అంగన్వాడీ, ఆశా వర్కర్లు కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులు
కార్మికుల ఆందోళనతో రణరంగంగా మారిన విజయనగరం కలెక్టరేట్
పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట, లాఠీచార్జ్
విజయనగరం గంటస్తంభం: కనీస వేతనం నెలకు రూ.26,000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 12 గంటల పనిదినాలను ఉపసంహరించుకుని లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వేతన సవరణ వెంటనే చేపట్టి ఆశా, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో కలెక్టరేట్ రణరంగంగా మారింది. వేలాదిమంది కార్మికులు ర్యాలీగా విజయనగరం కలెక్టరేట్కు చేరుకున్నారు.
సమస్యలు, డిమాండ్ల పరిష్కారంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంపై నినదించారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు సీఐటీయూ నేతలను పోలీసులు ఈడ్చుకుపోయి, బలవంతంగా అరెస్టుచేశారు. ఆందోళనలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఎం.శ్రీనివాస్, జిల్లా అధ్యక్ష, కార్యదర్ములు కె.సురేష్, టి.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.


