
థియేటర్ల వివాదంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని అన్నారు. ఇండస్ట్రీలో సమన్వయం లేదని దిల్ రాజు వెల్లడించారు. ఎవరికీ తోచినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తొలి రోజే నా సినిమా గేమ్ ఛేంజర్ను పైరసీ చేశారని దిల్ రాజు ఆరోపించారు. మా సినిమాను పైరసీ చేసిన వాళ్లలో మరో నిర్మాత కూడా ఉండొచ్చని దిల్ రాజు అన్నారు.
దాదాపు 56 రోజులు షూటింగ్లు ఆపి నిర్మాతలు ఏం సాధించలేకపోయారని అన్నారు. థియేటర్ల మూసివేతపై తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు తెలిపారు. సినిమా వాళ్లకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమేనని మాట్లాడారు. పవన్ కల్యాణ్ సినిమాను ఎవరూ ఆపడం లేదన్నారు. ఎగ్జిబిటర్ల కష్టాలు తమకు తెలుసని.. పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని కొందరు చెప్పారని తెలిపారు. కానీ పర్సంటేజీ విధానంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. రెంట్, పర్సంటేజ్ విధానంలో ఆడే థియేటర్ల విషయంలోనే వివాదం మొదలైందని దిల్ రాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన సమావేశంలో ఈ సమస్య తెరపైకి వచ్చిందని వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ..'ప్రస్తుతం ఇండస్ట్రీలో రెంట్ లేదా పర్సంటేజ్ విధానం నడుస్తోంది. మొదటి వారం బాగా రెవెన్యూ వస్తే రెంట్ ఇస్తున్నాం. సెకండ్ వీక్ కలెక్షన్లు తగ్గగానే పర్సంటేజ్ ఇస్తున్నాం. అది వాళ్లకు కష్టమని మా అందరికీ తెలుసు. దీనిపై చర్చిస్తున్నాం. కానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే.. ఎస్వీసీఎస్ సహా మా వద్ద ఉన్న థియేటర్లు 30 మాత్రమే. ఏషియన్, సురేశ్ కంపెనీలో 90 ఉన్నాయి. 250 థియేటర్లు ఓనర్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఆ నలుగురు అంటూ మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తోందని ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నాం. వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు' అని అన్నారు.
