KL Rahul: చూసి ఆడు పంత్‌.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే.. | KL Rahul firmly tells Pant to be watchful playing shots He retorts: Achhe se | Sakshi
Sakshi News home page

KL Rahul: చూసి ఆడు పంత్‌.. నేనేమీ నిర్లక్ష్యపు షాట్లు ఆడటం లేదు!.. నువ్వే..

Jun 23 2025 6:49 PM | Updated on Jun 23 2025 7:24 PM

KL Rahul firmly tells Pant to be watchful playing shots He retorts: Achhe se

ఇంగ్లండ్‌ (Ind vs Eng)తో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ ఆచితూచి ఆడుతోంది. ఇప్పటికే ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ (30), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (8)ల వికెట్లను టీమిండియా కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట దశలో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌లపై భారం పడింది.

నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదిలోనే గిల్‌ అవుట్‌ కావడంతో.. పంత్‌ రాహుల్‌ (KL Rahul)కు జతయ్యాడు. ఇద్దరూ కలిసి భోజన విరామ సమయానికి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.

ఓవైపు కేఎల్‌ రాహుల్‌ కూల్‌గా తన పని తాను చేసుకుపోతుంటే.. రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) మాత్రం తగ్గేదేలే అంటూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ క్రమంలో ముప్పై మూడవ ఓవర్లో మూడో బంతికి బ్రైడన్‌ కార్స్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన పంత్‌.. అదృష్టవశాత్తూ క్యాచ్‌ అవుట్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  

బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిని బంతి ఫైన్‌-లెగ్‌ రీజన్‌లో గాల్లోకి లేవగా.. వికెట్‌ కీపర్‌, ఫస్ట్‌ స్లిప్‌ క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. దీంతో పంత్‌ బతికిపోయాడు.

చూసి ఆడు..  నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదు
ఈ నేపథ్యంలో రాహుల్‌ పంత్‌కు సలహా ఇచ్చాడు. ‘కాస్త చూసి ఆడు.. జాగ్రత్త’ అని హెచ్చరించాడు. అయితే, పంత్‌ ఇందుకు కాస్త దురుసుగానే సమాధానం ఇచ్చినట్లు అనిపించింది. ‘‘నేనేమీ నిర్లక్ష్యఫు షాట్లు ఆడటం లేదు. జాగ్రత్తగానే హిట్టింగ్‌ చేస్తున్నా’’ అని పంత్‌ పేర్కొన్నాడు. స్టంప్‌ మైకులో ఈ మాటలు రికార్డయ్యాయి.

స్కోర్‌ చేయలేకపోతున్నాం
ఆ తర్వాత మరోసారి.. ‘‘బంతి పాతబడిపోయింది. మరీ ఆచితూచి ఆడటం వల్ల స్కోర్‌ చేసే అవకాశాన్ని మిస్‌ అయిపోతున్నాం’’ అని పంత్‌ పేర్కొనడం గమనార్హం. వీరికి సంభాషణను హైలైట్‌ చేస్తూ కామెంటేటర్లు హర్షా భోగ్లే, ఛతేశ్వర్‌ పుజారా నవ్వుకున్నారు. మరోవైపు.. టీమిండియా అభిమానులు రాహుల్‌ కూల్‌గానే పని పూర్తి చేస్తాడని ప్రశంసిస్తూనే.. పంత్‌ కాన్ఫిడెన్స్‌ వేరే లెవల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 54 ఓవర్ల ఆట పూర్తయ్యే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టాననికి 175 పరుగుల వద్ద నిలిచింది. రాహుల్‌ 83, పంత్‌ 41 రన్స్‌తో ఆడుతున్నారు. ఇక 57వ ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ 57 ఓవర్లలో 192 పరుగులు చేసింది. పంత్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. రాహుల్‌ సెంచరీకి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. 

ఇక ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో లీడ్స్‌ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ఆరంభించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన గిల్‌ సేన.. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇందుకు దీటుగా బదులిచ్చిన ఇంగ్లండ్‌ 465 పరుగులు సాధించింది. 

ఈ క్రమంలో ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా మెరుగ్గా ఆడి.. మంచి స్కోరు నమోదు చేస్తేనే ఆతిథ్య జట్టుకు సవాల్‌ విసరగలదు.
UPDATE: Ind vs Eng 1st Test: శతక్కొట్టిన కేఎల్‌ రాహుల్‌

చదవండి: ‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement