నీ ముక్కు నేలకు  రాస్తావా.. కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌ | Tpcc Chief Revanth Reddy Fires On Cm Kcr | Sakshi
Sakshi News home page

నీ ముక్కు నేలకు  రాస్తావా.. కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్‌

Nov 8 2023 7:07 PM | Updated on Nov 8 2023 7:36 PM

Tpcc Chief Revanth Reddy Fires On Cm Kcr - Sakshi

కాంగ్రెస్‌ సృష్టించే సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌ సృష్టించే సునామీలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోతుందని రేవంత్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుండుపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడుతూ, దొరల తెలంగాణ కావాలా?.. ప్రజల తెలంగాణ కావాలా?. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.4వేల పెన్షన్‌ ఇస్తాం. తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే’’ అంటూ ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పార్టీ శంషాబాద్ మండలానికి చేసింది ఏమీ లేదని జాతీయస్థాయిలో శంషాబాద్‌కు పేరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేననన్నారు. శంషాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్‌తో పాటు మెట్రో రైల్, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్సేనన్నారు.

జీవో 111 పేరుతో రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలను ప్రతిసారీ మోసం చేస్తూ ఎన్నికలను తెస్తున్నారని తెలిపారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవో 111 ఎత్తివేస్తామంటూ గెలుస్తున్నారన్నారు. బడా నాయకులు ఫామ్ హౌస్‌లు, విల్లాలు కట్టుకుంటే జీవో 111 వర్తించదు. కానీ అదే పేదోడు చిన్న ఇల్లు కడితే మాత్రం 111 జీవో అడ్డు వస్తుందని రేవంత్‌ మండిపడ్డారు.

24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు బీఆర్‌ఎస్‌ పార్టీ నిరూపిస్తే రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్‌తో పాటు తాను కూడా నామినేషన్ ఉపసంహరిస్తామని లేదంటే.. 8 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే శంషాబాద్ బస్టాండ్ ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు ముక్కు నేలకు  రాస్తావా అంటూ కేసీఆర్‌కు రేవంత్ సవాల్ విసిరారు.
చదవండి: రేవంత్ మాటమార్చి బుకాయిస్తున్నడు: మంత్రి హరీష్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement