
ప్రస్తుతం టాలీవుడ్లో థియేటర్ల సమస్య నడుస్తోంది. థియేటర్ల యజమానులు, సినిమాలు తీస్తున్న నిర్మాతల మధ్య పర్సంటేజ్ విషయమై ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. దీన్ని కాసేపు అలా పక్కనబెడితే రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టగా.. నిర్మాత అల్లు అరవింద్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు సోమవారం.. దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని దిల్ రాజు అన్నారు. ఇండస్ట్రీలో సమన్వయం లేదని, ఎవరికీ తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. 250 థియేటర్లు ఓనర్స్, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. 'ఆ నలుగురు' అంటూ మీడియా ఇష్టమొచ్చినట్లు రాస్తోందని, అందుకే ఈ విషయమై క్లారిటీ ఇద్దామని ఇప్పుడు మాట్లాడుతున్నానని దిల్ రాజు స్పష్టం చేశారు.
(ఇదీ చదవండి: థియేటర్ల బంద్.. ఆ విషయంలోనే వివాదం మొదలైంది: దిల్ రాజు)
ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడిన దిల్ రాజు.. గేమ్ ఛేంజర్ పైరసీ కావడం, ఓ నిర్మాత చేసిన కామెంట్స్ గురించి చెప్పుకొచ్చారు. 'గేమ్ ఛేంజర్ విడుదలైన రోజే పైరసీ ప్రింట్ వచ్చింది. కానీ ఓ మాజీ నిర్మాత.. ప్రొడ్యూసరే ఈ సినిమాని కావాలనే పైరసీ చేశాడని అన్నాడు. ఇది ఎంత నీచం? నా సినిమా నేను కాపాడుకుంటాను కానీ పైరసీ చేసుకుంటానా? కొంతమంది చాలా నీచంగా బిహేవ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాని నేను పైరసీ చేసుకుంటానా? పైరసీ చేస్తే ప్రొడ్యూసర్గా నాకు నష్టం కాదా? డిస్ట్రిబ్యూటర్కు నష్టం కాదా? బుద్ధి ఉన్నోడు ఎవడైనా తన ఇంట్లో మనిషిని చంపుకుందాం అనుకుంటాడా?' అని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన గేమ్ ఛేంజర్ సినిమా.. దారుణమైన డిజాస్టర్ అయింది. తొలిరోజే ఘనంగా రూ.186 కోట్ల కలెక్షన్స్ అని పోస్టర్ రిలీజ్ చేశారు గానీ దీనిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. రిలీజైన ఇన్నాళ్లు అవుతున్నాసరే ఏదోలా మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పుడు స్వయంగా చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా తను ఎదుర్కొన్న బాధని బయటపెట్టారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)