
ఇంగ్లండ్తో తొలి టెస్టు ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు రెండో రోజు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్యూవెదర్ వివరాల ప్రకారం.. లీడ్స్లో శనివారం ఉదయం ఎండ కాస్తుంది. 28-29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
అయితే, 25 శాతం మేర వర్షం కురిసేందుకు కూడా ఆస్కారం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వాన పడే అవకాశాలు 86 శాతం ఉన్నాయి. 31 శాతం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసేందుకు ఛాన్స్ ఉంది. టీమిండియా- ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆటలో రెండో, మూడో సెషన్లో వర్షం పడే ఛాన్సులు 77 శాతం ఉన్నాయి.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ తమ తొలి సిరీస్లో పరస్పరం తలపడుతున్నాయి. టెండుల్కర్-ఆండర్సన్ (Tendulkar-Anderson Trophy) ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు ఐదు టెస్టులు ఆడతాయి. ఈ క్రమంలో శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు మొదలైంది.
ఇరగదీసిన భారత బ్యాటర్లు
టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్.. గిల్ సేనను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమై ఈ మేరకు అతడు తీసుకున్న నిర్ణయం భారత్కు కలిసి వచ్చింది. తొలి రోజు పొడిగా ఉన్న పిచ్పై టీమిండియా స్టార్లు బ్యాట్తో ఇరగదీశారు.
ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (42) ఫర్వాలేదనిపించగా.. యశస్వి జైస్వాల్ (101) సెంచరీతో చెలరేగాడు. ఇక కెప్టెన్ శుబ్మన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 127 పరుగులతో అజేయంగా ఉండగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకం (65*) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి టీమిండియా 85 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేయగా.. గిల్, పంత్ క్రీజులో ఉన్నారు.
వరుణుడు అడ్డుపడతాడా?
అయితే, రెండో రోజు ఆటలో వీరు మరింత చెలరేగితే చూడాలని ఆశపడుతున్న అభిమానులకు వరుణుడు షాకిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తొలిరోజు కూడా ఇదే తరహా హెచ్చరికలు కాగా.. ఆట సజావుగానే సాగింది. ఇక మొదటి రోజు టీమిండియా అభిమానులను నిరాశపరిచిన అంశం ఏదైనా ఉందంటే.. అది సాయి సుదర్శన్ డకౌట్ మాత్రమే.
అదొక్కటే నిరాశ
ఇంగ్లండ్ గడ్డ మీద ఈ తమిళనాడు బ్యాటర్ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాడు. 24 ఏళ్ల సాయి భారత్ తరఫున టెస్టు ఆడిన 317వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. భారత సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా అతనికి టెస్టు క్యాప్ను అందించాడు.
అయితే, దురదృష్టవశాత్తూ కెరీర్ తొలి ఇన్నింగ్స్ అతనికి కలిసి రాలేదు. నాలుగు బంతులే ఎదుర్కొన్న అతను ‘సున్నా’కే వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. టెస్టు అరంగేట్రానికి ముందు సాయి భారత్ తరఫున 3 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు.
చదవండి: బుర్ర వాడేవాళ్లు ఇలాంటి పనిచేయరు: స్టోక్స్పై మాజీ కెప్టెన్ ఫైర్