-
అకౌంట్లతో పనిలేదు..
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ జూలై 5వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టిన 2019–20 వార్షిక బడ్జెట్లో ఒక లొసుగును సవరించారు. తన బడ్జెట్ ప్రతిపాదనకు ఒక కీలక సవరణను గురువారం తీసుకువచ్చారు. వివరాల్లోకి వెళితే... ఒక సంవత్సరంలో ‘ఒక అకౌంట్’ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్డ్రాయెల్స్ జరిపితే 2 శాతం మూలం వద్ద పన్ను (టీడీఎస్) విధించాలని జూలై 5 బడ్జెట్ ప్రతిపాదించింది. అయితే ‘రెండు లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్ల నుంచి కోటి పైబడిన విత్డ్రాయెల్స్ చేస్తే 2 శాతం టీడీఎస్ ఉండదా’ అనే సంశయం పలు వర్గాల నుంచి వ్యక్తమయ్యింది. బడ్జెట్లో ఈ లొసుగును సవరిస్తూ ఆర్థిక మంత్రి 2019 ఫైనాన్స్ బిల్లుకు ఒక సవరణను తీసుకువచ్చారు. దీని ప్రకారం .. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. భారీ నగదు లావాదేవీల నిరోధం లక్ష్యంగా బడ్జెట్లో ఆర్థిక మంతి ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 28 ఇతర సవరణలతోపాటు ఈ ప్రతిపాదనకూ లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. మొత్తం పన్ను బకాయిల్లో ఈ టీడీఎస్ కూడా భర్తీ అయ్యే అవకాశాన్నీ తాజా బడ్జెట్ ప్రతిపాదన కల్పిస్తోంది. -
‘కిసాన్ సమ్మాన్’తో రైతులకు అవమానమే
సాక్షి, న్యూఢిల్లీ: కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు మూడు విడతలుగా ఇస్తున్న రూ.6 వేల సాయం రైతులను అవమానించేదిగా ఉందని కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బడ్జెట్పై చర్చలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ బడ్జెట్ పద్దులపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ నుంచి ప్రధాన వక్తగా ఉత్తమ్ మాట్లాడారు. ‘2018–19 సంవత్సరానికి గానూ వ్యవసాయానికి బడ్జెట్లో రూ.75,753 కోట్లు కేటాయించి చివరకు 29 శాతం కోత విధించి రూ.53 వేల కోట్ల వ్యయం చేశారు. నేడు దేశంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. శాస్త్రీయమైన కనీస మద్దతు ధరలు లేకపోవడం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విషయంలో లోపభూయిష్ట విధానాలు, సరైన పంట ల బీమా సౌకర్యం లేకపోవడంతో వ్యవసాయం దుర్భరంగా మారి రోజూ 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో రోజురోజుకూ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోవడం బాధాకరం. ఒక్కో ఏడాది 11 నుంచి 13 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2016 నుంచి రైతు ఆత్మహత్యలపై అధికారిక గణాంకాలు లేకపోవడం విచారకరం’ అని అన్నారు. దేశంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని, కౌలు రైతులు వాణిజ్య పంటల వేసుకోవడం వల్ల వారికి పెట్టుబడి అధికమై నష్టాలు వచ్చినపుడు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. దేశంలో కోట్లాది మంది కౌలు రైతులకు ఉపయోగపడేలా ఒక చట్టం తేవాలని, గతంలో ఉమ్మడి ఏపీలో ఇలాంటి కౌలుదారు హక్కుల చట్టం తేవడం జరిగిందని, ఇలాంటి చట్టం దేశంలోనూ తెస్తే కోట్లాది మంది కౌలు రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతు ఆదాయం ఎంత పెంచారు? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016–17లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఇదే విషయాన్ని ప్రధాని పదే పదే చెప్పారని, కానీ ఈ మూడేళ్ళలో రైతుల ఆదాయం ఎంత పెరిగిందో ఎక్కడా చెప్పడం లేదని ఉత్తమ్ అన్నారు. ఈ మూడేళ్లలో వ్యవసాయ జీడీపీ కానీ, రైతుల ఆదాయం కానీ ఎక్కడ పెరిగిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక సర్వేల్లో ఎక్కడా కూడా రైతు, వ్యవసాయ ఆదాయాలు పెరగలేదని, సున్నా శాతం అభివృద్ధి ఉందని, 2022 నాటికి రైతు ఆదాయం పెరగాలంటే ఆరేళ్ల పాటు ఏటా 13 శాతం పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఎన్నికల ముందు బీజేపీ.. