PC: BCCI X
శ్రీలంక ఎలెవన్తో వార్మప్ మ్యాచ్లో టీమిండియా స్టార్లు రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ విఫలమయ్యారు. ఈ ఇద్దరు వికెట్ కీపర్లు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది.
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా టీమిండియా శ్రీలంకతో రెండు మ్యాచ్లలో తలపడేందుకు అక్కడికి వెళ్లింది. గాలె, కొలంబో వేదికలుగా ఆగష్టు 15 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. ఇందుకు సన్నాహకంగా టీమిండియా శ్రీలంక ఎలెవన్తో శుక్రవారం నుంచి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టింది.
కొలంబో వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓపెనర్లు నిశాన్ మధుష్క (66), రవిందు రశాంత (71), కెప్టెన్ సోనాల్ దినుష (52) అర్ధ శతకాలతో రాణించారు.
జైసూ డకౌట్.. పడిక్కల్ శతకం
ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్య రీతిలో బౌల్డ్ అయ్యాడు. అయితే, వన్డౌన్లో వచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుత శతకం (121 బంతుల్లో 103) సాధించాడు. ఆ వెంటనే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు.
పంత్, జురెల్ విఫలం
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చీ రాగానే వెనుదిరిగాడు. రమేశ్ మెండిస్ బౌలింగ్లో అనవసరపు షాట్కు ప్రయత్నించి.. నిశాన్ మధుష్కకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఐదు బంతులు ఎదుర్కొన్న పంత్.. కేవలం రెండు పరుగులు చేసి నిష్క్రమించాడు.
మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సైతం తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు. దీంతో పంత్, జురెల్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జడేజా అర్ధ శతకం పూర్తి
ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆటలో భాగంగా రెండు వికెట్లు తీసిన స్పిన్బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. 88 బంతుల్లో జడ్డూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలో 55 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఎలెవన్ కంటే మరో 154 పరుగులు వెనుకబడి ఉంది. మానవ్ సుతార్ ఏడు పరుగులతో ఉన్నాడు.
చదవండి: విండీస్కు భారీ షాక్.. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అప్గాన్ అర్హత


