ఆస్ట్రేలియాకు వారి సొంతగడ్డపై బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ను 9 వికెట్ల తేడాతో బంగ్లా జట్టు చిత్తు చేసింది. ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు దారుణమైన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ విఫలమై ఘోర ఓటమిని మూట కట్టుకుంది.
ఈ ఓటమిపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మార్క్ వా తీవ్రంగా స్పందించారు. డార్విన్ టెస్ట్కు కామెంటేటర్లుగా వ్యవహరించిన ఈ సీనియర్ ద్వయం కమ్మిన్స్ సేనపై విమర్శలు వర్షం గుప్పించారు. ఆసీస్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఓటమని మండిపడ్డారు.
ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలాంటి ఘోర ఓటమిని నేను ఇప్పటివరకు చూడలేదు. మూడేళ్ల క్రితం గబ్బాలో వెస్టిండీస్ చేతిలో కూడా ఖంగుతిన్నారు. కానీ ఇది అంతకంటే దారుణమైన ఓటమి. ఎందుకంటే బంగ్లా జట్టులో వారి అత్యుత్తమ బౌలర్లు నహిద్ రానా, షోరిఫుల్ ఇస్లాం లేరు. అయినప్పటికి మన బ్యాటర్లు చేతులెత్తేశారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా తమ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకుంటే బంగ్లాకు ఇది చాలా పెద్ద విజయమని మార్క్ వా పేర్కొన్నారు.
ఈ ఓటమి నన్ను తీవ్ర నిరాశపరిచింది. ఇది అత్యంత అవమానకరమైన ఓటమి. జట్టులో మార్పులు చేయడానికి నేను సాధారణంగా ఇష్టపడను. కానీ జట్టు తీవ్రంగా విఫలమైనప్పుడు మార్పులు తప్పవు. జట్టును పునర్నిర్మించడానికి కొత్త ఆటగాళ్లకు అవకాశమివ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా కొత్త ఓపెనర్, మూడో స్ధానానికి సరిపోయే యంగ్ ప్లేయర్లను తీసుకురావాలి అని పాంటింగ్ సూచించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది.


