట్టించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారి పోకడలు మారలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి తమ సేవకులను నియమించుకుంటారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది’అని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వల్లనే ఈ దుస్థితి రాష్ట్ర ఆదాయంపెంచాలి.. పేదలకు పంచాలి అనే పాలసీ తీసుకొస్తే కూడా అభినందించాలనే ఆలోచన ప్రతిపక్షాలకు రాకపోతే వారిని ఏమనాలని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ‘తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్ పట్ల సభావేదిక నుంచి వివరించాను. అధికారం పోయిందనే బాధతో ఇది కొందరికి రుచించదు. వారు కక్కిన విషాన్ని శివుడి మాదిరిగా గొంతులోనే పెట్టుకుంటాను’అని అన్నారు. తమపై గత ప్రభుత్వం పదేళ్లలో రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారాన్ని, దానికి 11 శాతం అధిక వడ్డీ మోపినందుకు, దానిని భరించడం వల్లనే తమ ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ను ఆవిష్కరిస్తూ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమని రేవంత్రెడ్డి చెప్పారు. ‘గవర్నర్ ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు. తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక’అని రేవంత్ పేర్కొన్నారు. విపరీత పోకడలకు పోవద్దు ‘కొత్త గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు విపక్షనేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనిప్రజలు ఆశించారు. సభాసంప్రదాయాలను గౌరవించకపోవడం తెలంగాణకు, ప్రజలకు తీరని మచ్చ’అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ‘వారసత్వాలతో అధికారం రాదు.. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటామంటే కుదరదు. సొంతంగా సత్తా ఉండాలి. ఔరంగజేబుగా మారతామంటే అది దురాశగా మారుతుంది. విపరీత పోకడలు, విధానాలకు పోవద్దు, అధికారం రాలేదని బాధ, దుఃఖం ఉండొద్దు’అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘కొందరు తమను తాము దైవాంశ సంభూతులమని అనుకుంటున్నారు. మీరు (బీఆర్ఎస్ నేతలు) దేవుళ్లు కాదు, దోపిడీదారులు. నోటిఫికేషన్లు, ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. అసంపూర్తిగా వదిలి వేసిన అసమర్థులు మీరు. మీలాగా గాలికి వచ్చిన వాళ్లం కాదు. ‘నేను కష్టజీవిని. తెలియకపొతే నేర్చుకుంటాను. ఇతరులకు నేర్పుతాను. ఇదే పంథాలో ముందుకు సాగి అనుకున్నవి కచ్చితంగా సాధిస్తాను’అని ఆయన పేర్కొన్నారు. ‘పారిశ్రామిక భూముల బదలాయింపులపై 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు హిల్ట్ పాలసీతో సహా దేనిపై అయినా సీబీఐ, ఈడీ, సిట్, లేదా ఏ అంతర్జాతీయ సంస్థతో విచారణకైనా మేం సిద్ధం. అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ను ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు.. ‘కేసీఆర్ అసెంబ్లీలో ఇదే స్థానం నుంచి తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి శాసనసభ కృతజ్ఞతలు చెబుతున్నది, ఆమె దయతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు’అని సీఎం రేవంత్ అన్నారు. తండ్రి బతికి ఉండగానే తద్దినం పెట్టడం అంటే ఏమిటో ఇప్పుడు అర్థమవుతోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బావమరుదులు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. వారిద్దరు అలాగే వ్యవహరిస్తే.. పార్టీ ముక్కలు అవుతుందని, అది కాకుండా చూసుకోవాలని, అధికారంలోకి వచ్చేది కల్ల అని వ్యాఖ్యానించారు. మేము చేసిన అప్పులు రూ. 3.47,294 కోట్లు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన మొత్తం అప్పులు రూ. 3,47,294 కోట్లు అయితే.. తాము చెల్లించిన అసలు, వడ్డీ కలుపుకొని రూ. 3,30,570 కోట్లు అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తాము అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్లలో నికరంగా చేసిన అప్పు కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమేనని స్పష్టంచేశారు. 2014 జూన్ 2న అధికారం చేపట్టిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు అప్పటి వరకున్న అప్పులు కేవలం రూ.69 వేల కోట్లు అయితే.. వారు తమకు 2023 డిసెంబర్లో అధికారం అప్పగించే నాటికి అప్పులు రూ. 6,71,757 కోట్లకు తోడు చేతి బదులుగా, కాంట్రాక్టర్లకు బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సినవి కలుపుకొంటే మరో రూ. 1.40 లక్షల కోట్లు ఉన్నాయని మొత్తంగా తమకు వారు అందించిన అప్పులు రూ. 8.11 లక్షల కోట్లు అని రేవంత్ వెల్లడించారు. కమీషన్లకు కక్కుర్తిపడి వారు 11 శాతం వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలను రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలా చేయడం వల్ల వడ్డీ భారం ఏటా దాదాపు రూ. 4000 కోట్లు ఆదా అవుతాయన్నారు. వైద్యానికి రూ. 4400 కోట్లు వ్యయం చేశాం పేదల వైద్యం కోసం తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 4,400 కోట్లు వ్యయం చేసిందని సీఎం రేవంత్ చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2,300 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2046 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పనిచేసిన పీఏలు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేద వారిపేట తీసుకుని వాటిని స్వాహా చేశారని, అలాంటి వారు తమను ప్రశ్నిస్తారా అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీని బీఆర్ఎస్ పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండురోజుల్లోనే రూ. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని రూ. 10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. నా కాలి గోటికి సరిపోవు... ‘వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి (హరీశ్రావు)ని మంత్రిగా చేసింది దివంగత నేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా? చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో సిరిసిల్ల ఎమ్మెల్యేగా (కేటీఆర్) గెలిచారు. నేను స్వశక్తితో జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాతే రాజకీయ పారీ్టలోకి వచ్చాను. నాతో నీకు పోలిక ఏమిటి? నాతో పోటీ ఏమిటి? నా కాలిగోటికి కూడా సరిపోవు’ అని సీఎం రేవంత్ అన్నారు. ‘2009లో పొత్తుధర్మంలో భాగంగా పాలమూరు బిడ్డలం కేసీఆర్ను భుజాన వేసుకుని ఎంపీగా గెలిపించాం. అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఏదైనా పూర్తిచేశారా?’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. విధులకు హాజరుకాకుండా జీతాలా? ‘2023 డిసెంబర్ 1 నుంచి ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్ష నేత రూ.1,06,56,674 జీతభత్యాలు పొందారు. విధులకు హాజరుకాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలి. అది ఉద్యోగులైనా రాజకీయ నేతలైనా కూడా చర్యలు తీసుకోవాలి’ అని రేవంత్రెడ్డి చెప్పారు. ‘ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్కు విజ్ఞప్తి... సభకు రండి, చర్చలో పాల్గొనండి.. మాజీ సీఎంకు ఆహ్వానం పలుకుతున్నాం. గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తా యని ఆశించాను. ఆశించిన మేర ప్రధాన ప్రతిపక్షం వ్యవహారశైలి లేదు’ అని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏఐ సునామీ రాబోతుంది... భవిష్యత్లో ఏఐ సునామీ రాబోతుందని రేవంత్రెడ్డి చెప్పారు. ‘దీనిని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ను గవర్నర్ ప్రసంగంలో వివరించారు. రాబోయే రోజుల్లో వైట్కాలర్ జాబ్లు పోయి బ్లూకాలర్ జాబ్లు రానున్నాయి. ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ను కనీసం చూశారా? గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మనం భవిష్యత్ ప్రణాళికలు రూపొందించకపోతే తరువాతి తరాలు మనల్ని క్షమించవు. అన్ని రంగాల మేధావులతో సమన్వయం చేసుకుని 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించుకున్నాం. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్గా విభజించుకున్నాం’ అని సీఎం వివరించారు. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువ...గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో సీఎంగా కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలను ట్యాబ్ ద్వారా సభలో సభ్యులకు సీఎం వినిపించారు. ‘వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. అప్పుడు సక్రమమని చెప్పిన వాళ్లకు ఇప్పుడు అక్రమం ఎలా అయింది? మీరు మాట్లాడిన మాటలను ప్రజలు అప్పుడే మర్చిపోయారనుకున్నారా? మూసీ ఉప్పల్ భగాయత్లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూద్దాం రండి. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. మూసీ కాలుష్యం కంటే వీరి కడుపుల్లో విషం ఎక్కువగా ఉంది. బుల్డోజర్లతో కొట్టేయమని చెప్పింది అప్పుడే మరిచిపోయారా’ అని పేర్కొన్నారు.ఈవీ వాహనాలకు పన్ను మినహాయింపుకాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని సీఎం తెలిపారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నట్టు ప్రకటించారు. ‘క్యూర్ ప్రాంతంలో ప్రక్షాళన చేస్తాం. 3 వేలకు పైగా డీజిల్తో నడుపుతున్న ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులతో ప్రత్యామ్నాయం చేశాం. డీజిల్, కిరోసిన్తో నడిచే ఆటోలను రెట్రోఫిటింగ్తో ప్రత్యామ్నాయం చేస్తాం. కాలుష్య నియంత్రణకు గట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. హైదరాబాద్ను పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రో విస్తరించాలని నిర్ణయించాం. అందులో భాగంగా రూ.25 వేల కోట్ల విలువైన మెట్రోను రూ.15 వేల కోట్లకు కొంటున్నాం. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటుంటే.. మేం మాత్రం ప్రైవేట్ సంస్థను కొనుగోలు చేస్తున్నాం. 76 కి.మీ. మెట్రోకు మేం కేంద్రానికి ప్రతిపాదనలను పంపాం’ అని చెప్పారు. చైనా నుంచి నేర్చుకుని ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. ‘కొంగరకలాన్ రోడ్డుకు టాటా దిగ్గజం రతన్ టాటా పేరు పెడితే అడ్డం పడుకుంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీతో మార్పు తీసుకురావాలని చూస్తే పాలకుండలో విషం చుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి’ అని సీఎం రేవంత్ చెప్పారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన మూడు గంటల ప్రసంగంపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మూడు గంటల ప్రసంగంలో సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మోడల్ చోర్ మోడల్. మూసి సుందరీకరణకు 16 వేల కోట్ల రూపాయలతో చేయొచ్చు. దానికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ చెప్పాల్సింది అభినందన కాదు, అభిశంసన.వీధి రౌడీ మాదిరి మాట్లాడిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి. స్పీకర్కు ఇంగితం ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలి. రేవంత్ రెడ్డి కన్ను తెలంగాణ భూములపై ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇలానే ఉంటుందని కేటీఆర్ విమర్శించారు. -
డ్రగ్స్ కేసు.. సిట్ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోందిఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్తో కలిసి ఇటీవల ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్రెడ్డిని ఖర్గే, కేసీల వద్దకు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఆయన్ను పరిచయం చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వేం నరేందర్రెడ్డి చేసిన కృషిని వారికి వివరించారు. కాగా.. రాజ్యసభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, కేసీలకు వేం నరేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. నరేందర్ రెడ్డిని వారు అభినందించారు. ఎంపీగా తనదైన ప్రత్యేక ముద్ర కనిపించేలా పనిచేయాలని ఖర్గే సూచించినట్లు తెలిసింది. ఈ సందర్భంగానే.. ఆయనతో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలు, ఇటీవల ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ పనితీరుపై చర్చించినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం కుదిరేలా, ప్రభుత్వ పథకాల అమలులో పార్టీ నేతల భాగస్వామ్యం ఉండేలా చూసుకుకోవాలని ఖర్గే సూచించినట్లుగా తెలిసింది. ప్రతీ రెండు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై.. సమన్వయ అంశాలపై చర్చించాలని ఖర్గే తెలిపినట్లు చెబుతున్నారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి.. సీపీపీ చైర్మన్ సోనియాగాంధీ, లోకస్భలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాం«దీలను కలిసే అవకాశం ఉంది. అలాగే.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో జరిగిన భేటీలో సీఎం వెంట ఎంపీలు మల్లు రవి, బలరామ్ నాయక్, సురేశ్ షెట్కార్ ఉన్నారు. -
కేటీఆర్ X మంత్రులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండోరోజు మంగళవారం అధికార, ప్రతిపక్ష సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్లకు శాసనసభ వేదికైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే సమయంలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సభ సాగింది. కేటీఆర్.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ఆ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని ధ్వజమెత్తారు. కేటీఆర్కు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రశ్నల వర్షం సుమారు 1.40 గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. గవర్నర్ ప్రసంగంలోని అంశాలతో పాటు రెండున్నరేళ్ల ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభు త్వం విఫలమైనందుకు ధన్యవాదాలు తెలపాలా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్కార్డుల విషయంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డికి మధ్య సమన్వయ లోపం ఉందని వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్న సీఎం సంతకానికి విలువలేకుండా పోయిందని విమర్శించారు. ఎందుకు చట్టబద్ధత కల్పించలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం సంతకానికి జీరో వాల్యూ అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి విమర్శలతో మంత్రుల ఫైర్ కేటీఆర్ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడిన మంత్రులు.. ప్రతి విమర్శలకు దిగారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగాన్ని చదివి ఉపన్యాసా లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు హితవు పలికా రు. గోబెల్స్ సదస్సులో రూ.లక్షల కోట్లు పెట్టుబడు లు వచ్చాయని చెప్తున్నా, టీజీఐఐసీ గణాంకాలు అందుకు భిన్నంగా ఉన్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యల పై స్పందిస్తూ.. ఎంఓయూలు కుదిరినా అవి ఆచరణలోకి వచ్చేందుకు సమయం పడుతుందంటూ వివరణ ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి.. తెల్లరేషన్కార్డులు, సన్న బియ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మిస్ బ్రిటన్ చేసిన ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించడంపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి..సీతక్కకు మద్దతుగా మాట్లాడారు. అనర్హత పిటిషన్లపై కేటీఆర్ మాట్లాడినప్పుడు మంత్రి పొంగులేటి..కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్!‘శోభాకృత నామ, క్రోదీకృత నామ సంవత్సరాలు పోయాయి. విశ్వావసునామ సంవత్సరం 19న పోతోంది. రేపు పరాభవ నామ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాసనామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయి.. పోతున్నయి. గ్యారంటీలు మాత్రం రావడం లేదు. గవర్నర్ ప్రసంగంలో గ్యారంటీలు, డిక్లరేషన్ల ఊసే లేదు. మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నా రు. ప్రభుత్వ అర్ధభాగం గడిచిపోయింది. ఫస్ట్ హాఫ్ డిజాస్టర్. సినిమా పేరు అభయహస్తం.. లోపల కథ చూస్తే భస్మాసుర హస్తం అని ప్రజలకు అర్థమైంది. మూడు ముక్కల్లో చెప్పాలంటే హామీలు ఎగ్గొట్టు.. కట్టిన వాటిని కూలగొట్టు.. ఉన్న పథకాలను చెడ గొట్టు..అన్నట్టుగా కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన ఉంది..’ అంటూ బీఆర్ఎస్ సభ్యుడు కేటీ రామారావు ధ్వజమెత్తారు. రైతు భరోసా, మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లను ఉద్దేశించి..ఈ ఆరు గ్యారంటీల (అభయ హస్తం) ఫైలు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఆ ఫైలు ఆచూకీ కోసం సిట్ వేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ ‘ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్ తొలి సంతకం చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధి, సంకల్పానికి నిదర్శనమని 2023 డిసెంబర్ 15న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన తన తొలి ప్రసంగంలో నాటి గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. సీఎం సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది? ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? తొలి కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పటికే 50–60 కేబినెట్ సమావేశాలు జరిగినా అతీగతీ లేదు. కొంతమంది ఆస్తులకు జీరో వేల్యూ చేసినట్టు సీఎం రేవంత్ అన్నారు. సీఎం సంతకానికి, ఆయన సంతకం చేసిన ఫైల్కి, మీ గ్యారంటీల కార్డుకి, మీ డిక్లరేషన్లకి, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికే జీరో వేల్యూ..’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి ఎక్కడ? ‘ఆరు గ్యారంటీలతో ఏటా ప్రతి కుటుంబానికి రూ.2.50 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చారు. ఏటా రూ.2.75 లక్షల కోట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఖర్చు చేశారా? రూ.2.5 లక్షల లబ్ధి పొందిన ఒక్క కుటుంబాన్నైనా చూపించగలరా? నేనే రాజు నేనే మంత్రి.. అని మిడిసిపడ్డ వారెవరూ సంపదలను, పదవులను మూటగట్టుకుని పోలేదని భాగవతంలో బలి చక్రవర్తి అన్నారు..’ అని కేటీఆర్ గుర్తు చేశారు. ఇటీవల ‘నేనే రాజు..నేనే మంత్రి’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడంపై పరోక్ష విమర్శలు చేశారు. ఎవరికి ధన్యవాదాలు తెలపాలి? ‘ధన్యవాద తీర్మానంపై చర్చలో ఎవరికి ధన్యవాదాలు చెప్పాలి? రూ.4 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న 46 లక్షల మందికా? రూ.6 వేల పెన్షన్ కోసం నిరీక్షిస్తున్న దివ్యాంగులకా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులకా? డీఏలు, పీఆర్సీ, బెనిఫిట్స్ అందని 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకా? నెలకు రూ.2,500 కోసం నిరీక్షిస్తున్న కోటి 65 లక్షల మంది ఆడపడుచులకా? విషాహారంతో చస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా?..’ అని కేటీఆర్ నిలదీశారు. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే.. ‘ఇండియా టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 420 వరల్డ్ కప్ పెడితే గెలిచేది కాంగ్రెస్సే. నేను కర్ణుడిలాంటి వాడిని అని ఇటీవల సీఎం అన్నారు. ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు అయ్యారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరి గినా తెలంగాణలో గొప్ప పాలన చేస్తున్నామంటూ ప్రజాధనంతో ప్రకటనలు ఇస్తున్నారు. పీసీ సర్కారు మాయాజాలాన్ని ఈ సర్కారు మరిపించింది. అట్టర్ ఫ్లాప్ సినిమాకి సంబరాలు చేస్తారా?. ఢిల్లీకి పోయి నిధులు తెస్తారనుకుంటే ఇచ్చి వస్తున్నారు. బాకీలు.. బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు! చెప్పుకోవడానికి ఏం ఉంది? బాకీలు..బకాయిలు.. డైవర్షన్లు.. కమీషన్లు. బుల్డోజర్ల చప్పుళ్లు..బూతుల మోతలు. ఆల్టైమ్ రికార్డు అప్పులు.. క్యూలైన్లో చెప్పులు. 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు. నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్లు. చెక్డ్యామ్ల పేలి్చవేతలు..అడుగడుగున అణచివేత. క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం. స్కాముల కళకళ.. స్కీముల వెలవెల. రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు. ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు. ఫుడ్ పాయిజనింగ్ చావులు.. ఫుట్బాల్ సరదాలు. గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీలో విమానయాత్రలు. మాటలు ధడేల్.. చేతలు తుఫేల్. దరఖాస్తులు.. దండాలు.. దఫ్తర్లు..’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇంకో 4 రోజులైతే ట్రిలియన్ డాలర్లు వచ్చేవి..! ‘గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు, ఐటీ ఉద్యోగాలు 9.39 లక్షలకు చేరుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 2023–24లోనే 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలున్నాయి. మరి కాంగ్రెస్ వచ్చాక 7 వేల ఉద్యోగాలు తగ్గాయా? ఐటీ ఎగుమతులు రూ.3.60 లక్షల కోట్లకు చేరాయని మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. తప్పుదోవ పట్టించిన ఐటీ శాఖ కార్యదర్శిని తీసి చెత్తబుట్టలో పారేయండి. గోబెల్స్ (గ్లోబల్) సమ్మిట్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. కానీ టీజీఐఐసీ వెబ్సైట్ ప్రకారం 2022–23లో 3,010, 2023–24లో 4 వేలు కొత్త పరిశ్రమలు వస్తే కాంగ్రెస్ వచ్చాక 2024–25లో 2,050, 2025–26లో 1,026కి ఎందుకు తగ్గాయి? 2031 కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తామన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రూ.100 కోట్లు పెట్టి డేరా నగర్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలినప్పుడు.. సమ్మిట్ ఇంకో నాలుగు రోజులు నడిపిస్తే అక్కడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమయ్యేది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. రూ.కోటి కోట్లు సమకూరితే రాష్ట్రం 100 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది. పెట్టుబడులు వెల్లువెత్తినట్టు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తల కణతపై తుపాకులు పెడితే వారు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం తర్వాత. ముందు వారికి నెలకు రూ.2,500 ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు పెట్టాలి. రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఇవ్వలేదు..’ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎంఓయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మా సిటీ స్థలాలపై కోర్టుకు ఒకటి.. బయటకు ఇంకొకటి ‘ఫార్మాసిటీ కోసం మా ప్రభుత్వం 14వేల ఎకరాలను సేకరిస్తే అప్పుడు భట్టి రైతులకు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. ప్రభు త్వం చెప్పుతున్నట్టు అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జర్నలిస్టులకు ఇళ్లు, జూపార్క్, స్టేడియం కట్టడం కుదరదు. ఫార్మాసిటీకి ఆ స్థలాలను వాడతామని ప్రభు త్వం కోర్టుకు చెప్పింది. బయట ఇంకొకటి అంటున్నారు..’ అని తప్పుబట్టారు. ‘హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలప్పుడు మిస్ బ్రిటన్ దేశం వదిలి పారిపోయింది. ఆమెను వ్యభిచారిణిలాగా భావన కలిగేలా వ్యవహరించారని సన్ మ్యాగజైన్లో వచ్చింది. మిస్ బ్రిటన్కు వేధింపులు ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రాన్ని చేతుల్లో పెడితే జీరో చేశారు ‘రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్గా చేసి ధనిక రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాం. ఈ రోజు ఆదాయం అంచనాలు తప్పుతున్నాయి. బడ్జెట్ అంచనాలు బోల్తా కొడుతున్నాయి. కరోనా కాలం తరహాలో తిరోగమనం చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. డే ఎకానమీ ఢమాల్ అన్నది. ఇప్పుడు నైట్ ఎకానమీ తెస్తారట. మేము దిగేసరికి రూ.3.47 లక్షలతో తలసరి ఆదాయంలో నంబర్ వన్గా ఉండగా, ఈ రోజు అదీ తగ్గింది. జీఎస్టీ, వాహనాల రిజిస్ట్రేషన్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం పడిపోయింది. మందుగమనం ఒక్కటే జోరుగా ఉంది. 2023 డిసెంబర్ నుంచి ఈ రాష్ట్రంలో జీరో వేల్యూ మిషన్ ప్రారంభమైంది. అన్నీ ఫాల్.. మీరేమో జాకీలు పెట్టి రైజింగ్ అంటున్నారు. నీరో చక్రవర్తి గురించి విన్నాం. జీరో చక్రవర్తిని చూస్తున్నాం..’ అని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్రెడ్డిలను ప్రస్తావించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పేరును విస్మరిస్తున్నారని విమర్శించారు.మీదే ఫ్లాప్ సినిమా!‘శాసనసభకు 2023లో జరిగిన ఎన్నికల్లో ఫ్లాప్ అయింది మీరు. లోక్సభ ఎన్నికల్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. మల్ల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లాప్ అయ్యారు. అన్నిసార్లు ఫ్లాప్ అయ్యి మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఏంటి?’ అని బీఆర్ఎస్ నేత కేటీఆర్పై శాసనసభా వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు మండిపడ్డారు. తీరు మార్చుకుంటే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెరుగయ్యే అవకాశం ఉంటదని హితవు పలికారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం శాసనసభలో జరిగిన చర్చలో సర్కారుపై కేటీఆర్ చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు. ఎవరో రాసిన స్క్రిప్్టను చదువుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, అధిష్టానాన్ని కలిసేందుకు ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తామని అన్నారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎన్నిసార్లు అయినా ప్రధానిని, మంత్రులను కలుస్తాం. రాష్ట్ర ప్రజల అబివృద్ధి. సంక్షేమానికి నిధులు ఇచ్చేందుకు తప్పకుండా ఢిల్లీకి పోతాం. మీరు ప్రాంతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ఉండి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మీరు ఎన్నిసార్లు బీజేపీ ప్రధానమంత్రి వద్దకు పోలేదు?..’ అని శ్రీధర్బాబు నిలదీశారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ పరిశ్రమలు వస్తే వాటికి అనుబంధంగా నివాస, వినోద, క్రీడా, ఐటీ రంగ సదుపాయాలూ వృద్ధి చెందుతాయన్నారు. గ్రీన్ఫార్మా పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఎంవోయూలపై శ్వేతపత్రం ప్రకటిస్తాం.. ‘గ్లోబల్ సమ్మిట్లో రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంవోయూలు ఎందుకు చేసుకున్నారని కేటీఆర్ అంటున్నారు. ఎంవోయూలు చేసుకోకపోతే బాగుండుననేది వారి ఆలోచనగా కనపడుతోంది. కేటీఆర్ కూడా దావోస్కు వెళ్లారు. ఆయనకు అన్నీ తెలుసు. ఎంవోయూల్లో 30–40 శాతమే సఫలీకృతం అవుతాయని మన సీఎంకు మహారాష్ట్ర సీఎం తెలియజేశారు. త్వరలో వీటిపై శ్వేతపత్రం ప్రకటిస్తాం. మహిళలను లక్షాధికారులను చేస్తామని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అన్నారు. దానికి కొనసాగింపుగానే వారిని కోటీశ్వరులను చేయాలని సంకల్పించాం. ఈ విజన్ను కూడా హేళనగా, చులకనగా మాట్లాడడం సరికాదు. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ నిర్ణయం తీసుకోకుంటే ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇక్కడ ఉండేవారా? సోషల్ మీడియాలో గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్కు మించిన దిట్ట లేరు. ఐటీ ఉద్యోగాలు తగ్గిన విషయం పరిశీలిస్తాం. ఐటీ ఎగుమతుల విలువలో సంఖ్యాపరంగా తప్పులుంటే సరిచేసుకుంటాం..’ అని మంత్రి అన్నారు. దళితుడిని సీఎం చేశారా?: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‘హామీలు అమలు కావడం లేదని ఆరోపించడం సరికాదు. దళితుడిని సీఎం చేస్తామనని..భూమి లేని పేదలకు మూడెకరాల భూమి ఇస్తామని మీ లెక్క హామీలిచ్చి విస్మరించలేదు. మీరు చేసిన అప్పులకు అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం..’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఆరు గ్యారంటీలతో ఒక్కో కుటుంబానికి రూ.2.5 లక్షల లబ్ధి కలుగుతుందని హామీ ఇచ్చింది వాస్తవమేనని, ఒక్కో కుటుంబానికి ఎన్ని లక్షలు వారి ఖాతాల్లో జమ చేశామో లెక్కలతో సహా వివరిస్తానన్నారు. 53–54లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుంటే 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్టు గుర్తుచేశారు. రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా వేశామన్నారు. సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కి రూ.500 బోనస్ ఇస్తున్నామని, రూ.12 వేలు రైతు భరోసా, బోనస్ కలిపి ఒక్కో ఎకరానికి రూ.25 వేలు చొప్పున రైతులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. మహిళలంటే కోపం ఎందుకు ?: సీతక్క మహిళలంటే మీకు ఎందుకంత వ్యతిరేకత అని కేటీఆర్పై మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. తరతరాలుగా అణచివేతకు గురైన మహిళలు స్వశక్తితో ఎదుగుతుంటే సహకరించాలని హితవు పలికారు. వైఎస్ ప్రభుత్వం తెచ్చిన అభయహస్తం పథకం నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ‘పదేళ్లలో ఎన్ని ఇళ్లు ఇచ్చారు? ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? దళితులకు భూములు ఎందుకు పంచలేదు?’ అని నిలదీశారు. దళితుడిని సీఎం చేసిందుకా? బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క తెల్లరేషన్కార్డు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని హామీ ఇచ్చి చేసినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలా? సన్న బియ్యం ఇస్తున్నందుకు, యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టినందుకు తమ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. మా హక్కులను రక్షించాలి.. తలసాని కేటీఆర్ మాట్లాడుతుంటే మంత్రులు పదేపదే జోక్యం చేసుకోవడం సభా మర్యాదలకు భంగం కలిగించడమేనని బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తమ హక్కులను సభాపతి రక్షించాలని విజ్ఞప్తి చేశారు.అలా ఎలా సార్?‘అధ్యక్షా మీరు కూడా.. మాపార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేస్తే ఎలా సార్?, ఆయనను ఆడ కూర్చోబెడితే..’అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం శాసనసభలో ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ను ఇటీవల స్పీకర్ కొట్టివేయడాన్ని ప్రస్తావించారు. ‘మీరు నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాకు విభేదం లేదు.. నా ప్రార్థన..’అని కేటీఆర్ ఇంకా ఏదో చెప్పబోతుండగా స్పీకర్ అడ్డు తగిలారు. ‘కోర్టులో జడ్జి తీర్పు ఇస్తే నచ్చకపోతే పైకోర్టుకు పోతాం. మీరు కూడా జడ్జిమెంట్ చదవకుండానే ఎన్నో అభియోగాలు చేసిన్రు. అయినా నేను మీడియా ముందుకు రాలేదు. జడ్జిమెంట్ పూర్తిగా చదివితే మాట్లాడాలి. మీకు చెపుతున్నా..ఈ ప్రశ్నించేదానిని తగ్గించుకుంటే మంచిగుంటది..’అని అన్నారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అయినా ప్రశ్నించే అధికారం సభ్యుడిగా నాకుంటది. మీరు జ్యుడీషియరీ నేను కాదనడం లేదు. ప్రజాస్వామ్యంలో నిలదీయడం, అడగడం మా బాధ్యత..’అని అన్నారు. మంత్రి పొంగులేటి ఆగ్రహం కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ‘జడ్జి స్థానంలో ఉన్న మిమ్మల్ని, మీ జడ్జిమెంట్ను కూడా ప్రశ్నించే స్థాయిలో మాట్లాడుతున్నారంటే..వారు ఏ రకమైన అహంకారంతో మాట్లాడుతున్నారో గమనించాలి. అసెంబ్లీ, పార్లమెంటుతో పాటు గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నాలుగుసార్లు ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా మీరు గమనించాలి. పార్టీలు మారడాన్ని పోత్సహించిందే మీరు..’అని బీఆర్ఎస్పై ధ్వజమెత్తారు. మంత్రి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘హైకోర్టు తీర్పు ఇస్తే సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే రివిజన్కు వెళ్లే హక్కు ఉంటుంది. హరియాణలో ఆయారాం గయారాం విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ..’అని చెప్పారు. స్పీకర్ స్థానంలో ఉన్న వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నా, మీరు అడ్డుకోవడం లేదు. మీరు మారాలి. బడివె అని సీఎం అంటే కూడా స్పందించలేదు. గ్రహణం కొన్ని గంటలే ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు..’అని వ్యాఖ్యానించారు. -
జగిత్యాల జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న సంజయ్.. నన్ను తనతో కలిసి పనిచేయాలని ఎలా అడుగుతారంటూ ప్రశ్నలు సంధించారు. నాడు ప్రతిపక్షంలో ఉండి ఒంటిచేత్తో అధికారపార్టీతో పోరాటం చేసిన నేను మంత్రి కావాలనుకోవడం తప్పా?. పార్టీ ఫిరాయింపునకు నాకు అవకాశం లేకుండేనా? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘నాలుగు దశాబ్దాల బంధాన్ని విడిచి పెట్టుకోవడం ఎవరికైనా ఇబ్బందే. ఆ స్థితిలో నేను ఇవాళ బాధ పడుతున్నాను. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ.. నన్నే తనతో కలిసి పని చేయాలని ఆఫర్ ఇస్తున్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో తప్పు లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, హక్కులను కాల రాయడం, అభ్యర్థుల ఎంపిక చేయడం ఇవన్నీ సమంజసమా?. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నేను పార్టీలో ఎదురవుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశాను. ఇందుకు ఎమ్మెల్యే సంజయ్ కారణం కాదా. 1995లో చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఎక్కడా పోటీకి కూడా వెనుకంజ వేసిన కాలంలో జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం అన్నీ గెల్చుకున్నాం. వీడిపోవడానికి కారకుడైన వ్యక్తి ఇవాళ కలిసి పని చేస్తానంటున్నాడు. నేను ఎక్కడ ఉన్నా అంకితభావంతో పనిచేస్తా. ఈ ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడితో ఓ ఆడబిడ్డ మున్సిపాలిటీలో ఇబ్బంది పడింది నిజం కాదా?. నాకు ఆఫర్ ఇవ్వడానికి సంజయ్ ఎవరు?. నేను పార్టీ వీడుతానని ఆయనకు చెప్పానా?. పార్టీ వీడాలని కోరుకోవడం లేదని ఎలా అంటారు?. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు?. నన్ను ఎలా కలిసి రమ్మంటారు?. సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ అంటున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని సంజయ్ అంటున్నారు. అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పట్టించుకోడు. చట్టసభల్లో ఎంపికైన వాళ్ళు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోవాలి. నేను ఇంతవరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాను. ఉండాలని ఇంకా కోరుకుంటున్నా. ఇంట్లో ఉడుం లాగా వచ్చి చేరితే ఆయనతో కలిసి ఎలా పనిచేస్తాం. నిన్నటి వరకు రాష్ట్రానికి జగిత్యాల ఆదర్శంగా ఉంటే ఇవాళ వివాదాలకు కేరాఫ్ చేశాడు. రాముడు నాకు ఆదర్శం. అందుకే శ్రీరామనవమి సందర్భంగా ఫ్లెక్సీలు పెట్టుకున్నా. నేను పార్టీ మారితే దానికి కారణం ఎమ్మెల్యే సంజయ్, ఆయన వెనుకున్న వారే కారణం అవుతారు. ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ అధిష్టానానిదే బాధ్యత. నాకు పార్టీ మారాలనే యోచనకు కారణం ఈ ఆవేదనే’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
జీవన్రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు
జగిత్యాల : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆయన నివాసం వద్ద ఉన్న పార్టీ ప్రోటోకాల్ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాలలోని జీవన్రెడ్డి రెడ్డి నివాసం వద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలతో పాటు ఇంటి లోపల ఉన్న ఫ్లెక్సీలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఫ్లెక్సీలపై ఉన్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అడ్లూరి ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు. ఈనెల 24 లేదా 25వ తేదీన జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటివద్ద ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీల తొలగింపు చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జీవన్రెడ్డి తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉతంఠ నెలకొంది.బీఆర్ఎస్లో చేరతారా..?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తర్వాత ప్రముఖంగా ఉన్న పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు. మరి జీవన్రెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం వార్త హల్చల్ చేసింది. బీఆర్ఎస్ గూటికి జీవన్రెడ్డి చేరబోతున్నారనేది ఆ వార్త సారాంశం. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేయడానికి జీవన్రెడ్డి సన్నద్ధమవుతున్నారని, ఆ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల తర్వాత తనకు కాంగ్రెస్లో తగిన గౌరవం లభించలేదని భావిస్తున్న జీవన్రెడ్డి.. దానికి పార్టీని వీడటం ఒక్కటే సరైన మార్గమని అనుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. -
‘సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?’
హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు. అసెంబ్లీ మీడియా హాల్లో హరీష్ మాట్లాడుతూ.. ‘ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్ల హక్కులను కాపాడటం కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణా నదీ జలాల పున:పంపిణీని కేసీఆర్ సాధించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయి. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు.కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత రెండు రోజుల క్రితం లెటర్ రాశామని లెటర్ రిలీజ్ చేస్తున్నారు. గోదావరి జలాలపై ఏపీ కన్ను పడింది. జనవరి 30 న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల మీటింగ్ జరిగింది. తెలంగాణ నుంచి వెళ్లిన అధికారులు డూడూ బసవన్నల్లా తల ఊపారు. గోదావరిలో ఏ రాష్ట్రానికి కేటాయింపులు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. ఫిబ్రవరి 12 వ తేదీన తెలంగాణకు మినిట్స్ వచ్చాయి. రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి దాసోహం అయ్యారా...?, రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని ఏపీకి తాకట్టు పెట్టారా...?’ అని ప్రశ్నించారు. -
అసెంబ్లీలో చిరునవ్వులు.. రాజాసింగ్ను ఆటపట్టించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రాజాసింగ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆటపట్టించారు. వారిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. అనంతరం, మీడియ ఏదో అనుకుంటుంది అంటూ.. ఇరువురు నేతలు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి నేడు గవర్నర్ ప్రసంగం కొనసాగింది. అనంతరం, అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బీజేఎల్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తుండగా.. రాజాసింగ్ను గమనించారు. దీంతో, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి బీజేఎల్పీలోకి ఎలా వెళ్లారు అంటూ నువ్వుతూ సెటైర్ వేశారు.బీజేఎల్పీ నుంచి బయటికి రా అంటూ రాజాసింగ్ను సరదాగా కేటీఆర్ ఆటపట్టించారు. ఇంతలో అక్కడే ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కల్పించుకుని.. సరదాగా మీరు కూడా బీజేఎల్పీ చాంబర్లోకి రండి అంటూ కేటీఆర్ను ఆహ్వానించారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. తాను బీజేఎల్పీ చాంబర్లోకి వస్తే మీడియా వాళ్ళు ఇంకేదో రాస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీంతో, ఇరు పార్టీల నేతల మధ్య సరదా సంభాషణ కొనసాగింది.అనంతరం, బీజేఎల్పీలోకి వెళ్ళడంపై ఎమ్మెల్యే రాజసింగ్ స్పందిస్తూ..‘పాత ఇల్లు.. పాత ఫ్రెండ్స్ ఎప్పుడైనా పోతాను.. ఎప్పుడైనా వస్తాను. పార్టీలో మళ్లీ చేరడంపై ఇంకా డిసైడ్ కాలేదు. ఎవరు ఎవరిని బతిమాలుతున్నారో భవిష్యత్తులో తెలుస్తుంది’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. బడ్జెట్ సమావేశాల సందర్బంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పార్టీ పక్షంవైపు కూర్చోవడం గమనార్హం. ఈ కమ్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కాలే యాదయ్యను బీఆర్ఎస్ వైపు కూర్చోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. కానీ, కాలే యాదయ్య మాత్రం తాను కాంగ్రెస్ వైపే కూర్చుంటానని చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవలే పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపుల విషయంలో క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా
రాయికల్ (జగిత్యాల): కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దశాబ్దాలకాలం కాంగ్రెస్కు సేవలందించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని, ఈ క్రమంలో మొదటగా పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి అందజేస్తారా? అని ప్రశ్నించగా.. ఇక్కడే చేస్తానని తెలిపారు. రంజాన్, ఉగాది పండుగల అనంతరం మరోసారి అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. -
‘కాంగ్రెస్ పాలనపై తిరగబడే కాలం వచ్చింది’
హైదరాబాద్: ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన బీసీ డిక్లరేషన్కు అతిగతి లేకుండా పోయిందన్నారు. ఏటా 20 వేల కోట్ల చొప్పున 5 ఏళ్లలో లక్ష కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని మాట తప్పారన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వల్ల బీసీ వర్గాల ప్రజల అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిందన్నారుస్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. బీసీ సంక్షేమం మాటల్లోనే తప్ప పనుల్లో కనిపించడం లేదనీ, రాబోయే బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని సూచించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, వారంతా ఇప్పుడు తిరగబడే కాలం వచ్చిందన్నారు.అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడాతా అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్ చెరు మండల ఇంచార్జ్ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో క్యాసారం కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్ రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా హరీశ్ రావు గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నక్క మల్లేష్ గౌడ్, కాసా ధనుంజయ్ గౌడ్, నక్క పవన్ గౌడ్, నక్క చరణ్ గౌడ్, నక్క వికాస్ గౌడ్, కాసా వినయ్ గౌడ్, పట్లోళ్ల తిరుపతి రెడ్డి, నక్క వీర స్వామి గౌడ్, నక్క సాయి గౌడ్, బచ్చుగూడెం ఎల్లయ్య యాదవ్, కాసా రాజు గౌడ్, అత్తెల్లి శ్రీకాంత్ రెడ్డి, పెద్దోళ్ల రాజు, ఇతర కార్యకర్తలు ఉన్నారు. -
‘మూసీ’.. కాంగ్రెస్ భూ ఆక్రమణ పథకం : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లూ కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో 6 కి.మీ. మేర విజయవంతంగా అభివృద్ధి చేశామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తూ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. శనివారం హిమాయత్ సాగర్ వేదికగా ‘మూసీ పునరుజ్జీవం– పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్‘కార్యక్రమాన్ని కేటీఆర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి ప్లానింగ్ రిపోర్టు లేకుండా సోషల్ ఇంపాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు లేకుండా, ప్రజలతో చర్చలు నిర్వహించకుండా వేలాదిమంది ఇళ్లను కూలగొడతామని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు. ‘అభివృద్ధికి మేము ఏమాత్రం వ్యతిరేకం కాదు. అవినీతికి, కాంగ్రెస్ భూదాహానికి, రేవంత్ రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు మాత్రం వ్యతిరేకం. రేవంత్ రెడ్డి అవినీతిని అడ్డుకుంటాం. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ నగర ప్రజలను కాపాడుకుంటాం. బాధితుల వెంట బీఆర్ఎస్ ఉంటుంది’అని కేటీఆర్ చెప్పారు. రెండేళ్లపాటు మూసీ బాధితులు సమష్టిగా ప్రభుత్వంపై పోరాడితే, తమ ప్రభుత్వం వచ్చాక కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యాన్ని పారదోలి అందరి ఇళ్లు, భూములను కాపాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవన్నారు.. ఇచ్చిన హామీలకు, అభివృద్ధికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, విపరీతంగా అప్పులు ఉన్నాయని చెబుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ కోసం వేల కోట్లు ఖర్చు పెడతానంటున్నాడని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘రూ.లక్షన్నర కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామంటున్నారు... అందాల పోటీలకు, ఫుట్బాల్ ఆటలకు వందల కోట్లు ఖర్చు పెడుతూ, మింగ మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె లెక్క రేవంత్ తీరు తయారైంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చాడు’అని విమర్శించారు. రూ.లక్షన్నర కోట్లు ఎందుకు? నిజాం కట్టించిన అద్భుతమైన జంట జలాశయాలను ఖరాబ్ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని, దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పాలన ఫలితంగానే మూసీ సర్వనాశనమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీని మురికి కుప్పగా మార్చిన పాపానికి రేవంత్రెడ్డి ముక్కు నేలకి రాసి, ప్రజలకు క్షమాపణ చెప్పి పాపాన్ని కడుక్కోవాలని హితవు పలికారు. వందల కిలోమీటర్ల నమామి గంగే పథకానికి కేవలం రూ.42 వేల కోట్లు వ్యయమైతే, 55 కి.మీ. మూసీకి రూ.లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చవుతుందో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని ప్రేమించే పార్టీగా, వ్యక్తులుగా మూసీ అభివృద్ధిని ఏమాత్రం అడ్డుకోబోమన్నారు. మూసీ పేరుతో రూ.వేల కోట్ల సొమ్మును దోచుకుంటామంటే మాత్రం కచ్చితంగా అడ్డుకుంటామని చెప్పారు. గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఆయన పేరుతో మూసీలో దోపిడీ చేయొద్దని విజ్ఞప్తి చేసినా రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎవరూ అడ్డుకోవద్దని మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టే కుట్ర చేస్తున్నాడని చెప్పారు. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6 కి.మీ. మూసీని విజయవంతంగా అభివృద్ధి చేసిందని, అయినా కాంగ్రెస్ మాదిరి ప్రచారం చేసుకోలేకపోయామన్నారు.మా అంచనా వ్యయం 16 వేల కోట్లు గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీలోకి మంచినీళ్లను వదలాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని కేటీఆర్ తెలిపారు. దాని కోసం కేవలం రూ.1100 కోట్లతో కొండపోచమ్మ నుంచి నీళ్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇదే కార్యక్రమానికి రూ. 10 వేల కోట్లకు అంచనాలు పెంచిన రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ ద్వారా అవినీతి కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మూసీని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి తమకు వచ్చిన అంచనా వ్యయం రూ. 16 వేల కోట్లు మాత్రమే కాగా, రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయతి్నస్తున్నారన్నారు. బఫర్ జోన్తో భయపెట్టి.. ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇళ్లను కూలుస్తోందని కేటీఆర్ విమర్శించారు. ‘డబ్బులు ఉన్న వాళ్లకే బఫర్ జోన్లు ఉంటాయా? రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డికుంట బఫర్ జోన్లో ఉంది కదా., దాని గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల సోదరుడి ఇల్లు హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉంది. మంత్రుల ఫామ్హౌస్లు, ఇళ్లు బఫర్ జోన్లో ఉన్నా.. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’అని పేర్కొన్నారు. 20 ఏళ్ల కింద కట్టుకున్న అపార్ట్మెంట్లు, ఇళ్లను కూలగొడతా అంటున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు మూసీ బఫర్ జో¯న్లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్మెంట్లను మాత్రం ముట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.3,300 ఎకరాలపై కన్నేసి.. రేవంత్ 3,300 ఎకరాల భూమిపై కన్నేసి మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ మొత్తం భూముల విలువ రూ.1,50,000 కోట్లని, ఇందుకోసమే రియల్ ఎస్టేట్ వ్యాపార ఆధారిత మూసీని రూపొందిస్తున్నారన్నారు. డిజైన్ చేసే కంపెనీకే రూ.160 కోట్లు ఇచ్చారంటే, ఎంత అవినీతి జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రేవంత్రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంత ఉందో కూడా అవగాహన లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, స్వామి గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. -
బీఆర్ఎస్లోకి జీవన్రెడ్డి..?
జగిత్యాల: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి.. కారు ఎక్కేందుకు జీవన్రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపే కాంగ్రెస్ రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉగాది పండుగ లోపే కొత్త నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కార్యకర్తలతో జీవన్రెడ్డి మాట్లాడారని, ఈ క్రమంలోనే ఆయన అనుచరుల సోషల్ మీడియా డీపీలు కూడా మారిపోవడంతో రాజీనామా వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అదే సమయంలో జీవన్రెడ్డి సోషల్ మీడియా గ్రూపుల డీపీలు, ప్రొఫైల్స్ కూడా మారిపోతున్నాయి. తాను కాంగ్రెస్లో సీనియర్గా ఉండి కూడా ఆ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడాన్ని జీవన్రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చి.. ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడంతో జీవన్రెడ్డి వేరే స్టెప్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రధానంగా జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానం దక్కినందుకు సంతోష పడలా లేక బాధ పడాలా అర్థం కావడం లేదన్నారు. సమిండ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఎమ్మెల్యే సంజయ్ ని కలిసిన కొద్ది రోజుల్లోనే ఛైర్పర్సన్ పదవిలో కూర్చోవడమేంటని విచారం వ్యక్తం చేశారు కూడా. ఇదే జీవన్రెడ్డిలో అసంతృప్తి జ్వాలలు పుట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కార్యకర్తలతో సుదీర్ఘ మంతనాల తర్వాతే జీవన్రెడ్డి పార్టీ మారే యోచనకు వచ్చారనే చర్చ నడుస్తోంది. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి ఇప్పటికే జీవన్రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
రేవంత్ రెడ్డి కాదు.. గోబెల్స్ రెడ్డి : హరీష్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్రెడ్డికాదు.. గోబెల్స్ రెడ్డి’ అని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.మూసి సుందరీకరణకు మేం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డీపీఆర్ లేకుండానే 10 వేల 17 ఇళ్లు కూలగొట్టేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. హైడ్రా పేరుతో ఇప్పటికే లక్షకు పైగా ఇళ్లు కూల్చారు. లక్ష జీవితాలను మూసీలో ముంచేస్తారా? మూసీని శుద్ధి చేస్తావా?. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా?.రియల్ ఎస్టేట్ దందా కోసమే మూసీ మీద పడ్డారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ కోసం 3,279 ఎకరాల భూ సేకరణ అవసరమా..!.మూసీ బ్యూటీఫికేషన్ పేరుతో లూటీఫికేషన్ చేస్తున్నారు’అని ఆరోపించారు. -
ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్రజాస్వామికం, దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆడిస్తున్న ఆటలో భాగంగానే స్పీకర్ ప్రసాద్కుమార్ పిటిషన్లు డిస్మిస్ చేశారన్నారు. అసెంబ్లీ స్పీకర్పై రాహుల్గాంధీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తు న్న డబ్బు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ నడిపించిందని, స్పీకర్ చేతుల్లో నిర్ణయాధికారం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల్లో ప్రథమ ముద్దాయి రాహుల్గాంధీ అని, ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిలో ప్రధాన నేరస్తుడు రాహుల్గాంధీ అని కేటీఆర్ విమర్శించారు. ఆయన అనుమతి లేకుండా అనర్హత పిటిషన్లు డిస్మిస్ చేసేంత సాహసం స్పీకర్ చేయలేరన్నారు. మాజీ మంత్రులు జోగు రామన్న, పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ తాతా మధు, పార్టీ నేతలు కర్నె ప్రభాకర్, డాక్టర్ ఆనంద్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి కేటీఆర్ బుధవారం తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై రాహుల్గాంధీ సమాధానం చెప్పాలి. ఈ నిర్ణయంతో రాహుల్ గాంధీ జోకర్గా నిలిచిపోయారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వెనువెంటనే సభ్యత్వం కోల్పోయేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్గాంధీకి ఏమాత్రం సిగ్గూ, గౌరవం ఉన్నా స్పీకర్ నిర్ణయంపై స్పందించాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెలుగుమట్ల కూల్చివేతలపై వదిలిపెట్టం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో పేదల ఇళ్ల కూల్చివేత అంశాన్ని అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రశ్నించి తీరుతామని కేటీఆర్ అన్నారు. ‘ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బినామీలు భూ మాఫియాగా ఏర్పడి పేదల మీద దాడి చేసి బయటకు పంపుతున్నారు. వెలుగుమట్లతోపాటు రాష్ట్రంలో కూలగొడుతున్న ప్రతీ ఇంటికి తిరిగి పట్టా ఇచ్చేంత వరకు వదిలిపెట్టం. ఇళ్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ మృగాల్లా మాట్లాడుతున్నారు. మంత్రుల ఆదేశాలతో ఖమ్మం ఏసీపీ బాధితులపైనే కేసులు పెడుతున్నారు’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్, రాహుల్నుసన్మానించాలి‘ఒక పార్టీ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండానే మరో పార్టీ బీ ఫామ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు. ఇంత అద్భుత నిర్ణయం తీసుకున్న స్పీకర్ను, ఆయన వెనుక ఉన్న రాహుల్గాందీని బహిరంగ సభ వేదికపై సత్కరించాలి’అని కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నా, విచారణ చేయాల్సిన అవసరం ఏముంది. ఫిరాయింపుల సంస్కృతి గురించి ఇకపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్గాం«దీ, కాంగ్రెస్ పార్టీకి లేదు. పార్టీ ఫిరాయింపుల అంశంపైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఇచ్చిన గౌరవం, వచి్చన పదవులపై ఆయనే ప్రశ్నించుకోవాలి. మురికి మాటలు మాట్లాడుతున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్లో కొనసాగుతున్నట్టు చేస్తున్న ప్రకటనలు ఆయన నైతిక పతనానికి అద్దం పడుతున్నాయి’అని కేటీఆర్ విమర్శించారు. -
పార్టీ మారలేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరారని పేర్కొంటూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొట్టేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ పూర్తి చేసిన స్పీకర్ బుధవారం ఉదయం 10 గంటలకు తన తుది తీర్పును ప్రకటించారు. వాస్తవానికి తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే 8 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను గతంలోనే డిస్మిస్ చేసిన స్పీకర్ తాజాగా.. దానం, కడియంకు సంబంధించి తీర్పు వెలువరించారు. వారు పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కాగా స్పీకర్ నిర్ణయంతో దానం, కడియంపై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని భావించిన బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్ ట్రిబ్యునల్ నుంచి తీర్పు కాపీ అందిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి.. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకే పరిమితమైంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆరోపణలు వచ్చాయి.టి.ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కాలే యాదయ్య (చేవెళ్ల), డాక్టర్ ఎం.సంజయ్కుమార్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్రెడ్డి (గద్వాల), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి), గూడెం మహీపాల్ రెడ్డి (పటాన్చెరు) వీరిలో ఉన్నారు. అయితే దానం నాగేందర్ 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వగా ఆమె చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి ఎంపీగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కడియం కావ్య తరఫున కడియం శ్రీహరి ప్రచారం చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం)లోని పేరా 2(1) ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 2024 జూలైలో శాసనసభ స్పీకర్ వద్ద వేర్వేరుగా అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. కోర్టుల్లో బీఆర్ఎస్ సుదీర్ఘ న్యాయపోరాటం తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్ 2024 డిసెంబర్లో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ స్పీకర్ను ఆదేశించింది. అయితే స్పీకర్కు కాల పరిమితి విధించడం తగదంటూ ఆ ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాలు చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు.. 3 నెలల్లో అన్ని పిటిషన్లు పరిష్కరించాలని ఆదేశించింది దీంతో 2025 ఆగస్టులో 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ దశల వారీగా విచారణ జరిపారు. అయితే నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలనే ఆదేశాలను స్పీకర్ పాటించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. 2025 నవంబర్ 17న ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పదింటిలో ఏడు పిటిషన్లు డిస్మిస్ చేసినట్లు 2026 జనవరి 16న సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్.. తాజాగా కడియం, దానంలకు అనర్హత వర్తించదని పేర్కొంటూ పిటిషన్లు డిస్మిస్ చేశారు. -
లావు శ్రీకృష్ణ దేవరాయలకు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడి 13 ఏళ్లు అయిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్ర బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. ‘మా తమ్ముడు కృష్ణ దేవరాయలు మంచిగా మాట్లాడాలని కోరుతున్నా. తెలంగాణపై ఏడుపు బంద్ చేయాలి’ అని అన్నారు. కాగా, లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 2014 ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా అనడంతో తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు?తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కేటీఆర్ మాట్లాడుతూ.. ‘దేశ చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ ఫిరాయింపులను స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. 2004లో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎత్తుకుపోయింది. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్. ఆయన బిడ్డకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారు? కడియం శ్రీహరి బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా? స్పీకర్ కార్యాలయం ఆర్డర్ కాపీ ఇవ్వడానికి భయపడుతోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ అద్భుతంగా పని చేసి ఉంటే ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయం? రాహుల్ గాంధీ ఎలా చెప్తే అలా స్పీకర్ నడుస్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచివారే, ఆయనపై మాకు గౌరవం ఉంది. రాహుల్ గాంధీకి పార్టీ ఫిరాయింపులపై స్పందించాలి. కడియం శ్రీహరి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుతున్నారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్పీకర్ తీర్పుపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణ స్పీకర గడ్డం ప్రసాద్ తీర్పుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి. కాంగ్రెస్ పార్టీ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అవుతుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు.ఇది కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచి.. పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సమాధానం చెబుతారు అంటూ పోస్టు చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్…— KTR (@KTRBRS) March 11, 2026ఇది కూడా చదవండి: తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు.. -
దానం, కడియంకు ఊరట.. స్పీకర్ సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ ప్రకటించారు. అనంతరం, ఇద్దరిపై వేసిన రెండు పిటిషన్లకు డిస్మిస్ చేశారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది. కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపటి వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో నేడు స్పీకర్ తీర్పును వెల్లడించారు. మరోవైపు.. తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్కు చెప్పుడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో స్పీకర్ తీర్పుపై పిటిషనర్లు మరోసారి కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక, స్పీకర్ తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందిస్తూ..‘స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నాను. పార్టీ ఫిరాయిస్తే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. కానీ, నాకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..‘స్పీకర్ పరిధిలో నేను ఏ తప్పూ చేయలేదు. కేసీఆర్ అంటే అపారమైన గౌరవం ఉంది. నన్ను కేసీఆర్ ప్రశ్నించాలి. కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం?. అసెంబ్లీలో బీఆర్ఎస్ నాకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. కేసీఆర్ నన్ను వివరణ అడగలేదు. నేను బీఆర్ఎస్ మెంబర్షిప్ వదులుకోలేదు.. ఎక్కడా తీసుకోలేదు అని వ్యాఖ్యలు చేశారు. -
ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు మొదటి కేబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొ స్తున్నా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబరు బిల్లుకు అధికార పార్టీ మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగర శివారులోని గోల్కొండ రిసార్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మూడో వార్షిక బడ్జెట్కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ పదవీకాలం సగం పూర్తయినా హామీల అమలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హామీల వైఫల్యం, మోసాన్ని ఎండగట్టేందుకు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం. రెండేళ్లుగా అసెంబ్లీ కమిటీలు లేకుండానే ప్రభుత్వం సమావేశాలను బలవంతంగా నడిపిస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని మా పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వ్యక్తికి ఇచ్చారు. సెలెక్ట్, స్టాండింగ్, పిటిషన్స్ తదితర 14 అసెంబ్లీ కమిటీలు పెండింగ్లో ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్విప్ లాంటి పదవులు భర్తీ చేయకుండా మందబలంలో బుల్డోజర్ టాక్టిక్స్ను ప్రభుత్వం ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఉభయ సభల్లో అబద్ధాలు, అసత్యాలతో అంకెలను తారుమారు చేస్తూ తూతూమంత్రంగా సమావే శాలు నిర్వహిస్తోంది’అని కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసేందుకే.. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయడానికే అవగాహన సమావేశాలు బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. రైతుబంధు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత, మూసీ బాధితులు తదితర అంశాలతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ అబద్ధాలను అంకెలతో సహా ఎండగడతాం. భవిష్యత్లోనూ బీఆర్ఎస్ శాసన మండలి, శాసనసభ సభ్యుల నడుమ మా పార్టీ సమన్వయం కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆరు గ్యారంటీలు, హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరిట భారీ అవినీతికి తెరలేపింది. మేము సుందరీకరణకు కాకుండా దాని పేరిట జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీకి నిధులు పంపేందుకే రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును చేపడుతున్నాడు. రేవంత్రెడ్డి చెబుతున్న మాటలకు ఎంత మాత్రం విలువ లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టపగలు నాశనం చేసిన సీఎం ‘నైట్ ఎకానమీ’గురించి మాట్లాడుతున్నాడు. రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఒక్క ఇళ్లు కట్టినా నేను రాజీనామా చేస్తాను అని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లు, ఫైఓవర్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి రేవంత్ తమ ఘనతగా చెప్పుకుంటున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. ముగిసిన అవగాహన కార్యక్రమం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి తదితరులు ప్రసంగించారు. పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి వివిధ అంశాలపై ప్రసంగించారు. -
కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చారు..: కేటీఆర్
సిరిసిల్ల: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చాడంటూ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు పథఖం బంద్ చేసి.. కొత్తగా రాహుల్ బంధు పథకం తెచ్చిండు అంటూ సెటైర్లు వేశారు. సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయిలు రాహుల్ గాంధీకి పంపించడమే రాహుల్ బంధు పథకం అంటూ విమర్శించారు. ఈరోజు(సోమవారం, మార్చి 9వ తేదీ) మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను సిరిసిల్లలో కేటీఆర్ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో నాట్లు వేసే టైమ్లోన రైతుబంధు పడుతూ ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకూ ఎవరికైనా రైతుబంధు పడిందా? అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి ప్రశ్నించారు. సంవత్సరానికి వేయి కోట్లు కట్టి పదవి కాపాడుకుంటుండు. ఖమ్మం వెలుగుమట్లలో వెయ్యి ఇళ్లు కూల్చిండు.మహబూబ్నగర్లో దివ్యాంగుల ఇళ్ళు కూల్చారు. సీఎం సొంత ఇల్లు కొడంగల్ కోస్గిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువులో ఉంది. 6 గారంటీలు నూరు రోజుల్లో అమలు చేస్తా అన్నాడు.. వెయ్యి రోజులు కావస్తున్నా అమలు చేయలేదు. అనాడు మూడో పంటకు రైతుబంధు వేయాలన్నారు.. ఇవాళ మూడో నెల వచ్చినా రైతుబంధు వేయడంలేదు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తా అన్నారు. పంట పంటకు బోనస్ ఇస్తా అన్నారు. అత్తలకు 4 వేలు కోడలు 2,500 ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఇచ్చిండా..?’అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. -
‘ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్దా..?, ఓవైసీదా?’
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన నడవడంలో లేదని, రజాకార్ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీ అనుమతిని సీఎం రేవంత్రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలన ఓవైసీ చేతుల్లో ఉందా ? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం కాదు…ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తోందా ?’ అని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది?, కాంగ్రెస్దా.. లేక ఓవైసీదా? అని ట్వీట్ చేశారు.❌Praja Palana✅ Razakar PalanaFor every decision, Revanth Reddy needs the permission of Owaisi.Such is the state of affairs in Congress-ruled Telangana. pic.twitter.com/pYMQHwFFxT— N Ramchander Rao (@N_RamchanderRao) March 9, 2026 ఓవైసీ పిలుపుతో వేల కోట్లు సమీకరిస్తామని అంటున్నారుతెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డాఉ. ‘ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రోజుకొక లాగా మారుతున్నాయి. ఒకవైపు పేదలు, దళితులు, గిరిజనులకు భూమి లేదని చెబుతున్నారు. కానీ జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు భూమి ఇస్తామని హామీ ఇస్తున్నారు. పెన్షన్లు క్లియర్ చేయడానికి ప్రభుత్వానికి డబ్బులు లేవని అంటున్నారు. కానీ ఓవైసీ ఒక పిలుపు ఇస్తే మూసీ ప్రాజెక్ట్కు వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెబుతున్నారు. కాలేజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. కానీ అమ్మాయిలకు ఉచిత EV స్కూటీలు ఇస్తామని కొత్త హామీలు ఇస్తున్నారు’ అని విమర్శించారు. -
రేవంత్.. రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం లేదా?: హరీష్ రావు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుభరోసా ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కొండన్నపల్లి వద్ద ఎండిపోయిన పంటలను శనివారం పరిశీలించారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు పంటలకు రైతుభరోసా ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. మూడు పంటలకూ డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు పోతారు?. పోలీసులు లేకుండా జనం దగ్గరకు ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్లగలరా?. కాళేశ్వరం కూలిందని చిల్లర మాటలు మాట్లాడుతారా?.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంటలు పండుతున్నాయి. హైదరాబాద్కు తాగు నీరు కాళేశ్వరం నీల్లే వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి.. ముందు చిల్లర వ్యాఖ్యలు బంద్ చేయండి. కాళేశ్వరం కూలిపోయింది అంటూ ఎన్నికల్లో అడ్డగోలు ఆరోపణలు చేస్తారా?. ప్రాజెక్ట్ను ఎండబెట్టాలని చూస్తున్నారా?. ఇప్పటికైనా మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్ చేయించండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేళ్లలో కనీసం పది వేల ఎకరాలకు నీరు ఇచ్చిందా అని ప్రశ్నించారు.


