సెలవిచ్చి ఊరుకోలేదు.. సంక్షేమమూ చూశారు | Khammam Municipal Commissioner Helps Baby Heart Surgery 14 Lakh Treatment | Sakshi
Sakshi News home page

సెలవిచ్చి ఊరుకోలేదు.. సంక్షేమమూ చూశారు

Aug 18 2026 8:24 AM | Updated on Aug 18 2026 8:24 AM

Khammam Municipal Commissioner Helps Baby Heart Surgery 14 Lakh Treatment

నామకరణం చేస్తున్న కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య

పసికందు ఆపరేషన్‌కు రూ.14 లక్షలు

మంజూరు చేయించిన ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌

తెలంగాణ: సెలవు కోసం వచ్చిన పారిశుద్ధ్య కార్మికురాలితో అవును లేదా కాదని చెప్పి వదిలేయకుండా ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య ఆమెను ఆరా తీయడంతో అసలు కారణం బయటపడింది. సదరు కార్మికురాలి మనవరాలు ప్రాణాంతక సమస్యతో బాధపడుతోందని తెలియడంతో చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయించగా ఆ పసిబిడ్డ కోలుకుంది.

ఖమ్మంకు చెందిన కాంపాటి రాకేష్‌ – మాధవి దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. పాప పుట్టిన 12 రోజులకే గుండె సంబంధిత తీవ్ర సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్సకు పెద్దమొత్తంలో నగదు కావాలని తెలియడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పసిపాప నానమ్మ నర్సమ్మ కేఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో కార్మికురాలు కాగా, పాప బాగోగులు చూసుకునేందుకు సెలవు కోరేందుకు కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యను ఆశ్రయించింది.

ఈ సమయంలో తన మనవరాలికి వచ్చిన కష్టాన్ని చెప్పుకోగా అభిషేక్‌ చొరవ తీసుకున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి వైద్యులతోనే కాక హైదరాబాద్‌లోని స్టార్‌ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. చికిత్స కోసం రూ.14 లక్షలు అవసరమని తెలియడంతో హృదయ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో మాట్లాడడంతో పాటు ప్రభుత్వం తరఫున డబ్బులు మంజూరు చేయించారు. దీంతో గతనెల 28న వైద్యులు చిన్నారికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్‌ విజయవంతంగా చేయగా పాప కోలుకుంది. నానమ్మ, తల్లిదండ్రుల కోరిక మేరకు పాపకు జస్వికశ్రీ అని కమిషనర్‌ నామకరణం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement