ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న చేనేత కార్మీకులు
నేతన్న సాయం పథకం నిధులు అందలేదంటూ రాస్తారోకో
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండు గంటలపాటు ఆందోళన
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ అందింది
ఏటా రూ. 24 వేల చొప్పున సాయం
ధర్మవరం: చేనేత కార్మీకుల కడుపు మండింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వం ‘నేతన్న సాయం’ పథకం ద్వారా సాయం అందిస్తుందని అనుకుంటే అనర్హులకు కట్టబెట్టి అర్హులకు మొండిచేయి చూపింది. దీంతో అర్హులైన నేతన్నల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్ కదిరి గేట్ వద్దనున్న నేతన్న విగ్రహం వద్ద సోమవారం ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై భారీ నిరసనకు దారితీసింది. ఈ కార్యక్రమానికి వందలాది మంది చేనేత కార్మీకులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు.
ఇంత అన్యాయం చేస్తారా..?
ఈ సందర్భంగా శివానగర్, కేశవనగర్, శాంతినగర్, గ్యాస్ గోడౌన్ ప్రాంతాలకు చెందిన నేత కార్మీకులు మాట్లాడుతూ.. నేతన్న సాయం పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేలు ఇస్తామంటే ఎంతోకొంత ఉపశమనం కలుగుతుందని భావించామని.. కానీ, ఇటీవల టీడీపీ కూటమి నాయకులు అనేక వార్డులలో అనర్హుల పేర్లను ఎక్కించడంతో అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. హ్యాండ్లూమ్ అధికారులు సైతం ఎవరికి మగ్గాలు ఉన్నాయో కూడా విచారించకుండా అనర్హులకు డబ్బులు ఎలా జమచేస్తారని ప్రశి్నంచారు.
చంద్రబాబు ప్రభుత్వంలోని మూడు పారీ్టల కార్యకర్తల కోసం మాత్రమే నేతన్న సాయం పథకాన్ని తెచ్చారా అని ఆగ్రహంతో నిలదీశారు. ధర్మవరంలో ఇంతటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని వారు మండిపడ్డారు. పట్టణంలో నాలుగు వేల మందికి పైగా అనర్హులకు పథకం అందించి.. ఆ మేర అర్హులకు తీరని ద్రోహం చేశారని తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ నేతన్న నేస్తం పథకం అందిందని, జగనన్న ప్రతిఏటా రూ.24 వేలు ఠంఛన్గా అందించారని బాధిత చేనేత కార్మీకులు గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. చివరకు.. పట్టణ సీఐ రెడ్డప్ప హ్యాండ్లూమ్ అధికారులతో మాట్లాడి ఐదు రోజుల్లో అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో «నిరసన విరమించారు.