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని వివరించారు. పత్తి రైతులకు కనీసం రూ.6 వేల మేర కనీస మద్దతు ధర ఇవ్వాలని ఉత్తమ్ కోరారు. పంటల బీమాతో తెలంగాణకు పైసా రాలేదు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రం తెచ్చిన పథకం రైతులను అవమానపరిచేలా ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున, అది కూడా మూడు విడతల కింద ఇస్తుందని పేర్కొన్నారు. అంటే ఐదుగురు సభ్యులున్న కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.3.30 వస్తుందని, ఇది రైతులకు ఎలా ఉపయోపడుతుందని ప్రశ్నించారు. కోట్లాది మంది కౌలు దారులు, ఆదివాసీ రైతులు, భూమి లేని పేద రైతులకు ఇది వర్తించడం లేదని అన్నారు. ప్రధానమంత్రి పసల్ భీమా యోజన పథకంలో 50 శాతం మంది రైతులకు పంటల భీమా అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే 25 శాతానికి మించి అందడం లేదన్నారు. తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద ఒక్క పైసా రాలేదని అన్నారు. ఈ పథకం వల్ల రైతుల కంటే బీమా కంపెనీలకు ఎక్కువ లాభం ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణలోని నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఉత్తమ్ చెప్పారు. ఎన్నికల ముందు రాజ్నాథ్ సింగ్ వచ్చి నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, వెంటనే అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
జనరంజకం నిర్మల బడ్జెట్
భారత్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభు త్వం బడ్జెట్ ను రూపొందించింది. ఆ మేరకు విధానపరమైన చర్యలను కూడా తీసుకుంది. ఇదంతా కార్పొరేట్లకు సంబంధించిన వ్యవహారం అని, తమకేమీ సంబంధం లేదని చాలామంది పేద, మధ్యతరగతి ప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు అనుకుంటుంటారు. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్థికాభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్, పారిశ్రామిక అభివృద్ధి అన్నంతవరకే పరిమితం కాలేదు. దానికి నిదర్శనమే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్. అందులో పేర్కొన్నట్లుగా.. మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రభాగానికి చేరుకుంది. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి ఇచ్చిన చేయూత. ఆరు వేల పెట్టుబడి మద్దతును రైతులందరికీ అందిస్తామని పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంప్రదాయ, కుటీర పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది దుకాణదారులు, వాటిలో పనిచేసే వారికి మేలు చేకూర్చేలా పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని బడ్జెట్లో ప్రకటించటం అందరూ స్వాగతించాలి. ఆదాయపు పన్ను, జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం అధికంగా అంచనా వేసి చూపించిందని, అంత సాధ్యం కాదని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చెప్పుకొచ్చారు. ఆదాయపు పన్ను 23.25 శాతం, జీఎస్టీ 44.98 శాతం చొప్పున పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని ఆయన లెక్కలు వేశారు. కానీ, ఈ లెక్కలకు ఆధారం ఏం టి? ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు వేశారు? అని నిర్మల రాజ్యసభలో ప్రశ్నిస్తే.. సరిగ్గా ఆమె మాట్లాడే రోజు చిదంబరం సభకు హాజరు కాలేదు. వాస్తవానికి ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను, ఇతర పన్నులన్నీ కలిపితే ఆదాయపు పన్నుగా లెక్కిస్తారు. బహుశా చిదంబరం కార్పొరేట్, ఇతర పన్ను ల్ని తీసేసి ఆదాయపు పన్ను ఒక్కదానినే లెక్కించి అంత రాబడి అసాధ్యం అని చెప్పి ఉండొచ్చు అని నిర్మలా సీతారామన్ బాధ్యతాయుతంగా వివరణ ఇచ్చారు. అదేవిధంగా జీఎస్టీ విషయంలోనూ చిదంబరం వేసినవి కాకిలెక్కలేనని పార్లమెంటులోనే నిర్మలా సీతారామన్ తూర్పారబట్టారు. నరేం ద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బ్యాంకుల నెత్తిన పెట్టిన మొండి బాకీల స్థాయి ఎక్కడికి చేరిందంటే.. ప్రభుత్వ రంగ, జాతీయస్థాయి బ్యాంకులు అసలు కొనసాగుతాయా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యా యి. రిజర్వ్ బ్యాంకు ఈ మొండి బాకీలపై ఒక నివే దిక వెలువరించింది. మొండి బాకీలకు కారణం ప్రభుత్వ, బ్యాంకు విధానాల్లోని లోపాలు కూడా కారణమని తెలిపింది. అలాంటి విధాన లోపాలను గత ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం సవరించింది. బడ్జెట్ అంటే ఒకప్పుడు పైపై మెరుగులు, ఆయా వర్గాల ప్రజల్ని సంతృప్తి పరిచేందుకు కేటాయింపులు ప్రకటించి శభాష్ అనిపించుకోవడాలు మాత్రమే అన్నట్లుగా ఒక తంతుగా జరిగేది.అలాం టి కాస్మొటిక్ వ్యవహారాలకు మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. కాగా, రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ లేవని, పోలవరం లాంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని ప్రతిపక్షాలు, ఎంపీలు అదేపనిగా విమర్శలు చేస్తున్నారు. ఇంతకు ముందే చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ నిధులు ఇస్తోంది. పోలవరం సహా ఆయా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. వీటికి ఆయా శాఖల ద్వారా కేటాయింపులు జరుగుతాయి. ప్రత్యేకంగా బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి ప్రస్తావన లేదన్నది నిజమే. కానీ, అలా ప్రత్యేకంగా ఏ ఒక్క ప్రాజెక్టు, రాష్ట్రం గురించి కూడా మంత్రి ప్రసంగంలో చోటివ్వలేదన్నది కూడా నిజం. ఎందుకంటే ఇది దేశాభివృద్ధికి రూపొందించిన బడ్జెట్ కాబట్టి. పైగా, ఇది ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు కొనసాగింపుగా పెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్. దానికి తోడు ప్రస్తుత ఆర్థిక సంఘం గడువు ఈ ఏడాదితో ముగుస్తోంది. కొత్త ఆర్థిక సంఘం నివేదిక ఈ ఏడాది నవంబర్లో వచ్చే అవకాశం ఉంది. అంటే.. అందులో పేర్కొన్న విధంగా రాష్ట్రాలకు కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో సైతం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో నిధుల వస్తాయని పేర్కొన్నది. ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే నిధుల కేటాయించడం, రాష్ట్రం లోని గుళ్లకు చరిత్రలో తొలిసారి బడ్జెట్ కేటాయింపులు చేయడం స్వాగతించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడులాగా కేటాయింపులు చేసి వదిలేయటం కాకుండా వాస్తవంగా ఆ కేటాయింపుల మేరకు నిధులు విడుదల చేసి జగన్ మడమతిప్పని ముఖ్యమంత్రి అనిపించుకోవాలి. పురిఘళ్ల రఘురామ్ వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త -
ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్లో రైలు ఎక్కి హైదరాబాద్లో దిగాలనే ఇక్కడ ప్రజల దశాబ్దాల కోరిక నెరవేరడానికి మరి కొన్నేళ్లు పట్టొచ్చు. కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ మొదటి దశ పనులు వేగంగానే సాగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి తూప్రాన్ మీదుగా గజ్వేల్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. సిద్దిపేట వరకు భూసేకరణ పూర్తి కాగా, సిరిసిల్ల వరకు భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రైల్వేబడ్జెట్లో ఏటా కేటాయింపులు చేస్తున్న నేపథ్యంలో సిద్దిపేట వరకు రైల్వేలైన్ పూర్తవ్వడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్కు రూ.200 కోట్లు కేటాయించడం చూస్తుంటే కొత్త రైల్వేలైన్ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్లు అర్థమవుతోంది. 13 రైల్వేస్టేషన్లు ... 160 బ్రిడ్జిలు కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం ఇప్పటికే తూప్రాన్ వరకు రైల్వేలైన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రైల్వేలైన్తోపాటు 13 రైల్వేస్టేషన్ల నిర్మాణం, అవసరమైన వంతెనల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. ఈ లైన్లో 160 బ్రిడ్జిలు, 7 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, 49 రోడ్డు అండర్ బ్రిడ్జిల నిర్మాణం జరపాల్సి ఉంటుంది. → నాలుగు దశలు... 151.40 కిలోమీటర్లు.. → మొదటి దశ: మనోహరాబాద్ – గజ్వేల్ (32 కి.మీ), → రెండో దశ: గజ్వేల్– దుద్దెడ (32.15 కి.మీ) → మూడో దశ: దుద్దెడ –సిరిసిల్ల ( 48.65 కి.మీ), → నాలుగో దశ: సిరిసిల్ల – కొత్తపల్లి (38.60 కి.మీ) కేసీఆర్ కలల ప్రాజెక్టుగా... సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని హరీష్రావుకు వదిలేసి 2004లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించిన కేసీఆర్.. యూపీఏ–1 ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన విషయం విదితమే. అప్పుడు ఆయన మదిలో మెదిలో ఆలోచనే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎంపీలతో కలిసి అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రైల్వే శాఖ మంత్రి లాలూప్రసాద్ యాదవ్లను ఒప్పించి రైల్వేలైన్ను సాధించారు. కొత్తపల్లి నుంచి వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, తూప్రాన్ మీదుగా మనోహరాబాద్ స్టేషన్కు అనుసంధానం చేసే విధంగా ఈ లైన్ను నిర్ధారిస్తూ 2006లోనే సర్వే చేశారు. రూ.800 కోట్ల అంచనాతో కొత్త రైల్వేలైన్ ప్రారంభించబోతున్నట్లు యూపీఏ ప్రభుత్వం రైల్వే బడ్జెట్లో స్పష్టం చేశారు. 2006లో కేంద్ర మంత్రివర్గం నుంచి కేసీఆర్ బయటికి రావడం, ఎంపీ స్థానానికి రాజీనామా, తిరిగి ఎన్నిక, తదితర ఉద్యమ, రాజకీయ పరిణామాల్లో రైల్వేలైన్పై ప్రగతి కనిపించలేదు. 2009లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా విజయం సాధించి, కొత్తపల్లి రైల్వేలైన్ ప్రగతి కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. వివిధ కారణాల వల్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వేలైన్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. 2014 తరువాతే బడ్జెట్ కేటాయింపులు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు అనుగుణంగా ఢిల్లీలో మంత్రాంగం జరిపి కొత్తపల్లి రైల్వేలైన్ ముందుకు కదిలేలా తనవంతు ప్రయత్నం చేశారు. 151.40 కిలోమీటర్ల రైల్వేలైన్కు అంచనా వ్యయం రూ.1160 కోట్లుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్రం ఈ లైన్కు సంబంధించి పలు ఆంక్షలు విధించింది. రైల్వేలైన్ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, రైలు నడవడం ప్రారంభమయిన తరువాత మొదటి ఐదేళ్లు నష్టాలను భరించాలనే ఒప్పందం మేరకు కేంద్రం బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిపింది. నాలుగు దశల్లో జరిగే రైల్వేలైన్ నిర్మాణం పనులకు సంబంధించి 2017–18 బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించగా, 2018–19లో మరో రూ.125 కోట్లు కేటాయించారు. ఈసారి మరో రూ.200 కోట్లు కేటాయించడంతో తొలిదశ పనులు పూర్తయినట్లేనని చెప్పవచ్చు. సిద్దిపేట వరకు దాదాపు భూసేకరణ పూర్తి – సిరిసిల్లలో నోటీసులు రైల్వేలైన్కు సంబంధించి ఒకవైపు మొదటి దశ పనులు జరుగుతుండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. గజ్వేల్ వరకు రైల్వేలైన్ వేసే పనులు సాగుతుండగా, సిద్దిపేట వరకు భూసేకరణ దాదాపుగా పూర్తయింది. సిరిసిల్ల జిల్లాలో రైల్వేలైన్ సందర్భంగా భూములు కోల్పోతున్న వారికి భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు. సిరిసిల్లలో మిడ్మానేర్ బ్యాక్ వాటర్ మీదుగా కిలోమీటరు పొడవునా బ్రిడ్జి నిర్మాణం జరపాల్సి ఉంటుంది. సిరిసిల్ల వరకు భూసేకరణ పూర్తయితే మూడు దశల నిర్మాణం పనులకు ఆటంకాలు తొలగినట్టే. రైల్వే లైన్ హైలైట్స్ ► 2004లో కరీంనగర్ ఎంపీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రతిపాదన ► 2006 : యూపీఏ–1 ప్రభుత్వం సర్వే చేసి, రూ.800 కోట్ల అంచనాతో బడ్జెట్ నివేదిక ► 2014: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత పనుల్లో కదలిక ► 2015: తాజా సర్వేలో కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్ అంచనా వ్యయం రూ.1160 కోట్లు ► 2016: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన ► 2017–18 : రైల్వే బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయింపు ► 2018–19 : రైల్వే బడ్జెట్లో మరో రూ.125 కోట్లు కేటాయింపు ► 2019–20 : ఈసారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించిన కేంద్రం -
మార్కెట్లో ‘వాటా’ ముసలం!
స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజలకు కేటాయించే కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ తాజా ప్రతిపాదన స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టించింది. బడ్జెట్ రోజు, ఆ తర్వాతి రోజు కొనసాగిన నష్టాలకు ప్రధాన కారణాల్లో ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రతిపాదన కూడా ఒకటి. ఈ ప్రతిపాదన కారణంగా టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు, డిమార్ట్ రిటైల్ స్టోర్స్ చెయిన్ను నిర్వహించే అవెన్యూ సూపర్ మార్ట్స్ వంటి దిగ్గజ కంపెనీలు కనీసం 10–20 శాతం మేర వాటాను విక్రయించాల్సి వస్తుంది. బీఎస్ఈలో దాదాపు 4,000కు పైగా కంపెనీలు లిస్ట్కాగా, వీటిల్లో 1,100 మేర కంపెనీలు వాటా విక్రయం జరపాల్సి వస్తుంది. ఇదంతా ఒకెత్తు. బహుళజాతి కంపెనీలు(ఎమ్ఎన్సీ) బాధ ఇంకొక ఎత్తు. చాలా ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతం రేంజ్లో ఉంది. ఇవి 10 శాతం మేర వాటా విక్రయించాల్సి రావచ్చు. అయితే వాటా విక్రయానికి బదులుగా అసలు స్టాక్ మార్కెట్ నుంచే డీలిస్ట్ అయ్యే దిశగా ఈ ఎమ్ఎన్సీలు యోచిస్తున్నాయని సమాచారం. ఈ విషయమై సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ.... లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ హోల్డింగ్ను ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ విషయమై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఒక లేఖ రాశామని ఆమె పేర్కొన్నారు. పబ్లిక్ హోల్డింగ్ పెంపు ప్రతిపాదనకు సెబీ త్వరలోనే విధి విధానాలను రూపొందిస్తుందని, రెండేళ్ల గడువుని ఇవ్వవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన స్టాక్ మార్కెట్ నుంచి లిక్విడిటీని లాగేయడమే కాకుండా, ప్రమోటర్ వాటా అధికంగా ఉన్న బహుళ జాతి కంపెనీలు మన స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి దోహదపడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 65 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఇలాంటి కంపెనీలకు పెద్దగా ఇబ్బంది లేదు. కొన్ని ఎమ్ఎన్సీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి అటూ, ఇటూగా ఉంది. ఈ కంపెనీలు డీలిస్టింగ్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇక బిజినెస్ టు బిజినెస్(బీ2బీ)రంగంలో ఉన్న కంపెనీలు పూర్తిగా డీలిస్టింగ్కే మొగ్గుచూపుతున్నాయి. ఇలాంటి కంపెనీల వ్యాపారాలకు బ్రాండ్లతో పని లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే తాజా ప్రతిపాదనలపై ఎమ్ఎన్సీలు ఇప్పటివరకైతే, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అప్పడూ ఇదే పరిస్థితి... మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ 2010–13లో 25 శాతం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనను తెచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. పలు ఎమ్ఎన్సీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి ప్రయత్నాలు చేశాయి. ఈ తాజా ప్రతిపాదన ప్రకారం ప్రజలకు 35 శాతం వాటాను కేటాయించాల్సి వస్తే, ఎమ్ఎన్సీలు రూ.50,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాల్సి రావచ్చు. ఎమ్ఎన్సీలు, ఇతర భారత కంపెనీలు కలసి మొత్తం మీద రూ. 4 లక్షల కోట్ల మేర షేర్లను విక్రయించే అవకాశాలున్నాయి. ఎమ్ఎన్సీలు...మంచి పనితీరు... మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నా, చాలా ఎమ్ఎన్సీలు మంచి పనితీరునే కనబరుస్తూ వచ్చాయి. మొత్తం గత 16 ఏళ్లకు గాను 11 ఏళ్లలో ఎమ్ఎన్సీ షేర్లు నిఫ్టీని మించిన రాబడులనిచ్చాయి. 2006 నుంచి చూస్తే, వరుసగా 13 ఏళ్ల పాటు నిఫ్టీని మించిన పనితీరును ఎమ్ఎన్సీలు చూపించాయి. తాజా ప్రతిపాదన తక్షణం అమలయ్యే అవకాశాల్లేవు. దశలవారీగానే ఈ ప్రతిపాదన అమల్లోకి రావచ్చు. కనీసం 3–4 ఏళ్లు పడుతుందని అంచనా. అయినప్పటికీ, ఇది ఆయా షేర్ల పనితీరుపై తీవ్రంగానే ప్రభావం చూపించవచ్చు. ప్రమోటర్ వాటా 75 శాతానికి పైగా ఉన్న సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ వంటి కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్) విధానంలో తమ వాటాను విక్రయించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. ఇది ఆయా షేర్ల పనితీరుపై సమీప భవిష్యత్తులో తీవ్రంగానే ప్రభావం చూపుతుంది. అయితే సీమెన్స్, ఏబీబీ, హనీవెల్ కంపెనీల ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, ఈ షేర్లు తగ్గితే అది కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించాలని ఆంటిక్ స్టాక్ బ్రోకింగ్ పేర్కొంది. ఓఎఫ్ఎస్ల వెల్లువ... ఈ ప్రతిపాదన కారణంగా ఆఫర్ ఫర్ సేల్’(ఓఎఫ్ఎస్)లు వెల్లువెత్తుతాయని నిపుణులంటున్నారు. వాటా విక్రయానికి చౌకైన, వేగవంతమైన ప్రక్రియ ఇదేనని, దీంతో స్టాక్ మార్కెట్లో ఓఎఫ్ఎస్లు వెల్లువెత్తుతాయని, దీంతో సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందని వారంటున్నారు. ఈ ప్రతిపాదన కారణంగా కొన్ని ఉత్తమ ఫలితాలూ ఉంటాయని విశ్లేషకులంటున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల యాజమాన్యం మరింతగా విస్తరిస్తుందని, స్టాక్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుందని, షేర్లకు సరైన విలువ లభిస్తుందని, కార్పొరేట్ గవర్నెన్స్ మరింతగా మెరుగుపడగలదని వారంటున్నారు. అంతే కాకుండా నాణ్యత గల షేర్లు సమంజసమైన ధరకు లభించే అవకాశాలూ ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement