PC: BCCI X
టీమిండియా కీలక సిరీస్కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27 సీజన్లో భాగంగా శ్రీలంకతో రెండు మ్యాచ్లు ఆడేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే లంకకు చేరుకున్న టీమిండియాకు.. వార్మప్ మ్యాచ్తో కావాల్సినంత ప్రాక్టీస్ దొరికింది.
ముగ్గురు కీలక ఆటగాళ్లు దూరం
ఈ సిరీస్లో 2-0తో గెలిస్తేనే డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ ఫైనల్ రేసులో టీమిండియా నిలవగలుగుతుంది. అయితే, ఈ కీలక మ్యాచ్లకు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, బ్యాటర్ సాయి సుదర్శన్ దూరమయ్యారు. గాయాల వల్ల ఈ ముగ్గురూ సిరీస్కు అందుబాటులో లేకుండా పోయారు.
ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కీలక సూచనలు చేశాడు. ఆటగాళ్లు గాయాల బెడద, టెస్టు క్రికెట్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తప్పక దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. ఈ మేరకు JITO ప్రీమియర్ లీగ్ ఆరంభం సందర్భంగా మాట్లాడుతూ..
అదే అత్యంత ముఖ్యం
‘‘ప్రతి ఆటగాడు దేశవాళీ క్రికెట్ ఆడటం అత్యంత ముఖ్యం. ఇటీవలి కాలంలో భారత జట్లు స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడటం చూస్తున్నాం. ఇందుకు కారణం వారు దేశీ క్రికెట్ ఆడకపోవడమే.
బీసీసీఐ ఈ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించాలి. ప్రతి ఒక్క ఆటగాడు మల్టీ-డే మ్యాచ్లు ఆడేలా చూడాలి. సీనియర్లను చూసి యువ ఆటగాళ్లు కూడా ఎంతో నేర్చుకుంటారు. వారితో కలిసి ఆడటం వల్ల యువ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
మనోళ్లు తేలిపోతున్నారు
ఇటీవల టీమిండియా ఎన్నో టీ20, వన్డే మ్యాచ్లు ఆడింది. అయితే, స్పిన్ బౌలింగ్లో మనోళ్లు అత్యుత్తమంగా రాణించలేకపోయారు. ఇక టెస్టు ఫార్మాట్ మరింత భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది’’ అని కపిల్ దేవ్ టీమిండియాతో పాటు బీసీసీఐకి సూచించాడు. కాగా శ్రీలంకతో ఆగష్టు 15 నుంచి టీమిండియా తొలి టెస్టు మొదలుకానుంది. ఇందుకు గాలె వేదిక.


