కాలుష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా సున్నం చెరువు | Toxic metals found in Sunnam Cheruvu water sold for drinking | Sakshi
Sakshi News home page

Hyderabad: కాలుష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా సున్నం చెరువు

Jun 28 2025 7:12 PM | Updated on Jun 28 2025 8:01 PM

Toxic metals found in Sunnam Cheruvu water sold for drinking

ప్రమాదకర స్థాయిలో సీసం, కాడ్మియం, నికెల్‌

దీని సమీపంలోనే వెలిసిన అనేక అక్రమ బోర్లు

అక్రమంగా నీళ్లు తోడి ట్యాంకర్ల ద్వారా విక్రయం

సాక్షి, హైద‌రాబాద్‌: మాదాపూర్‌లోని సున్నం చెరువు కాలుష్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. అందులోని నీరు మరిగించినా తొలగిపోని కారకాలతో నిండిపోయింది. ఈ చెరువు చుట్టూ అక్రమ బోర్లు వేసిన కొందరు నీటిని తోడి అమ్మేస్తు న్నారు. ఈ నీరు వినియోగిస్తున్న సమీప ప్రాంతాల వాసులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) గుర్తించింది. నమూనాలు సేకరించి, కాలుష్య నియంత్రణ మండలితో (పీసీబీ) పరీక్షలు చేయించి మరీ నిర్థారించింది.  

పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన... 
సున్నం చెరువు శేరిలింగంపల్లి–కూకట్‌పల్లి మండలాల సరిహద్దులో ఉన్న గుట్టల బేగంపేట, అల్లాపూర్‌ గ్రామాల మధ్య 32.60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రస్తుతం కాలుష్య కాసారంలా మారిన ఈ చెరువు సమీపంలోకి వెళ్లినా భరించ లేని దుర్వాసన ఉంటోంది. ఈ ప్రాంతంలో బోర్లు వేసి దరు ఆ నీటిని తాగునీటిగా పేర్కొంటూ ట్యాంకర్ల ద్వారా పరిసరాల్లోని విక్రయిస్తున్నారు.  

పునరుద్ధరణ చర్యల్లో భాగంగా పరీక్షలు... 
నగరంలోని తమ్మిడికుంట, బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువు, ఉప్పల్‌ నల్లచెరువు, బుమ్రకుద్దీన్‌ దౌలా చెరువులతో పాటు సున్నం చెరువు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. సున్నం చెరువులో మంచి నీరు నిలువ ఉండేలా చేయడానికి దాదాపు  రూ.10 కోట్లు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తోంది. ఆ చర్యల్లో భాగంగా హైడ్రా అధికారులు అక్కడి భూగర్భ జలాల నమూనాలు సేకరించి, పీసీబీ ద్వారా పరీక్షలు చేయించింది. 

తాగునీరుగా ట్యాంకర్లు సరఫరా చేస్తున్న నీటి నమూనాలకూ పరీక్షలు చేయించింది. ఈ నేపథ్యంలోనే ఆ నీటిలో నికెల్, కాడ్మియం. సీసం లోహాల మోతాదు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు బయటపడింది. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పీసీబీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ లోహాలు ఉండాల్సిన మోతాదులో కాకుండా.. 2 నుంచి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు పీసీబీ నివేదిక రూపొందించింది.

ప్రమాదకర స్థాయిలో సీసం... 
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక లీటరు నీటిలో సీసం 0.01 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు చుట్టూ ఉన్న బోరు నీటిలో ఇది 0.073 నుంచి 0.122 వరకు ఉన్నట్టు పీసీబీ తేల్చింది. ఇలాంటి నీరు పిల్లల మెదడు చురుకుదనంపై ప్రభావం చూపి, వారి జ్ఞాపిక శక్తిని తగ్గిస్తుందని, రక్తహీనతకు కారణం అవుతుందని హైడ్రా స్పష్టం చేసింది.  

లీటరు నీటిలో కాడ్మియం 0.003 మిల్లీ గ్రాముల వరకు ఉండచ్చు. సున్నం చెరువు పరిసరాల్లోని బోర్ల నీటిలో ఇది 0.007 నుంచి 0.010  మిల్లీ గ్రాముల వరకు ఉన్నట్టు వెల్లడైంది. ఇలా అధిక మొత్తంలో ఉన్న కాడ్మియం మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.

చ‌ద‌వండి: బిల్డ్‌నౌతో వేగం పెరిగినా.. త‌గ్గ‌ని పైర‌వీలు  

లీటరు నీటిలో 0.02 మిల్లీగ్రాముల వరకు నికెల్‌ ఉండొచ్చు. ఈ నీటిలో ఇది 0.038  నుంచి 0.046 మిల్లీ గ్రాముల వరకు ఉంది. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది.  

మరగబెట్టినా ఫలితం ఉండదు... 
సాధారణంగా నీటిని మరగబెట్టి, చల్లార్చి తాగితే అందులో ఉండే ప్రమాదకర బ్యాక్టీరియాలతో పాటు కొన్ని కాలుష్య కారకాలు పోతాయి. అయితే సున్నం చెరువు చుట్టూ ఉన్న బోర్ల నుంచి వచ్చే నీటిని మరగబెట్టి వినియోగించినా ప్రమాదమే అని వైద్యులు చెప్తున్నారు. మరగటం వల్ల అందులోని సూక్ష్మక్రిములు పోయినా... సీసం, కాడ్మియం, నికెల్‌ లోహాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా సున్నం చెరువు వద్ద బోర్ల ద్వారా అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement