యువీతో గిల్‌ గురించి మాట్లాడాను.. కపిల్‌ దేవ్‌ మాదిరే అతడు కూడా.. | Yograj Singh Big Prediction For India Captain Gill Just Like Kapil Dev | Sakshi
Sakshi News home page

యువీతో గిల్‌ గురించి మాట్లాడాను.. కపిల్‌ దేవ్‌ మాదిరే అతడు కూడా..

Jun 20 2025 7:32 PM | Updated on Jun 20 2025 8:24 PM

Yograj Singh Big Prediction For India Captain Gill Just Like Kapil Dev

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ ప్రయాణం మొదలైంది. ఇంగ్లండ్‌ (Ind vs Eng)తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం నాటి తొలి టెస్టుతో గిల్‌ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) తండ్రి, కోచ్‌ యోగ్‌రాజ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్‌ గడ్డ మీద గెలిచి.. ట్రోఫీతో తిరిగి వస్తుందని యోగ్‌రాజ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, బ్యాటర్‌గానూ కెప్టెన్‌ గిల్‌ ముందుండి జట్టును నడిపిస్తేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.

యువీతో మాట్లాడినపుడు ఇదే అన్నాడు
‘‘కొన్ని రోజుల క్రితం.. అభిషేక్‌ శర్మ (Abhishek Sharma), శుబ్‌మన్‌ గిల్‌ల గురించి నేను యువరాజ్‌ సింగ్‌తో మాట్లాడాను. ఆ సమయంలో.. ‘గిల్‌ నాయకుడిగా జట్టును ముందుండి నడిపిస్తాడు’ అని యువరాజ్‌ అన్నాడు. అవును.. శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌కు వెళ్లినపుడు వీలైనంత ఎక్కువసేపు క్రీజులో ఉండాలి.

కపిల్‌ దేవ్‌ మాదిరి
కెప్టెన్‌ మెరుగైన ప్రదర్శన చేస్తే జట్టులోనూ జోష్‌ నిండుతుంది. శుబ్‌మన్‌ సహచరులకు 100, 200 లేదంటే 300 స్కోరును టార్గెట్‌గా పెట్టాలి. తనే బాధ్యత తీసుకోవాలి. 1983 వన్డే వరల్డ్‌కప్‌లో కపిల్‌ దేవ్‌ మాదిరి ఆటగాడిగానూ జట్టును ముందుండి నడిపించాలి’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌ ANIతో పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు.

జైసూ అర్ధ శతకం పూర్తి
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌లో భాగంగా టీమిండియా తొలుత ఇంగ్లండ్‌తో తలపడుతోంది. స్టోక్స్‌ బృందంతో ఐదు టెస్టులు ఆడేందుకు అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు శుక్రవారం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన స్టోక్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. టీమిండియా బ్యాటింగ్‌ చేస్తోంది.

ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (42)- యశస్వి జైస్వాల్‌ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, భారీ అంచనాలతో బరిలోకి దిగిన అరంగేట్ర ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ మాత్రం నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు డకౌట్‌ అయ్యాడు.

ఇక మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌- కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించే బాధ్యత తీసుకున్నారు. 42 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి జైసూ 78 పరుగులతో ఉండగా.. గిల్‌ 42 పరుగులు సాధించాడు. టీమిండియా స్కోరు: 172-2 (42). 

చదవండి: వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement