‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’ | He never spoke to me for 3 months: Ganguly On 2003 WC Dropped Star | Sakshi
Sakshi News home page

‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’

Jun 23 2025 5:56 PM | Updated on Jun 23 2025 6:38 PM

He never spoke to me for 3 months: Ganguly On 2003 WC Dropped Star

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) 2003 వన్డే ప్రపంచకప్‌ నాటి జ్ఞాప​కాలు గుర్తు చేసుకున్నాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించామని.. కూర్పు దృష్ట్యా నాడు ఓ దిగ్గజ బ్యాటర్‌కు మొండిచేయి చూపామని పేర్కొన్నాడు. ఈ కారణంగా అతడు తనతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తాజాగా వెల్లడించాడు.

కాగా 2003లో సౌతాఫ్రికాలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ (ODI World Cup 2003) జట్టులో యాజమాన్యం వీవీఎస్‌ లక్ష్మణ్‌కు చోటు ఇవ్వలేదు. అతడిని కాదని దినేశ్‌ మోంగియా (Dinesh Mongia)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక నాటి ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

నాతో మూడు నెలలు మాట్లాడలేదు
తాజాగా నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వరల్డ్‌కప్‌ జట్టు కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. లక్ష్మణ్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సహజమే. అలా చాలా మందిని చాలా సార్లు పక్కనపెట్టాల్సి వచ్చేది.

అందుకు వారు అసంతృప్తికి లోనవడం కూడా మామూలే. వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం దక్కనందుకు లక్ష్మణ్‌ నాతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చొరవ తీసుకుని అతడిని కదిలించాను.

ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఇలాంటి ఆటుపోట్లు తప్పవు. ముఖ్యంగా సమర్థవంతుడైన తనకు చోటు దక్కనందుకు లక్ష్మణ్‌ అసంతృప్తికి లోనుకావడం, బాధపడటం సహజమే.

పాక్‌లో అదరగొట్టాడు
అయితే, ప్రపంచకప్‌ టోర్నీలో మా ప్రదర్శన పట్ల అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఈవెంట్‌ తర్వాత అతడు వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 

ఏ ఆటగాడైనా జట్టులో చోటు దక్కనపుడు బాధపడినా... దానిని మరీ వ్యక్తిగతంగా తీసుకోరు. జట్టు ప్రయోజనాల కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు’’ అని గంగూలీ పేర్కొన్నాడు.

కాగా టీమిండియా తరఫున గంగూలీ 1992 నుంచి 2008 వరకు 113 టెస్టులు, 311 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7212, 11363 పరుగులు సాధించాడు. భారత క్రికెట్‌ జట్టు దశ దిశ మార్చిన కెప్టెన్‌గా పేరొందిన దాదా ఖాతాలో.. 16 టెస్టు, 22 వన్డే శతకాలు ఉన్నాయి.

మరోవైపు.. హైదరాబాదీ వీవీఎస్‌ లక్ష్మణ్‌ 1996- 2012 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్‌లో 134 టెస్టుల్లో 8781 పరుగులు,86 వన్డేల్లో 2338 పరుగులు సాధించాడు. ఇక గతంలో గంగూలీ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా పనిచేయగా.. లక్ష్మణ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా ఉన్నాడు. ప్రధాన కోచ్‌ల గైర్హాజరీలో టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: దంచికొట్టిన ఉన్ముక్త్‌ చాంద్‌.. క్లాసెన్‌ బృందానికి తప్పని ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement