ఎస్ఐ కాళ్లపై పడి వేడుకున్న రైతు
వైరా: ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి వరి నారుమడులకు అనధికారికంగా ఇన్నాళ్లు నీరు విడుదల చేయగా, నాట్లు వేసే సమయానికి నిలిపివేశారు. దీంతో రిజర్వాయర్ ఆయకట్టు కింద వరి సాగు చేస్తున్న రైతులకు నీరు సరఫరా చేయాలని కోరుతూ వివిధ పార్టీల నాయకులు సోమవారం వైరాలోని ఐబీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు బందోబస్తు విధుల్లో భాగంగా నాయకులు, రైతులకు నచ్చచెబుతున్నారు.
ఈ క్రమంలో తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన రైతు బోడేపూడి మాధవరావు ఒక్కసారిగా ఎస్ఐ కాళ్లపై పడి సాగునీరు ఇప్పించి తమ పంటలు కాపాడాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఉన్నతాధికారుల అదేశాల మేరకు నడుచుకుంటామని ఐబీ డీఈ నాగబ్రహ్మం బదులిచ్చారు. చివరకు సాయంత్రం 3 గంటల తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వలకు అనధికారికంగా నీటిని విడుదల చేయడంతో రైతులు ఆందోళన విరమించారు.


