సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా నేతల మధ్య సఖ్యత కోసం భువనగిరిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ రోజు (సోమవారం) సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ మ్యాటర్ హాట్ టాఫిక్గా మారింది.
కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం టార్గెట్గా రాజగోపాల్ రెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేస్తూనే.. పార్టీలో బయటి వ్యక్తుల ఆధిపత్యం పెరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను అణచివేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమకారులు, పాత కాంగ్రెస్ నాయకులు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన గౌరవం దక్కాలని అన్నారు. కాంగ్రెస్ను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దీనికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా బదులిచ్చారు. రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి “రాజగోపాల్రెడ్డి హద్దుల్లో ఉండాలి” అని స్పష్టం చేశారు. ఆయన బాధను తాము అర్థం చేసుకోగలమని.. అయితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.పార్టీకి ఎవరూ అతీతులు కాదని సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా కాంగ్రెస్లో ఒకే నిబంధన వర్తిస్తుందని అన్నారు. పార్టీ గీత దాటితే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో పార్టీ నాయకత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు.
అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ఆశచూపి క్యాబినెట్లోకి తీసుకోకపోవడంతో ఆయన అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తన అసంతృప్తిని బహిరంగంగానే తెలియజేస్తూ పార్టీని ఇరకాటంలో పెట్టే యత్నం చేస్తున్నారు.


