తూర్పు గోదావరి జిల్లా: జీఎస్ఎల్ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతికి విచారాన్ని వ్యక్తం చేస్తూ కళాశాలలో సోమవారం సంతాప సభ నిర్వహించారు. పీజీలో డెర్మటాలజీ ఫస్టియర్ చదువుతున్న ఆమె ఇకలేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నామని, ఆమె కుటుంబానికి మనోధైర్యాన్ని అందించి, ఆమె ఆత్మకు శాంతిని చేకూర్చాలని దేవుడిని ప్రార్థించారు. ఆఖరి నిమిషం వరకు ఆమెను బతికించుకునేందుకు తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.
ఆమె చిత్రపటం వద్ద సహ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ ప్రతినిధులు పుష్పాంజలి ఘటించారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించాలని జీఎస్ఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి ఈడీ డాక్టర్ గన్ని సాధిక ద్వారా త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గన్ని సారిక, డాక్టర్ సీతారామ్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ తేజస్విని, డాక్టర్ సుభాషిణి, విద్యార్థులు పాల్గొన్నారు.


