ఎన్యుమరేషన్ పత్రాలు
అందించాలి
అర్హులకు మాత్రమే ఓటు హక్కు కల్పించడం, డబుల్ ఓట్లు తొలగించడమే ధ్యేయంగా సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఎన్యుమరేషన్ ఫారాలు సరిగా నింపి బీఎల్ఓలకు అందించాలి. పత్రాలు ఇవ్వక పోతే ఓటు కోల్పోతారు.
– జాన్ మమ్మద్, డీటీ తిరుమలగిరి
తిరుమలగిరి ( తుంగతుర్తి ) : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తుది గడువు సమీపిస్తోంది. బీఎల్ఓలు, బీఎల్ఏలు ఇంటింటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ చేశారు. ప్రస్తుతం ఫారాల్లో వివరాలు నింపి తిరిగి సేకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 24 వరకే గడువు ఉండడంతో ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో ఎన్యుమరేషన్ పత్రాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ 50 శాతం పూర్తయ్యింది.
ఫారాలు నింపేందుకు అవస్థలు
ఎన్యుమరేషన్ ఫారాలు నింపేందుకు గ్రామస్థాయి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. 2002 తర్వాత వివాహమై తమ అత్తగారింటికి వచ్చిన మహిళలు ఇక్కడే ఓటరుగా నమోదై ఉన్నారు. ప్రస్తుతం వారు తమ తల్లిదండ్రుల ఓటరుతో మ్యాపింగ్ చేయాల్సి రావడం, ఎన్యుమరేషన్ పత్రాల్లో వారి తల్లి లేదా తండ్రి ఓటరు వివరాలు నింపాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు ఉపాధి కోసం హైదరాబాద్, కరీంనగర్తో పాటు ఇతర నగరాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం తమ గ్రామంలో ఎన్యుమరేషన్ పత్రాలు నింపి ఇచ్చేందుకు సొంతూళ్లకు వచ్చేందుకు వీలు పడడం లేదని చెబుతున్నారు. గడువు ముగుస్తోందంటూ బీఎల్ఓలు, స్థానికులు వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాల్లో ఆటోలకు మైకులు అమర్చి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వక పోతే ఓటు పోతుందంటూ హెచ్చరిస్తున్నారు. గడువు మరో 11 రోజుల మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ వందశాతం పూర్తవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పత్రాలు ఇచ్చింది సగం మందే
సూర్యాపేట జిల్లాలో 10,08,252 మంది ఓటర్లు ఉండగా ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీని బీఎల్ఓలు దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటి వరకు 5,01,651 మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ పత్రాలను నింపి బీఎల్ఓలకు అందించారు. వాటిని బీఎల్ఓలు వెంటనే డిజిటలైజేషన్ కూడా పూర్తి చేశారు. జిల్లాలోని 23 మండలాల్లో అత్యధికంగా నడిగూడెం మండలంలో 68.15 శాతం, మఠంపల్లిలో 68.06 శాతం, అత్యల్పంగా సూర్యాపేటలో 28.32 శాతం ఎన్యుమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది.
జిల్లాలో 50 శాతం ఎన్యుమరేషన్ పత్రాల స్వీకరణ పూర్తి
వెంటనే డిజిటలైజేషన్ చేస్తున్న
బీఎల్ఓలు
ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రామాల్లో విస్తృత ప్రచారం


