‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’ | Jada Sravan Kumar Comments On Sai Krishna Case | Sakshi
Sakshi News home page

‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’

Jun 19 2026 6:51 PM | Updated on Jun 19 2026 7:20 PM

Jada Sravan Kumar Comments On Sai Krishna Case

సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్‌.. ల్యాండ్ సెటిల్‌మెంట్‌ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.

‘‘సాయికృష్ణను ఈ నెల 8న  మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు  మాత్రమే కృష్ణలంక పీఎస్‌లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్‌లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్‌ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్‌ ఫోర్స్‌ ఆఫీస్‌ నుంచి ఓ ప్రైవేట్‌ హోటల్‌కు తీసుకెళ్లారు. ప్రైవేట్‌ హోటల్‌ రూమ్‌ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు

..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే  హోటల్‌ రూమ్‌ బుక్‌ అయ్యింది. హోటల్‌ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌ ట్రీట్‌మెంట్‌ చేశారు. మణిపాల్‌ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్‌కు తీసుకెళ్లారు. ఆర్‌ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్‌లో సీసీ ఫుటేజ్‌ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement